మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో ‘వార్షిక విత్త ప్రకటన’ (Annual financial statement) అనే పదం ఉంది.
బడ్జెట్ పదం బోగోట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. బోగోట్ అంటే ‘తోలు సంచి’ అని అర్థం.
బడ్జెట్ ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రశీదులు (Receipts), చెల్లింపులకు (Payments) సంబంధించిన పరిమాణాత్మక విలువలను తెలియజేస్తుంది.
భారత్లో బడ్జెట్ పరిణామక్రమం
భారత్లో మొదటిసారి 1860లో జేమ్స్ విల్సన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
స్వాతంత్య్రం వచ్చాక 1947, నవంబరు 26న తొలి బడ్జెట్ను షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 1950లో జాన్ మథాయ్ మొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
1952లో ప్రధాని హోదాలో జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
మనదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరాగాంధీ.
1947 నుంచి ఇప్పటి వరకు (202223్శ భారతదేశంలో 92 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వీటిలో 74 సాధారణ లేదా వార్షిక బడ్జెట్లు, 14 మధ్యంతర బడ్జెట్లు, 4 ప్రత్యేక లేదా మినీ బడ్జెట్లు.
మనదేశంలో 1956లో మొదటిసారి కృష్ణమాచారి మినీ బడ్జెట్ను రూపొందించారు.
బడ్జెట్ రకాలు
సంతులిత బడ్జెట్ (Balanced Budget)
వచ్చే సంవత్సరంలో చేసే వ్యయాలు, ఆదాయాలు సమానం అయితే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు. ఇందులో మిగులు లేదా లోటు ఉండదు. ప్రభుత్వం సేకరించిన ఆర్థిక వనరులన్నింటినీ ఉపయోగించి వార్షిక బడ్జెట్ను తయారుచేస్తారు.
అసంతులిత బడ్జెట్ (Unbalanced Budget)
ఆదాయ, వ్యయాలు సమానంగా లేని బడ్జెట్ను అసంతులిత బడ్జెట్ అంటారు. అది మిగులు లేదా లోటు బడ్జెట్ అవ్వొచ్చు.
శూన్యాధార బడ్జెట్ (Zero-based Budget)
దీన్ని 1969లో అమెరికాలో మొదటిసారి రూపొందించారు.
రూపకర్త పీటర్ ఫైర్ (Peter Phyrr) .
గతాన్ని విడిచి, వర్తమాన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రూపొందించే బడ్జెట్ను శూన్యాధార బడ్జెట్ అంటారు.
ఇందులో పూర్వం అమలు చేసిన పథకాలతో సంబంధం లేకుండా ఆర్థిక వ్యవస్థ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏటా నూతనంగా బడ్జెట్ను రూపొందిస్తారు.
మనదేశంలో ఈ బడ్జెట్ను 1986లో వి.పి.సింగ్ రూపొందించారు.
స్థిర లక్షణ బడ్జెట్ (Fixed Budget)
బడ్జెట్ను అమలు చేసే కాలంలో మార్పు లేకుండా స్థిరంగా ఉంచుతూ రూపొందించడాన్ని స్థిర లక్షణ బడ్జెట్ అంటారు.
చర లక్షణ బడ్జెట్ (Flexible Budget)
అభివృద్ధి దశల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా, ఇతర అత్యవసర పరిస్థితులను అంచనా వేస్తూ బడ్జెట్లో మార్పులు చేయడాన్ని చర లక్షణ బడ్జెట్ అంటారు.
కుంటి బాతు బడ్జెట్ (Lame Duck Budget)
దీన్ని సంవత్సరంలో కొంత కాలానికి మాత్రమే రూపొందిస్తారు. పరిపాలనా పరంగా అనిశ్చిత పరిస్థితుల్లో దీన్ని తయారు చేస్తారు.
అనుబంద బడ్జెట్ (Supplementary Budget)
ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లాంటి అత్యవసర సమయాల్లో ప్రధాన బడ్జెట్ను కాకుండా అనుబంధ బడ్జెట్ను రూపొందిస్తారు.
బహుళ బడ్జెట్ (Multiple Budget)
ఒక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల బడ్జెట్లను రూపొందిస్తే, దాన్ని బహుళ బడ్జెట్ అంటారు.
సాధారణ లేదా వార్షిక బడ్జెట్ (General/ Annual Budget)
ఏడాది కాలానికి ఆదాయ-వ్యయాలను అంచనా వేస్తూ రూపొందించే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ అంటారు.
సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరుచేసిన సంవత్సరం: 1921
సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేసిన సంవత్సరం: 201718
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ (Vote on account budget)
ఎలాంటి చర్చ లేకుండా లోక్సభ ఆమోదించే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ప్రభుత్వం తమ వ్యయాలను కొంత కాలానికి మాత్రమే కొనసాగించడానికి రూపొందించే బడ్జెట్ ఇది. ఇందులో వ్యయానికి ప్రాదాన్యం ఇస్తారు.
బడ్జెట్లో వివిధ రకాల లోట్లు లోటు భావనలు కింది విధంగా ఉంటాయి.
రెవెన్యూ లోటు: రెవెన్యూ ఆదాయం కంటే వ్యయం ఎక్కువైతే, రెవెన్యూ లోటుగా పేర్కొంటారు.
మూలధన లోటు: మూలధన ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది.
బడ్జెట్ లోటు: ప్రభుత్వ మొత్తం ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది.
కోశ లోటు: దీన్నే ద్రవ్య లోటు లేదా ఆర్థిక లోటు లేదా విత్త లోటు అని పిలుస్తారు. బడ్జెట్ లోటుకు ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులను చేరిస్తే, కోశ లోటుగా పేర్కొంటారు.
ప్రాథమిక లోటు: కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు మినహాయిస్తే ప్రాథమిక లోటు వస్తుంది. వడ్డీ చెల్లింపులను ప్రణాళికేతర వ్యయంగా పేర్కొంటారు.
ధ్రువీకరించిన లోటు: కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాల్లో వచ్చే పెరుగుదలను ధ్రువీకరించిన లోటుగా పేర్కొంటారు.
భారత్లో బడ్జెట్ రూపొందించే విధానం
కేంద్రం 201718 నుంచి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెడుతోంది.
రెవెన్యూ వసూళ్లు: పన్ను ఆదాయం, ఫీజులు, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం మొదలైనవి.
మూలధన వసూళ్లు: రుణాల సేకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకం మొదలైనవి.
బడ్జెట్ వ్యయంలో 2 రకాలు ఉంటాయి.
అవి: 1) రెవెన్యూ వ్యయం
2) మూలధన వ్యయం
రెవెన్యూ వ్యయం:
పరిపాలనా యంత్రాంగంపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటారు.
ఉదా: విద్య, వైద్య-ఆరోగ్య సౌకర్యాలపై చేసే వ్యయం; ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు; అవస్థాపక సౌకర్యాలపై వ్యయం; సంక్షేమ పథకాలపై వ్యయం; వడ్డీ చెల్లింపులు; రక్షణ వ్యయం; శాంతి భద్రతలపై వ్యయం;
మూలధన వ్యయం:
ఆస్తులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చేసే వ్యయాన్ని మూలధన వ్యయంగా పేర్కొంటారు.
ఉదా: ప్రాజెక్టుల నిర్మాణం; ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు; పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పించడం; జాతీయ రహదారులు నిర్మాణం.
రచయిత
రాయల రాధాకృష్ణ