‣ ఏపీ టెట్ 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) ప్రకటన వెలువడింది. ప్రభుత్వం నిర్వహించే వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల్లో (ప్రైవేటుతోసహా) టీచరుగా స్థిరపడాలనుకునేవారికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్లో సాధించిన మార్కులతో 20 శాతం వెయిటేజిని ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఇస్తారు. కాబట్టి సహజంగానే పోటీ ఎక్కువే ఉంటుంది. ఈ పరీక్ష ప్రాధాన్యం గుర్తించి అభ్యర్థులు సన్నద్ధతను కొనసాగించాలి!
ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత టెట్ను ఆగస్టులో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన పట్టణాల్లో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 21 వరకు రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షను నిర్వహిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది.
పరీక్ష స్వరూపం
ఏపీ టెట్లో 2 పేపర్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
పేపర్-1: 1 నుంచి 5 తరగతులకి బోధించడానికి అర్హత సాధించాలి.
పేపర్ 2: 6 నుంచి 8 తరగతులకి బోధించడానికి అర్హత పొందాలి. (భాషా పండితులతోసహా).
గరిష్ఠ సమయం, మార్కులు: 150 నిమిషాలు. ప్రతి పేపరులో 150 మార్కులు.
అర్హతలు
పేపర్-1: పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్/ 10+2 లేదా తత్సమాన అర్హతతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్) కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
10+2 అర్హతతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా/ 4 సంవత్సరాల బీఈఎల్ఈడీ/బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉండాలి.
పేపర్-2: అభ్యర్థులు తమ బ్యాచిలర్స్ డిగ్రీని (బీఏ/బీకాం/బీఎస్సీ) కనీసం 50 మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. భాషా పండిత అభ్యర్థులు కూడా 6 నుంచి 8 తరగతులు బోధించడానికి ఈ పేపరులో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే బీఈడీ/ బీఈడీ (స్పెషల్ ఎడ్యకేషన్/ నాలుగు సంవత్సరాల బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తుర్ణులై, 50 శాతం మార్కులు సాధించాలి. రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాలి.
గమనిక: పేపర్ 1(బి), పేపర్-2(బి) పరీక్షలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉండాలి. ఆ డిగ్రీలకు ఆర్సీఐ గుర్తింపు అవసరం.
టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్కు జీవితకాలం చెల్లుబాటు ఉంటుంది.
దరఖాస్తు గడువు: 16.06.2022 నుంచి 16.07.2022 వరకు.
వెబ్సైట్: http:/cse.ap.gov.in
పరీక్ష రుసుము: ప్రతి పేపర్కు రూ.500.
సన్నద్ధత ఎలా?
‣ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన ఏపీ టెట్ సిలబస్ను పూర్తిగా అభ్యసించి, అర్థం చేసుకోవాలి.
‣ సిలబస్లోని ఏయే చాప్టర్ల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించవలసి ఉందనే విషయం అభ్యర్థి తన బలాలు, బలహీనతల ఆధారంగా పరీక్షించుకోవాలి. ఆపై సన్నద్ధతను కొనసాగించాలి.
‣ గత పరీక్షల ప్రశ్నపత్రాలు విశ్లేషించుకుని ఎక్కువ ప్రాధాన్యం ఉన్న అధ్యాయాలు, భావనలు మొదలైనవి తెలుసుకుని, వాటిపై పట్టు సాధించాలి.
‣ సిలబస్కు అనుగుణంగా ప్రామాణికమైన మెటీరియల్ను సేకరించుకోవడం, అవసరమైన విషయాలను అభ్యసిస్తూ సాధన చేయడం చాలా అవసరం.
‣ కష్టతరమైన అంశాలకు, భావనలకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. వాటిని నేర్చుకుంటూ పూర్తి పట్టు సాధించాలి.
‣ ఏ సబ్జెక్టుకైనా తగినంత సమయం కేటాయించుకుని అధ్యయనం కొనసాగించాలి.
‣ పొరపాట్లను, తప్పులను సరిదిద్దుకుంటూ, స్వీయ అభ్యసనం కొనసాగిస్తూ, నిర్దేశించిన సమయంలో సమాధానాలు రాసేలా సాధన చేయాలి.
‣ కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మంచి మార్కులు పొందేవిధంగా ప్రయత్నించాలి.
‣ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజికి తెలుగు అకాడమీ పుస్తకాలను, వీడియో పాఠాలను అనుసరించాలి.
‣ క్లిష్టమైన భావనలను ఆకళించుకుని విశ్లేషణాత్మకంగా, తరగతి గది సమస్యలకు అన్వయిస్తూ సాధన సాగాలి.
‣ మెథడాలజీకి తెలుగు అకాడమీ సిలబస్ను అనుసరించాలి.
‣ ఆంగ్ల మాధ్యమంలో చదివిన అభ్యర్థులు తెలుగు కంటెంట్కు, వ్యాకరణాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
‣ తెలుగు మాధ్యమంలో చదివిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఇంగ్లిష్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి అభ్యసించాలి.
‣ పరీక్షలో ప్రతి మార్కూ విలువైనదే. అందుకని అన్ని సబ్జెక్టుల మీదా దృష్టి కేంద్రీకరించి సాధనచేయాలి.
‣ నిరంతర ప్రేరణ, అభ్యసనం, సాధన, రెమిడియల్ లెర్నింగ్ (నివారణాత్మక అభ్యసనం) చేస్తూ, ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలి.
పరీక్ష విధానం
పేపర్-1-ఎ
ఎ) చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజి 30 ప్రశ్నలు - 30 మార్కులు.
బి) భాష-1 (తెలుగు/ఉర్దూ/తమిళం మొదలైనవి) 30 ప్రశ్నలు - 30 మార్కులు. (24 మార్కులు కంటెంట్ + 6 మార్కులు బోధన విధానం)
సి) భాష-2 (ఆంగ్లం) - 30 ప్రశ్నలు - 30 మార్కులు (కంటెంట్- 24 మార్కులు + పెడగాజి 6 మార్కులు)
డి) గణితం - 30 ప్రశ్నలు- 30 మార్కులు (కంటెంట్-24 మార్కులు, పెడగాజి - 6 మార్కులు)
ఇ) పరిసరాల విజ్ఞానం - 30 ప్రశ్నలు- 30 మార్కులు (సైన్సు కంటెంట్ - 12 మార్కులు, పెడగాజి - 3 మార్కులు) (సోషల్ స్టడీస్ కంటెంట్ - 12 మార్కులు, పెడగాజి - 3 మార్కులు) మొత్తం: 24 మార్కులు + 6 మార్కులు పెడగాజి
పేపర్-1-బి
ఎ) చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజిలోని ప్రశ్నలను స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి ఇస్తారు. మిగతా అన్ని అంశాలు పేపర్-1-ఎలో పేర్కొన్నవాటిని అధ్యయనం చేయాలి.
పేపర్-2-ఎ
1) చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి - 30 ప్రశ్నలు, 30 మార్కులు.
2) భాష-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళ/ఒరియా/సంస్కృతం - 30 ప్రశ్నలు - 30 మార్కులు
3) భాష-2 (ఆంగ్లం) - 30 ప్రశ్నలు - 30 మార్కులు
4) ఎ) గణితం, సైన్స్ గణితం కంటెంట్ 24 మార్కులు + మెథడాలజీ 6 మార్కులు. ఫిజికల్ సైన్స్ కంటెంట్ 12 మార్కులు + మెథడాలజీ 3 మార్కులు. బయోసైన్స్ కంటెంట్ 12 మార్కులు + మెథడాలజీ 3 మార్కులు. మొత్తం 48 మార్కులు + 12 మార్కులు మెథడాలజీ
బి) సోషల్ స్టడీస్ (60 మార్కులు) కంటెంట్ 48 మార్కులు + మెథడాలజీ 12 మార్కులు.
సి) లాంగ్వేజెస్ (60 మార్కులు) కంటెంట్ 48 మార్కులు + బోధనా పద్ధతులు 12 మార్కులు
పేపర్-2 బి (స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు మాత్రమే).
ఎ) చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి స్పెషల్ ఎడ్యుకేషన్లో 30 మార్కులు - 30 ప్రశ్నలు.
బి) భాష-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ఒరియా/సంస్కృతం) 30 మార్కులు - 30 ప్రశ్నలు.
సి) లాంగ్వేజ్-2 ఆంగ్లం 30 మార్కులు- 30 ప్రశ్నలు.
డి) కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజి 60 మార్కులు - 60 ప్రశ్నలు.
1) ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్
2) హియరింగ్ ఇంపెయిర్మెంట్ (ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ హియరింగ్ ఇంపెయిర్మెంట్
3) లెర్నింగ్ డిజేబిలిటీ
4) మెంటల్ రిటార్డేషన్/ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ©
5) మల్టిపుల్ డిజేబిలిటీ
6) విజువల్ ఇంపెయిర్మెంట్
నోట్: 1 నుంచి 6 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలనూ, 7 నుంచి 10 తరగతులకు పాత పాఠ్యపుస్తకాలను కంటెంట్ ప్రిపరేషన్ కోసం అనుసరించాలి.