• facebook
  • whatsapp
  • telegram

పాఠ్య ప్రణాళిక  

        ప్రాచీన సంకుచిత భావన ప్రకారం పాఠ్య ప్రణాళిక అంటే పఠనం కోసం నిర్దేశించిన నియమిత పాఠ్యాంశాలు. విద్యా ప్రణాళిక పరిధి విస్తృతంగా ఉంది. ఆధునిక భావన ప్రకారం విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపమే పాఠ్య ప్రణాళిక. 
లాటిన్‌లోని 'కరీర్' నుంచి 'కరిక్యులమ్' అనే ఆంగ్ల పదం వచ్చింది. కరీర్ అంటే 'పందెపు బాట' లేదా 'పరుగెత్తే దారి'. విద్యాపరంగా నిర్వచనం - 'బోధనా వ్యవస్థ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గం'.
కన్నింగ్‌హామ్ ప్రకారం - పాఠశాల్లో నిర్ధారించిన లక్ష్యాలు, ఉద్దేశాలనూ రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం.
విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళికలో పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం లాంటి విలువలను పెంచే అంశాలుంటాయి. జాతీయ స్థాయిలో కింది మార్గదర్శక సూత్రాల ననుసరించి సైన్స్ పాఠ్య ప్రణాళిక ఉండాలి.
ఎ. బయటి జీవితాన్ని, జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానం చేయాలి.
బి. కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి.
సి. పాఠ్య పుస్తకాల్లో చిక్కుకునేలా కాకుండా, విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాల్ని రూపొందించుకోవాలి.
పరీక్షల్ని మరింత సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి.

 

కరిక్యులమ్ ఆచరణలో ఇమిడి ఉన్న అంశాలు
1. జ్ఞాన నిర్మాణం కోసం బోధన.
2. చుట్టూ ఉన్న పరిసరాలు, వస్తువులు, ప్రజలతో భాష, వివిధ కార్యక్రమాలతో జరిపే ప్రతి చర్య ద్వారా అభ్యసనం.
3. అభ్యసనానుభవాల్ని రూపొందించడం
4. ప్రణాళిక పట్ల వైఖరి
5. విమర్శనాత్మక బోధనా వ్యూహం

 

విజ్ఞానశాస్త్రం - పాఠ్య ప్రణాళిక:
* నిజమైన విజ్ఞానశాస్త్ర విద్య అంటే పిల్లవాడికి తన జీవితం గురించి శాస్త్రీయంగా నిజాలు చెప్పడమే.
* పిల్లల వయసుకు తగిన విషయం, పద్ధతి, భాష, బోధనానుభవాలతో కూడిన జ్ఞానాన్ని అందించేలా కరిక్యులమ్ ఉండాలి.
* పిల్లల్లోని సహజమైన కుతూహలం, సృజనాత్మకతలను మెరుగుపర్చేలా నేర్చుకునే పద్ధతులు, విధానాలు
ఉండాలి.
* కరిక్యులమ్‌లో సైన్స్ చరిత్రకు తగినంత ప్రాధాన్యముండాలి.
* స్థానిక పరిసరాల నుంచి ప్రపంచం వరకు అర్థం చేసుకోవడానికి పాఠ్య ప్రణాళికలో పరిసరాలకు తగిన ప్రాధాన్యం ఉండాలి.
* నీతి, నిజాయితీలకు సహకరించేలా, బాధలు, భావాల నుంచి స్వేచ్ఛ ప్రసాదించేలా, వివిధ నైతిక అంశాలకు ప్రణాళికలో భాగం కల్పించాలి.

 

ప్రాథమిక స్థాయి:
* ప్రస్తుతం సైన్స్‌ను, సామాజిక శాస్త్రాలను కలిపి పర్యావరణ విద్యగా (పరిసరాల విజ్ఞానం) బోధిస్తున్నారు. ఆరోగ్యానికి ఇందులో చాలా ప్రాధాన్యమిస్తున్నారు.
* ప్రాథమిక స్థాయిల్లో పీరియాడికల్ పరీక్షలు, మార్కులు, గ్రేడులను నిర్ణయించడం, అదే తరగతిలో మళ్లీ చదివించడం ఉండకూడదు.

 

మాధ్యమిక స్థాయి:
* సుపరిచిత ప్రయోగాలు, సరళమైన సాంకేతిక డిజైన్లు, నమూనా నిర్మాణాల ద్వారా శాస్త్రీయ సూత్రాలను పిల్లలు నేర్చుకోవాలి.
* వివిధ కృత్యాలు, సర్వేల్లో పాల్గొనడం ద్వారా పరిసరాలు, ఆరోగ్యం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి.
* మాధ్యమిక స్థాయిలో నిరంతర నియమిత కాల వ్యవధి మూల్యాంకనాలు (యూనిట్ పరీక్షలు, టెర్మినల్ పరీక్షలు) ఉండాలి. ప్రత్యక్ష పద్ధతి ద్వారానే గ్రేడింగ్ ఇవ్వాలి. తప్పిపోవడం ఉండకూడదు.

 

సెకండరీ స్థాయి:
విద్యార్థి వివిధ అంశాలతో కూడిన శిక్షణ ద్వారా సైన్స్‌ను నేర్చుకోవాలి. మాధ్యమిక స్థాయి కంటే మరింత మెరుగైన సాంకేతిక అంశాలనూ, పరికరాలను ఉపయోగించి ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలి.


విజ్ఞానశాస్త్రం - సహ పాఠ్య ప్రణాళిక:
* విద్యార్థిలో పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మక శక్తిని పెంపొందించేలా, పరిశోధనాభిలాషను కలిగించేలా పాఠశాలలు కృషి చేయాలి. వీటి కోసం విద్యా బోధనలో సహ పాఠ్యాంశాలు, పాఠ్యేతర అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.

 

సైన్స్ సహపాఠ్య కార్యక్రమాలు:
1. సైన్స్ కార్నర్ల ఏర్పాటు, 2. సైన్స్ కిట్‌ల తయారీ, 3. ప్రయోగశాలల ఏర్పాటు, 4. సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానం, 5. 'చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్' లలో పాల్గొనడం, 6. సైన్స్ ఎగ్జిబిషన్‌ల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించిన అంశాలను ప్రదర్శించడం, 7. సైన్స్ సెమినార్లను నిర్వహించడం, 8. సైన్స్ డ్రామాల్లో పాల్గొనడం, 9. కళావిద్యను (చిత్రలేఖనం, శాస్త్రీయ భావనలు ఉన్న నృత్యాలు, హస్తకళలు, దృశ్యకళలు, తోలుబొమ్మలు) ప్రోత్సహించడం, 10. పర్యావరణ విద్యా కార్యక్రమాలను నిర్వహించడం, 11. క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన విహార యాత్రలను చేపట్టడం, 12. పనివిద్య ద్వారా, విజ్ఞానశాస్త్రాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం. 13. ఆరోగ్య, వ్యాయామ విద్యకు సంబంధించిన కృత్యాలను చేయించడం, 14. ఉపాధ్యాయులు, పిల్లల మధ్య సంబంధాల్లో, బోధనాభ్యసన ప్రక్రియలోని అన్ని అంశాల్లో శాంతి విద్య ప్రతిబింబించాలి.

 

విషయ ప్రణాళిక:
విషయ ప్రణాళిక అనేది ఆయా తరగతుల్లో బోధించాల్సిన విషయం. ఇది అంశాల విస్తృతినీ, పరిమితిని తెలియజేస్తుంది. విషయ ప్రణాళిక ఒక తరగతి విద్యార్థుల మానసిక స్థాయి, విషయజ్ఞానం, దశలపై ఆధారపడి ఉంటుంది. జాతీయ పాఠ్యప్రణాళిక - 2005ని అనుసరించి ఎలిమెంటరీ దశ (I-VIII) లోని తరగతులకు, సెకండరీ దశ (IX, X) లోని తరగతులకు, హయ్యర్ సెకండరీ దశ (XI, XII) లోని తరగతులకు విషయ ప్రణాళికను తయారుచేశారు.
I, II తరగతుల్లో పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలను భాష, గణిత, పాఠ్య పుస్తకాలకు సంబంధించిన విషయ ప్రణాళికలకు అనుసంధానం చేశారు.
'సామాన్య శాస్త్రం' విషయ ప్రణాళిక VI నుంచి X వరకు ఆయా తరగతుల స్థాయిని బట్టి ఏడు ప్రధానాంశాలతో వివరించారు. అవి: 1. ఆహారం 2. పదార్థాలు 3. జీవ ప్రపంచం 4. వస్తువులు ఎలా పనిచేస్తాయి. 5. కదిలే వస్తువులు 6. సహజ దృగ్విషయాలు 7. సహజ వనరులు.

 

విద్యా కమిషన్‌లు, కమిటీల సిఫార్సులు
I. సెకండరీ విద్యా కమిషన్ (1952) అభిప్రాయాలు:

ఎ. అనుభవాల సమగ్ర రూపం
బి. భిన్నత్వ మార్పులకు అనుగుణం
సి. సామాజిక జీవనంతో సంబంధం
డి. విరామ సమయ వినియోగానికి శిక్షణ
ఇ. సమైక్యత, సహ సంబంధం

 

II. కొఠారీ కమిషన్ సూచనలు: (1964-66)
1. పాఠశాల్లో విద్యా ప్రణాళిక విస్తృత పరిధిలో ఉండాలని కొఠారీ సూచించారు.
2. పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పులుండాలి.
3. పాఠ్య పుస్తకాలను, బోధనాభ్యసన సామాగ్రిని హెచ్చు స్థాయిలో రూపొందించాలి.
4. పాఠ్య ప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.
5. కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించడంలోనూ, విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా రూపొందించడానికి ప్రయత్నించడంలోనూ పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలుండాలి.
6. వివిధ విద్యా విభాగాలు, శాఖలు జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగా పాఠశాల పాఠ్య ప్రణాళికను రూపొందించాలి.
7. కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం ప్రాథమిక దశలో విద్యార్థికి సంబంధించిన సామాజిక, భౌతిక, జీవన సంబంధమైన పరిసరాలకు ప్రాధాన్యమివ్వాలి.
8. ప్రాథమికోన్నత దశలో విద్యార్థుల జ్ఞాన సముపార్జనతోపాటు, తార్కికంగా ఆలోచించడంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి.

 

III. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ (1977):
1. పరిశీలన ద్వారా జ్ఞానాన్ని పొందడం.
2. ఆటపాటల ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంచడం, జట్టు భావనను పెంపొందించడం.
3. సామాజికంగా ఉపయోగపడే కృత్యాల ప్రణాళికను రూపొందించడం, అమలుపరచడంలో నైపుణ్యాన్ని ఏర్పరచడం.
4. సృజనాత్మక శక్తిని పెంపొందించడం.
5. స్వయం అభ్యసనంలో నైపుణ్యాలను ఏర్పరచడం.
6. కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుచేసి రసాత్మక దృష్టిని, అభినందనను పెంపొందించడం.
7. జీవితంలో అన్ని రంగాల్లో సమైక్యత, ఓర్పు, సహకారం, నిరాడంబరత అలవర్చుకునేలా చేయడం.

జాతీయ విద్యావిధానం (1986):
* సమస్యా పరిష్కార పద్ధతి, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించడమే ప్రధానాంశాలుగా పాఠ్యప్రణాళిక ఉండాలి.
* జాతీయ సమగ్ర పాఠ్యప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం కోసం శాస్త్ర పాఠ్యప్రణాళికకు సంబంధించిన అంశాలైన 1. పర్యావరణ పరిరక్షణ, 2. పరిమిత కుటుంబ భావన, 3. శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం.
* కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, వివరాలను అందించడం.
* వివిధ శాస్త్ర విభాగాల సమన్వయం తెలపడం.
* పరిసరాలకు సంబంధించిన వివిధ అంశాలపై నిశితమైన ప్రశ్నలు వేసేట్లు చేయడం.
* విద్యార్థుల్లో సామాజిక, నైతిక విలువలను పెంచడానికి శాస్త్రాన్ని ఒక సహాయకంగా తెలియజేయడం.
* విశాల దృక్పథాన్ని, జ్ఞానపరమైన నిజాయితీని అలవరచుకోవడం, ప్రశ్నించడంలో ధైర్యం పెంచుకోవడం, శాస్త్రీయ వైఖరి, విధానాలను వృద్ధిచేయడం.
* శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం, జీవావరణ వ్యవస్థను కాపాడటం, శాస్త్రాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలపై జాగరూకులను చేయడం.

 

మూల పాఠ్యప్రణాళిక :
ప్రజాస్వామ్య సమాజంలో సమర్థంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు అవసరం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలను వృద్ధిచేసే అభ్యసనానుభావాల సమూహమే 'మూల పాఠ్యప్రణాళిక'.

 

పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రాలు:
1. శిశుకేంద్రీకృత, 2.సమాజ కేంద్రీకృత, 3. సమైక్యతా, 4. కృత్యకేంద్రీకృత, 5.పరిరక్షణ, 6. సృజనాత్మక, 7. దూరదృష్టి, 8. మార్పునకు అనువుగా ఉండే, 9. అనుభవ సామస్త్య, 10. వ్యవస్థీకరణ సూత్రాలు.
బ్రూబేకర్ అభిప్రాయం ప్రకారం పాఠ్యప్రణాళికలో విద్యార్థులను ఇమడ్చడం కాకుండా విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక రూపుదిద్దుకోవాలి.

 

వ్యవస్థీకరణ ఉపగమాలు / విధానాలు
1. ఏకకేంద్ర పద్ధతి: (Concentric Method):
 ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అంటారు.

 

2. అంశాల పద్ధతి లేదా శీర్షిక విధానం: (Topic Method): శాస్త్ర సంబంధమైన సూత్రం లేదా ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకుని సంబంధిత విషయాలన్నింటినీ కేంద్రీకరించి ప్రణాళికను తయారుచేస్తే అది శీర్షిక పద్ధతి.
శీర్షిక పద్ధతిలో అంశాలు 1. జీవనకేంద్రిత, 2. పరిసర కేంద్రిత, 3. పరిసర, జీవన కేంద్రిత అంశాలుగా విభజించి ఉంటాయి.

 

3. ప్రక్రియ పద్ధతి: ప్రక్రియల ఆధారంగా ఏర్పరచడం.
 

4. భావన పద్ధతి: ఇది COPES (Conceptually Oriented Programme in Science) ఆధారంగా అభివృద్ధిచెందింది.

ప్రణాళికలో ఎంపిక చేసిన 5 భావన పథకాలు
విశ్వనిర్మాణాత్మక ప్రమాణాలు, ప్రతిచర్య, మార్పు, శక్తి పరిరక్షణ, శక్తి తరుగుదల, సాంఖ్యక శాస్త్ర ఉద్దేశంలో ప్రకృతి.
5. సమైక్య లేదా శాఖాంతర పద్ధతి: పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో శాఖాంతర పద్ధతి ఒక ముఖ్యమైన ఆధునిక పోకడ. సమైక్య విధానంలో సబ్జెక్టుల మధ్య సహసంబంధం ద్వారా విద్యార్థుల్లో అవగాహన ఏర్పరచడం. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానంలోని మూల సూత్రం సహసంబంధం.
6. యూనిట్ పద్ధతి: యూనిట్ వ్యవస్థను ఎక్కువగా అభివృద్ధి చేసింది మోరిసన్. ఇది రెండు రకాలు. 1. మూలాధార యూనిట్, 2. బోధనా యూనిట్.

 

యూనిట్‌లో భాగాలు:
1) ప్రేరణ
2) సంకీర్ణ దృష్టి
3) నేపథ్యాన్ని కనుక్కోవడం
4) కొత్త అనుభవాలను చేర్చడం
5) అభ్యసనాల నిర్వహణ
6) విషయ సంగ్రహణ
7) పునర్విమర్శ
8) మూల్యాంకనం

7. చారిత్రక పద్ధతి: విషయాలను చరిత్రను అనుసరించే క్రమంలో అంటే వాటిని కనుక్కున్న క్రమంలో అమర్చడం.
8. తార్కిక క్రమ పద్ధతి.  9. రుతుక్రమ అమరిక విధానం.

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌