‣ 200 మార్కులకు ప్రశ్నపత్రం
కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకూ మొదట ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహించి అభ్యర్థులను దానిలో పొందిన కటాఫ్ మార్కుల ఆధారంగా మాత్రమే తదుపరి దశలోని శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలకు అనుమతిస్తారు. వాటిల్లోనూ అర్హత సాధించిన వారికి మాత్రమే తుది రాత పరీక్షకు అవకాశం లభిస్తుంది. నియామక మండలి అధికారులు తొలి దశలో వడపోత కోసం ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష విధానం ఎలా ఉండనుంది? ఏయే అంశాలపై ఎన్ని మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారనే అంశాలివి.
ప్రిలిమ్స్ ఇలా..
ఏయే పోస్టులకు: సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాల్లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు, జైలువార్డర్లు, ఫైర్మెన్
ప్రశ్నపత్నం: 200 మార్కులకుగాను 200 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి.
అర్హత మార్కులు: ఓసీలు 40 శాతం, బీసీలు 35, ఎస్సీ ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు 30 శాతం మార్కులు సాధించాలి. పోటీ ఎక్కువుంటే కటాఫ్ మార్కులను నిర్దేశిస్తారు.
ప్రశ్నపత్రం: తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో..
తదుపరి దశలకు వెళ్లేందుకు ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో వచ్చే మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
శారీరక కొలతలు (పీఎంటీ)/దేహదారుఢ్య పరీక్షలు (పీఈటీ)
ప్రాథమిక రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు తొలుత శారీరక కొలతలు(పీఎంటీ) పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎత్తు, బరువు, శ్వాస పీల్చినప్పుడు ఛాతి వైశాల్యం పెంపు వంటివి ప్రమాణాల ప్రకారం ఉన్నాయా? లేవా అనేది పరీక్షిస్తారు. ఇందులో అర్హులైన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల్లో ఈ పోటీలుంటాయి.
సివిల్ పోలీసు కానిస్టేబుల్, జైలు వార్డర్లు (పురుషులు, మహిళలు), ఫైర్మెన్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలను ఎంత సమయంలో పూర్తి చేయాలంటే..
విభాగం - పురుషులు - మాజీ సైనికులు - మహిళలు
100 మీటర్ల పరుగు - 15 సెకన్లు - 16.5 సెకన్లు - 18 సెకన్లు
లాంగ్జంప్ - 3.80 మీటర్లు - 3.65 మీటర్లు - 2.75 మీటర్లు
1600 మీటర్ల పరుగు - 8 నిమిషాలు - 9 నిమిషాల 30 సెకన్లు - 10 నిమిషాల 30 సెకన్లు
‣ పైన పేర్కొన్న మూడింటిలో 1600 మీటర్ల పరుగును తప్పనిసరిగా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. వంద మీటర్ల పరుగు, లాంగ్జంప్ విభాగాల్లో ఒక దాంట్లో అర్హత సాధిస్తే చాలు.
‣ ఇది కూడా కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దేహదారుఢ్య పరీక్షలు ఇలా..
‣ 100 మార్కులకు దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి.
‣ 100 మీటర్ల పరుగుకు: 30 మార్కులు, లాంగ్జంప్కు: 30, 1600 మీటర్ల పరుగుకు: 40 మార్కులు.
‣ పైన పట్టికలో పేర్కొన్న సమయం ప్రకారమే దేహదారుఢ్య పరీక్షలను పూర్తి చేయాలి.
‣ నిర్దేశిత సమయంకంటే ఎంత ముందు గమ్యాన్ని చేరుకుంటే అన్ని ఎక్కువ మార్కులు అభ్యర్థులకు లభిస్తాయి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
తుది రాత పరీక్ష
‣ ఏయే పోస్టులకు: సివిల్ పోలీసు కానిస్టేబుల్, జైలువార్డర్లు, ఫైర్మెన్
‣ ఎన్ని మార్కులకు: 200 మార్కులకు (ఒకటే పేపర్ బహుళైచ్ఛిక విధానంలో)
‣ తుది ఎంపిక: తుది రాత పరీక్షలో 200 మార్కులకుగాను అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు
‣ ఏయే పోస్టులకు: ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు
‣ ఎన్ని మార్కులకు: 100 మార్కులకు (200 ప్రశ్నలుంటాయి. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది)
‣ తుది ఎంపిక ఇలా: చెరో 100 మార్కులకు నిర్వహించే దేహదారుఢ్య, తుది రాత పరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకుగాను అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ప్రాథమిక, తుది రాతపరీక్షల్లోని ప్రశ్నలు ఏయే అంశాలపై ఉంటాయంటే..
‣ ఆంగ్లం, అర్థమేటిక్, జనరల్ సైన్స్, భారత చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్రం, రాజనీతి, ఆర్థికంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వర్తమాన వ్యవహారాలు, రీజినింగ్, మెంటల్ ఎబిలిటీ. ఇంటర్మీడియట్ స్థాయి పాఠ్యాంశాలుంటాయి.