* 8,904 పోస్టులకు ప్రకటన విడుదల
ప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం ఈ సంవత్సరానికి మళ్లీ వచ్చింది. దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్ అసోసియేట్స్) ఖాళీలతో ప్రకటన వెలువడింది. రెండు వారాల్లో బ్యాంకు ఉద్యోగార్థులకు ఇది రెండో తీపికబురు. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు క్లర్కులు. అభ్యర్థులు పరీక్ష స్వరూపాన్ని, అందుబాటులో ఉన్న సమయాన్ని, తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే విజయాన్ని సాధించవచ్చు.
ఎస్బీఐ దేశవ్యాప్తంగా 8904 జూనియర్ అసోసియేట్ పోస్టులను (251 బ్యాక్లాగ్లతో కలిపి) భర్తీ చేయనుంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 425, ఆంధ్రప్రదేశ్లో 253 పోస్టులు ఉన్నాయి. నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.