శాతవాహనుల పరిపాలనా విధానం
రాజు
* శాతవాహనుల కాలంలో చక్రవర్తే సర్వాధికారి.
* ధర్మశాస్త్రాలను అనుసరించి, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించేవారు.
* రాచరికం వంశపారంపర్యంగా ఉండేది.
* రాజు కుమారుడిని కుమర లేదా యువరాజు అనేవారు.
* రాజే సర్వసైన్యాధ్యక్షుడు. అన్ని అధికారాలు అతడి చేతిలోనే ఉన్నప్పటికీ నిరంకుశ పాలన సాగించలేదు.
* యుక్తవయసు నుంచే అన్ని విద్యలు నేర్చుకునేవారు.
పాలకవర్గం
* రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండేది.
* రాజు కుటుంబానికి చెందిన రాజకుమారులు పలు ప్రాంతాలకు అధిపతులుగా ఉండేవారు.
* తమ పేర్లతో నాణేలు విడుదల చేసే అధికారం పొందారు.
* రథిక, భోజక లాంటి జాతులకు చెందిన నాయకులు శాతవాహన సామ్రాజ్యాభివృద్ధికి తోడ్పడ్డారు.
* వీరి కాలంలో మహాభోజ స్థాయి మహారథి కంటే ఎక్కువ.
* పశ్చిమ దక్కన్లో మహాభోజుడు, దక్షిణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో మహారథికులు ఉండేవారు. వీరి భార్యలు తమ పేర్లకు ముందు భర్త పేరును చేర్చుకునేవారు.
* శాతవాహన పాలనలో మహాసేనాధిపతి, మహాతలవరి అనే పాలకవర్గం ఉండేవి. వీరు కొంత భూభాగానికి గవర్నర్లుగా పనిచేస్తూ పౌర, సైనిక బాధ్యతలు నిర్వహించేవారు.
* మంత్రివర్గంతో పాటు భాండాగారిక, హెరణిక, ప్రతిహార, లేఖక, నిబంధకార లాంటి ఉద్యోగులు ఉండేవారు. వీరికి జీతాలు చెల్లించేవారు.
రాష్ట్రపాలన
* శాతవాహనులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలుగా (రాష్ట్రాలు) విభజించారు.
* ప్రతి ఆహారంలో ఒక ప్రధాన నగరం (నిగమం), అనేక గ్రామాలు ఉండేవి.
* రాజ్యాన్ని సామంత రాజ్యాలుగా విభజించి వాటి పాలనకు మహారథి, మహాభోజ అనే అధికారులను నియమించేవారు.
* సామంత రాజ్యాలను జనపదాలు అని పిలిచేవారు. ఈ జనపదాలనే ఆహారాలుగా విభజించారు.
* శాతవాహనుల కాలంలోని గోవర్థనాహార, మమలాహార, సోపారాహార, కోడూరాహార అనే పేర్లున్న ఆహారాలు శాసనాల్లో కనిపిస్తాయి.
* ఆహారానికి అధిపతిగా అమాత్యుడు (మంత్రి) ఉండేవాడు.
* అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు. వీరిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చేవారు.
* సాధారణంగా రాజబంధువులనే అమాత్యులుగా నియమించేవారు.
* వీరి రాజ్యంలో రాజు, మహాబలుడు, సేనాధిపతి అనే మూడంచెల స్థాయుల్లో పరిపాలనా వ్యవస్థ ఉండేది.
గ్రామపాలన
* ప్రతి ఆహారం కొన్ని గ్రామాల సముదాయం.
* పాలనలో చిట్టచివరి పాలనాంశం గ్రామం.
* గ్రామాధిపతిని గ్రామణి అంటారు. ఇతడికి గ్రామసభలు సలహాలిచ్చేవి.
* భట్టిప్రోలు శాసనంలోని నిగమసభ ప్రస్తావనను బట్టి నగరాల్లో పౌరసభలు పాలన నిర్వహణలో సహాయపడేవని తెలుస్తోంది.
* ఈ నిగమసభలు పైఠాన్, ధాన్యకటకం, బరుకచ్చ, కళ్యాణి, సోపార లాంటి నగరాల్లో ఉండేవి.
* ఇందులోని సభ్యులను గహపతులు అనేవారు.
* ఆంధ్రదేశంలో 30 రక్షణ దుర్గాలున్నట్లు మెగస్తనీస్ ఇండికాలో పేర్కొన్నాడు.
* స్థానిక పాలనలో మహాలేఖక, మహాఆర్యక (మత కార్యకలాపాలు) భాండాగారిక (కోశాధికారి), నిబంధాకార (పత్రాలు నమోదు చేసే అధికారి), ప్రతిహార, దూతక (రాజు ఆదేశాలను తీసుకువెళ్లేవారు) లాంటి ఉద్యోగులు తోడ్పడేవారు.
* గ్రామీణ పాలన గౌల్మికుల చేతిలో ఉండేది. వీరు సైనికాధికారులు.
* వీరి అధీనంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలతోపాటు 45 మంది సైనికులు ఉండేవారు.
* వీరు గ్రామంలో శాంతిభద్రతలు నిర్వహించేవారని ఆర్.ఎస్.శర్మ అభిప్రాయపడ్డారు.
ఆదాయ - వ్యయాలు
* ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు.
* రాజుకు ‘రాజకంబేట’ (రాజు భూమి) అనే కొంత పొలం ఉండేది. దీని ఆదాయం రాజుకు చెందుతుంది.
* పండిన పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
* పంటలో రాజు భాగాన్ని భోగ అంటారు.
* నాసిక్ శాసనాన్ని బట్టి రాజు కొంత భూమికి మాత్రమే అధిపతి.
* రాజు భూమిని దానం చేయాల్సి వచ్చినప్పుడు కొని, దానం చేసేవాడు.
* భూమిశిస్తుతో పాటు రహదారి సుంకాలు, వృత్తి పన్నులు ఉండేవి.
* పన్నులు ధన, ధాన్య రూపంలో వసూలు చేసేవారు.
* సైన్యపోషణ, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగుల జీతాలు, తదితరాల కోసం ఆదాయాన్ని ఎక్కువగా ఖర్చు చేసేవారు.
* బ్రాహ్మణులకు, బౌద్ధులకు భూదానాలు చేశారు.
సైనిక పాలన
* శాతవాహనులు పటిష్ఠవంతమైన సైన్యాన్ని పోషించారు.
* హాథిగుంఫా శాసనంలో చతురంగ బలాల ప్రస్తావన ఉంది.
* రాజే సర్వసైన్యాధ్యక్షుడు అయినప్పటికీ మహాసేనాధిపతి ఉండేవాడు. యుద్ధ సమయాల్లో రాజు ముందుండి సైన్యాన్ని నడిపేవాడు.
* శాసనాల్లో కటకవారం (సైన్య శిబిరం), స్కంధవారం (తాత్కాలిక శిబిరం) అనే పదాలు కనిపిస్తాయి.
* యుద్ధ సమయాల్లో సాధారణ ప్రజలను హింసించేవారు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో విజేతలు క్రూరంగా వ్యవహరించారు. ఉదా. కళింగ ఖారవేలుడు పిథుండ నగరాన్ని గాడిదలతో దున్నించి ధ్వంసం చేశాడు.
* గౌతమీపుత్ర శాతకర్ణిని క్షహారాటవంశం నిరవశేషకర (క్షహరాట వంశాన్ని నిర్మూలించినవాడు) అని చరిత్రకారులు వర్ణించారు.
సాంఘిక పరిస్థితులు
* శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. వీరు వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు.
* ప్రజలు తమ వృత్తులను బట్టి కులాలు, ఉపకులాలుగా విడిపోయారు.
* శకులను క్షత్రియులుగా హిందూ సమాజంలో కలుపుకోవడంతో శకులకు, శాతవాహనులకు మధ్య వివాహ సంబంధాలు సాధ్యమయ్యాయి.
* జైన, బౌద్ధ మతాల ప్రభావం కారణంగా వర్ణాశ్రమ ధర్మాలు సులభతరమయ్యాయి.
* వ్యాపారులు, చేతి వృత్తుల వారు బౌద్ధ మత వ్యాప్తి కోసం ధన సహాయం చేశారు.
* రాజులు తమ పేర్లకు ముందు తమ తల్లి పేరును (గౌతమీపుత్ర, వాశిష్టీపుత్ర) పెట్టుకోవడం నాటి సమాజంలో తల్లికి ఉన్న స్థానాన్ని సూచిస్తోంది.
* శాతవాహన రాజులు స్వయంగా మత సంబంధమైన దానాలు చేశారు. వీరిలో కొందరు రాజప్రతినిధులుగా వ్యవహరించారు.
* సమాజంలో బహుభార్యత్వం ఉండేది. స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించారు.
* అమరావతి శిల్పాన్ని బట్టి స్త్రీ, పురుషులు ఇరువురూ అలంకరించుకునేవారని తెలుస్తోంది.
* కనీస వస్త్రధారణ చేసేవారు. సుఖనాగరిక జీవితం గడిపేవారు.
* వితంతు వివాహాలు లేవు. సంగీతం, నృత్యం ప్రధాన వినోదాలు.
* ఈ యుగం నాటి స్త్రీలు తమ భర్త పదవుల పేర్లను తమ పేర్లతో కలిపి పెట్టుకునేవారు.
* మహాసేనాధిపత్ని, మహాభోజకి, మహారథిణి లాంటి పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి.
* నగర జీవనం విలాసంగా, గ్రామ జీవనం నిరాడంబరంగా ఉండేది.
* వివాహ వ్యవస్థకు ప్రాధాన్యం ఎక్కువ. సతీసహగమన ఆచారం ఉండేది.
* స్త్రీకి సంబంధించిన వివిధ ఆచారాలు గాథాసప్తశతిలో ఉన్నాయి.
* వేశ్య వృత్తి గౌరవప్రధానమైనదిగా భావించేవారు. ఆ కాలంనాటి వేశ్యలు పలు కళల్లో నిపుణులని వాత్స్యాయనుడు కామసూత్రాల్లో వివరించాడు.
* వీరి కాలంలో సంస్కృతం అధికార భాష.
* యజ్ఞయాగాదుల కారణంగా బ్రాహ్మణుల ప్రాధాన్యం పెరిగింది.
మాదిరి ప్రశ్నలు
1. ఆంధ్రదేశంలో 30 రక్షణ దుర్గాలున్నట్లు తెలుపుతున్న గ్రంథం ఏది?
1) అర్థశాస్త్రం 2) అష్టాధ్యాయి 3) ఇండికా 4) పైవేవీకావు
జ: అర్థశాస్త్రం
2. రెండో పులోమావి ఎవరి కుమారుడు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2)గౌతమీపుత్ర శాతకర్ణి 3) రెండో శాతకర్ణి 4) శ్రీముఖుడు
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
3. శాతవాహన రాజుల్లో ‘దక్షిణాపథేశ్వరుడు’ అనే బిరుదాంకితుడు ఎవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) శివశ్రీ శాతకర్ణి 3) మొదటి శాతకర్ణి 4) రెండో పులోమావి
జ: మొదటి శాతకర్ణి
4. కవివత్సలుడు అనే బిరుదు ఉన్న శాతవాహన రాజు?
1) హాలుడు 2) రెండో శాతకర్ణి 3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) శ్రీముఖుడు
జ: హాలుడు
5. నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?
1) రెండో శాతకర్ణి 2) మొదటి శాతకర్ణి 3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) శ్రీముఖుడు
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
6. శాతవాహన కాలంలో గ్రామాధ్యక్షుడిని ఏమని పిలిచేవారు?
1) గ్రామణి 2) నిగమపాలక 3) మహాభోజ 4) భూపతి
జ: గ్రామణి
7. ధాన్యకటక మహస్తూపానికి శిలాప్రాకారాన్ని నిర్మించినవారెవరు?
1) శ్రీముఖుడు 2) నాగార్జునుడు 3) రెండో పులోమావి 4) గౌతమీపుత్ర శాతకర్ణి
జ: నాగార్జునుడు