మనం ఆధునికమని భావించే ఆధునిక భౌతికశాస్త్రం సుమారు 100 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైంది. 'మాక్స్ప్లాంక్' అనే శాస్త్రవేత్త, 1900 సంవత్సరంలో, కృష్ణవస్తు వికిరణాన్ని వివరించడానికి ప్రతిపాదించిన 'క్వాంటం సిద్ధాంతం' సంప్రదాయ భౌతిక శాస్త్ర భావనలకు చరమగీతం పాడింది. సంప్రదాయ భౌతికశాస్త్రం, ద్రవ్యాన్ని స్థూల స్థాయి (macro level) లో పరిగణిస్తే, ఆధునిక భౌతిక శాస్త్రం సూక్ష్మస్థాయి (macro level) లో అంటే పరమాణు స్థాయిలో పరిగణిస్తుంది. సంప్రదాయ, ఆధునిక భౌతిక భావనలు, భౌతిక శాస్త్రానికి రెండు కళ్లలాంటివి.
అవిభాజ్యం...
ద్రవ్యం (matter) అవిచ్ఛిన్నం (continuous) గా కనిపించినా, జ్ఞానేంద్రియాలు గుర్తించలేని సూక్ష్మ స్థాయిలో నిర్ణీత విచ్ఛిన్న (discrete)నిర్మాణాన్ని కలిగి ఉందేమోనని భావించిన మానవాళికి 150 సంవత్సరాల తర్వాత, పరమాణు నిర్మాణంపై ఒక అవగాహన కలిగింది. పదార్థం లేదా ద్రవ్యాన్ని విభజిస్తూ పోతే, మిగిలే అవిభాజిత కణమే పరమాణువు (atom). ఒక మూలక పరమాణువు చిన్నదే అయినప్పటికీ, అది ఆ మూలక ధర్మాల ప్రతినిధి. వేర్వేరు మూలక పరమాణువులు, వేర్వేరు ధర్మాలతో ఉంటాయి. క్రీ.పూ. 600 నాటికే వైశేషిక వ్యవస్థను రూపొందించిన 'కణాదుడు' పదార్థ సూక్ష్మ, మౌలిక కణాలను గుర్తించాడు. 1803లో 'డాల్టన్' ప్రతిపాదించిన 'పరమాణు సిద్ధాంతం' ప్రకారం ద్రవ్యం విచ్ఛిన్నంగా ఉండే పరమాణువులతో నిర్మితమైంది.