గుప్తయుగం
* క్రీ.శ.4 నుంచి 5వ శతాబ్దం వరకు గుప్తులు భారతదేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వీరు హిందూమతాభిమానులు.
* వీరి పాలనా విధానాన్ని చరిత్రకారులు రోమ్ పాలకుడైన ‘అగస్టన్’, గ్రీక్ రాజు ‘పెరిక్లిజ్’, ఇంగ్లండ్ రాణి ‘ఎలిజబెత్’తో పోల్చారు.
చారిత్రక ఆధారాలు
* గుప్తుల చరిత్రకు సంబంధించిన అనేక పురావస్తు, సాహిత్య ఆధారాలు, శాసనాలు చరిత్రకారులకు లభించాయి. సముద్రగుప్తుడి ‘అలహాబాద్ శాసనం’; రెండో చంద్రగుప్తుడి ఉదయగిరి, మధుర, సాంచి, గద్వా శాసనాలు; మొదటి కుమారగుప్తుడి దామోదరవూరు రాగిశాసనం, భిస్లా, మాండసోర్ శాసనాలు; స్కంధగుప్తుడి శాసనాలు; బుధగుప్తుడి శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలు.
* గుప్తరాజులు బంగారు, వెండి, రాగి నాణేలను జారీ చేశారు. ఇవి ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితులు తెలుపుతున్నాయి.
ఉదా: మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవుడు విడుదల చేసిన నాణేలు; కచుడి పేరుపై జారీ చేసిన నాణేలు; సముద్రగుప్తుడు నాణేలపై విల్లంబులు, గొడ్డలి, అశ్వమేధ, పులివేట, వీణవాయిస్తున్న బొమ్మలను చెక్కించాడు. ఇవి వారి ఆర్థిక విజయాలు, సాంకేతిక విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి.
* గుప్తుల కాలంలో నిర్మించిన దేవాలయాలు, వారు ఉపయోగించిన ముద్రికలు, అజంతా - ఎల్లోరా గుహల్లోని చిత్రాలు అప్పటి వాస్తు శిల్పం, చిత్రలేఖనం మొదలైన విషయాలను వివరిస్తున్నాయి.
* మత్స్య, వాయు, విష్ణు పురాణాలు గుప్తుల వంశావళిని, పాలనను తెలుపుతున్నాయి. కామాందకుడి నీతిసారం; శూద్రకుడి మృచ్ఛకటికం; విశాఖదత్తుడి ముద్రారాక్షసం, దేవిచంద్రగుప్తం; కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, రుతుసంహారం, రఘువంశం మొదలైన గ్రంథాలు గుప్తుల చరిత్రకు సాక్ష్యాలు.
* చైనా యాత్రికుడు ఫాహియాన్ రచించిన ‘బౌద్ధ రాజ్యాల చరిత్ర’, బాణుడి ‘హర్షచరితం’గుప్తుల చరిత్రకు ప్రధాన ఆధారాలు.
తొలిపాలకులు
* గుప్తవంశ స్థాపకుడు ‘శ్రీగుప్తుడు’. ఇతడు ప్రయాగ సమీపంలోని చిన్న రాజ్యానికి పాలకుడని కొందరు పేర్కొంటే, పాటలీపుత్ర పాలకుడని మరికొందరు చరిత్రకారుల వాదన.
* ఇతడి అధికారం మగధ (బిహార్), బెంగాల్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది.
* ఇతడు క్రీ.శ. 4వ శతాబ్దంలో రాజ్యపాలన చేసినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది.
* శ్రీగుప్తుడికి ‘మహారాజ’ అనే బిరుదు ఉంది.
* ఇతడు చైనా యాత్రికుల కోసం ఒక ఆలయాన్ని నిర్మించి, దాని ఖర్చుల కోసం 24 గ్రామాలు దానం చేసినట్లు ‘ఇత్సింగ్’ తన రచనల్లో పేర్కొన్నాడు.
* ఇతడి కుమారుడు ‘ఘటోత్కచ గుప్తుడు’. ఇతడికీ ‘మహారాజ’ అనే బిరుదు ఉంది. ఇతడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు.
సముద్రగుప్తుడు (క్రీ.శ. 335- 380)
* మొదటి చంద్రగుప్తుడు మరణించాక సింహాసనం కోసం వారసుల మధ్య పోరాటాలు జరిగాయి. వీటిలో సముద్రగుప్తుడు తన అన్న ‘కచ’ని ఓడించి రాజయ్యాడు.
* ‘అలహాబాద్’ శాసనంలో చంద్రగుప్తుడే సముద్రగుప్తుడ్ని రాజుగా ప్రకటించినట్లు ఉంది. కొందరు చరిత్రకారులు కచ అనేది రాజు పేరు, ‘సముద్రగుప్తుడు’ అతడి బిరుదు అని పేర్కొన్నారు.
* సముద్రగుప్తుడి సేనాని ‘హరిసేనుడు’. ఇతడు అలహాబాద్ ప్రశస్తి (అలహాబాద్ శాసనం) శాసనాన్ని వేయించాడు. అందులో సముద్రగుప్తుడి సైనిక విజయాలు, సమకాలీన పరిస్థితుల గురించి ఉన్నాయి.
* అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుడి విజయాలను నాలుగు భాగాలుగా పేర్కొన్నారు. మొదటి భాగంలో 12 మంది దక్షిణాపథ రాజులను ఓడించి వారికి స్వేచ్ఛనిచ్చినట్లు ఉంది. రెండో భాగంలో ఆర్యావర్తానికి చెందిన 8 మంది రాజులను వధించినట్లు; మూడో భాగంలో 9 గిరిజన గణతంత్ర రాజ్యాలను ఓడించినట్లు; నాలుగో భాగంలో దైవపుత్ర షహానుషాలు, శాకామురుందలు, సింహళ, ఇతర ద్వీపాల రాజులను ఓడించినట్లు ఉంది.
* బ్రిటిష్ చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడ్ని ‘ఇండియన్ నెపోలియన్’గా పేర్కొన్నాడు.
సముద్రగుప్తుడి దండయాత్రలు
మొదటి ఆర్యావర్త దండయాత్ర:
* సముద్రగుప్తుడు రాజయ్యాక తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఉత్తరభారతదేశంలోని రాజ్యాలపై దండెత్తి, వాటిని ఆక్రమించుకున్నాడు. ఓడిపోయిన రాజులను తన సామంతులుగా చేసుకున్నాడు.
* మొదటి ఆర్యావర్త దండయాత్రలో అహిచ్ఛత్రాన్ని (రామ్నగర్) పాలించిన అచ్యుతను, పద్మావతిపుర రాజైన నాగసేనుడ్ని, మధుర పాలకుడు గణపతి నాగుడ్ని ఓడించాడు.
* అతడి సరిహద్దు రాజ్యాలైన సమతట (తూర్పు బెంగాల్), కామరూప (అసోం), నేపాల్, దావకం (అసోంలోని నవగార్), కర్తపురం (జలంధర్) మొదలైనవన్నీ సముద్రగుప్తుడి అధీనంలోకి వెళ్లాయి.
దక్షిణ భారతదేశ దండయాత్రలు:
* సముద్రగుప్తుడు తన దక్షిణ భారతదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించాడు. వారు: కోసల (మధ్యప్రదేశ్) రాజైన మహేంద్రరాజు, మహాకాంతార (సంబల్పూర్, గోండ్వానా) పాలకుడు వ్యాఘ్రరాజు, ఎరండపల్లి (ఆముదాలవలస) రాజైన స్వామిదత్తుడు, విష్టపుర (పిఠాపురం) అధిపతి మహేంద్ర, కొత్తూరు (విశాఖపట్నం) పాలకుడు హస్తివర్మ, ఎలక్కడ (పులికాట్, నెల్లూరు) రాజు ఉగ్రసేనుడు, కేరాల (చందాజిల్లా - మధ్యప్రదేశ్) పాలకుడు ముంతరాజు, కుశస్థల (ఉత్తర ఆర్కాటు - తమిళనాడు) పాలకుడు ధనుంజయుడు, అవముక్తి (వేంగి-కంచి మధ్యరాజ్యం) అధిపతి నీలరాజు, కంచి పాలకుడు విష్ణుగోపుడు.
* ఫ్లీట్, స్మిత్ మొదలైన చరిత్రకారులు తమ రచనల్లో సముద్రగుప్తుడి దక్షిణభారతదేశ దండయాత్రల గురించి వివరించారు. వీరి ప్రకారం, సముద్రగుప్తుడు తన రాజధాని పాటలీపుత్రం నుంచి తూర్పుతీరం మీదుగా కంచివరకు దండయాత్ర సాగించి, పశ్చిమతీరం వెంట తిరిగి పాటలీపుత్రం చేరాడు.
* డూబ్రెల్ అనే చరిత్రకారుడు తూర్పుతీరం నుంచి కంచివరకు దండయాత్ర చేసి తిరిగి అదే మార్గంలో పాటలీపుత్రం చేరినట్లు పేర్కొన్నాడు.
* దక్షిణ భారతదేశ దండయాత్రలో ఇతడు సుమారు 3000 మైళ్లు ప్రయాణించాడని చరిత్రకారులు వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాల ఫలితంగా సముద్రగుప్తుడు సాటిలేని యోధాను యోధుడిగా పేరొందాడు.
* సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్రల్లో ఉండగా, ఉత్తర భారతదేశంలోని మతిల, నాగదత్త, చంద్రవర్మ, గణపతినాగ, నాగసేన, అచ్యుత, నంది, బలవర్మ మొదలైన 9 మంది రాజులు, వాకాటకరాజు ‘రుద్రమదేవుడి’ (రుద్రసేన) నాయకత్వంలో కూటమిగా ఏర్పడి సముద్రగుప్తుడిపై దండెత్తారు. అతడు వారిని కౌశాంబి వద్ద ఓడించాడు. దీన్నే రెండో ఆర్యావర్త దండయాత్ర అంటారు.
* దీంతో అతడి సామ్రాజ్యం ఉత్తర భారతంలోని గాంధార వరకు విస్తరించింది.
ఆటవిక రాజ్యాలతో దౌత్యం
* సముద్రగుప్తుడికి ఆటవిక రాజ్యాలు స్వయంగా విధేయత ప్రకటించాయి. అవి: సమతట (బెంగాల్), కామరూప, దావక (అసోం), నేపాల్, కీర్తి (హిమాలయ ప్రాంతం), పశ్చిమ పంజాబ్, శకులు. ఈ రాజ్యాలు సముద్రగుప్తుడితో దౌత్య సంబంధాలు పెంచుకుని, స్నేహం చేశాయి.
* అతడు తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సుమారు 18 ఆటవిక రాజ్యాలను ఓడించి, ఆక్రమించాడు.
గణరాజ్యాలపై దండయాత్ర: ఆ సమయంలో వాయవ్య భారతదేశంలో అనేక గణతంత్ర రాజ్యాలు, నగర రాజ్యాలు ఉండేవి. అర్జునాయనులు, యౌధేయులు, మాద్రకులు, కాకులు మొదలైన గణరాజ్య పాలకులు సముద్రగుప్తుడికి కప్పం చెల్లిస్తూ, అతడి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు.
విదేశీ దండయాత్రలు
* ఉత్తర, దక్షిణ భారతదేశాలు తన అధీనంలోకి వచ్చాక సముద్రగుప్తుడు విదేశీ దండయాత్రలపై తన దృష్టి సారించాడు. ఆఫ్గనిస్థాన్, సిలోన్ పాలకులతో సముద్రగుప్తుడు స్నేహం చేశాడు.
*సింహళ రాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయను దర్శించడానికి వచ్చే శ్రీలంక యాత్రికుల కోసం ఒక విహారాన్ని నిర్మించాడు.
* వి.ఎ.స్మిత్ అభిప్రాయం ప్రకారం ఇతడి సామ్రాజ్యం ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నర్మద, పశ్చిమాన చంబల్ - యమున నదులు, తూర్పున బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించింది.
మొదటి చంద్రగప్తుడు (క్రీ.శ.319 335)
* మొదటి చంద్రగుప్తుడ్ని గుప్తసామ్రాజ్య నిర్మాతగా పేర్కొంటారు. ఇతడు లిచ్ఛవి రాకుమారి ‘కుమారదేవిని’ వివాహం చేసుకుని, ఆ రాజ్యంలో చాలా భాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
* ఇతడు ‘బంగారు’ నాణేలు ముద్రించాడు. వాటిపై తనతో పాటు తన భార్య బొమ్మను, లిచ్ఛవుల పేర్లు ముద్రించాడు.
* పురాణాల ప్రకారం చంద్రగుప్తుడి రాజ్యంలో సాకేత (అయోధ్య), ప్రయాగ, మగధ ఉండేవి. ఇతడికి ‘మహారాజాధిరాజా’ అనే బిరుదు ఉంది.
* చంద్రగుప్తుడు క్రీ.శ.320 ఫిబ్రవరి 26న గుప్తశకాన్ని ప్రారంభించాడు. (కొందరు చరిత్రకారుల ప్రకారం క్రీ.శ.319 డిసెంబరులో గుప్తశకం ప్రారంభమైంది.)
* వజ్జిక రచించిన ‘కౌముది మహోత్సవం’లో మగధ రాజ్యాన్ని ‘సుందరవర్మ’ పాలించినట్లు ఉంది. అందులో అతడు ‘చంద్రసేనుడనే’ వ్యక్తిని దత్తత తీసుకోగా, అతడు సుందర వర్మను వధించి రాజయ్యాడని; అతడే మొదటి చంద్రగుప్తుడని ఉంది.
రాజకీయ చరిత్ర - పుట్టుక
* గుప్తుల పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
కొంతమంది అభిప్రాయం ప్రకారం..
* ‘‘శుంగ, శాతవాహనుల శాసనాల్లో గుప్తుల ప్రస్తావన ఉంది. గుప్తులు ధరణి గోత్రికులు. శుంగ వంశస్తుడైన అగ్నిమిత్రుడి రాణి ధరణితో గుప్తులకు బంధుత్వం ఉంది. వారు బ్రాహ్మణ కులస్థులు’’ - హెచ్.సి.రాయ్ చౌదరి
* ‘‘గుప్తులు పంజాబ్లోని ‘జాట్’ తెగకు చెందినవారు. చంద్రగోమిన్ రచనల్లో ఈ ప్రస్తావన ఉంది.’’ - కె.పి.జైశ్వాల్
* ‘‘పంజాబ్లో లభించిన రాగి రేకుల శాసనాల్లో గుప్త అనేది రాజు ఇంటి పేరుగా ఉంది. వీరు క్షత్రియులు.’’ - డాక్టర్ ఎస్.ఛటోపాధ్యాయ
* ‘‘గుప్తులు రాజులు కాదు. వీరు తొలుత సంపన్న భూస్వాములుగా ఉండి, మగధ ప్రాంతంలో రాజకీయ ఆధిక్యత పొందారు.’’ - రోమిల్లా థాపర్
* ‘‘గుప్తులు ఉత్తర్ ప్రదేశ్లో కుషాణులకు సామంత రాజులుగా ఉన్నారు. వీరి పతనం తర్వాత గుప్తులు అధికారానికి వచ్చారు’’ - ఆర్.ఎస్. శర్మ
* గుప్తుల జన్మస్థలం బెంగాల్లోని ‘వరేంద్రి’ ప్రాంతం అని ఛటోపాధ్యాయ, ఆర్.సి.మజుందార్ అభిప్రాయపడగా, బెంగాల్లోని ‘ముర్షిదాబాద్’ జిల్లా అని డాక్టర్ గంగూలి పేర్కొన్నారు.
* గుప్తుల జన్మస్థలం మగధ ప్రాంతంలోని పాటలీపుత్ర పరిసరాలని జె.అలనీ తెలపగా, వీరు పూర్వీకులది ప్రయాగ సమీప ప్రాంతమని - కె.పి.జైశ్వాల్ అభిప్రాయపడ్డారు.
* చాలామంది చరిత్రకారులు గుప్తులను వైశ్యులుగా పేర్కొన్నారు.
* గుప్తులు అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో రాజకీయ అనైక్యత ఉంది. విదేశీ దండయా త్రలు జరిగేవి. స్వతంత్ర రాజ్యాలు, గణరాజ్యాలుగా పాలకులు విడిపోయారు. అనతికాలం లోనే గుప్తులు ఉత్తరాది రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. మధ్యభారతదేశంలో దొరికే ‘ఇనుము’ ద్వారా పటిష్టమై గంగా-సింధూ మైదానంపై అధికారం చలాయించారు.