వ్యవసాయ విధానాలు
ప్రస్తుతం మనదేశంలో జీవనాధార, వాణిజ్య వ్యవసాయాలు చేస్తున్నారు.
జీవనధార వ్యవసాయం: ఇందులో రెండు రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి.
అవి: 1. సాధారణ జీవనాధార వ్యవసాయం
2. సాంద్ర జీవనాధార వ్యవసాయం
సాధారణ జీవనాధార వ్యవసాయం:
* ఇది చిన్న కమతాల్లో, పురాతన పనిముట్లతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి. దీన్నే ‘నరుకు - కాల్చు’, ‘పోడు వ్యవసాయం’ అని కూడా అంటారు.
* ఈ రకమైన వ్యవసాయ విధానంతో పంటల పెరుగుదల రుతుపవనాలు, భూమిలోని పోషక పదార్థాలు, అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
* సాధారణ జీవనాధార వ్యవసాయాన్ని ‘రుతుపవన వ్యవసాయం’ అని కూడా అంటారు.
సాంద్ర జీవనాధార వ్యవసాయం:
* అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన వ్యవసాయం అమల్లో ఉంది. ఈ విధానానికి అధిక మొత్తంలో శ్రామికులు అవసరం.
* ఇది అత్యధిక జీవ రసాయన ఎరువులు, నీటి పారుదలను ఉపయోగించుకుని అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానం.
వాణిజ్య వ్యవసాయం
* అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం.
* దీని విస్తృతి ప్రాంతాన్ని బట్టి మారుతుంది.
ఉదా: పంజాబ్, హరియాణాలో వరి వాణిజ్య పంట కాగా, ఒడిశాలో జీవనాధార పంట.
* తోటపంటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కవ విస్తీర్ణంలో పండిస్తారు.
కమతం
ఒక పంట కాలంలో ఒక రైతు సాగుచేసే భూ విస్తీర్ణాన్ని కమతం అంటారు.
* చిన్న కమతాలను కలిగి ఉండటం భారతీయ వ్యవసాయ రంగం ప్రధాన లక్షణం.
రైతులు - రకాలు
ఉపాంత రైతులు: 2.5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.
చిన్నకారు రైతులు: 2.6 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.
సన్నకారు రైతులు: 5.1 నుంచి 10 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.
మధ్య తరహా రైతులు: 10.1 నుంచి 25 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన వారు.
పెద్ద రైతులు: 25 ఎకరాల కంటే ఎక్కువ సాగుభూమి కలిగిన వారు.
* భూమిని కొలవడానికి హెక్టారును ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు.
* ఒక హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు ్బ10,000 చదరపు మీటర్ల భూమి).
* భారతదేశంలో 9.24 కోట్ల ఉపాంత రైతులు, 2.47 కోట్ల చిన్న రైతులు, 1.38 కోట్ల సన్నకారు రైతులు, 10 లక్షల మంది పెద్ద రైతులు ఉన్నారు.
అంతర పంటలు
* ఏదైనా ప్రాంతంలో ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు.
* కందులు, మినుములు, పెసలు, పప్పు ధాన్యాలను ప్రధానంగా మనదేశంలో అంతర పంటలుగా పండిస్తారు.
* తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సైతం పప్పుధాన్యాలను పండిస్తారు.
* ఈ మొక్కలన్నీ లెగ్యుమినేసీ కుటుంబానికి చెందినవి. ఇవి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి, నేలలో ప్రతిస్థాపన చేసి, భూసారాన్ని పెంచుతాయి.
* భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో పప్పుధాన్యాలను ప్రధానంగా పండిస్తారు.
మిశ్రమ వ్యవసాయం
* వ్యవసాయం, పశుగణాభివృద్ధి రెండూ సమాన స్థాయిలో అభివృద్ధి చెందడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు.
* శ్వేత విప్లవం కారణంగా పశుగణాభివృద్ధి రంగంలో అనేక మార్పులు జరిగాయి.
* పాల ఉత్పత్తి పెరిగి, రైతుల ఆదాయం కూడా అధికమైంది.
* మేలి రకపు సంకరజాతి వృద్ధి, మేలైన మేత సరఫరా, పశువ్యాధుల నివారణ, డెయిరీ - కోళ్ల ఫారాలు, మాంసం - ఉన్ని - తోళ్ల పరిశ్రమ అభివృద్ధి లాంటి నవీన పద్ధతుల ద్వారా పశుగణ నిర్వహణాభివృద్ధి సాధ్యమవుతుంది.
ఎరువులు
సేంద్రియ ఎరువులు:
* సేంద్రియ ఎరువు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మ జీవులు ఉంటాయి.
* హ్యూమస్ ఏర్పడే ప్రక్రియతో ఖనిజాలు మెల్లగా అందుబాటులోకి వస్తాయి.
రసాయనిక ఎరువులు:
* నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి ఖనిజాలు నీటిలో కరుగుతాయి. వీటిని మొక్కలు త్వరగా గ్రహిస్తాయి. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు.
* ఇవి మట్టిలో నుంచి నీటి ద్వారా లోపలి పొరకు ఇంకి, భూగర్భ జలాలు, నదులు, చెరువులను కలుషితం చేస్తాయి.
* రసాయన ఎరువులు నేలలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి.
* ఇవి వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి కొంతకాలానికి నెమ్మదిగా నేల తన సారాన్ని కోల్పోతుంది.
* హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది.
పంచగవ్య (సేంద్రియ ఎరువు):
* ఇది ద్రవ రూపంలో ఉంటుంది.
* ఆవు మూత్రం, పేడ, పాలు, నెయి; అరటి పండ్లు; కొబ్బరి నీళ్లు; బెల్లం; నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు.
శ్వేత విప్లవం
* వివిధ అభివృద్ధి పథకాల ద్వారా దేశంలో పాల ఉత్పత్తిని పెంచడమే శ్వేత విప్లవం ప్రధాన లక్ష్యం.
* 1970లో జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు Operation Flood Project ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం. దీని ద్వారా దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
* ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పాల ఉత్పతిదారులను నగర వినియోగదారులతో కలపడం.
* కోళ్ల ఫారాల్లో గుడ్ల కోసం లేయర్లను, మాంసం కోసం బ్రాయిలర్లను పెంచుతారు.
హరిత విప్లవం
* ఆధునిక వైజ్ఞానిక విధానం ద్వారా వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తి వ్యవస్థలో నూతన నిర్దేశాలను తీసుకొచ్చి, వ్యవసాయ సౌకర్యాన్ని సాధించడమే హరిత విప్లవం ప్రధాన లక్ష్యం.
* పంటల ఉత్పత్తి పెంచేందుకు అధిక దిగుబడి ఇచ్చే రకాలను అభివృద్ధి చేయాలి. దీని కోసం నిర్దిష్టమైన పంట మొక్కలను పెంచడం, అభివృద్ధి చేయడమే హరిత విప్లవం.
* ఆహార కొరత, ఆకలి, పౌష్టికాహార లోపాలు లాంటి సమస్యలను అధిగమించడం ద్వారా దేశంలో వ్యవసాయ రంగంలో స్థూలంగా మార్పు తీసుకురావడం దీన్ని ఉద్దేశం.
* భారతదేశంలో హరిత విప్లవాన్ని మొదట 1960లో చిరుధాన్యాలపై 196364లో గోధుమ పంట; 1965లో వరి పంటపై ప్రయోగించారు.
* హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రయోజనం (ఎక్కువ దిగుబడి) పొందిన పంట గోధుమ.
* 196566లో ఖరీప్ పంటకాలంలో సంకర వ్యవసాయాన్ని పూర్తిగా అమలు చేశారు.
* భారతదేశంలో హరితవిప్లవ పితామహుడిగా ఎం.ఎస్.స్వామినాథన్ను పేర్కొంటారు.
* మనదేశంలో హరిత విప్లవాన్ని మొదటగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో ప్రవేశపెట్టారు.
* హరితవిప్లవం వల్ల అధిక దిగుబడి సాధించిన రాష్ట్రం పంజాబ్.
హరితవిప్లవ ప్రభావం
* ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది. దీంతో ఇతర దేశాల నుంచి ఆహర ధాన్యాల దిగుమతి తగ్గింది.
* ప్రస్తుతం భారతదేశ దిగుమతుల్లో ఆహార ధాన్యాల వాటా 3%.
* మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10వంతు మనదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.
* హరిత విప్లవం కారణంగా పర్యావరణం తీవ్రంగా ప్రభావిమైంది.
* ఇందులో క్రిమిసంహార మందులను విరివిగా ఉపయోగించడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి.
* పంజాబ్లోని 12 జిల్లాల్లో 9 భూగర్భ జల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
పంట కాలాలు
భారతదేశంలో మూడు పంట కాలాలు ఉన్నాయి. అవి:
1) ఖరీఫ్ 2) రబీ 3) జయాద్
ఖరీఫ్ పంట కాలం: నైరుతి రుతుపవనాల రాకతో దాదాపు దేశమంతా ఖరీఫ్ కాలం ప్రారంభమవుతుంది.
* సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్య కాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి.
* ఈ కాలంలో ప్రధాన పంటగా వరి సాగు చేస్తారు.
రబీ కాలం: దీన్ని శీతాకాల పంట కాలం అని కూడా అంటారు.
* మధ్యధరా సముద్రం నుంచి వీచే పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో వర్షం కురుస్తుంది. ఇది రబీ పంటలకు అత్యంత ఉపయోగకరం.
* ఈ పంటను అక్టోబరు నుంచి డిసెంబరు మధ్యలో సాగుచేస్తారు. ఏప్రిల్ - జూన్ మధ్యలో పంట కోతలు ప్రారంభమవుతాయి.
* హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది.
* రబీ కాలంలో గోధుమ పంటను ఎక్కువగా సాగుచేస్తారు. గోధుమను శీతాకాల పంట అని కూడా అంటారు.
జయాద్ కాలం : ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును జయాద్ అంటారు.
* దీన్నే వేసవి పంట కాలం అని కూడా అంటారు.
* పుచ్చకాయలు, కర్బూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొదలైన వాటిని జయాద్ కాలంలో పండిస్తారు.