‣ గ్రూప్-1 అభ్యర్థులకు నిపుణుల సూచనలు
తెలంగాణలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా గ్రూప్-1 నియామక పరీక్షకు పోటీ తీవ్రంగా ఉంటుంది. దీనికి పోటీ పడాలనుకుంటున్న అభ్యర్థులు తక్షణ కార్యాచరణ ఆరంభించాలి. గెలుపును నిర్ణయించే కీలక సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. వాటిని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. నోట్సు రాసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చేలోగానే వీటిపై పట్టు సాధించటానికి ప్రయత్నించాలి.
ఉద్యోగార్థులు అందరితోపాటు దిగువ స్థాయి ప్రభుత్వోద్యోగులూ, సాఫ్ట్వేర్ ఉద్యోగుల దృష్టీ ఇప్పుడు గ్రూప్-1 పోస్టుల మీదే ఉంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం గత రెండు, మూడు సంవత్సరాల నుంచి సీరియస్గా సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా తమ దృష్టిని గ్రూప్-1పై కేంద్రీకరిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉండటానికి మరో కారణం గరిష్ఠ వయసును 44 సంవత్సరాలకు పెంచడం. ఆపై రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల సడలింపు అంటే 49 సంవత్సరాలకు పొడిగించడం. ఇంకో కారణం- భారీ స్థాయిలో డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ ఎస్పీ పోస్టులు ఉండటం. వీటికి ఎంపికైతే 10-12 సంవత్సరాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా పదోన్నతికి వీలుండటం.
గ్రూప్-1 సర్వీస్ సాధించాలంటే నోటిఫికేషన్ గురించి ఎదురుచూడకుండా నేటి నుంచే పటిష్ఠ ప్రణాళికను రూపొందించుకుని సన్నద్ధతను ప్రారంభించాలి. వీలైనంత త్వరగా గ్రూప్-1 పరీక్షలో కీలక సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇటీవలే టీఎస్పీఎస్సీ గ్రూప్స్ సిలబస్లో ఎలాంటి మార్పులూ ఉండవని ప్రకటించింది. నిజానికి గ్రూప్-1 సిలబస్ను 2015లో రూపొందించిన తర్వాత ఇంతవరకూ పరీక్ష జరగలేదు. ముందుగా https://tspsc.gov.in/ వెబ్సైట్ నుంచి గ్రూప్-1 సిలబస్ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.
రెండు స్థాయుల్లో జరిగే గ్రూప్-1 పరీక్షలో మొదటిది ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్), రెండోది ప్రధాన పరీక్ష (మెయిన్స్). మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ప్రధాన పరీక్షలో ఒక భాగమని గుర్తించండి. అభ్యర్థులు ప్రధాన రాత పరీక్షలో, మౌఖిక పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ను పరిశీలించి వాటిలో ఏయే అంశాలు మెయిన్ పరీక్షలో కూడా ఉన్నాయో గుర్తించాలి.
సిలబస్లో ఏయే సబ్జెక్టుల్లో మార్పులు ఉండవో గుర్తించి మొదట వాటిపై దృష్టిని కేంద్రీకరించటం మేలు. వాటిని విశ్లేషణతో అధ్యయనం చేస్తూ నోట్సును స్వయంగా, సమగ్రంగా తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ఇది ప్రిలిమ్స్కూ, మెయిన్స్కూ ఉపయోగపడేటట్లు ఉండాలి.
దాదాపు సగం సిలబస్
ఈ కిందివాటిని మార్పులు ఉండని సబ్జెక్టులని చెప్పవచ్చు.
1. భారతదేశ చరిత్ర - సంస్కృతి
2. తెలంగాణ చరిత్ర- సంస్కృతి
3. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం
4. భౌతిక భూగోళశాస్త్రం
5. బేసిక్ సైన్స్
ముందుగా పైన తెలిపిన సబ్జెక్టులను సమగ్రంగా చదివితే అది ప్రిలిమ్స్, మెయిన్స్లకు ఉపయోగపడుతుంది.
మార్కుల ప్రాధాన్యం దృష్ట్యా ప్రిలిమ్స్లో భారతదేశ చరిత్ర-సంస్కృతి నుంచి 10 - 15 ప్రశ్నలు, తెలంగాణ చరిత్ర-సంస్కృతి నుంచి 10 - 15 ప్రశ్నలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం నుంచి 10 - 15 ప్రశ్నలు, భౌతిక భూగోళశాస్త్రం నుంచి 5 - 6 ప్రశ్నలు, బేసిక్ సైన్స్ నుంచి 5 - 10 ప్రశ్నలు రావొచ్చు.
ఈవిధంగా ప్రిలిమ్స్లోని మొత్తం 150 ప్రశ్నలకు దాదాపు మూడో వంతు ప్రశ్నలు పై సబ్జెక్టుల నుంచే వస్తాయి. అంతేకాకుండా ఇండియన్ పాలిటీ నుంచి మరో 15 - 18 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు జరిగితే జరగవచ్చు. ‘భారత ఆర్థిక వ్యవస్థ’కు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణల నుంచి 5- 6 ప్రశ్నలు ఉండవచ్చు.
ఈ సబ్జెక్టులు ముందుగా చదివితే ప్రిలిమ్స్లో దాదాపు సగం సిలబస్ పూర్తి చేసినట్లు అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేలోపే ఇవన్నీ సిద్ధమైతే ఎంతో ప్రయోజనం!
ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది?
‣ ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ అయినప్పటికీ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండాలి. కేవలం బిట్లు చదివితే సరిపోదు.
‣ ప్రిలిమ్స్లో ప్రశ్నలు లోతుగా తికమక పెట్టేట్లు ఉంటున్నాయి. ‘కిందివాటిలో ఏది సరైనది కాదు?’ అనే ప్రశ్న వచ్చిందనుకోండి.
ఇచ్చిన నాలుగు జవాబుల్లో మూడు అంశాలు మీకు తెలియాల్సిందే! అందులో ఏది తెలియకపోయినా మీ సమాధానం తప్పు అవుతుంది.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News