• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో ఆంధ్రోద్యమం

  తెలంగాణ చరిత్రలో.. ప్రత్యేకించి నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమ చరిత్రలో 'ఆంధ్ర జనసంఘం' స్థాపన ఒక మహత్తర సంఘటన. అప్పటివరకు గ్రంథాలయాలను స్థాపించి భాషా సంస్కృతుల సేవకే పరిమితమైన తెలుగువారిని సామాజిక, రాజకీయ ఉద్యమాల వైపు తీసుకెళ్లిన ఘనత ఆంధ్ర జనసంఘానిదే. ఇది రాజకీయేతర సంస్థగా పనిచేస్తూనే, యువకులను చైతన్యపరిచి, పరిస్థితులను రాజకీయ కార్యరంగానికి సిద్ధం చేసింది. ఆంధ్ర మహాసభల ద్వారా మెరికల్లాంటి నాయకులను తయారు చేసింది. ప్రపంచ ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాటానికి బాటలు వేసింది. ఆంధ్రోద్యమంలో జనసంఘం, మహాసభల పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
నిజాం రాజ్యంలో తెలుగువారు తమ భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడానికి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం లాంటి గ్రంథాలయాలను స్థాపించారు. వీటిద్వారా ప్రజలను చైతన్యపరిచారు. తెలుగువారు భాషా సంస్కృతులకు మాత్రమే పరిమితమైన సందర్భంలో.. వారి ఆలోచనల్లో గొప్ప మార్పును తీసుకొచ్చి, వారిని ఆంధ్రోద్యమం వైపు మళ్లించిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

 

ఆంధ్ర జనసంఘం

  హైదరాబాద్‌లోని వివేకవర్థిని థియేటర్‌లో 1921 నవంబరు 12వ తేదీ అర్ధరాత్రి హిందూ సంస్కార సభ జరిగింది. పుణె మహిళా విశ్వవిద్యాలయ స్థాపకులు దోండే కేశవ కార్వే ఆ సభకు అధ్యక్షులు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వారంతా ఆంగ్లం, ఉర్దూతోపాటు వారి మాతృభాషల్లో కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ సభలో వక్తగా ఉన్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆలంపల్లి వెంకట రామారావు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించినప్పుడు సభికులంతా గోలచేసి ప్రసంగం కొనసాగకుండా చేశారు. ఈ ఘటనను సభలో పాల్గొన్న తెలుగువారు అవమానంగా భావించి, నిరసన తెలుపుతూ బయటకు వచ్చారు. వారంతా ఆ రాత్రే టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడకు వచ్చినవారిలో టేకుమాల రంగారావు, మాడపాటి హనుమంతరావు, మిట్ట లక్ష్మీనరసయ్య, ఆదిరాజు వీరభద్రరావు, నడింపల్లి జానకి రామయ్య, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, బోయినపల్లి వెంకటరామారావు, కొమ్మవరపు సుబ్బారావు, బూర్గుల నరసింహారావు, డాక్టర్ పందింటి రామస్వామి నాయుడు.. అంతా కలిసి 'ఆంధ్ర జనసంఘం'ను స్థాపించారు. ఒక రూపాయి చందా ఇచ్చేవారు ఈ సభలో సభ్యులుగా ఉంటారని నిర్ణయించారు. వంద మంది సభ్యులు ఈ సంఘంలో చేరారు. 1922 ఫిబ్రవరి 24, మార్చి 17, ఏప్రిల్ 4న ఆంధ్ర జనసంఘం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన మూడుసార్లు సమావేశమై నియమావళిని రూపొందించింది. ఆ తర్వాత ఎన్నో ఆంధ్రజన సంఘం శాఖలు నిజాం రాష్ట్రంలో ప్రారంభమై ఆంధ్రోద్యమ వ్యాప్తికి చురుగ్గా పనిచేశాయి. తెలుగువారిలో జాగృతి, ఉత్సాహం వెల్లివిరిశాయి. ఆంధ్ర జనసంఘం కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడింది. సంస్కరణలు మాత్రమే లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. 1922 డిసెంబరు 2న 'సూర్యాపేట వర్తక సంఘం'ను స్థాపించారు.

 

జనసంఘం సమావేశాలు

  ఆంధ్ర జనసంఘం మొదటి సమావేశం 1923 జులై 27న హైదరాబాద్‌లో మాడపాటి హనుమంతరావు ఇంట్లో జరిగింది. అధ్యక్షుడుగా రాజ బహదూర్ వెంకట రామారెడ్డిని, కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావును ఎన్నుకున్నారు.
రెండో సమావేశం 1924 మార్చి 1న నల్గొండలో నీలగిరి పత్రిక సంపాదకులు షబ్నవీసు వేంకట రామనరసింహారావు కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సభకు కూడా వెంకట రామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ రెండు సమావేశాల్లోనూ తెలుగువారి విద్యావికాసాలు, వారి భాషాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలనే నిర్ణయించారు.
మూడో సమావేశం 1925 ఫిబ్రవరి 21న మధిరలో జరిగింది. దీనికొక విశిష్టత ఉంది. ఆంధ్ర జనసంఘంతోపాటు గ్రంథాలయ మహాసభ కూడా ఫిబ్రవరి 22న జరిగింది. బొంబాయి ఆంధ్రులు కూడా దీనికి సానుభూతి తెలిపారు. గ్రంథాలయాలను నిజాం సహించలేక.. రాజ్యపు అవతలివారి సంబంధాలను ఓర్వలేక.. 1925లో జరగాల్సిన నాలుగో మహాసభకు అంతరాయం కలిగించారు. వాయిదాపడిన ఈ సభలు సూర్యాపేటలో 1928, మే 28, 29, 30 తేదీల్లో అత్యంత విజయవంతంగా జరిగాయి. వీటితోపాటు గ్రంథాలయ మహాసభలు, వర్తక సంఘం సమావేశాలు కూడా జరిగాయి.
ఈ సభలతో నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమంలో తొలిదశ విజయవంతంగా ముగిసింది. ఈ కొద్దికాలంలో తెలుగువారికి ఒక సంస్థ ఉందన్న విశ్వాసం ఏర్పడింది. వర్తకుల్లో మంచి ప్రాబల్యం సంపాదించింది. వారికి సంఘం వల్ల కొన్ని ప్రయోజనాలు కలిగాయి. దొరలు, అధికారుల బెడద కొంత తగ్గింది. ఈ దశలో ఆంధ్ర జనసంఘం వివిధ సంఘాల సంధానుకార్యాన్ని నిర్వహించింది. అందువల్ల తెలంగాణ అంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అవసరమైంది. బ్రిటిష్ ఆంధ్ర నుంచి సుసర్ల శ్రీ రామనరసింహం విస్తృత ఆంధ్ర సంస్థ అవసరాన్ని సంఘానికి తెలియజేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని 'ఆంధ్ర మహాసభ' అవతరించింది.

 

మహాసభలు

ఒకటో ఆంధ్ర మహాసభ: మెదక్ జిల్లా జోగిపేటలో 1930 మార్చి 3, 4, 5 తేదీల్లో మొదటి సభ జరిగింది. దీనికి సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రభుత్వం ఎన్నో షరతులతో సభ జరపడానికి అనుమతినిచ్చింది. ఈ సభాసమావేశాల్లో 32 తీర్మానాలను ఆమోదించారు. వీటిలో ఎక్కువగా విద్య, సంఘ సంస్కరణలకు సంబంధించినవే ఉన్నాయి. వీటితోపాటు బాల్యవివాహాల నిషేధం, వితంతు వివాహం లాంటి తీర్మానాలను కూడా చేశారు. అయితే సభలో ఉన్న సనాతన సంప్రదాయవాదులను ఈ తీర్మానాలు బాధించాయి.

 

రెండో ఆంధ్రమహాసభ: ఈ సభ 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో దేవరకొండలో జరిగింది. ఈ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. రావి నారాయణరెడ్డి నాయకత్వాన రెడ్డి హాస్టల్ విద్యార్థులు కాలినడకన బయలుదేరి, ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ దేవరకొండ చేరుకున్నారు. గస్తినిషాన్ తిర్పన్ - సర్క్యులర్ నం.53ను ఉపసంహరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం ఈ సభలో ప్రధాన విషయం.

 

మూడో ఆంధ్రమహాసభ: రెండు మహాసభల తర్వాత సమావేశాలకు కొంత అంతరాయం వచ్చింది. ఆంధ్ర మహాసభ రాజకీయ సభ కాదని నాయకులు చెబుతున్నా, దాని తీర్మానాలు ప్రభుత్వ షరతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న నెపంతో మూడు సంవత్సరాలపాటు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. అనేక అడ్డంకులను సృష్టించింది. వీటిని ఎదుర్కొంటూ మూడో మహాసభలు 1934 డిసెంబరు 13, 14, 15 తేదీల్లో ఖమ్మంలో జరిగాయి. ఈ సభలకు పులిజాల వెంకట రంగారావు అధ్యక్షత వహించారు.

 

నాలుగో ఆంధ్ర మహాసభ: మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన 1935 డిసెంబరు 26, 27, 28 తేదీల్లో సిరిసిల్లలో జరిగాయి. ఈ సమావేశాల్లో ఆంధ్ర మహాసభ వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలని, ఉపస్యాసాలు తెలుగులోనే ఉండాలని నిర్ణయించారు. ఈ సభల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

 

అయిదో ఆంధ్ర మహాసభ: షాద్‌నగర్‌లో 1936 డిసెంబరు 15, 16, 17 తేదీల్లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి దాదాపు 10వేల మంది హాజరయ్యారు.

 

ఆరో ఆంధ్ర మహాసభ: నిజామాబాద్‌లో 1937 డిసెంబరు 6, 7, 8 తేదీల్లో జరిగింది. మందుముల నరసింగరావు అధ్యక్షత వహించారు. అప్పటివరకు ఆంధ్ర మహాసభను రాజకీయేతర సంస్థగా పరిగణించేవారు. కానీ ఈ సమావేశాల్లో అది రాజకీయ కార్యాచరణ దిశగా అడుగులు వేసింది. బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో 'భారత ప్రభుత్వ చట్టం - 1935'ను అమలు చేయాలని నిర్ణయించింది. 1937 ఫిబ్రవరి 13న నిజాం ఉల్ ముల్క్ ఉస్మాన్ అలీఖాన్ 25 సంవత్సరాల రాజ్యపాలన (సిల్వర్ జుబ్లీ) వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఆనంద సమయంలో నిజాం ప్రభువు తన పరిపాలనలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రజాప్రతినిధుల మండలిని ఏర్పాటు చేయడం కోసం, రాజ్యాంగ సవరణలు సూచించడానికి 1937 సెప్టెంబరు 22న ప్రముఖ న్యాయవాది అరవముద అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీని ప్రకటించారు. ఈ సమావేశాల్లో పలు రాజకీయ తీర్మానాలు చేశారు. అంతకుముందు అంతర్లీనంగా ఉన్న అతివాద, మితవాద భావాలను బహిరంగంగా ప్రకటించడం ప్రారంభమైంది.

ఏడో ఆంధ్ర మహాసభ: హైదరాబాద్ జిల్లా మల్కాపురంలో 1940లో జరిగింది. మందుముల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాలు అంతకుముందు వాటి కంటే భిన్నంగా జరిగాయి. ఈ సభలోనే కమ్యూనిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే మితవాదులు, అతివాదులనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. నిజాం రాష్ట్రంలో జరిగిన ప్రథమ సత్యాగ్రహంలో మందుముల రామచంద్రరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు. సత్యాగ్రహం ద్వారా రాజకీయ చైతన్యాన్ని పొందిన యువకులు మహాసభల్లో మరింత చురుగ్గా పాల్గొన్నారు.

 

ఎనిమిదో ఆంధ్ర మహాసభ: నల్లగొండ జిల్లా చిలుకూరులో 1941లో జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమ నేత రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. నాయకులు మితవాదులు, అతివాదులుగా చీలిపోవడంతో చిలుకూరు సభలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యక్ష ఉపన్యాసంలో ప్రపంచ యుద్ధాలు, అంతర్జాతీయ అంశాలు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వల్ల కలిగే నష్టాలు వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. కౌలు సమస్య, వెట్టిచాకిరి, రైతుల సమస్యలు, స్త్రీలసమస్యలు లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. సభ్యత్వ రుసుమును రూపాయి నుంచి నాలుగు అణాలకు తగ్గించారు. ఈ నిర్ణయం మహాసభను ప్రజలకు మరింత చేరువ చేసింది. రావి నారాయణరెడ్డి అధ్యక్ష కాలంలో ఆంధ్ర మహాసభ తరఫున విద్యా వారం (1941 అక్టోబరు 19-25), బేగారి వారం (1941 డిసెంబరు 25 - 1942 జనవరి 1), రాజకీయ బాధితుల దినం (1941 డిసెంబరు 25) జరిపారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించి రైతులు, కూలీల్లో చైతన్యం తేగలిగారు.

తొమ్మిదో ఆంధ్ర మహాసభ: వరంగల్ జిల్లా ధర్మవరంలో 1942 మేలో జరిగింది. మాదిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మితవాదుల్లో మితవాది మాదిరాజు. పరిస్థితులు అతివాదులకు అనుకూలంగా ఉన్నప్పటికీ సంఘ నిర్మాణ బలహీనతల వల్ల నాయకత్వం తిరిగి మితవాదుల చేతుల్లోకి మారింది. యువ నాయకుల సహాయ సహకారాలు ఈ సభకు లభించలేదు.

 

పదో ఆంధ్ర మహాసభ: ఈ సభ 1943 మే 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగింది. జాతీయవాది కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో మొదటిసారి అధ్యక్షుడి ఎన్నికకు పోటీ జరిగింది. అతివాద నాయకులు బద్దం ఎల్లారెడ్డి, మితవాద నాయకుడు కొండా వెంకట రంగారెడ్డి మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి విజయం సాధించారు. దీంతో మితవాదులు, అతివాదుల మధ్య అంతరం తారాస్థాయికి చేరింది.

 

11వ ఆంధ్ర మహాసభ: భువనగిరిలో 1944 మార్చిలో జరిగింది. దీనికి రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో మితవాదుల జోక్యం లేదు. విజయవాడ ప్రాంతం నుంచి సుమారు వంద మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. ఈ మహాసభ వామపక్ష వాతావరణంలో ఒక బలీయమైన ప్రజాఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఈ సభలకు 10వేల మంది హాజరయ్యారు. సభలో సభ్యత్వ రుసుమును నాలుగు అణాల నుంచి ఒక అణాకు తగ్గించి మహాసభను ప్రజలకు మరింత చేరువ చేశారు. అయితే, ఆంధ్ర మహాసభలో తమకిక స్థానం లేదనుకున్న మితవాదులు కొండా వెంకట రంగారెడ్డి ప్రోద్బలంతో మందుముల నరసింగరావు అధ్యక్షతన పోటీ మహాసభ పెట్టారు. తమదే నిజమైన ఆంధ్ర మహాసభ అని పేర్కొంటూ.. 1945లో మడికొండలో ఆంధ్ర మహాసభలను నిర్వహించారు.

 

12వ ఆంధ్ర మహాసభ: ఖమ్మంలో 1945 ఏప్రిల్ 26, 27 తేదీల్లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. దాదాపు 40 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో రైతులకు సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. వెట్టిచాకిరిని వెంటనే రద్దు చేయాలని సభ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజాం రాజ్యాన్ని ఎదిరించి, ప్రజారాజ్యాన్ని స్థాపించాలని ఆంధ్ర మహాసభ పిలుపునిచ్చింది. ఈ మహాసభల తర్వాత రాజకీయ పోరాటాలు తెలంగాణ అంతటా వ్యాపించాయి. ప్రజా పోరాటమే సమస్యల పరిష్కారానికి పరమావధిగా ప్రజలు గ్రహించారు. ఆంధ్ర మహాసభపై 1946 జులైలో ప్రభుత్వం నిషేధం విధించింది. మితవాద నాయకుల ఆంధ్ర మహాసభ 1946లో కందిలో జమలాపురం కేశవరావు అధ్యక్షతన జరిగింది. దీని తర్వాత స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తివేయడంతో మితవాదుల ఆంధ్ర మహాసభ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.

 

మహిళా సభలకూ చోటు

  ఆంధ్ర మహాసభలతోపాటు మహిళా సభలను కూడా నిర్వహించారు. ఈ సంప్రదాయం పదో ఆంధ్ర మహాసభ వరకు కొనసాగింది. సభలకు నడింపల్లి సుందరమ్మ, టి.వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, మాడపాటి మాణిక్యమ్మ, బూర్గుల అనంత లక్ష్మీదేవి, నందగిరి ఇందిరాదేవి, యోగ్యశీలాదేవి, రంగమ్మ ఓబులరెడ్డి వంటివారు అధ్యక్షులుగా వ్యవహరించారు.

Posted Date : 18-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌