పొదుపులు సమీకరించి.. పెట్టుబడులు సమకూర్చి!
ఆర్థిక వ్యవస్థలో విత్త మార్కెట్లు ప్రధానమైనవి. ద్రవ్యత్వ ఆస్తులైన కరెన్సీ నోట్లు, బాండ్లు, వాటాలు, బిల్లులు, ఒప్పంద పత్రాలు తదితరాలు ఇందులో ఉంటాయి. పొదుపును సమీకరించి పెట్టుబడిదారులకు, అవసరం ఉన్నసంస్థలకు అందించడమే మౌలికంగా ఈ మార్కెట్ల ఉద్దేశం. బ్యాంకింగ్ అందులో అంతర్భాగమే. అనాదిగా కొనసాగుతున్న దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు వీటి కిందకే వస్తారు. మన దేశంలో విత్త మార్కెట్లకు అర్థం, పరిధి విస్తృతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మార్కెట్లలో రకాలు, కాలపరిమితి ఆధారంగా వర్గీకరణ, ఇతర ప్రాథమిక అంశాల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.
ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే సమర్థ విత్త వ్యవస్థ ఎంతో అవసరం. ఆ వ్యవస్థలో నాలుగు భాగాలు ఉంటాయి.1) విత్త సంస్థలు 2) విత్త మార్కెట్లు 3) విత్త సాధనాలు 4) విత్త సేవలు.
విత్త సంస్థలు: వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.
బ్యాంకేతర విత్త సంస్థలు: అవి: 1) అభివృద్ధి విత్త సంస్థలు 2) బ్యాంకేతర విత్త కంపెనీలు 3) గృహనిర్మాణ విత్త కంపెనీలు
బ్యాంకింగ్ సంస్థలు: ఇవి మళ్లీ ఆరు రకాలు. 1) టర్మ్ విత్త సంస్థలు ఉదా: ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఐఎఫ్సీఐ మొదలైనవి. 2) నిర్దిష్ట విత్త సంస్థలు ఉదా: ఎగ్సిమ్ బ్యాంకు, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్. 3) రంగాలవారీ విత్త సంస్థలు ఉదా: నాబార్డ్. 4) పెట్టుబడి విత్త సంస్థలు ఉదా: యూటీఐ. 5) బీమా సంస్థలు ఉదా: ఎల్ఐసీ, జీఐసీ. 6) రాష్ట్రస్థాయి సంస్థలు ఉదా: ఎస్ఎఫ్సీఎస్
విత్త మార్కెట్లు: విత్త వ్యవస్థలో ప్రముఖమైన విభాగం విత్త మార్కెట్లు. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి విత్తమార్కెట్లు దోహదం చేస్తాయి. ఇవి రెండు రకాలు 1) ద్రవ్య మార్కెట్ 2) మూలధన మార్కెట్. ద్రవ్య మార్కెట్ స్వల్పకాలిక విత్తం సమకూరిస్తే, మూలధన మార్కెట్ దీర్ఘకాలిక విత్తాన్ని సేకరిస్తుంది.
ద్రవ్య మార్కెట్: స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. ద్రవ్య మార్కెట్లో మంజూరయ్యే రుణాల కాలవ్యవధి ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఈ మార్కెట్లో లభించే నిధులు స్వల్పకాలానికే పరిమితమై ఉంటాయి. అందువల్ల ద్రవ్య మార్కెట్ను స్వల్పకాలిక పరపతి మార్కెట్ అని కూడా అంటారు. ద్రవ్య మార్కెట్ ప్రత్యక్షంగా ద్రవ్యంతో వ్యవహరించదు. సమీప ద్రవ్యంగా పేర్కొనే స్వల్పకాలిక పరపతి ఉన్న వర్తక బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల అంగీకారాలు మొదలైన పత్రాల కొనుగోలు, అమ్మకం జరిగే వ్యవస్థనే ద్రవ్య మార్కెట్ అంటారు. ఈ పత్రాలన్నింటికీ అధిక ద్రవ్యత్వం ఉంటుంది.
భారతీయ ద్రవ్య మార్కెట్ను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించారు.1) సంఘటిత ద్రవ్య మార్కెట్ 2) అసంఘటిత ద్రవ్య మార్కెట్. సంఘటిత మార్కెట్లో ఉప మార్కెట్లు, ద్రవ్య మార్కెట్ ప్రధానంగా ఉంటాయి. వీటిని బ్యాంకింగ్ రంగం పర్యవేక్షిస్తుంది.
1) కాల్మనీ మార్కెట్: వివిధ బ్యాంకుల మధ్య నిధుల బదిలీ ఈ మార్కెట్ లక్ష్యం. మిగులు నిధులున్న బ్యాంకులు, తాత్కాలికంగా నగదు కొరత ఏర్పడిన బ్యాంకులకు నిధులు సమకూర్చడమే కాల్మనీ మార్కెట్. దీన్ని అంతర బ్యాంకుల తక్షణ ద్రవ్య మార్కెట్ అంటారు. ఈ మార్కెట్లో రెండు విభాగాలుంటాయి.
1) తక్షణ ద్రవ్య మార్కెట్ 2) అల్ప వ్యవధి ద్రవ్య మార్కెట్.
* తక్షణ రుణం కాలపరిమితి ఒక రోజు మాత్రమే. అల్పవ్యవధి రుణ కాలపరిమితి 14 రోజులు. అన్నిరకాల బ్యాంకులు ఈ మార్కెట్లో పాల్గొంటాయి.
2) బిల్లుల మార్కెట్: బిల్లుల మార్కెట్ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు.ఎ) ట్రెజరీ బిల్లుల మార్కెట్ బి) వాణిజ్య బిల్లుల మార్కెట్.
ఎ) ట్రెజరీ బిల్లుల మార్కెట్: ట్రెజరీ బిల్లులతో వ్యవహరించే ద్రవ్య మార్కెట్ను ట్రెజరీ బిల్లుల మార్కెట్ అంటారు. భారత ప్రభుత్వం తాత్కాలిక ద్రవ్య నిధుల అవసరాలు తీర్చుకోవడానికి స్వల్పకాలిక రుణాలు పొందడానికి ఉపయోగించే సాధనాలను కోశ బిల్లులు లేదా ట్రెజరీ బిల్లులు అంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వ స్వల్పకాలిక రుణ సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. ట్రెజరీ బిల్లులు మూడు రకాలు.1) 91 రోజుల ట్రెజరీ బిల్లులు 2) 182 రోజుల ట్రెజరీ బిల్లులు 3) 364 రోజుల ట్రెజరీ బిల్లులు. వీటిని 15 రోజులకు ఒకసారి వేలం ద్వారా విక్రయిస్తారు.
నగదు నిర్వహణ బిల్లులు: ఇవి కూడా ట్రెజరీ బిల్లుల లాంటివే. కాల వ్యవధి 91 రోజుల కంటే తక్కువ. కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక అవసరాల కోసం రిజర్వు బ్యాంకు విక్రయించే సెక్యూరిటీలు ఇవి. వీటిని చట్టబద్ధ ద్రవ్యత్వ నిబంధన కింద బ్యాంకులు తమ వద్ద ఉంచుకోవచ్చు.
వేస్ అండ్ మీన్ అడ్వాన్సులు: తాత్కాలిక ట్రెజరీ బిల్లుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వు బ్యాంకు తాత్కాలికంగా ఇచ్చే రుణాలు లేదా ఓవర్ డ్రాఫ్ట్లు. వీటి కాలవ్యవధి 10-14 పనిదినాలు.
తేదీ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు: బ్యాంకుల చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని (ఎస్ఎల్ఆర్) కొంత కాలవ్యవధి లోపల తగ్గించాలనే నరసింహం కమిటీ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 5, 10 సంవత్సరాల కాల పరిపక్వత తేదీ ఉన్న సెక్యూరిటీలను ఈ కొత్త విధానంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బి) వాణిజ్య బిల్లుల మార్కెట్: ఒక వ్యాపారి మరో వ్యాపారికి అరువుపై సరకు అమ్మినప్పుడు ఒక నిర్ణీత తేదీన చెల్లించే విధంగా అంగీకారం తెలియజేస్తూ కొనుగోలుదారుడు రాసిన పత్రాన్నే వాణిజ్య బిల్లు లేదా వర్తక బిల్లులు అంటారు. ఇది దేశీయ కార్యకలాపాలకు చెందింది. సాధారణంగా దీని కాలవ్యవధి మూడు నెలలు ఉంటుంది. భారతదేశంలో అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను హుండీలు అంటారు. ఇవి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో ఉపయోగంలో ఉన్నాయి. హుండీల్లో డిమాండ్ బిల్లులను దర్శని అని, వ్యాపార బిల్లులను ముద్దతి అని పిలుస్తారు. మన దేశంలో ఈ మార్కెట్ అంతగా అభివృద్ధి చెందలేదు.
3) వాణిజ్య పత్రాలు: వాఘల్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టింది. 1990, జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూర్చుకోడానికి స్వల్పకాల సాధనమే వాణిజ్య పత్రాలు. మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలు వీటిని జారీ చేయవచ్చు.స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చు. వీటిని విడుదల చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఉండాలి. రూ.5 కోట్ల కంటే ఎక్కువ నిర్వహణ మూలధనం (వర్కింగ్ క్యాపిటల్) ఉన్న కంపెనీలు వీటిని జారీ చేస్తాయి. వీటి పరిపక్వత కాలం 3-6 నెలల మధ్య ఉంటుంది. ఇండియాలో వాణిజ్య పత్రాలను ఎక్కువగా జారీ చేసింది లీజింగ్, విత్త సంస్థలు.
4) డిపాజిట్ సర్టిఫికెట్లు: వాఘల్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు మేరకు 1989, జూన్లో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారీ చేసే సర్టిఫికెట్లను డిపాజిట్ సర్టిఫికెట్లు అంటారు. డిస్కౌంట్ ప్రాతిపదికన ఇవి జారీ అవుతాయి. 1991-92 నుంచి అఖిల భారత విత్త సంస్థలైన ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఐఎఫ్సీఐలు కూడా వీటి జారీకి అనుమతి పొందాయి. వీటికి మార్కెట్లో ఒక సంవత్సరం వరకు కాలవ్యవధి ఉంటుంది.
అసంఘటిత ద్రవ్య మార్కెట్: అసంఘటిత ద్రవ్య మార్కెట్ను మూడు రకాలుగా విభజించవచ్చు.
1) క్రమబద్దీకరించని నాన్-బ్యాంకింగ్ విత్తసంస్థలు: దీనిలో రుణ లేదా విత్త కంపెనీలు దేశం అంతటా వ్యాపించి ఉన్నాయి. డిపాజిట్లు, రుణాల సేకరణ ద్వారా తమకు కావాల్సిన నిధులు సమకూర్చుకుంటాయి. 1/5వ వంతు నుంచి 1/4వ వంతు నిధులు సొంత వనరుల ద్వారా సమకూర్చుకుంటాయి. రిటైల్, హోల్సేల్ వ్యాపారులకు, చేతివృత్తుల వారికి రుణాలు ఇస్తాయి. వడ్డీ రేటు 36% నుంచి 48% ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి పరపతి పొందలేనివారు వీటి నుంచి రుణాలు తీసుకుంటారు.
చిట్ఫండ్ కంపెనీలు: ఇవి పొదుపు సంస్థలు. వీటిలోని సభ్యులు కాలానుగుణంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని లాటరీ పద్ధతిలో లేదా వేలంపాట ద్వారా సభ్యులకు అందిస్తారు. ఈ వ్యాపారం అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కేరళ, తమిళనాడులో ఎక్కువగా ఉంది.
నిధి: ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఇవి పనిచేస్తున్నాయి. వీటి కార్యకలాపాలు సభ్యుల వరకే పరిమితమవుతాయి. సభ్యుల కుటుంబ అవసరాల కోసం రుణాలు అందిస్తాయి. వీటికి కావాల్సిన నిధులు కూడా సభ్యుల డిపాజిట్ల ద్వారా సమకూరతాయి. ఇంటి నిర్మాణం, మరమ్మతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. వీటి కార్యాలయం కూడా స్థానికంగానే ఉంటుంది.
2) దేశీయ బ్యాంకర్లు: దేశీయ బ్యాంకర్లు వ్యక్తిగతంగా లేదా ప్రైవేటు సంస్థలుగా ఏర్పడతాయి. ఇవి డిపాజిట్లు స్వీకరిస్తాయి, రుణాలు ఇస్తాయి. దేశీయ బ్యాంకర్లకు, వడ్డీ వ్యాపారులకు తేడా ఉంది. వడ్డీ వ్యాపారులు కేవలం ద్రవ్యాన్ని రుణంగా ఇచ్చే వ్యాపారం చేస్తారు. వీరు విత్త సంబంధ మధ్యవర్తులు కారు.
మన దేశంలో ముఖ్యమైన దేశీయ బ్యాంకర్లు 1) గుజరాత్ షరఫ్లు (ముంబయి, కోల్కతా పారిశ్రామిక కేంద్రాల్లో ఉండేవారు) 2) ముల్తానీలు లేదా శిఖర్పురీ షరఫ్లు (ముంబయి, చెన్నై) 3) చెట్టియార్లు (దక్షిణ భారతదేశం) 4) మార్వారీ కాయాలు (కోల్కత్తా, ముంబయి, అస్సాం).
వాణిజ్య బ్యాంకులు భద్రత లేకుండా రుణాలు ఇవ్వవు. కానీ దేశీయ బ్యాంకులు అలాంటి రుణాలు ఇస్తాయి. అలాగే వ్యక్తిగత సేవలు కూడా అందిస్తాయి. దేశీయ బ్యాంకులు సీఆర్ఆర్ నిర్వహించాల్సిన అవసరం లేదు. వీటి స్థాపన వ్యయం తక్కువగా ఉంటుంది.
3) వడ్డీ వ్యాపారులు: వీరు రెండు రకాలు. 1) వడ్డీ వ్యాపారమే ప్రధాన వృత్తిగా ఉన్నవారు. 2) ఇతర వృత్తులతోపాటు వడ్డీ వ్యాపారం చేసేవారు.
లక్షణాలు: * సొంత నిధులతోనే వ్యాపారం చేస్తారు. అరుదుగా బ్యాంకులు, విత్త సంస్థల నుంచి రుణాలు తీసుకుంటారు. * వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకునేవారు పేదవారై ఉంటారు. ఉదా: వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు * వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీని వసూలు చేస్తారు.
విత్త సాధనాలు: భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన లేదా కొన్ని కాలవ్యవధుల్లో లేదా వడ్డీ రూపంలో లేదా డివిడెండ్ రూపంలో కొంత ద్రవ్యాన్ని చెల్లించే విధంగా ఒక వ్యక్తి లేదా సంస్థ మీద రాసిన క్లెయిమ్ను విత్త సాధనం అంటారు. ఉదా: కాగితపు సంపద, వాటాలు, డిబెంచర్లు, బాండ్లు ఒక నిర్ణీత కాలవ్యవధి తర్వాత నిర్దిష్ట ద్రవ్య మొత్తంపై వడ్డీ లేదా డివిడెండ్ చెల్లించాల్సిన క్లెయిమ్ పత్రాన్ని విత్త ఆస్తి అంటారు. ఉదా: బ్యాంకు డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు, కంపెనీ వాటాలు, రుణపత్రాలు మొదలైన విత్త ఆస్తులు, సెక్యూరిటీలను విత్త ఆస్తులు అంటారు.
విత్త సేవలు: నిధులు రుణంగా స్వీకరించడానికి, సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి, చెల్లింపులు చేయడానికి విత్త మార్కెట్లో నష్ట భయాన్ని అదుపు చేయడానికి ఉపకరించే సేవలే విత్త సేవలు.
రచయిత: ధరణి శ్రీనివాస్