• facebook
  • whatsapp
  • telegram

పేదరికం రకాలు

అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం.. ప్రధాన ఆర్థిక, సాంఘిక సమస్యలు. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. 20వ శతాబ్దపు మధ్య కాలం నుంచి ఈ సమస్యలు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారాయి. అన్నింటిలోకెల్లా పేదరికం తీవ్రమైన సమస్య. గత కొన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ అనేక ప్రణాళికలు రూపొందిస్తూ చర్యలు చేపడుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అన్ని ఉద్యోగ నియామక పరీక్షల్లోనూ 'భారతదేశ, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి' అనే విభాగం కీలకమైంది. అభ్యర్థులకు పేదరికం మూలాలు.. దారిద్య్ర రేఖ.. పేదరిక అంచనాలు.. నిర్మూలన చర్యలు.. ప్రత్యేక పథకాలపై అవగాహన అవసరం.

సమాజంలోని ప్రజలు తమ మనుగడకు అవసరమైన కనీస అవసరాల (ఆహారం, వస్త్రాలు, గృహవసతి)ను పొందలేని స్థితిలో ఉంటే, ఆ స్థితిని పేదరికం అంటారు.
భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పేదరికమే ముఖ్యమైంది. అంతర్జాతీయంగా.. ఆర్థిక శాస్త్రంలో నిరపేక్ష, సాపేక్ష పేదరికాలనే రెండు భావనలున్నాయి. ఇందులో భారత్ లాంటి దేశాల్లో కనిపించేది నిరపేక్ష పేదరికం. ఈ రెండు రకాల భావనలను పరిశీలిస్తే..

నిరపేక్ష పేదరికం (అబ్జల్యూట్ పావర్టీ)
కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. కనీస అవసరాల పరిమాణాన్ని మార్కెట్ ధరల ఆధారంగా లెక్కించి కనీస జీవన వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే పేదరికం నిరపేక్ష పేదరికం. పేదరికపు సమస్యను పరిశీలించేటప్పుడు నిరపేక్ష పేదరికాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

సాపేక్ష పేదరికం (రిలేటివ్ పావర్టీ)
సాపేక్ష పేదరికం అనేది ఆర్థిక అసమానతలను సూచిస్తుంది. ఈ భావన ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ స్థాయి, జీవన ప్రమాణం తక్కువగా ఉన్న ప్రజలను ఆదాయస్థాయి, జీవన ప్రమాణం ఎక్కువగా ఉన్న ప్రజలతో పోల్చి తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షంగా పేదవారుగా పరిగణిస్తారు. ఈ భావనను సంపన్న దేశాల్లో అధికంగా ఉపయోగిస్తారు.

దారిద్య్ర రేఖ (పావర్టీ లైన్)
కనీస వినియోగ స్థాయి లేదా తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయాన్ని చేయగల ఆదాయస్థాయిని తెలిపే రేఖను దారిద్య్ర రేఖ లేదా పేదరికపు రేఖ అంటారు. ప్రణాళికా సంఘం ప్రకారం ఆహార వస్తు వినియోగాన్ని క్యాలరీల రూపంలో లెక్కిస్తారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున అవసరమయ్యే క్యాలరీలు 2400. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు.

పేదరికాన్ని కొలిచే పద్ధతులు
1. తలల లెక్కింపు పద్ధతి (హెచ్‌సీఆర్ - హెడ్ కౌంట్ రేషియో)

భారతదేశంలో పేదరికంలో ఉన్న జనాభాను లెక్కించడానికి సాధారణంగా తలల లెక్కింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం ఎంత అనే విషయం తెలుస్తుంది. దీన్ని కింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.
H = q/n 100
H = తలల లెక్కింపు
q = పేదరికంలో ఉన్న ప్రజలు
n = మొత్తం జనాభా

2. పేదరిక వ్యత్యాస సూచి
పేదరిక తీవ్రతను, పేదల్లో ఉండే అంతరాలను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు.
పేదరికం వ్యత్యాసం = పేదరికపు రేఖ - పేదవాడి సగటు వినియోగ వ్యయం / పేదరికపు రేఖ

3. సేన్స్ పేదరిక సూచి
సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్యకుమార్ సేన్ దీన్ని అభివృద్ధి చేశారు. పేదరిక రేఖకు దగ్గరగా ఉన్నవారిని పైకి తీసుకొచ్చేకంటే, పేదరిక రేఖకు దూరంగా ఉన్నవారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువగా పెరుగుతుందని సేన్ అభిప్రాయ పడ్డారు.

4. బహు పార్శ్వపు పేదరిక సూచి (ఎంపీఐ- మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్)
2010 మానవ అభివృద్ధి నివేదిక, మానవ పేదరిక సూచి(హెచ్‌పీఐ-1997) స్థానంలో ఎంపీఐను ప్రవేశపెట్టింది. ఈ సూచి మూడు అంశాలతో ఉంటుంది. అవి...
1. ఆయుర్దాయం
2. అక్షరాస్యత
3. జీవన ప్రమాణం

భారత్‌లో పేదరికం అంచనాలు
మన దేశంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్‌వో) ప్రతి 5 ఏళ్లకోసారి పేదరికాన్ని అంచనా వేస్తుంది. ఈ అంచనాలను ప్రణాళిక సంఘం (దీని స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది) అధికారికంగా ప్రకటిస్తుంది. భారత్‌లో స్వాతంత్య్రానికి పూర్వం పేదరికాన్ని అంచనా వేసింది దాదాభాయ్ నౌరోజీ.

పట్టిక-3 ప్రకారం ప్రణాళిక సంఘం అంచనాలతో పోలిస్తే తెందూల్కర్ కమిటీ అంచనాల్లో పేదరిక పెరుగుదల కనిపిస్తోంది. కానీ ఈ పెరుగుదల కొత్త పద్ధతిలో అంచనా వేయడం వల్ల వచ్చిందే తప్ప పేదరికం మొత్తం మీద పెరిగిందని నిర్ధారణ చేయకూడదని తెందూల్కర్ కమిటీ ప్రత్యేకంగా సూచించింది. కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా మొత్తం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు 8 శాతం మేరకు తగ్గారని ఈ గణాంకాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

ఎన్ఎస్ఎస్‌వో పేదరికపు అంచనాలు
2011-12 ఏడాది పేదరిక అంచనాలను ఎన్ఎస్ఎస్‌వో (68వ రౌండ్) 2013, జులై 22న ప్రకటించింది. దీని ప్రకారం 2011-12లో మొత్తం జనాభాలో 21.9 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇందులో గ్రామీణ పేదల శాతం 25.7, పట్టణ పేదల శాతం 13.7.

పేదరిక నిర్మూలన చర్యలు
స్వల్పకాలిక చర్యలు: వివిధ పేదరిక నిర్మూలన పథకాల అమలు.
మధ్యకాలిక చర్యలు: స్వయం సహాయక బృందాల ద్వారా పేదరికాన్ని తగ్గించడం.
దీర్ఘకాలిక చర్యలు: జనాభా తగ్గించడం, వృద్ధి వేగవంతం చేయడం, ఆదాయ అసమానతలు తగ్గించడం, భూసంస్కరణల అమలు, గ్రామీణ పారిశ్రామికీకరణ.



ట్రికిల్ డౌన్ సిద్ధాంతం
ప్రపంచవ్యాప్తంగా 1970కు పూర్వం ఆర్థికవేత్తలు 'ట్రికిల్ డౌన్ సిద్ధాంతం'ను విశ్వసించారు. వృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరిగి అది కింది స్థాయికి ప్రవహించి పేదరికం దానంతట అదే తగ్గుతుందని తెలిపేదే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. 1970 నాటికి వృద్ధి జరిగింది కాని పేదరికం తగ్గలేదు. అంటే పేదరికాన్ని తగ్గించడంలో ఈ సిద్ధాంతం ఉపయోగపడలేదు. అందువల్ల పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు భావించారు. ఫలితంగా 1970 దశకం నుంచి భారతదేశంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్నీ పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినప్పటికీ వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.

పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన పథకాలు
1. ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు:

ఉదా: డీపీఏపీ, సీఏడీపీ, డీడీపీ.
2. ప్రత్యేక వర్గాలు లేదా లక్ష్య వర్గాల అభివృద్ధి పథకాలు:
ఉదా: ఎస్ఎఫ్‌డీఏ, ఎంఎఫ్ఏఎల్ఏ, కనీస అవసరాల పథకం, అంత్యోదయ అన్న యోజన
3. ప్రత్యేక పథకాలు / నిరుద్యోగ నిర్మూలన పథకాలు:
ఉదా: ఎన్ఆర్ఈపీ, ఆర్ఎల్ఈజీపీ, ట్రైసం (టీఆర్‌వైఎస్ఈఎం), ఎన్ఆర్‌వై, ఎస్‌జీఎస్‌వై, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటివి.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌