• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఆవిర్భవ క్రమం

  చాలామేర చూసినవారే.. ఎక్కువ మంది పాల్గొన్నవారే.. అయినా తెలంగాణ ఉద్యమంపై పేపర్ అనగానే చాలామంది అభ్యర్థుల్లో అదో రకమైన గుబులు!. అంతా తెలిసినట్లే ఉంది.. ఏమీ తెలియనట్లే ఉంది.. దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడుందనే ఆరా! గ్రూప్-2లో నాలుగో పేపర్‌గా, గ్రూప్-1లో ఆరో పేపర్‌గా సాంకేతిక పోస్టులకు జనరల్‌స్టడీస్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎలా చూడాలో.. ఎలా అవగాహన చేసుకోవాలో.. ఏవిధంగా చదవాలో.. - తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఉద్యమాన్ని పోటీపరీక్షల సిలబస్‌లో చేర్చిన సిలబస్ కమిటీ ఛైర్మన్ ఆచార్య హరగోపాల్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం..
హైఉద్యమం అంటే తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ తొలి ఉద్యమం, జై ఆంధ్రా, తెలంగాణ తాజా ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భవం దాకా సిలబస్‌లో ఉంది. ఈ పేపర్ పెట్టడంలో ఉద్దేశమేంటంటే అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలేంటి? అవి ఎందుకు ఇంతకాలంగా కొనసాగాయి? వాటిని నెరవేర్చడానికి జరిగిన ప్రక్రియ ఏమిటి? ఉద్యమం ఇంతదాకా కొనసాగడానికున్న బలమైన కారణాలు తెలంగాణలో ఉద్యోగం చేయాలనుకునేవారికి తెలియాలి. ఇప్పుడు పరీక్షకు కూర్చుంటున్న విద్యార్థుల్లో దాదాపు అంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యమంలో పాల్గొన్నవారే. ఒకరకంగా ఇది వాళ్ల ఆత్మకథ. వారి సొంత అనుభవం. ఈ జీవిత అనుభవాన్ని విజ్ఞానంగా మార్చడమనేది కీలకం. ఉదాహరణకు మిలియన్ మార్చ్ గానీ.. సాగరహారం గానీ.. అలాంటి వాటిలో వీరంతా పాల్గొన్నవారే.. మద్దతిచ్చిన వారే..
సాగరహారం, మిలియన్ మార్చ్ వంటివి జరగడానికున్న నేపథ్యమేమిటి?
నిరసన రూపంగా ఇదెలా వచ్చింది?
జరిగిన సంఘటనలేమిటి? వాటి ప్రభావాలేమిటి?
ఉద్యమం తగ్గుతున్నప్పుడు ఇవి జరిగాయా?
ఉద్యమానికి ఊపునిచ్చి జోరుగా ముందుకు తీసుకెళ్లాయా?
అసలీ నిరసన తీరు సరైనదేనా?
నిరసన తీరుల్లో ఇవి కొత్త పరిణామాలా? రూపాలా?
ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఉద్యమంలో ఉండొచ్చా?లేదా?
ఉంటే వాటి ప్రయోజనమేమిటి?

  .. ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. ప్రజలు సమష్టిగా నిరసన తెలపాలనుకున్నప్పుడు, రాజకీయ పార్టీలు దానికి సరిగా అద్దం పట్టనప్పుడు, ఓ ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) ఇచ్చిన పిలుపునకు స్పందించి ప్రజలు ముందుకు రావడమంతా విజ్ఞానమే. దీన్ని సిద్ధాంతీకరించగలగాలి. ఆ సత్తాను అభ్యర్థులు సాధించాలి. సంఘటనలను తెలుసుకోవడం ఒకెత్తయితే వాటిని చారిత్రక సందర్భంలో చూడగలగడం మరో ఎత్తు. అదెప్పుడు వస్తుందంటే విశ్లేషణ, వివేచనతో అనుభవాన్ని భావంగా మలచడం తెలిసినప్పుడు వస్తుంది. లేదంటే ఏం చదవాలనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఉద్యమంలో జరిగినవి కేవలం సంఘటనలు కాదు. సంఘటనలను ఎవరైనా రాస్తారు. 'మిలియన్ మార్చ్ జరిగింది.. జనం వచ్చారు.. నిరసన తెలిపారు..' విగ్రహాలు తీశారు.. అని ఎవరైనా రాస్తారు. అది సరిపోదు. అందులోంచి వచ్చిన విజ్ఞానం ఏమిటి? ఉద్యమం నడుస్తున్న కమ్రంలో వచ్చిన నిరసన, ఆందోళనల రూపాలపై వ్యాఖ్యానించగలగాలి.

 

పూర్వాపరాలు తెలియాలి..

  భారత రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కుంది. ప్రజలు భిన్న మార్గాల్లో నిరసనలు తెలపడానికి రాజ్యాంగంలోనే హక్కులున్నాయి. ఆ హక్కులను ఉపయోగించుకొనే మిలియన్ మార్చ్ జరిగిందా? మరి అది ఓ పద్ధతి ప్రకారం జరగకుండా ఆ సమయంలో కొన్ని సంఘటనలెందుకు జరిగాయి? అవి ప్రజల ఆవేశం నుంచే వచ్చాయా? తెలంగాణ సాకారం కావడానికి నిజంగా ఈ నిరసన ఉపకరించిందా? అనేది చెప్పగలగాలి. అంతే తప్ప వచ్చారు.. వెళ్లారు.. మాట్లాడారు.. అంటే సరికాదు. అలాగే ఉద్యమంలో భాగంగా చంద్రశేఖరరావు నిరశన దీక్ష గురించి పెట్టారు. 'నిరశన చేశారు.. తెలంగాణ ప్రకటన వచ్చాక విరమించారు..' ఇంతేనా? నిరశన చేసిన సందర్భం, చేసిన విధానం, పద్ధతి, విరమించుకున్న పద్ధతి, చిదంబరం ప్రకటన.. 1969 సమయంలో రవీంద్రనాథ్ చేసిన నిరశనకు చంద్రశేఖరరావు చేసిన నిరశనకు తేడా.. ఇలాంటివి విశ్లేషించాలి.

 

ప్రారంభం నుంచీ..

  1952-53 నుంచే ప్రతిఘటన ఉంది. అప్పటి నుంచే ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేయడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఏదో ఒకరూపంలో నిరసన ఉంది. అంతర్గతంగానైనా ఉంది. అందుకే ఫజల్అలీ కమిషన్ కూడా తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఉండగలవా? లేదా? అన్నది పదేళ్ల అనుభవం తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అలాకాకుండా 1956లో బూర్గుల రామకృష్ణారావు ఒప్పుకున్నారు. కమ్యూనిస్టులు విశాలాంధ్ర కావాలన్నారు.. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంది కాబట్టి విశాలాంధ్ర వచ్చేసింది. ఫజల్అలీ చెప్పినట్లు పదేళ్లు ఆగి ఉంటే ఏం జరిగేదో తెలియదు. కానీ వీళ్లు ఓపిక పట్టలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదనతో చేస్తున్న విశాలాంధ్ర డిమాండులో సామ్రాజ్యవాద విస్తరణ ధోరణి కనిపిస్తోందని ఫజల్అలీ పేర్కొన్నారు. 'అమాయకపు అమ్మాయికి, అల్లరి పిల్లవాడికి జరుగుతున్న పెళ్లి.. ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చ'ని నెహ్రూ నిజామాబాద్‌లో అన్నారని జయశంకర్ చెప్పేవారు. భాష ప్రాతిపదికగా, తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంలో ఉండాలి అనే ఒక ఆకాంక్ష ఉంది. కానీ ఎందుకనో అంతర్లీనంగా భాష వల్ల సమైక్యత రాలేదు. అంటే సమైక్యంగా ఉండటానికి భాషే సరిపోదా? భాష సరిపోయిందని మనం అనుకున్నాం గానీ సరిపోలేదు. భాషను దాటి ఆర్థికంగా, భౌతికంగా అభివృద్ధిలో సమతూకం ఉండి, అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందే దిశగా నడిచి ఉంటే భాషా రాష్ట్రానికి కావాల్సిన పునాది ఏర్పడేది. కానీ బలహీనమైన పునాదిపై భాషారాష్ట్ర నిర్మాణం జరిగింది. ఆ బలహీనమైన పునాది నిరంతరం కొనసాగుతూ వచ్చింది. ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంది. పెద్దమనుషుల ఒప్పందం అయ్యాక, ఒకవేళ అప్పటి నాయకత్వానికి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి దూరదృష్టి ఉండివుంటే పరిస్థితి ఎలా ఉండేదో? ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరోవేలుగా కొట్టిపారేయడం అప్పటి పరిస్థితుల్లో సరైనదే కావొచ్చు. కానీ దీర్ఘకాలంలో అదో సమస్యకు కారణంగా మారింది. అదిస్తే నష్టమేమీ జరిగేది కాదు. తెలంగాణకు చెందిన రంగారెడ్డో, చెన్నారెడ్డో ఉపముఖ్యమంత్రిగా ఉండేవారు. దానివల్ల ఆ రోజు సంజీవరెడ్డి అధికారానికి పెద్దగా ప్రమాదమేమీ ఏర్పడేది కాదు. కానీ దూరదృష్టి లేకపోయింది. రెండు ప్రాంతాలు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాన్ని గౌరవించాలి. అది లేనప్పుడు ఒక తప్పు తర్వాత మరొకటి జరుగుతుంది.

 

విదర్భ పరిస్థితి వేరు..

  పక్కనున్న మహారాష్ట్రను తీసుకుంటే విదర్భ ప్రాంతానికి బడ్జెట్ వేరుగా ఉంటుంది. విదర్భ ప్రాంత బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించాలి. కావాలనుకుంటే గవర్నర్ ఆ బడ్జెట్‌ను వెనక్కి పంపించొచ్చు. విదర్భకు ఏ అన్యాయం జరిగినా వాళ్లు నేరుగా గవర్నర్ వద్దకు వెళతారు. గవర్నర్ ప్రభుత్వానికి (ఆ మేరకు ఆయనకు అధికారాలున్నాయి) 'మీరీ అన్యాయం చేస్తున్నారు.. బడ్జెట్‌లో కేటాయించండ'ని చెప్పవచ్చు. అందుకే విదర్భలో తెలంగాణలో వచ్చినట్లు నిరసన రాలేదు. ఇలా దేశంలో అనేక వెనకబడిన ప్రాంతాల్లో ఒప్పందాలు, ఏర్పాట్లున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి మండలి ఉండేది. అందులో ఎమ్మెల్యేలుండేవారు. ప్రత్యేక బడ్జెట్ ఉండేది. ఇక్కడెవరైనా బయటివారు భూమి కొనాలంటే అభివృద్ధి మండలి అనుమతి ఇవ్వాల్సి వచ్చేది. ఇవన్నీ ఉన్నాయి.. కానీ వీటన్నింటినీ గౌరవిస్తే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! అది ప్రజల్ని మరింత ఐక్యం చేయడంలో దోహదపడేదేమో! మాకూ న్యాయం జరిగిందనే భావన తెలంగాణ ప్రజల్లో ఏర్పడి ఉంటే ఉద్యమం జరిగేది కాదు. ఎక్కడ పొరపాటు చేశామనేది అంతర్‌దృష్టితో ఆలోచించినా వచ్చే ప్రమాదాన్ని ఆపలేకపోయారు. విభజనను ఆపలేకపోయారు. భాష కలిపి ఉంచలేకపోయింది. కాబట్టి మొత్తం ఉద్యమాన్ని అలా అర్థం చేసుకోవాలే తప్ప.. దీన్ని కేవలం తెలంగాణ - ఆంధ్ర ప్రాంతం దృష్టితో మాత్రమే చూడొద్దు. ఇది ఒక ప్రాంతీయ సమస్య.
ఆంధ్ర ప్రజలు కారణం కాదు..
విద్వేషమనేది రాజకీయం. జరిగిన అభివృద్ధిలోని నిరసనను రెచ్చగొట్టడం, లేదా ఆంధ్రప్రాంత ప్రజలపై ఆగ్రహంగా మారడమనేది రాజకీయ ప్రక్రియ. కానీ ఆ ప్రక్రియకుండే భూమిక ఏమిటంటే ఎక్కడో నిరసనకు కావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆ పరిస్థితులకు ప్రత్యక్ష కారణం కాదు. ఏం జరుగుతోందో వారికి కూడా తెలియదు. కానీ పాలకులు, రాజకీయ నాయకులు, మొత్తం ప్రక్రియలో భాగస్వాములు.. వారందరికీ దూరదృష్టి ఉండాల్సింది. 'ప్రజలను కలిపి ఉంచాలి.. నిరసన ఉన్నా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం.. ఈ నిరసన పోవటానికి దారులేమున్నాయ'ని ఆలోచించి పరిష్కరిస్తే పద్ధతిగా ఉండేది. అలాకాకుండా 'ఏదో నిరసన తెలుపుతారు.. చిన్నప్రాంతం, వీరేం చేస్తారు? కొట్లాడి ఎక్కడికి పోతారు? ఎలా విడిపోతారు? వీరికి రాష్ట్రమెవరిస్తారు' అనే తేలిక భావమే సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా ఒకే తీరుగా కనిపించింది. కానీ చిన్న ప్రాంతమైనా, ఎంత బలహీనులైనా - ప్రజలు ఐకమత్యంగా డిమాండ్ చేసినప్పుడు, పోరాటం చేసినప్పుడు, ఎంత పెద్దప్రాంతమైనా దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆ చారిత్రక అవగాహన లేక చిన్నప్రాంతం - పెద్దప్రాంతంతో పోరాటం చేస్తుందా! అని చివరి దాకా లాగారు. చాలామంది రాజకీయ నాయకులు 'ఏం తెలంగాణ? ఎలా వస్తుంది?..' అనే ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారు. తెలంగాణ ప్రాంతానికుండే ప్రత్యేక లక్షణమేంటంటే పోరాడే తత్వం. అది సమ్మక్క సారక్కే కావొచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఇలా.. ఏదైనా కావచ్చు.. ఉద్యమాలు చేసే లక్షణం తెలంగాణలో ఉంది. దాన్ని కూడా తక్కువ అంచనా వేశారు. అమాయకులైన ప్రజలు అణిగిమణిగే ఉంటారు. కానీ చైతన్యవంతమయ్యాక ప్రశ్నలడుగుతారని మరువకూడదు. పెద్దమనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలవుతూ వచ్చాయి. ఎన్టీరామారావు కొంతమేరకు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆలోచించి జీవో విడుదల చేశారు. కానీ దాని అమలు జరగలేదు. దీంతో దాని అమలు కోసం మరో పోరాటం.. సమస్యను అంతదాకా ఎందుకు రానివ్వాలి?

 

సమగ్ర కోణంలో చూడాలి..

  కలసి ఉండాలనుకున్నప్పుడు ఒకరి అస్తిత్వాన్ని కించపరచడం సరికాదు. జనమే కావాలనుకుంటే ఎంత చిన్నప్రాంతమైనా అనుకున్నది సాధించుకోగలుగుతారు. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం లాంటివి కూడా రాష్ట్రాలయ్యాయి. ప్రజలు బలంగా కోరుకున్నాక ఎవరైనా చేసేదేమీ లేదు. ఎక్కడో చారిత్రకంగా, విధానపరంగా గానీ, రాజకీయ సంస్కృతిలో గానీ తెలుగు ప్రజలు కలసి ఉండాలనే ఉద్వేగానికి అవసరమైన చర్యలేవీ తీసుకోకపోవడం వల్ల సుదీర్ఘపోరాటం జరిగి విభజనకు దారితీసింది. విభజన అనేది సంతోషకరమైనదేమీ కాదు. ఏ విభజనైనా సమైక్యత కంటే తక్కువే. సమైక్యత ఎన్నటికైనా ఉన్నతమైన విలువే! కలసి ఉండటమనే భావనకున్నంత విలువ విడిపోతామనడానికి ఉండదు. కానీ ఆ ఉదాత్తమైన సమైక్య భావనకు కావల్సిన రాజకీయ సంస్కృతి, సంస్కారం లేనప్పుడు సమస్యలు వస్తాయి. అది ఇక్కడే కాదు శ్రీలంక, చెకోస్లొవేకియా, సోవియట్ యూనియన్, పాకిస్థాన్-బంగ్లాదేశ్.. ఎక్కడైనా గానీ విడిపోయిన ప్రతిచోటా ఇలాగే ఉంటుంది. ఈ దృక్పథంతో అసమానతను చూడాలి. కేవలం తెలంగాణ ఉద్యమం అని కాకుండా విశాలమైన చారిత్రక అవగాహనతో చూడాలి. తెలంగాణ, ఆంధ్ర మధ్య విభజనకు, ప్రపంచవ్యాప్తంగా విడిపోవడం, కలవడం ప్రక్రియలకున్న సంబంధాన్ని చూడాలి. ప్రజలెందుకు విడిపోతారు? విడిపోవడానికి కారణాలేమిటి? అసమానతలెందుకు పెరిగాయి? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి చాలా ఉన్నాయి. జర్మనీలు రెండూ కలిశాయి. సోవియట్‌యూనియన్ విడిపోయింది. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవాలి. అలాగే 40 దేశాల ఓట్టమాన్ సామ్రాజ్యం (ఇరాన్, ఇరాక్ తదితరాలు) విడిపోయి ఇప్పుడు అమెరికా వైపు చూస్తున్నాయి. అవెందుకు విడిపోయాయి? ఆ కోణంలో సమస్యను అర్థం చేసుకోవాలి. అంతేతప్ప కేవలం పరీక్ష, పుస్తకం, జవాబులు రాయడం.. మార్కులు సంపాదించడం.. ఉద్యోగం పొందడం.. ఇదంతా వేరు, చారిత్రక పరిణామ క్రమంలో ఉద్యమాన్ని అర్థం చేసుకోవడం వేరు. అలా అర్థం చేసుకొని రాసేవారికి ఎక్కువ మార్కులొస్తాయి. గైడ్ చదువుకొని వెళ్లాలనే సంస్కృతి వల్ల విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. నిజానికి సమగ్ర కోణంలో తెలంగాణ ఉద్యమాన్ని చూడగలిగితే ఆ ఆందోళన ఉండదు.

  ''తెలంగాణపై చదువుకోవడానికి సరైన సమాచారం లేదంటున్నారు.. ఆ దృక్పథమే సరికాదు. బోలెడన్ని పుస్తకాలున్నాయి. కానీ ఒకేచోట, ఒక పుస్తకంలో సమాచారమంతా లేకపోవడం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. ఒకస్థాయికి చేరాక విజ్ఞానం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి చదువుకోవాలి తప్ప పుస్తకాలను చూసి కాదు. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? ఉద్యమానికి మూలకారణమేంటి? ప్రాంతీయ అసమానతలు పెరిగాయా? పెరిగితే ఎందుకు పెరిగాయి? అనే మౌలిక ప్రశ్నలు వేసుకొని పరీక్షలకు సంసిద్ధం కావాలి. అలాకాకుండా యాంత్రికంగా సంఘటన తర్వాత సంఘటన చదువుకుంటామంటే అది విజ్ఞానమే కాదు. విద్యార్థులు ఎప్పుడైనా పరీక్షకు సిద్ధమయ్యేప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబు వెతుక్కునే క్రమంలో వెళితే ఆ సన్నద్ధతే నాణ్యంగా ఉంటుంది. దేశంలో ఏ ఉద్యమం సమయంలోనూ లేనంత, రానంత సాహిత్యం, సమాచారం తెలంగాణ ఉద్యమంలో వచ్చింది."

Posted Date : 18-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌