• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ఆదివాసీలు, గిరిజనుల విలక్షణత

భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. వీటికి సామాజికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకతలున్నాయి. వీటితోపాటు వైవిధ్య చరిత్ర, సంస్కృతులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు.. దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజనులున్నారు. భారత్‌లోని గిరిజన తెగల సంస్కృతి.. సంప్రదాయాలు.. జీవన వైవిధ్యం.. తదితర అంశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజశాస్త్ర శాఖాధిపతి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్య గణేశ్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.
                              ఆదివాసీలు, గిరిజనులు ఏ దేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. ప్రస్తుత భారత జనాభాలో దాదాపు 8-9 శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. భారతీయ సమాజంలో గిరిజన సమూహాలన్నీ ప్రత్యేకమైన మత విశ్వాసాలను కలిగి ఉన్నాయి. గిరిజన సమాజమనేది కొన్ని ప్రత్యేక లక్షణాలతో కూడుకున్న సమూహం. ఆంథ్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం ఒక్కో గిరిజన తెగ ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరిజన తెగ విభిన్న రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతి గిరిజన సమూహానికి ఒక నిర్దిష్టమైన పేరుంటుంది. ఒకే రకమైన భాష, సంస్కృతి ఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం, ఒకే చట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్ధతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యేకమైన మత విశ్వాసాలు, ఆరాధన పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. వీటితోపాటు ప్రతి గిరిజన సముదాయానికి ఒక స్వయం ప్రతిపత్తి గల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా, తమనుతాము నియంత్రించుకునే స్వీయ రాజకీయ వ్యవస్థను (ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రిస్తుంటారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూహాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంతస్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రిస్తుంటుంది. స్వగోత్రికులు రక్తబంధువులనే భావన కలిగి ఉంటారు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు.
 

పవిత్ర టోటెమ్

ప్రతి గోత్రానికి ఓ టోటెమ్ ఉంటుంది. టోటెమ్ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మతపరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఆరాధిస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావొచ్చు, జంతువు, చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావొచ్చు. అది వారి తెగకు గుర్తు.
మూడు రకాల తెగలు

భారత్‌లో మనకు 3 రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి.
1. దట్టమైన అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన తెగలివి.
2. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా, వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలుంటాయి. సామాజిక, వ్యాపార సంబంధాలుండే అవకాశముంది.
3. మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈ మైదాన ప్రాంతాల్లో స్థిరపడిన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అందుకే వారిలో విద్య, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే బిల్లులు, సంతాల్(మధ్యప్రదేశ్)లు, ముండాలు (బిహార్), మహారాష్ట్ర, తెలంగాణల్లోని రాజ్‌గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంటుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.

 

ఈశాన్య భారతంలో..

సామాజిక, మానవ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారత్‌లో దాదాపు 450కి పైగా గిరిజన సమూహాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి జనాభా శాతం ఎక్కువ. దాదాపు 80 నుంచి 90 శాతం దాకా ఈశాన్య రాష్ట్రాల మొత్తం జనాభాలో గిరిజనులే. వీటిలో జనాభా పరంగా చూస్తే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో విస్తరించిన గోండు తెగ అత్యధిక జనాభాతో ఉంది. ఈ గోండుల్లో కూడా రకరకాల వారున్నారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువగా కనిపించేవారు మరియా గోండులు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కనిపించే వారు రాజ్‌గోండులు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ప్రధానమైన తెగ భిల్లులు. బిహార్, ఒడిశా, పశ్చిమ్ బంగ, మధ్యప్రదేశ్ (పాక్షికంగా)ల్లో సంతాల్‌లు; ఝార్ఖండ్‌లో ముండాలు అత్యధిక జనాభా ఉన్న గిరిజన సమూహాలు. మధ్యభారత ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అక్కడి జనాభాలో అత్యధిక శాతం గిరిజన తెగకు చెందినవారే. ఉదాహరణకు మిజోరాంను చూస్తే స్థానిక జనాభాలో 95 శాతం గిరిజన సమూహాలే. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లోని జనాభాలో 80 శాతం గిరిజనులే. నాగాలాండ్‌లో 85 శాతం పైగా, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 25 శాతం వంతున గిరిజన జనాభానే. గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 12, అసోం, బిహార్‌ల్లో 10 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
 

గిరిజన సమూహాలు.. జోన్లు

భారత్‌లో భౌగోళికంగా వివిధ గిరిజన సమూహాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయనేది ఆసక్తికరం. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఫర్ రిసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్), ఎల్‌పీ విద్యార్థి అనే సామాజిక మానవ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించింది. భారత్‌లోని వివిధ గిరిజన సమూహాల భౌగోళిక విస్తరణను అధ్యయనం చేసిన విద్యార్థి వీరిని నాలుగు జోన్లుగా విభజించారు.

1. హిమాలయ ప్రాంతం
2. మధ్య భారత ప్రాంతం
3. పశ్చిమ భారత ప్రాతం
4. దక్షిణ భారత ప్రాంతం
భారతదేశ జనాభాలో గిరిజన జనాభా 9-10 శాతం ఉంటుందని అంచనా. మొత్తం గిరిజన జనాభాలో.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో 11 శాతం ఉంటే.. 57 శాతం మధ్య భారతంలోనూ, 25 శాతం పశ్చిమ భారతంలోనూ, 7 శాతం దక్షిణ భారతంలోనూ ఉన్నట్లు విద్యార్థి అంచనా. ఇతడి సర్వే ప్రకారం ఆయా ప్రాంతాల్లోని ప్రధాన తెగలను చూస్తే..

 

1. హిమాలయ ప్రాంతంలో..

జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రధానంగా కనిపించేవి భోట్, గుజ్జర్, గద్ది తెగలు. ఉత్తర్ ప్రదేశ్‌లోని తెరాయి ప్రాంతంలో ప్రధానమైన తెగ తారూ. అసోంలో - మిజో, గారో, ఖాసీలతో పాటు బోడోలు.. మేఘాలయలో - ఖాసా, ఖాసీలు.. నాగాలాండ్‌లో - నాగాలు.. మణిపూర్‌లో - మావో, కూకీలు.. త్రిపురలో - త్రిపురి తెగ.
 

2. మధ్య భారత ప్రాంతంలో..

పశ్చిమ్ బంగ, బిహార్, జార్ఖండ్‌ల్లో - సంతాల్, ముండా, ఒరావణ్, హో తెగలు.. ఒడిశాలో - ఖోండులు, గోండులు.
 

3. పశ్చిమ భారత ప్రాంతంలో..

రాజస్థాన్‌లో - భిల్లులు, మీనాలు ఘరాసియాలు.. మధ్యప్రదేశ్‌లో - సంతాల్‌లు, భిల్లులు.. గుజరాత్‌లో - భిల్లులు, దుబ్లాలు, ధోడియాలు.. మహారాష్ట్రలో - భిల్లులు, కోలీలు, మహదేవ్‌లు, కోక్నాలు ప్రధాన తెగలు.
 

4. దక్షిణభారత ప్రాంతంలో..

ఆంధ్రప్రదేశ్‌లో - కోయ, కొండదొర, సవర, కొండరెడ్డి.. తెలంగాణలో - రాజ్‌గోండులు, లంబాడీలు, చెంచులు, ఎరుకలు, గుత్తికోయ, కోలమ్, నాయక్‌పోడ్.. తమిళనాడులో - ఇరుల, తోడా, కురుంబా, కడార్‌లు.. కర్ణాటకలో - నాయికాడ, మరాటీలు.. కేరళలో - కుళయన్, పనియన్.. అండమాన్, నికోబార్ దీవుల్లో - అండమానీలు, జారవాలు, నికోబారీలు ప్రధాన తెగలు. రకరకాల కారణాల వల్ల జారవా అనే తెగతో పాటు అండమానీలు జనాభా పరంగా దాదాపు అంతరించే స్థితిలో ఉన్న తెగలు.
 

కులం - తెగ

ప్రతి తెగ సజాతీయ సమాజం. తెగలో ఏకరూపత ఉంటుంది. భౌగోళికపరంగా ఉన్న సమూహమిది. కులం అలా కాదు. కులం ఏకరూపత కలిగిన సమూహం కాదు. కులానికి చెందినవారు వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు. వారికి వేర్వేరు సంస్కృతులుండొచ్చు. కులానికి వారసత్వంగా ఉండే వృత్తి ఉంటుంది. కానీ గిరిజనులకు ఆయా భౌగోళిక ప్రాంతాల్లోని వనరులను బట్టి జీవనోపాధి ఉంటుంది. ప్రతి తెగకు ఓ నిర్దిష్టమైన భాష ఉంటుంది. గిరిజన భాషలకు చాలామేర లిపి లేదు. కులానికి నిర్దిష్టమైన భాష అంటూ ఉండదు. కులానికి, తెగలకు ఉన్న ఏకైక ప్రధాన సారూప్యత ఏమైనా ఉందంటే అది రెండూ అంతర్‌వివాహ సమూహాలే.
 

తెలంగాణ గిరిజనం

తెలంగాణలో దాదాపు 10-12 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు అంచనా. ఇక్కడ నివసిస్తున్న ప్రధాన తెగలు - లంబాడీలు, రాజ్‌గోండులు, చెంచులు, ప్రధాన్‌లు, కోలమ్‌లు, నాయక్‌పోడ్, ఎరుకలు, గుత్తికోయలు. సామాజికంగా, సాంస్కృతికంగా జనజీవన స్రవంతిలో సమ్మిళితమైన తెగలు - లంబాడీలు, గోండులు (రాజ్‌గోండులు). ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్‌గోండులు తాము క్షత్రియసంతతి వారమని అంటుంటారు. వీరు కొంతమేరకు విద్యాపరంగా, ఇటీవలి కాలంలో రాజకీయంగా కూడా భాగస్వామ్యాన్ని పొందారు. వీరితో పాటు లంబాడీ తెగ కూడా ఆ ఫలాలను అందుకుంటోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో విస్తరించిన తెగ లంబాడీ తెగ. ఇటీవలి కాలంలో లంబాడీలు కూడా తాము క్షత్రియులమనే వాదన తెస్తున్నారు. రాజ్‌గోండులతో పాటు ఆదిలాబాద్‌లో ప్రముఖంగా ఉన్నవారు ప్రధానులు, కోలమ్‌లు, నాయక్‌పోడ్‌లు. తెలంగాణలో బాగా వెనకబడిన తెగ చెంచులు. వీరు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంటారు. ఇప్పటికీ ఆహార సేకరణ ప్రధానవృత్తిగా ఉన్న తెగ ఇది. వరంగల్‌లాంటి చోట ఎరుకల తెగవారెక్కువ. వీరు జన జీవన స్రవంతిలో భాగంగానే జీవనం గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మథుర అనే తెగ ఉంది. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన తెగకు చెందిన వారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. గోవులను పెంచడం, వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించడం వీరి ప్రత్యేకత. శ్రీకృష్ణుడి సంతతి నుంచి వచ్చామని అంటుంటారు. కామారెడ్డి గాంధారి మండలంలో ఈ మథుర తెగ కనిపిస్తుంది. తెలంగాణలోని చాలా తెగల్లో వెనకబాటుతనం కనిపిస్తుంది. ప్రభుత్వాలు గిరిజన తెగల అభివృద్ధి కోసం ఐటీడీఏ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దీనిద్వారా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఫలితంగా కొన్ని తెగల్లో అభివృద్ధి కనిపిస్తోంది.

Posted Date : 18-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌