• facebook
  • whatsapp
  • telegram

సాగు విధానాలు

పద్ధతులు మార్చి.. దిగుబడులు పెంచి!

 

నేలను మార్చి మార్చి చేసే పోడు పద్ధతి నుంచి యంత్రాలతో ఏక కాలంలో వేల ఎకరకాలను సాగు చేసే స్థితిని దాటి కార్పొరేట్‌ ఫార్మింగ్‌ వరకు వ్యవసాయం విస్తరించింది. భిన్న శీతోష్ణస్థితులకు తగినట్లుగా ఆహార, వాణిజ్య, తోట పంటలు పండిస్తున్నారు. హరిత విప్లవాలతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆ పద్ధతులతోపాటు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండుతున్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. 


భారతదేశంలో సగానికిపైగా కుటుంబాలకు ఇప్పటికీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే జీవనాధారం. దేశ ఆర్ధికాభివృద్ధిలోనూ వ్యవసాయమే కీలక పాత్ర పోషిస్తోంది. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని, పరిశ్రమలకు ముడిసరకులను అందిస్తోంది. వివిధ శీతోష్ణస్థితుల కారణంగా అనేక రకాల పంటల ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఇక్కడ ఉంది.


1900 సంవత్సరానికి పూర్వం మన దేశ వ్యవసాయం పురాతన పద్ధతుల్లో జరిగేది. 1908లో పుణె వద్ద వ్యవసాయ కళాశాల స్థాపించారు. 1937 నాటికే ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ఏర్పడినప్పటికీ పరిశోధనలు, వ్యవసాయ విద్య ప్రగతి ఆశాజనకంగా సాగలేదు. స్వాతంత్య్రానంతరం 1951లో దేశ ఆర్థికాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు.తర్వాత హరిత విప్లవంలో భాగంగా దిగుమతి చేసుకున్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను దేశీయ మొక్కలతో సంకరీకరణ (క్రాస్‌) చేసి, కొత్త వంగడాలను తయారు చేశారు. రైతులకు పంచారు. వాటికున్న రోగనిరోధక శక్తి వల్ల ప్రాంతీయ శీతోష్ణస్థితులను తట్టుకొని అధిక దిగుబడులిచ్చాయి.

 

రకరకాలుగా సేద్యం

పోడు వ్యవసాయం: దీనినే విస్తాపన వ్యవసాయం అంటారు. ఇది అతి ప్రాచీన విధానం. ఒక ప్రాంతంలోని చెట్లను నరికి, చదును చేసి వ్యవసాయం చేస్తారు. భూసారం తగ్గిపోతే మరో ప్రదేశానికి మారతారు. ఈ విధానం ఎక్కువగా కొండ ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది.

సాంద్ర వ్యవసాయం: జనసంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పురుగు మందులు, రసాయన ఎరువులు వాడుతూ సాగు చేసే పద్ధతి సాంద్ర వ్యవసాయం. నీటిలభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇది ఉంది. సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. వరి, చెరకు, జనపనార ఎక్కువగా సాగుచేస్తారు.

వాణిజ్య వ్యవసాయం: ఈ పద్ధతిలో అధిక దిగుబడి వంగడాలు, ఆధునిక పనిముట్లు ఉపయోగిస్తారు. ఎక్కువగా ఎగుమతి ఆధారిత పంటలు పండిస్తారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లు ఈ విధానానికి ప్రసిద్ధి.

విస్తృత వ్యవసాయం: కొన్ని వందల వేల ఎకరాల్లో యంత్రాలను ఉపయోగించి సాగు చేస్తారు. అమెరికాలో ఎక్కువగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు.

మిశ్రమ వ్యవసాయం: వ్యవసాయంతో పాటు పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం మొదలైనవి ఈ పద్ధతిలో జరుగుతాయి. ఈ విధానం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువ.

సహకార వ్యవసాయం: రైతులు అందరూ కలిసి సామూహికంగా చేసే వ్యవసాయం ఇది. రష్యాలో వీటిని కోల్‌కోజ్‌లు అంటారు.

తోటల పెంపకం: కొబ్బరి, మామిడి, బత్తాయి, జీడిమామిడి, రబ్బరు, కాఫీ, టీ మొదలైన వాటిని తోటల పెంపకంలో భాగంగా సాగుచేస్తారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఇది ఎక్కువగా జరుగుతోంది.

ఒప్పంద వ్యవసాయం: దీనినే కాంట్రాక్టు ఫార్మింగ్‌ అంటారు. ఈ విధానంలో పెద్దపెద్ద కార్పొరేటు కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకొని వ్యవసాయం చేస్తాయి. 

 

ప్రధాన పంటలు

భారతదేశంలో ప్రధానంగా మూడు రకాల పంటలు పండిస్తారు. అవి 1) ఆహారపంటలు 2) వాణిజ్య పంటలు 3) తోట పంటలు.

ఆహార పంటలు: వరి, గోధుమ, జొన్న, సజ్జ, కొర్రలు, రాగులు, బార్లీ. వీటిని ఆహార ధాన్యాలు అంటారు. ఇవికాక  పెసర్లు, కందులు, శనగలు ఇంకా ఇతర పప్పుధాన్యాలు కూడా ఉన్నాయి.


వరి: వరి పండించడంలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇది మన ముఖ్య ఆహారపంట. దేశంలో సాగయ్యే భూమిలో 1/4వ వంతులో వరి పండుతోంది. వడ్ల ఉత్పత్తి 1951లో 20.58 మిలియన్‌ టన్నులు ఉండగా, 1980లో 53.6 మి.టన్నులు, 2020-21 నాటికి 120 మి.టన్నులుగా నమోదైంది. ఈ పంటకు సగటు ఉష్ణోగ్రత 24డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉండాలి. వార్షిక వర్షపాతం 150-200 సెం।।మీలు అవసరం. ప్రధానంగా 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు, సముద్రమట్టం నుంచి 2500 మీటర్ల వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట పండించవచ్చు. వరిని ఖరీఫ్‌లో, రబీలో, నీటి వసతులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వేసవి పంటగా పండిస్తారు.

గోధుమ: వరి తరువాత గోధుమ ప్రధానమైనది. అది ద్వితీయ ఆహార పంటగా ఉంది. ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. 1951లో ఉత్పత్తి 6.46 మిలియన్‌ టన్నులు, 1980లో 36.31 మి.టన్నులు, 2020-21 నాటికి 107.6 మి.టన్నులుగా ఉంది. ఈ పంటకు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేడ్, వార్షిక సగటు వర్షపాతం 75 సెం.మీ. ఉండాలి.

చిరుధాన్యాలు: వర్షపాతం తక్కువ ఉన్న రాష్టాల్లో (మెట్టపైర్లుగా) ఇవి అనుకూలం. తక్కువ సారవంతమైన నేలల్లో పండిస్తారు. వీటికి కావాల్సిన సగటు ఉష్ణోగ్రత జొన్న 26 - 33 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు, సజ్జ 25 - 35 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు, రాగులు 20 - 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు, మొక్కజొన్నకు 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు. ఈ పంటలకు అవసరమైన సరాసరి వర్షపాతం 50-100 సెం.మీ.

పప్పుధాన్యాలు: కందులు, శనగలు, పెసలు, మినుములు ప్రధానమైనవి. వీటిలో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది.  ఈ పంటలకు 20 - 25 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల సగటు ఉష్ణోగ్రత, సుమారు 40 - 50 సెం.మీ. వరకు వర్షపాతం అవసరం.  ప్రపంచ వ్యాప్తంగా పప్పుధాన్యాలకు సంబంధించి ఉత్పత్తిలో 25%, వినియోగంలో 27%, దిగుమతుల్లో 14% వాటా భారత్‌ కలిగి ఉంది. 1950-51లో¨ 8.41 మిలియన్‌ టన్నులున్న మన పప్పుధాన్యాల ఉత్పత్తి, 2010-11లో 18.24 మిలియన్‌ టన్నులు, 2020-21 నాటికి 25 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

నూనె గింజలు: దేశ వాణిజ్య పంటల్లో నూనెగింజలకు ప్రముఖ స్థానం ఉంది. ఇందులో భాగంగా ఎక్కువగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, ఆముదం, సోయా పండిస్తారు. నూనెగింజల ఉత్పత్తి 1950-51లో 5.16 మి.టన్నులు కాగా 2014-15 నాటికి 25.30 మిలియన్‌ టన్నులు, 2020-21కి ముందస్తు అంచనాల ప్రకారం 36.57 మిలియన్‌ టన్నులుగా ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.


వాణిజ్య పంటలు: మన దేశ వ్యవసాయ రంగంలో ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనవి పత్తి, చెరకు, జనుము, పొగాకు, మిరప, తేయాకు, కాఫీ, రబ్బరు, కొబ్బరి, మిరియాలు మొదలైనవి.


పత్తి: వాణిజ్య పంటల్లో పత్తి ప్రథమ స్థానంలో ఉంది. దేశ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఇది వెన్నెముక లాంటిది. పత్తిని తెల్లబంగారం అంటారు. పంట విస్తీర్ణంలో భారత్‌ మొదటి స్థానం ఉంది. కానీ ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ పంటకు సుమారు 50-100 సెం.మీ.ల వర్షపాతం, 21-31 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత అవసరం. నీటి పారుదల ఉన్న శుష్క ప్రాంతాల్లో పత్తిని పండించవచ్చు.

చెరకు: చెరకు పండించే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో, బ్రెజిల్‌ మొదటి స్థానంలో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పంటను విరివిగా పండిస్తారు. 70-150 సెం.మీ. వర్షపాతం, 21-27 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత అవసరం. సారవంతమైన ఒండ్రు నేలలు, జిగురు నేలలు ఈ పంటకు అనుకూలం.

జనుము: ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన పంట. దీనికి 25-35 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, 100-140 సెం.మీ. వర్షపాతం అవసరం. డెల్టా, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఖరీఫ్‌ పంటగా పండిస్తారు.

పొగాకు: క్రీ.శ.1508లో పోర్చుగీసు వారు పొగాకును భారతదేశానికి తీసుకొచ్చారు. దీనికి 16-35 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, 50 సెం.మీ. వర్షపాతం లేదా నీటి సరఫరా ఉన్న ప్రాంతాలు అనుకూలం. పొగాకులో నాణ్యమైన వర్జీనియా రకం గుంటూరు జిల్లాలో పండుతుంది.

మిరప: ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పండిస్తారు. ఈ పంటకు 60-125 సెం.మీ. వర్షపాతం, 10- 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత అవసరం.

తేయాకు: దీని సాగుకు 150 సెం.మీ.- 300 సెం.మీ. వర్షపాతం, 20-30 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉన్న కొండ, వాలు ప్రాంతాలు అనుకూలం. గతంలో తేయాకు ఉత్పత్తి దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, 2020-21 లెక్కల ప్రకారం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానాన్ని చైనా దక్కించుకుంది. 

కాఫీ: ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారత్‌ 7వ స్థానంలో, బ్రెజిల్‌ మొదటిస్థానంలో ఉన్నాయి. కాఫీ పంటను సాధారణంగా కొండవాలు ప్రాంతాల్లో సాగు చేస్తారు. ఈ పంటకు 15-28 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, 150-200 సెం.మీ. వర్షపాతం అవసరం.

రబ్బరు: ఎక్కువగా కేరళలో పండిస్తారు. దీనికి 21-35 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, 300-400 సెం.మీ. వర్షపాతం కావాలి. ఒండ్రు, సున్నపురాతి నేలలు అనుకూలం.

* కొబ్బరి పంటకు 125-150 సెం.మీ. వార్షిక వర్షపాతం, 25 - 35 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత అవసరం. కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికంగా పండిస్తారు.

* మిరియాల పంటకు 10- 20 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, 200-300 సెం.మీ. వర్షపాతం కావాలి. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో పండిస్తారు. ఏలకులకు 150-300 సెం.మీ. వర్షపాతం, 15- 25 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత అవసరం. వాటిని కేరళ, కర్ణాటక తమిళనాడులో ఎక్కువగా పండిస్తారు.

తోటపంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు, మామిడి, జీడిమామిడి తదితరాలు.

 

హరిత విప్లవం

 దేశంలో 60వ దశకంలో వ్యవసాయాభివృద్ధికి ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. అధిక ఉత్పత్తుల కోసం ఎరువులు వినియోగించారు. నీటి వసతులు కల్పించారు. వ్యవసాయ యాంత్రికీకరణ చేశారు. క్రిమిసంహారక మందులను అధిక మొత్తంలో ఉపయోగించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇంటెన్సివ్‌ అగ్రికల్చర్‌ డిస్ట్రిక్ట్‌ పోగ్రాం (ఐఏడీపీ) పథకాన్ని ప్రారంభించింది. 1960-61లో 7 జిల్లాల్లో నూతన సాంకేతిక అభివృద్ధి వినియోగాన్ని ఒక పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. ఇందులో వరి పంట సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, బిహార్‌లోని షాహబాద్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, తమిళనాడులోని తంజావూరు జిల్లాలను ఎంచుకున్నారు. గోధుమకు పంజాబ్‌లోని లుథియానా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలు; జొన్న పంటకు రాజస్థాన్‌లోని పౌలి జిల్లాను ఎంపిక చేశారు. అనంతరం 1966లో అధిక దిగుబడినిచ్చే వంగడాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. అమెరికా వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారి డాక్టర్‌ విలియమ్‌ గాడ్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒకేసారి వచ్చిన ఈ మార్పును గ్రీన్‌ రెవల్యూషన్‌ అన్నారు. భారతదేశంలో హరితవిప్లవం సాధనలో ముఖ్యపాత్ర వహించిన శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌. అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమం ఆహార పంటల్లో కేవలం అయిదు పంటలకే పరిమితమైంది. అవి గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ.

రెండో హరిత విప్లవం: 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రెండో హరితవిప్లవాన్ని ప్రారంభించారు. విత్తనాభివృద్దికి బయోటెక్నాలజీని ఉపయోగించడం, భూమితో పాటు పశుసంపద ఉత్పాదకతను పెంచడం, మెట్టప్రాంత వ్యవసాయానికి ప్రాధాన్యం, సాగునీటి వసతులు పెంచడం, నీటి సమగ్ర నిర్వహణ, పంట రుణాలపై వడ్డీ తగ్గింపు, కొత్త సాంకేతిక పద్ధతులు పాటించడం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి.

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 19-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌