• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు-చట్టాలు

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. 
                   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌


 

నదీ జలాల్లో 'విష' ప్రవాహం

మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..


పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.


కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.


'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.


'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.
గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.


కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.


భోపాల్ దుర్ఘటన
* 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.
* ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
* 1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.
* 1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
* రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..
* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్
* విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.
* కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

 

 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌