ఆర్థిక పరిస్థితులు - వర్తకం - వాణిజ్యం
* శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉండేది. వ్యవసాయం, పారిశ్రామిక, దేశ-విదేశ వ్యాపారంలో ఈ ప్రాంతం గణనీయమైన ప్రగతి సాధించింది.
* ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు.
* వృత్తి పన్నులు, రహదారి - రేవులపై సుంకాల ద్వారా రాజ్యానికి అధిక ఆదాయం సమకూరేది.
* నదీతీర ప్రాంతాల్లో పంటలు బాగా పండేవి. వరి, చెరకు, జొన్న, జనుము, నువ్వులు మొదలైన పంటలు పండించేవారని ‘గాథాసప్తశతి’లో పేర్కొన్నారు. పండిన పంటలో ఆరోవంతు ప్రభుత్వానికి పన్నుగా చెల్లించేవారు.
* ఆ కాలంలో వివిధ వృత్తుల వారు శ్రేణులుగా (సంఘాలు) ఏర్పడ్డారు. ఈ శ్రేణులు బ్యాంకులుగా పనిచేసేవి.
* సమాజంలో వృత్తుల ఆధారంగా కులాల విభజన జరిగింది. వీరిలో కోలిక (చేనేత), కులారిక (కుమ్మరి), తిలపినక (నూనె తీసేవారు), కమ్మర (కంసాలి), సువర్ణకార (స్వర్ణకారులు), వధిక (వడ్రంగి), బదయంత్రిక (నీటియంత్ర కార్మికులు) ముఖ్యులు.
* శ్రామికులు తమ సంఘాల వద్ద ధనాన్ని నిల్వ చేసుకునేవారు. ఆయా సంఘాలు వారికి 12% వరకు వడ్డీ చెల్లించేవి.
* ఆ కాలంలో గుమాస్తాలను లేఖకులు అని, రాతి పనివారిని మితికులు, కర్రపని చేసేవారిని వద్దకిలు అని పేర్కొన్నారు.
* శాతవాహనుల కాలంలో పశ్చిమ దక్కన్లో ప్రతిష్టానం, కోడూర, విజయపురి, తగర, నాసిక్, వైజయంతి, గిర్నార్ ప్రముఖ వర్తక కేంద్రాలుగా ఉండేవి.
* తూర్పు దక్కన్లో ధాన్యకటకం (ధరణి కోట) ప్రధాన వర్తక కేంద్రం. పశ్చిమతీరంలో బరుకచ్చం, సోపార, కల్యాణి; తూర్పుతీరంలో కోడూర, ఘంటసాల, మైసోలియా ప్రధాన రేవు పట్టణాలు. ఈ వ్యాపార కేంద్రాల ద్వారా ఎగుమతి, దిగుమతులు జరిగేవి.
* సారాయి, మణులు, వజ్రాలు, వెండి, బంగారం, గాజు ప్రధాన దిగుమతులు కాగా; దంతపు సామాన్లు, పట్టువస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, చందనం, బియ్యం, గోధుమలు, నెయ్యి, చెక్కర ముఖ్య ఎగుమతులు.
* వీరు ఎక్కువగా రోమ్తో వ్యాపారం చేసేవారు.
* ప్లీని, స్ట్రాబో రచనలు; ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ’ అనే గ్రంథంలో ఆనాటి వర్తక, వాణిజ్యాల గురించిన సమాచారం ఉంది.
* శాతవాహనుల కాలంనాటి నాణేలు రోమ్లో లభించాయి.
* ఆ కాలంలో నూలు, వస్త్ర పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి.
* ఓడల నిర్మాణానికి అవసరమయ్యే కలపను రోమ్వారు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు.
* శాతవాహనులు ఎక్కువగా రాగి, సీసం మిశ్రమంతో కలిపిన నాణేలను ముద్రించారు.
* గ్రామాలు, స్థానిక వ్యాపారాల్లో వస్తుమార్పిడి విధానం ఉండేది. ఉద్యోగులకు జీతాలను వస్తురూపంలోనూ చెల్లించేవారు.
* ఈ వ్యాపార, వాణిజ్యాల వల్ల పశ్చిమ దేశాలతో పాటు ఆగ్నేయాసియా, దూరప్రాచ్య దేశాలతోనూ సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి.
సాంస్కృతిక పరిస్థితులు - సాహిత్యం, వాస్తు, శిల్పకళ
* శాతవాహనుల కాలంలో భాష, సారస్వతం, వాస్తు, శిల్పకళ బాగా అభివృద్ధి చెందాయి. వీరి రాజభాష ప్రాకృతం. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాషలో, బ్రహ్మీలిపిలో ఉన్నాయి.
* హాలుడు గాథాసప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఇందులో 700 పద్యాలు ఉన్నాయి. హాలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. ఈ గ్రంథం అప్పటి సాంఘిక పరిస్థితులను తెలుపుతుంది.
* శాతవాహనుల ఆస్థానంలో గుణాఢ్యుడు అనే కవి ఉండేవాడు. అతడు ప్రాకృతంలో ‘బృహత్కథను’ రాశాడు.
* చివరి శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ మతం బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో సంస్కృత భాషకు ప్రాధాన్యం పెరిగింది.
* ఆ కాలంలో ప్రాకృతం, సంస్కృతంతో పాటు దేశీ అనే భాష కూడా ఉండేది. అత్త, పోట్ట, పిల్ల, అద్దం, నత్తి, చరచు, చెక్క, చెప్పు అనే దేశీ పదాలు గాథాసప్తశతిలో ఉన్నాయని చరిత్రకారులు పేర్కొన్నారు.
* దేశీ అంటే స్థానిక ప్రజల భాష అని అర్థం. ఇది తెలుగుకు దగ్గరగా ఉంటుందని అచార్య డి.సి.సర్కార్ పేర్కొన్నారు.
* భట్టిప్రోలు, జగ్గయ్యపేటలోని శాసనాలు బ్రహ్మీ లిపిలో ఉన్నాయి.
* శాతవాహనులు ఉపయోగించిన లిపిని దక్షిణాది లిపులన్నింటికీ మాతృకగా చరిత్రకారులు భావిస్తాయి.
* శర్వవర్మ రచించిన ‘కాతంత్య్రవ్యాకరణం’, ఆచార్య నాగార్జునుడి రచనలు సంస్కృత భాషలో ఉన్నాయి.
* శాతవాహనుల కంటే ముందే ఆంధ్రదేశంలో వాస్తు శిల్పకళా సంప్రదాయాలు ఉన్నాయి.
* ఆంధ్రులకు 30 సురక్షిత నగరాలు ఉన్నట్లు మెగస్తనీస్ ‘ఇండికా’లో పేర్కొన్నాడు.
* అమరావతి, జగ్గయ్యపేట, ఘంటశాలలో ఇటుకలతో స్తూపాలు నిర్మించి, వాటికి పాలరాతి పలకలను అమర్చారు.
*అమరావతి స్తూపం ప్రసిద్ధి చెందిన అద్భుత కళాఖండం. దీని నిర్మాణాన్ని క్రీ.పూ. 200లో ప్రారంభించారు. క్రీ.శ.2వ శతాబ్దంలో దీన్ని పూర్తిగా పునఃనిర్మించారు. దీన్ని శంకాకారంలో కట్టారు. దీని అడుగు వ్యాసం కొలత 53 మీటర్లు, ఎత్తు 33 మీటర్లు.
* ఈ స్తూపంలో బుద్ధుడి జీవితానికి సంబంధించిన అనేక దృశ్యాలను రాళ్లపై చెక్కారు.
ప్రధానంగా బుద్ధుడి పుట్టుక-కమలంతో, మహాభినిష్క్రమణ - గుర్రంతో, జ్ఞానోదయం - బోధివృక్షంతో, ధర్మచక్రపరివర్తనామానాన్ని - ధర్మచక్రంతో, మహాపరినిర్వాణాన్ని - స్తూపంతో పోల్చారు.
* కార్లే, నాసిక్, కన్హేరి, బేడ్సాలో చైత్యాలయాలను మంచి శిల్పకళతో కట్టారు. వీటిలో కార్లే అందమైన గుహాలయం. సాంచి, అమరావతి స్తూపాలు వాస్తు - శిల్పకళకు మంచి ఉదాహరణ. సాంచీ స్తూపంలో ఉండే తోరణాలు అమరావతి, నాగార్జునకొండలోని శిల్పాలు శాతవాహనుల కాలానికి చెందినవే.
* అమరావతి శిల్ప పద్ధతులే ఇతర స్తూపాల్లోనూ ఉన్నాయి. అందుకే ఆంధ్ర శిల్పానికి ‘అమరావతి శిల్పకళ’ అనే పేరు వచ్చింది.
* వివిధ భంగిమల్లో మానవాకృతిని చిత్రించడంలో అమరావతి శిల్పులకు సాటిలేరని దేవీప్రసాద్ ఘోష్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.
* శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది. అజంతా 10వ గుహలోని శ్వేత గజజాతక చిత్రం శాతవాహనుల కాలానికి చెందిందే. ఆనాటి సమాజంలో ప్రజలు తమ గృహాల గోడలపై రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ గాథలను చిత్రించుకునేవారు.
మతపరిస్థితులు
* శాతవాహనుల కాలం నాటికి వైదిక, జైన, బౌద్ధ మతాలు దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందాయి.
* వీరు వైదిక మతస్థులు. మొదటి శాతకర్ణి అశ్వమేథ, రాజసూయ యాగాలు; గోదానాలు చేశాడని నానాఘాట్ శాసనంలో ఉంది.
* గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణాశ్రమ ధర్మాలను రక్షించి, బ్రాహ్మణులను పోషించి ‘ఏక బ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’ అనే బిరుదులు పొందాడు.
* నానాఘాట్ శాసనంలో ఇంద్ర, వాసుదేవ, సూర్య, చంద్ర, యమ, వరుణ మొదలైన దేవతల ప్రార్థనా గీతాలు ఉన్నాయి.
* వీరు ఎక్కువగా వైదికమతాన్ని అనుసరించినప్పటికీ, బౌద్ధమతాన్ని ఆదరించారు. వర్తకులు, స్త్రీలు ఎక్కువగా బౌద్ధమతాన్ని ఆచరించారని ఆనాటి శాసనాల్లో ఉంది.
* శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో కార్లే, నాసిక్, కన్హేరి, భాజ మొదలైన ప్రాంతాల్లో గుహచైత్యాలయాలు; తూర్పు తీరంలోని జగ్గయ్యపేట, చినగంజాం, రామిరెడ్డిపల్లి, నాగార్జున కొండల్లో స్తూపవిహారాలు వెలిశాయి.
* యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు ధాన్యకటకం, శ్రీపర్వతాల్లో నివహిస్తూ మహాయాన బౌద్ధమతాన్ని ప్రచారం చేశాడు.
* నాగార్జునుడు ‘సుహృల్లేఖ’ అనే గ్రంథాన్ని రచించి, ‘మాధ్యమికవాదాన్ని’ ప్రచారం చేశాడు.
* మొదటి శాతకర్ణి జైనమతాభిమాని. ఇతడు రాజధానిలో జైనుల కోసం చైత్యాలు నిర్మించాడు. అదే కాలానికి చెందిన కొండకుందాచార్యుడు అనే జైనాచార్యుడు అనంతపురం జిల్లా కొనకొండ్లలో ఆశ్రమం స్థాపించి, జైనమతాన్ని ప్రచారం చేశాడు. ఇతడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు.
* కళింగ ఖారవేలుడు మహామేఘవాహన విహారాన్ని నిర్మించాడు. ఇతడు జైనమతాన్ని పోషించాడు.
* బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన ఆచార్య నాగార్జునుడు క్రీ.శ 2వ శతాబ్దంలో ‘ఆరోగ్యమంజరి’, ‘రసరత్నాకరం’ (రసాయన శాస్త్రం) అనే గ్రంథాలు రచించి, తాత్వికచింతన విధానమైన శూన్యవాదాన్ని ప్రచారం చేశాడు. ఇతడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడని చరిత్రకారుల భావన.
* బౌద్ధ మతస్థులు బుద్ధుడి చిహ్మాలైన బోధివృక్షం, ధర్మచక్రం, సింహాసనం, త్రిరత్నం లాంటి వాటిని పూజించేవారు.
* బౌద్ధగ్రంథమైన ప్రజ్ఞాపారమితశాస్త్రాన్ని ఆంధ్రబౌద్ధులు రచించారు.
* అమరావతి శాసనాల్లో బౌద్ధమతం గురించి ఉంది. ధాన్యకటకం, శ్రీపర్వతం, జగ్గయ్యపేట, గుంటుపల్లి ప్రముఖ బౌద్ధకేంద్రాలుగా విలసిల్లాయి.
శాతవాహనుల తర్వాతి రాజవంశాలు
* శాతవాహన సామ్రాజ్యం పతనమయ్యాక, వారి సామంతులు అనేక ప్రాంతాలను ఆక్రమించి స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు.
* వీరిలో ఇక్ష్వాకులు ముఖ్యులు. వీరు విజయపురి లేదా నాగార్జునకొండను రాజధానిగా చేసుకుని కృష్ణా - గుంటూరు ప్రాంతాన్ని సుమారు 50 ఏళ్లకుపైగా పరిపాలించారు.
* ఇక్ష్వాకుల సామంతులు ‘బృహత్పలాయనులు’. వీరు కృష్ణానది ఉత్తరతీరాన్ని (కోడూర) పాలించారు.
* ఆనందగోత్రులు గుంటూరును పాలించారు. వీరి రాజధాని కందపురం.
* వీరి తర్వాత శాలంకాయనులు ‘వేంగి’ని’ రా జధానిగా చేసుకుని 120 ఏళ్లకుపైగా పాలించారు.
* శాతవాహనుల తర్వాత క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో విష్ణుకుండినులు కళింగతోపాటు, పూర్తి ఆంధ్రదేశాన్ని పాలించారు.
* కుంతల, మహారాష్ట్ర ప్రాంతాలను చుటు వంశీయులు పాలించారు.
* అభీరులు పశ్చిమోత్తర భూముల్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.
* క్రీ.శ. 4, 5 శతాబ్దాల్లో విదర్భ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు.
* బనవాసి ప్రాంతాన్ని కందుబులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
* తర్వాతి కాలంలో దక్షిణభారతదేశాన్ని పల్లవులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు పాలించారు.