• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు - సంభవించే ప్రాంతాలు

కాళ్ల కింద భూమి కదిలిపోతే!

  కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోతుంది. పునాదులతో సహా నిర్మాణాలు కూలిపోతాయి. ఆస్తులు, ప్రాణాలకు అపారనష్టం సంభవిస్తుంది. ఇవన్నీ భూకంపాలు సృష్టించే విధ్వంసకర విపరీత పరిణామాలు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఆ విపత్తు పరిధిలోనే ఉన్నాయి. మన దేశంలోనూ అపాయం పొంచి ఉంది. ఆ వైపరీత్యాలకు కారణాలను, తీవ్రతను తగ్గించే వ్యూహాల గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

  ప్రపంచంలో శక్తిమంతమైన భూకంపాలు ఖండపలక చలనాలు లేదా విరూపకారక చలనాల వల్ల సంభవిస్తున్నాయి. భూమి మొదటిపొర అయిన భూపటలం విరూపకారక పలకలుగా లేదా శిలాఖండాలుగా విడిపోయి ఉంటుంది. అవి వాటి దిగువనున్న అర్ధ ద్రవశిలా పదార్థంతో ఉన్న పొరపై మెల్లగా కదులుతూ ఉంటాయి. ఆ సమయంలో పలకల మధ్య సంపీడన, తన్యత బలాలు పనిచేస్తాయి. దాంతో పగుళ్ల ద్వారా శక్తిని విడుదలై కంపన తరంగాలుగా మారి భూమి ఉపరితలంపై ప్రభావం చూపిస్తాయి.

 

 

ప్రపంచంలో..

ఖండ పలకల కదలికల ఆధారంగా ప్రపంచంలో భూకంపాలు జరిగే ప్రదేశాలను మూడు మేఖలలుగా విభజించారు.

 

పసిఫిక్‌ పరివేష్టిత మేఖల: అమెరికన్‌ భూపటలం పలక పశ్చిమానికి జరుగుతుండగా నాజ్కా పలక, కోకోస్‌ పలకలు తూర్పు వైపు జరగడం వల్ల; పసిఫిక్‌ సముద్ర పలక పశ్చిమానికి జరుగుతూ ఫిలిప్పీన్స్, సోలోమాన్, ఫిజి పలకలను ఒత్తిడి చేయడం వల్ల పసిఫిక్‌ సముద్రం చుట్టూ 65% భూకంపాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా పసిఫిక్‌ చుట్టూ ఎక్కువగా అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవిస్తుంటాయి. అందువల్ల పసిఫిక్‌ పరివేష్టిత మేఖలను పసిఫిక్‌ అగ్నివలయం అంటారు. ఈ ప్రాంతంలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, అర్జెంటీనా, హైతీ, హూండరస్, నికార్‌గువా, ఎల్‌సాల్వడార్, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో పశ్చిమతీరం, అమెరికా పశ్చిమతీరం (కాలిఫోర్నియా, అలస్కా రాష్ట్రాలు), రష్యా తూర్పు భాగం, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణకొరియా, ఇండోనేషియా, బ్రూనై, తూర్పు తైమూర్, న్యూజిలాండ్, పపువా - న్యూగినియా, టోంగా, వనౌటు దేశాలు ఎక్కువగా భూకంపాలను ఎదుర్కొంటున్నాయి. న్యూజిలాండ్‌కు దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియాకు భూకంపాల బెడద లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా భూమి అడుగు భాగంలో కంపనాలు ప్రయాణించే భ్రంశాలు లేవు.

 

ఆల్ఫ్‌ - మధ్యదరా సముద్రం - ఆసియన్‌ మేఖల: ఈ ప్రాంతంలో మధ్యదరా సముద్రంలో యురేషియన్‌ పలకతో ఆఫ్రికన్‌ పలక రాపిడి చేస్తుంది. ఇండియన్‌ క్రస్ట్‌ పలక ఉత్తరానికి జరుగుతూ టిబెట్‌ ప్రాంతంలో యురేషియన్‌ పలకను ఒత్తిడి చేస్తుంది. అరేబియన్‌ పలక, ఇరానియన్‌ చిన్న పలకలు ఒకదానికొకటి ఎదురుగా జరుగుతూ యురేషియన్‌ క్రస్ట్‌ పలకతో రాపిడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో 20% భూకంపాలు సంభవిస్తున్నాయి. పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, రొమేనియా, బల్గేరియా, మాసిడోనియా, సెర్బియా, మాంటెనెగ్రో, క్రొయేషియా, తుర్కియే (టర్కీ), ఆల్బేనియా, సైఫ్రస్, జార్జియా దేశాలతో పాటు ఆసియా ఖండంలో భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్, తజకిస్థాన్, కజకిస్థాన్, ఆర్మేనియా, ఇరాన్, ఇజ్రాయెల్, జోర్డాన్‌ దేశాలు; ఆఫ్రికా ఖండంలో మధ్యదరా సముద్రపు అంచులోని అల్జీరియా, మొరాకో దేశాలు ఈ మేఖల పరిధిలో ఉన్నాయి

 

చిన్న మేఖల: అట్లాంటిక్‌ మహాసముద్ర భూతలంలో, హిందూ మహాసముద్రంలోని ఎర్రసముద్రం అంచు వెంబడి, తూర్పు ఆఫ్రికాలోని పగులులోయ వెంట ఉన్న ఈజిప్ట్, జిబౌటి, ఇథియోపియా, ఐస్‌లాండ్, ఆఫ్రికా పశ్చిమతీరంలోని హేప్‌వర్ది దీవులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 15% భూకంపాలు సంభవిస్తున్నాయి.

* ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన వాటిలో చిలీలో 1960, మే 22న వచ్చిన భూకంపం అతిపెద్దది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 9.25గా నమోదైంది. రెండో పెద్ద భూకంపం 1965లో అలాస్కాలో (9.1 తీవ్రత) వచ్చింది.

* ఒకే భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోసిస్మల్‌ రేఖలు అంటారు. ఇవి సాధారణంగా కోడిగుడ్డు ఆకారంలో లేదా దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి.

 

భారత్‌లో

హిమాలయాలు ప్రపంచంలో అత్యంత చురుకైన ముడుత పర్వతాలు. హిమాలయాల అంతర్భౌమ ప్రాంతం భౌగోళికంగా చాలా చురుకుగా ఉండి భూకంపాల సంభ్యావత పెరగడానికి అనుకూలంగా ఉంది. హిమాలయాల తూర్పు ప్రాంతంలో మయన్మార్‌లోని అరకాన్‌యామో ముడత పర్వత మేఖల వద్ద, హిమాలయ పశ్చిమ భాగంలో పాకిస్థాన్‌లోని మక్రాన్‌ సముద్ర తీరం నుంచి అఫ్గానిస్థాన్‌ వరకు ఉన్న చమన్‌ భ్రంశ మండలంలో భూకంపాలు వస్తున్నాయి. ముఖ్యంగా టిబెట్‌ ప్రాంతంలో ఇండియన్‌ పలక ఉత్తరానికి జరుగుతూ యురేషియన్‌ పలకలను ఒత్తిడి చేస్తోంది. 

 

మన దేశంలో భూకంప భ్రంశ మండలాలను నాలుగు జోన్‌లుగా నిర్ణయించారు.

 

జోన్‌ 5: ఈ జోన్‌లో అత్యధిక అపాయం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రిక్టర్‌ స్కేల్‌పై 7 నుంచి 9 పాయింట్ల తీవ్రతను నమోదుచేస్తాయి. అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో కొంత ప్రాంతం, గుజరాత్‌లోని కచ్‌-భుజ్‌  ఈ జోన్‌లో ఉన్నాయి.

 

జోన్‌ 4: ఈ ప్రాంతంలో భూకంపాలు అధిక అపాయాన్ని కలిగిస్తాయి. రిక్టర్‌స్కేల్‌పై 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదుకు అవకాశం ఉంది. దిల్లీ, సిక్కిం, దక్షిణ బిహార్, దక్షిణ ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్‌ దక్షిణ భాగం; మహారాష్ట్రలోని కొయనా ప్రాంతాలు ఈ జోన్‌లో ఉన్నాయి.

 

జోన్‌ 3: ఇక్కడ మాధ్యమిక భూకంపాల అపాయం ఉంటుంది. రిక్టర్‌స్కేల్‌పై 4 నుంచి 6 పాయింట్ల తీవ్రత నమోదవుతుంది. ఇందులో పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌ పశ్చిమ భాగం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గోవా, లక్షదీవులు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. కోల్‌కతా, చెన్నై, ముంబయి మహానగరాలు కూడా ఈ జోన్‌లోకి వస్తాయి.

 

జోన్‌ 2: తక్కువ అపాయం లేదా అపాయం లేని చిన్న భూకంపాలు ఈ జోన్‌లో సంభవిస్తాయి. రిక్టర్‌స్కేల్‌పై 0 నుంచి 4 తీవ్రత నమోదవుతుంది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జోన్‌లోకి వచ్చే ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు. 

  మనదేశంలో 5, 4 జోన్లు భూకంపాల ప్రమాదం ఉన్నవి కాగా 3, 2 జోన్లు సురక్షిత ప్రాంతాలుగా చెప్పవచ్చు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) ప్రకారం భూకంపాల నష్టం ఎక్కువగా 5, 4 జోన్‌లలో ఉంది. దేశం మొత్తం భూభాగంలో 58.6% భాగానికి భూకంపాల ముప్పు ఉంది. 38 నగరాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఇప్పటివరకు మనదేశంలో పెద్ద భూకంపం 1897లో షిల్లాంగ్‌లో వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 8.7గా నమోదైంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3, 2 భూకంపాల జోన్లు మాత్రమే విస్తరించి ఉన్నాయి. అంటే భూకంపాల బెడద అంతగా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969, ఏప్రిల్‌ 13న కిచ్చెన్నపల్లి గొల్లగూడెంలో పెద్ద భూకంపం సంభవించింది. దీన్ని భద్రాచలం భూకంపం అంటారు. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.7గా నమోదైంది.

 

భూకంపాల తీవ్రతను తగ్గించే వ్యూహాలు

* భూకంప ప్రభావం నుంచి ఉపశమనానికి కమ్యూనిటీ సంసిద్ధత ఎంతో కీలకం.

* భూకంపాలు సంభవించిన సమయంలో పరిగెత్తకుండా డ్రాప్, కవర్, హోల్డ్‌ విధానం పాటించాలి.

* భవన నిర్మాణాల్లో సరైన ఆర్కిటెక్ట్, నాణ్యమైన ఉపకరణాలు వినియోగించాలి.

* పెద్ద భవనాలకు మధ్యలో ఖాళీలు వదిలి, దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా, ఆంగ్ల అక్షరాలు T, L, U, X ఆకారాల్లో భవంతులు నిర్మించాలి.

* గట్టి నేలపై భవనాలను నిర్మిస్తే దృఢంగా ఉంటాయి. బలహీనమైన నేలపై ఉండే భవనాలు తీవ్రంగా కంపిస్తాయి.

* గోడలకు చిన్న కిటికీలు నిర్మించాలి. గోడలు, మూలాలు కలిసే చోట రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ ఏర్పాటు చేయాలి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత జాతీయ భవన నిర్మాణ కోడ్‌ను మొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు? 

1) 1970    2) 1960    3) 1980   4) 1990

 

2. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీని ఎక్కడ స్థాపించారు?

1) ముంబయి    2) లఖ్‌నవూ    3) నాగ్‌పుర్‌    4) నోయిడా

 

3. మనదేశంలో మొదటి భూకంప హెచ్చరిక వ్యవస్థను ఎక్కడ ఏర్పాటుచేశారు?

1) ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌      2) బిహార్‌లోని పట్నా

3) మహారాష్ట్రలోని కొయనా    4) ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా

 

4. భారతదేశంలో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని 1898లో ఎక్కడ స్థాపించారు?

1) ముంబయి    2) కోల్‌కతా    3) దిల్లీ     4) బెంగళూరు

 

5. భూకంప మ్యాపులను తయారుచేసే సంస్థ?

1) బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ 

2) భారత వాతావరణ విభాగం

3) సిస్మాలజీ డిపార్ట్‌మెంట్‌ 

4) జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ

 

6. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వివరణ ప్రకారం దేశంలో ఏ జోన్‌లలో తీవ్ర భూకంపాలు సంభవిస్తాయి?

1) 5, 4     2) 1, 2     3) 3, 4     4) 2, 3 

 

7. ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా జరిగే భ్రంశ మండలం ఏది?

1) పసిఫిక్‌ పరివేష్టిత మేఖల             2) మధ్యదరా సముద్ర మేఖల

3) హిందూ మహాసముద్ర మేఖల        4) అట్లాంటిక్‌ మహాసముద్ర మేఖల

 

8. ప్రపంచంలో ఇప్పటివరకు నమోదయిన అతిపెద్ద భూకంపం ఏది?

1) కాలిఫోర్నియా భూకంపం       2) అలస్కా భూకంపం

3) చిలీ భూకంపం             4) జపాన్‌ భూకంపం

 

9. భారతదేశంలో ఇప్పటివరకు సంభవించిన వాటిలో పెద్ద భూకంపం? 

1) కొయనా భూకంపం    2) షిల్లాంగ్‌ భూకంపం

3) కశ్మీర్‌ భూకంపం    4) అసోం భూకంపం

 

10. దేశంలోని మెట్రో నగరాల్లో ఏ నగరానికి భూకంపాల అపాయం ఎక్కువగా ఉంది?

1) దిల్లీ    2) బెంగళూరు    3) హైదరాబాద్‌    4) చెన్నై

 

సమాధానాలు: 1-1; 2-4; 3-1; 4-2; 5-1; 6-1; 7-1; 8-3; 9-2; 10-1.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 03-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌