ప్రగతి చోదక శక్తులు!
పరిశ్రమలు నడవాలన్నా, వాహనం కదలాలన్నా, విమానం ఎగరాలన్నా ఇంధనాలు కావాల్సిందే. ఆధునిక ప్రగతి మొత్తం ఆ శక్తివనరుల చుట్టూనే తిరుగుతోంది. వాటిలో వాడిన కొద్దీ తరిగిపోయేవి కొన్ని ఉంటే, ఎంత ఉపయోగించుకున్నా ఎప్పటికీ లభించేవి ఇంకొన్ని ఉన్నాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలకంగా మారిన ఆ ఇంధానాల లభ్యత, వినియోగాల వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.
ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారేందుకు శక్తివనరులు ప్రధానంగా దోహదపడ్డాయి.ప్రాచీన కాలంలో నిప్పుతో మొదలైన శక్తివనరుల వినియోగం నేడు విద్యుత్తు, ఇంధనాల రూపంలో ప్రతి రంగంలోనూ కొనసాగుతోంది. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి శక్తి సంపద విశేషంగా సాయపడుతోంది. ఒక ప్రాంత ఆర్థికాభివృద్ధి అక్కడ వాడుతున్న శక్తి వనరుల మీద ఆధారపడి ఉంటుంది. అవి రెండు రకాలుగా ఉన్నాయి.
తరిగిపోయేవి: వీటినే సంప్రదాయ ఇంధన వనరులు అంటారు. వినియోగిస్తున్న కొద్దీ ఈ వనరుల నిల్వ తగ్గిపోతూ ఉంటుంది. వాటి పునరుత్పత్తి సాధ్యం కాదు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధంగా ఉపయోగించుకోవాలి.
ఉదా: బొగ్గు, పెట్రోల్, సహజవాయువు, అణుశక్తి, యురేనియం, థోరియం వంటి ఖనిజాలు
తరిగిపోనివి: వీటిని సంప్రదాయేతర ఇంధన వనరులంటారు. ఎంత ఉపయోగించుకున్నా, ఎన్నిసార్లు వాడినా ఇవి తరిగిపోవు. మళ్లీ, మళ్లీ వినియోగించుకోవచ్చు. ప్రకృతిలో ఎల్లప్పుడూ లభ్యమవుతాయి. ప్రస్తుతం సాంకేతికాభివృద్ధి కారణంగా వీటి ఉపయోగం పెరుగుతోంది.
ఉదా: సూర్యరశ్మి, గాలి, నీరు
మనదేశంలో వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా బొగ్గు, ముడిచమురు, అణుశక్తి, సహజ వాయువు, జలవిద్యుత్తు శక్తిని ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో సాంకేతిక అభివృద్ధి ఫలితంగా సౌరశక్తి, పవన శక్తి, సముద్ర తరంగాల శక్తి, జీవశక్తి (బయో-ఎనర్జీ) వాడకం మొదలైంది.
సంప్రదాయ ఇంధనాలు
బొగ్గు: ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరుల్లో ముఖ్యమైనది బొగ్గు. దీన్నే నల్లబంగారం అంటారు. అనాదిగా పరిశ్రమలకు, మన దేశంలో విద్యుదుత్పత్తికి ఇది ప్రధాన ఇంధనం. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో నేటికీ 50 శాతంపైగా బొగ్గు ద్వారానే జరుగుతోంది. బొగ్గు కేవలం విద్యుత్తు ఉత్పత్తికే కాకుండా, యంత్రాలకు, రైల్వే, ఓడల ప్రయాణాలకు ఉపయోగిస్తారు. ఇనుము-ఉక్కు పరిశ్రమల్లో, రసాయన మిశ్రమాల్లో, సిమెంటు తయారీల్లో వాడుతున్నారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉంది. మొదటి స్థానం చైనా దక్కించుకుంది. బొగ్గు నిల్వల పరంగా భారత్ ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. వందల సంవత్సరాల క్రితం సరస్సులు, లోయల్లో ఉండే చెట్లు, అడవులు భూకంపాల వల్ల భూమిలో కప్పబడి (కార్బోనిఫెరస్ యుగం) బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయి. ఆ వృక్షాల అవశేషాలు బొగ్గుగా మారే ప్రక్రియను కోలిఫికేషన్ అంటారు. భూమి పొరల్లో ఈ బొగ్గు ఎంత లోతులో ఉంటే అంత నాణ్యంగా ఉంటుంది. మన దేశంలో రెండు రకాల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.
గోండ్వానా రకం: ఇవి కార్బోనిఫెరస్ యుగంలో ఏర్పడ్డాయి. వీటి నిల్వలు మహానది, సోన్నది, నర్మద, దామోదర్ నదీ లోయ ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలోని మొత్తం బొగ్గు నిల్వల్లో 98 శాతం పైగా ఈ రకమైనవే. ఇవి నాణ్యమైన ఆంత్రసైట్, బిట్యుమినస్ రకానికి చెందినవి.
టెర్షియరీ రకం: ఇది తృతీయ మహాయుగపు బొగ్గు. మొత్తం బొగ్గులో ఈ రకం కేవలం 2 శాతం మాత్రమే. ఇది లిగ్నైట్ రకానికి చెందినది. అస్సాం, రాజస్థాన్, కశ్మీర్, తమిళనాడులోని కడలూర్ జిల్లా నైవేలి, గుజరాత్లోని కచ్, శివాలిక్ కొండల వద్ద లభిస్తుంది.
బొగ్గు రకాలు: బొగ్గు ఏర్పడే క్రమంలో విభిన్న రకాల ఒత్తిడులు, ఉష్ణోగ్రతలు ఎదురవుతాయి. కాలం ఆధారంగా అవి అనేక విధాలుగా ఉంటాయి. మందం, గట్టిదనం, తేమ శాతం, బూడిద రకాల ఆధారంగా బొగ్గును వర్గీకరిస్తారు.
ఆంత్రసైట్: ఇది ఉత్తమమైన, నాణ్యమైన రకం. నలుపు రంగులో, దృఢంగా ఉంటుంది. ఇందులో 80 శాతం పైగా కర్బనం ఉంటుంది. జమ్ము- కశ్మీర్లో లభిస్తుంది. నీలి రంగు మంటను ఇస్తుంది.
బిట్యుమినస్ బొగ్గు: ఇది మెత్తగా/మృదువుగా ఉంటుంది. దేశంలో ఈ రకమే అధిక మోతాదులో ఉంది. దీనిలో కర్బనం 40 - 80 శాతం, 15 - 40 శాతం తేమ ఉంటుంది. నలుపు రంగులో, మందంగా ఉంటుంది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో లభిస్తుంది.
లిగ్నైట్: దీన్ని గోధుమ రంగు బొగ్గు అంటారు. 40- 55 శాతం కర్బనం, 35 శాతం తేమ ఉంటుంది. నైవేలీ (తమిళనాడు), పల్నా (రాజస్థాన్), లక్ష్మీపుర్ (అస్సాం), కావేరా (జమ్ముకశ్మీర్)లలో లభిస్తుంది. దేశంలో లిగ్నైట్ నిక్షేపాలు తమిళనాడులో అధికంగా ఉన్నాయి.
పీట్: బొగ్గుగా మారే క్రమంలో ఏర్పడే రకమిది. దీనిలో 40 - 50% కర్బనం ఉంటుంది. కాల్చినప్పుడు పొగ, బూడిద ఎక్కువ వస్తుంది.
దేశంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం (30.06.2022 నాటికి)
విద్యుత్తు వనరు | స్థాపిత సామర్థ్యం (మెగావాట్లలో) | మొత్తం విద్యుత్తులో వాటా (శాతాల్లో) |
బొగ్గు | 2,04,080 | 50.54 |
లిగ్నైట్ | 6,620 | 1.60 |
గ్యాస్ | 24,856 | 6.15 |
డీజిల్ | 510 | 0.12 |
జలవిద్యుత్తు | 46,850 | 11.10 |
అణువిద్యుత్తు | 6,780 | 1.67 |
పునరుత్పాదక ఇంధన వనరులు | 1,14,064 | 28.25 |
మొత్తం సామర్థ్యం | 4,03,760 | 100 |
ఆధారం: కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖ
ముడిచమురు
ముడిచమురు (పెట్రోలియం) నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మొదలైనవి లభిస్తాయి. గ్రీకు భాషలో పెట్రో అంటే శిల, ఓలియమ్ అంటే నూనె. పెట్రోలియం అంటే శిలాజ ఇంధనం. రవాణా వాహనాలు, రైళ్లు, ఓడలు నడవడానికి పెట్రోల్, డీజిల్ ఉపయోగిస్తారు. దేశంలో మొదటగా అస్సాంలోని దిగ్బాయ్లో ముడిచమురు నిల్వలు గుర్తించారు. ఆ తర్వాత సహర్ కటియ, కాంబట్ సింధు శాఖ, బాంబే హై వద్ద కూడా కనుక్కున్నారు. 1956లో భారత్లో ఓఎన్జీసీ (చమురు, సహజ వాయువుల సంస్థ) ఏర్పడింది. నాటి నుంచి ఈ సంస్థ పర్యవేక్షణలో చమురునిల్వలున్న ప్రదేశాల పరిశోధన, ఉత్పత్తి జరుగుతోంది. 2020-21 లెక్కల ప్రకారం దేశంలో చమురు నిల్వలు 603.6 మిలియన్ టన్నులు.
దేశంలో బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతంలోని దిహంగ్ లోయ, దిగ్బాయ్, సహర్ కటియా, టిపం కొండలు, రాజస్థాన్లోని మంగళ, గుజరాత్లోని అంకలేశ్వర్, లూనెజ్, అహ్మదాబాద్-కలోల్, ఆలియాబెట్, పశ్చిమ సముద్ర తీరంలోని బాంబే హై, బెస్సెయిన్ చమురు క్షేత్రం, తూర్పుతీరంలో తమిళనాడులోని నారీమనమ్, కోవిలప్పల్, ఆంధ్రప్రదేశ్లోని రవ్వ క్షేత్రం (కాకినాడ), నర్సాపుర్, లింగాల, పాశర్లపూడి మొదలైన ప్రదేశాల్లో ముడిచమురు వెలికితీత జరుగుతోంది.
సహజ వాయువు
మన దేశంలో సహజ వాయువును మొదట పంజాబ్లోని జ్వాలాముఖి వద్ద, బరోడా వద్ద కనుకొన్నారు. సహర్ కటియా, హుగ్రీజన్ ప్రాంతాల్లో ఈ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని బిజయ్పుర్, గుజరాత్లోని వాగోడియాల వద్ద గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆధ్వర్యంలో సహజ వాయువును వెలికితీశారు. 1960ల్లోనే సహజ వాయువును ఇంధనంగా వినియోగించడం ప్రారంభమైంది. 2020-21 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం సహజ వాయువు నిల్వలు 1371.89 బిలియన్ క్యూబిక్ మీటర్లు. మొత్తం నిక్షేపాల్లో ఖండతీరపు అంచున 65% ఉండగా, తూర్పు ఖండతీరపు అంచున అత్యధికంగా 41% నిల్వలున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం సహజ వాయువులో 75 శాతం ఓఎన్జీసీ కంపెనీ వెలికితీస్తోంది. సహజ వాయువును ఎక్కువగా రసాయన ఎరువుల తయారీకి, విద్యుత్తు ఉత్పత్తికి, వంటగ్యాస్గా, వాహనాల ఇంధనంగా వినియోగిస్తారు.
అణువిద్యుత్తు శక్తి
అణుశక్తికి కావాల్సిన యురేనియం, థోరియం వంటి ఖనిజాలు కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఇల్మినైట్, మోనజైట్ ఖనిజాల రూపంలో లభిస్తాయి. ఇల్మినైట్ నుంచి టిటానియం, మోనజైట్ నుంచి థోరియం లభిస్తాయి. అణుశక్తి ఉత్పత్తి 1970లో బొంబాయిలోని తారాపుర్ వద్ద జరిగింది. దేశంలో ప్రస్తుతం 7 అణువిద్యుత్తు కేంద్రాలున్నాయి. అవి తారాపుర్ (మహారాష్ట్ర), రావత్భట్ (రాజస్థాన్), కల్పకం (చెన్నై), నరోరా (ఉత్తర్ప్రదేశ్), కాక్రపార (గుజరాత్), కైగా (కర్ణాటక), కూడంకుళం (తమిళనాడు). మన దేశంలో యురేనియం తవ్వకానికి అనుమతి ఉన్న సంస్థ ‘యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ను 1967లో ఏర్పాటుచేశారు. కేంద్ర అణుశక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీని నిర్వహణలో ఝార్ఖండ్లో యురేనియం గనులు (6 భూగర్భ, ఒక ఉపరితల) ఉన్నాయి. కొత్తగా మూడు ప్రదేశాల్లో యురేనియం ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. అవి తుమ్మలపల్లి (కడప జిల్లా), కిలాంగ్ (మేఘాలయ), లంభాపుర్ - పెద్దగట్టు (నల్గొండ జిల్లా). ఇది ప్రతిపాదిత ప్రాజెక్టులు.
రచయిత: డాక్టర్ గోపగోని ఆనంద్