• facebook
  • whatsapp
  • telegram

మొగల్‌ యుగ విశేషాలు

భారతదేశాన్ని క్రీ.శ. 1526 నుంచి క్రీ.శ. 1858 వరకు మొగలులు పాలించారు. బాబర్‌ నుంచి ఔరంగజేబ్‌ వరకూ మొగల్‌ పాలన గొప్పగా సాగిందని చరిత్రకారులు కొనియాడారు. మొగల్‌ పాలనను ప్రారంభించింది సూర్‌ వంశానికి చెందిన షేర్షా. అతడు ప్రవేశపెట్టిన పాలనా,   రెవెన్యూ, ఆర్థిక సంస్కరణలనే అక్బర్‌ కొద్ది మార్పులతో కొనసాగించాడు. అందుకే షేర్షాను అక్బర్‌కు మార్గదర్శకుడిగా పేర్కొంటారు. 


పరిపాలనా సంస్కరణలు

కేంద్రపాలన: మొగల్‌ చక్రవర్తులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలనను అందించారు. కేంద్రపాలనలో చక్రవర్తే అత్యున్నతాధికారి. పౌరపాలన మొత్తం అతడి చుట్టే కేంద్రీకృతమై ఉండేది. మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో చక్రవర్తి పాలనను కొనసాగించేవాడు. షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సర్కారులు - పరగణాలు - గ్రామాలుగా విభజిస్తే, కొద్దిమార్పులతో అక్బర్‌ తన సామ్రాజ్యాన్ని సుబాలు - సర్కారులు - పరగణాలు - గ్రామాలు అనే భాగాలుగా ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రి మండలిలో వకీల్‌ (ప్రధానమంత్రి), వజీర్‌ (ఆర్థికమంత్రి), మీర్‌భక్షీ (యుద్ధమంత్రి), మీర్‌-ఇ-సదర్‌ (దానధర్మాల మంత్రి), ప్రధాన ఖాజీ (న్యాయశాఖామంత్రి) పరిపాలనలో చక్రవర్తికి సహాయపడేవారు.  
 

రాష్ట్ర పాలన: షేర్షా సర్కారులు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేయగా, అక్బర్‌ ‘సుబాలు’ అనే ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. సుబా అధిపతి సుబేదార్‌. వీరి పాలన కూడా కేంద్ర పాలనను పోలి ఉండేది. సుబేదార్‌కు రాష్ట్ర పాలనలో తోడ్పడేందుకు ఫొతేదార్, పౌజ్‌దార్‌ లాంటి అధికారులు ఉండేవారు. అమీన్‌ను రాష్ట్ర రెవెన్యూ అధికారిగా, నేటి కలెక్టర్‌తో పోల్చవచ్చు. ఫొతేదార్‌ రాష్ట్ర కోశాధికారి. రాష్ట్రంలో సైనిక వ్యవహారాలు చూడటానికి ‘భక్షీ’ అనే అధికారిని నియమించారు. రాష్ట్ర గవర్నర్‌లను సిఫా-సలార్‌ అనేవారు. తర్వాతి కాలంలో సిఫా-సలార్‌ పదవి సుబేదార్‌ లేదా నజీమ్‌గా మారింది. వీరితో పాటు కాజీ, సాదర్, ముతాసిబ్‌ లాంటి ఇతర అధికారులు కూడా రాష్ట్ర పాలనలో సాయపడేవారు.

స్థానిక పాలన
మొగలుల స్థానిక పాలనలో సర్కారులు - పరగణాలు - గ్రామాలతోపాటు మహల్స్, ఠాణాలు, పట్టణాలు, ఓడరేవులు లాంటి ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి. సర్కారు అధిపతిని పౌజ్‌దార్‌ అని, పరగణా అధిపతిని షిక్‌దార్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో పట్వారీ, చౌకీదార్, ముఖద్దమ్‌ లాంటి ఉద్యోగులు ఉండేవారు. ఇలా మొగలులు తమ కాలంలో కేంద్రం నుంచి గ్రామం వరకు సమర్థవంతమైన పాలన అందించారు.

రెవెన్యూ పాలన
మొగలుల కాలం నాటి రెవెన్యూ విధానాల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. భూములను సర్వే చేయించడం, విభజించడం, శిస్తు నిర్ణయించడం లాంటి రెవెన్యూ విధానాలను అనుసరించారు. కేంద్రంలో వజీర్, సుబాలలో (రాష్ట్రాలు) దివాన్‌లు, అమీన్‌లు, సర్కారులు; పరగణాల్లో కనుంగోలు రెవెన్యూ విధులను నిర్వహించేవారు. షేర్షా భూములను కొలిపించి ఉత్తమ - మధ్యమ - అధమ అనే మూడు రకాలుగా విభజించాడు. అక్బర్‌ కాలంలో భూములను పోలజ్, పరౌటీ, చాచర్, బంజర్‌ అనే నాలుగు రకాలుగా విభజించారు. 
పండిన పంటలో 1/3 వంతు భూమి శిస్తుగా వసూలుచేసేవారు. అక్బర్‌ కాలంలో బందోబస్తు రెవెన్యూ విధానం (రైత్వారీ పద్ధతి) ప్రవేశపెట్టారు. నాటి భూమి శిస్తు విధానాన్ని జబ్తి (జాబితా) పద్ధతిగా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ప్రతి 10 సంవత్సరాల సగటు పంటను లెక్కించి భూమి శిస్తు విధిస్తారు. అందుకే దీన్ని దహ్‌సాలా పద్ధతి అని కూడా పిలిచేవారు. రైతులు భూమి శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించడానికి అనుమతించారు.

న్యాయపాలన 
మొగలుల కాలంలో చక్రవర్తే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. ఫర్మానాలు జారీ చేయడం, మరణ శిక్షలు విధించడం లాంటి విశేషాధికారాలు కూడా ఉండేవి. చక్రవర్తికి న్యాయపాలనలో సహాయపడటానికి ‘ఖాజీ’లు అనే న్యాయశాఖామంత్రులు, ఇతర ఉద్యోగులు ఉండేవారు. మహ్మదీయ మతానికి చెందిన వారైనా మొగలులు ఇతర మతాల విశ్వాసాలు, మత గ్రంథాల ప్రకారం తీర్పులు చెప్పేవారు. ముఖ్యంగా ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి అక్బర్‌ తన కాలంలో ఘరోకా-ఇ-దర్శన్‌ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. జహంగీర్‌ ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. సుబాలు, సర్కారులు, పరగణాల్లో కూడా ప్రత్యేక న్యాయాధికారులను నియమించి మొగలులు ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించారు.

సైనిక పాలన
మొగలుల కాలం నాటి సైనిక పద్ధతిని మున్సబ్‌దారీ పద్ధతిగా పేర్కొంటారు. ఈ విధానాన్ని అక్బర్‌ కాలంలో ప్రవేశపెట్టారు. సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో మున్సబ్‌దారులను నియమించారు. వాళ్లు సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మున్సబ్‌దారులకు వంశపారంపర్య హక్కులు లేవు. తరచూ బదిలీ అయ్యేవారు. మున్సబ్‌దార్‌ అంటే ఒక శ్రేణికి అధికారి అని అర్థం. 
అబుల్‌ ఫజల్‌ రచనల ప్రకారం నాటి మున్సబ్‌దారుల్లో సుమారు 33 తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 10 గుర్రాల నుంచి అధికంగా 10 వేల గుర్రాలను పోషించే 33 తరగతుల మున్సబ్‌దారులుండేవారని అబుల్‌ ఫజల్‌ రాశాడు. నాటి మున్సబ్‌దారీ విధానంలో జాత్‌ (హోదా), సవారీ (అదనపు అలవెన్స్‌) అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉండేవి. జహంగీర్‌ కాలంలో, అనంతరం షాజహాన్‌ కాలంలో మున్సబ్‌దారీ విధానంలో కొన్ని మార్పులు చేశారు. అనంతర కాలంలో మున్సబ్‌దారుల స్థానంలో జాగీర్దారులను నియమించారు. మరికొన్నిచోట్ల మున్సబ్‌దారులకే జాగీరులను కేటాయించారు.  అయితే మున్సబ్‌దారులందరూ జాగీర్దారులు కాదు. 

సామాజిక వ్యవస్థ  
మొగలుల కాలంనాటి సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని ఆర్‌.సి. మజుందార్, రాయ్‌చౌదరి లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నాటి సమాజంలో ప్రభు, మధ్యతరగతి, సామాన్య అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ప్రభు వర్గంలో చక్రవర్తి, అంతఃపుర ఉద్యోగ బృందం; మధ్యతరగతి వర్గంలో జమీందారులు, జాగీర్దారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. రైతులు, కూలీలు, కౌలు రైతులు, సేద్య బానిసలు లాంటి పేదవారు సామాన్య వర్గంలో ఉండేవారు. నాటి సామాజిక వ్యవస్థలో రైతులు, కూలీలు తీవ్రమైన దోపిడీకి గురయ్యేవారు. సమాజంలో బహుభార్యత్వం, వ్యభిచారం, సతీసహగమనం, పరదా పద్ధతి లాంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి. స్త్రీ విద్య అందుబాటులో లేదు.

 

సాంస్కృతిక వికాసం
మొగలులు తమ కాలంలో వాస్తు, కళ, విద్యా సారస్వతాల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేశారు. ముస్లిం పాలకులైనా మొగలుల్లో ఔరంగజేబ్‌ మినహా అంతా పరమత సహనం పాటించారు. లౌకిక రాజ్యంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఔరంగజేబ్‌ చేసిన ప్రయత్నాల వల్లే మొగల్‌ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. మొగలులు దేశవ్యాప్తంగా మదర్సాలు, పాఠశాలలను స్థాపించారు. కానీ స్త్రీ విద్యాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. చక్రవర్తులు తమ ఆస్థానంలో అనేకమంది కవి పండితులను పోషించారు. రాజభాష అయిన పారశీకంతోపాటు, హిందీ, సంస్కృతం, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లో కూడా చక్కటి సాహిత్య సృష్టి జరిగింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైన ఇండో-ఇస్లామిక్‌ మిశ్రమ సంస్కృతి మొగలుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, వాస్తు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బాబర్‌ నుంచి షాజహాన్‌ వరకు వాస్తురంగంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు.ఉద్యానవనాలు, మసీదులు, కోటలు, దర్గాలు, రాజప్రసాదాలు లాంటి నిర్మాణాల్లో పర్షియన్‌ - భారతీయ వాస్తు విధానాలను అనుసరించారు. బాబర్‌తో ప్రారంభమైన ఉద్యానవనాల నిర్మాణం జహంగీర్, షాజహాన్‌ల కాలంలో ఉన్నత దశకు చేరింది. షాలిమార్‌ గార్డెన్స్, మొగల్‌ గార్డెన్స్‌ ప్రఖ్యాతి గాంచాయి. అక్బర్‌ కాలంలో ఫతేపూర్‌ సిక్రీలో నిర్మించిన కట్టడాలు, షాజహాన్‌ కాలంలో నిర్మించిన ఎర్రకోట, తాజ్‌మహల్‌ నిర్మాణాలు మొగలుల వాస్తు కళాపోషణకు దర్పణాలు. అలహాబాద్‌లో అక్బర్‌ పూర్తిగా హిందూ పద్ధతిలో నిర్మించిన 40 స్తంభాల భవనం చాలా ప్రసిద్ధిచెందింది. సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన తాన్‌సేన్, బైజుబావరా, బాజ్‌బహదూర్, రూపవతి లాంటి వారిని మొగలులు ఆదరించారు. చిత్రలేఖనంలో చక్రవర్తులు సైతం ప్రావీణ్యం పొందారు. జహంగీర్‌ సూక్ష్మ చిత్రలేఖనంలో నిష్ణాతుడు. హుమయూన్‌ తన ఆస్థానంలో పర్షియన్‌ చిత్రకారులను పోషించాడు. అక్బర్‌ కాలంలో ఖ్వాజా అబ్దుల్‌ సమద్‌ నాయకత్వంలో ప్రత్యేక చిత్రలేఖన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈవిధంగా మొగలుల కాలంలో సాహిత్యం, వాస్తు కళలు వర్ధిల్లాయి.

 

ఆర్థిక వ్యవస్థ
మొగలుల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని నూతన మార్పులు సంభవించాయి. పాలకులు వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అందుకే, అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మొగల్‌ చక్రవర్తులు వ్యవసాయరంగ అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధవహించారు. రాజ్యంలో భూమి మొత్తం చక్రవర్తిదే అయినప్పటికీ వాస్తవ రూపంలో దాన్ని అనేకమంది అధీనంలో ఉంచారు. భూములకు సంబంధించి ఖుద్‌కాస్త్‌లు, పాహీలు, ముజారియమ్‌లు లాంటి అనేక రకాల పేర్లు వాడుకలో ఉండేవి. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందిన సొంత భూములను ఖలీఫా భూములని, రైతులకు చెందిన భూములను ఖుద్‌కాస్త్‌ భూములని పిలిచేవారు. పాహీలు, ముజారియమ్‌లను కౌలు రైతుల భూములుగా పరిగణించేవారు. జమీందారుల అధీనంలో కూడా కొన్ని భూములు ఉండేవి. నాటి జమీందారుల్లో  స్వయం ప్రతిపత్తి ఉన్న జమీందారులు, మధ్యంతరస్థాయి జమీందారులు, ప్రాథమికస్థాయి జమీందారులు అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ఈ విధంగా మొగలుల కాలంలో వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక మార్పులు ప్రవేశపెట్టారు. రైతాంగ అభివృద్ధికి, నీటిపారుదల సౌకర్యాల కల్పనకు, శిస్తు విధింపునకు పాలకులు కృషి చేశారు. అయితే, నాటి రైతులు జమీందారుల దౌర్జన్యానికి గురయ్యేవారు. అధిక పన్నులతో సామాన్యులు బాధపడేవారు.
                     నాటి వర్తక, వాణిజ్యాలను జాతీయ, అంతర్జాతీయ వర్తకాలుగా వర్గీకరించవచ్చు. దేశంలో జరిగే జాతీయ వర్తకంతోపాటు, పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలతో జరిగే విదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది. భారతీయ నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి. లాహోర్, ముల్తాన్‌ గొప్ప రవాణా కేంద్రాలుగా రూపొందాయి. 
విశాలమైన తీరప్రాంతం సముద్ర వ్యాపారానికి తోడ్పడింది. పట్టు, నూలు వస్త్రాలు, ఆయుధాలు, వజ్రాలు, చక్కెర లాంటివి ఎక్కువగా విదేశాలకు ఎగుమతయ్యేవి. బంగారం, కర్పూరం, విలాస వస్తువులను దిగుమతి చేసుకునేవారు. భారతదేశంలో పట్టణ కేంద్రాలు అధికంగా వృద్ధి చెందటం కూడా పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణమైంది. చిన్నచిన్న పట్టణాలు, సరాయిలు, కాస్బాలు కూడా స్థానిక మార్కెట్లుగా మార్పు చెందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు లాంటి కారణాల వల్ల వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి.
                     నాడు గ్రామీణ చేతివృత్తులతోపాటు కుటీర పరిశ్రమలు, నూలు, పట్టు, వజ్రాలు, ఉన్ని లాంటి భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తికి ప్రథమస్థానంగా ఉండేది. వడ్రంగం, నేత, అద్దకం, కమ్మరం లాంటి గ్రామీణ చేతివృత్తులవారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి, వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు. పత్తి, నూనె గింజలు, నీలిమందు లాంటి ఉత్పత్తులు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డాయి. కుమ్మరం, తోలు ఉత్పత్తులు పెరిగాయి. పాదరక్షలు, తోలు సంచుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన భారీ పట్టణ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. బెంగాల్, గుజరాత్‌ ప్రాంతాల్లో జౌళి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. బెంగాల్, కోరమాండల్‌ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే లాంగ్‌క్లాత్, మస్లిన్‌ వస్త్రాలకు ఆసియా మార్కెట్లలో అధిక గిరాకీ ఉండేది. ఇత్తడి, రాగి, వజ్రాల పరిశ్రమలు వృద్ధి చెందాయి. మొగలుల కాలంలో పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతాలు చక్కెర పరిశ్రమలకు, ఢిల్లీ రాగి పరిశ్రమకు, బెనారస్‌ ఇత్తడి పరిశ్రమకు; ఢాకా, అహ్మదాబాద్, జాన్‌పూర్‌ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధికెక్కాయి. బెర్నియార్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు ‘పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి’ అని పేర్కొన్నాడు.

 

మొగల్‌ సామ్రాజ్యం - రాజకీయ చరిత్ర

బాబర్‌ క్రీ.శ.1526 లో మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అనంతరం అతడి కుమారుడైన హుమయూన్, మనవడైన అక్బర్‌ చక్రవర్తి పరిపాలించారు. క్రీ.శ.1605లో అక్బర్‌ మరణానంతరం అతడి కొడుకు జహంగీర్, మనవడు షాజహాన్‌లు రాజ్యపాలన చేశారు.


జహంగీర్‌ (1606 - 27)
    జహంగీర్‌ అసలు పేరు సలీం. అక్బర్, మర్యంఉజ్‌ జమానీ (జోధాబాయ్‌) దంపతులకు అజ్మీర్‌లో జన్మించాడు. అక్బర్‌ ఇతడ్ని ముద్దుగా షేక్‌బాబా అని పిలిచేవాడు. జహంగీర్‌ గురువు అబ్దుల్‌-రహీం-ఖానీ-ఖానన్‌. జహంగీర్‌ సోదరులు మురాద్, డానియెల్‌. వీరు అక్బర్‌ కంటే ముందే చనిపోయారు. సలీం తన తండ్రి పాలనాకాలంలోనే తిరుగుబాటు చేశాడు. కానీ అక్బర్‌ అతడ్ని శిక్షించి, అనంతరం బెంగాల్‌ గవర్నర్‌గా నియమించాడు. తండ్రికి, తనకు మధ్య రాజీ కోసం ప్రయత్నించిన అబుల్‌ ఫజల్‌ను జహంగీర్‌ బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో చంపించాడు. క్రీ.శ.1605లో అక్బర్‌ మరణానంతరం జహంగీర్‌ ఆగ్రా కోటలో చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్నాడు. అతడి భార్యలు మన్‌బాయ్‌ (షాబేగం), జగత్‌ గోసైన్, నూర్జహాన్‌. జహంగీర్‌ 1611లో నూర్జహాన్‌ను వివాహం చేసుకున్నాక మొగల్‌ సామ్రాజ్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చక్రవర్తి అయ్యాక జహంగీర్‌ ప్రజా సంక్షేమం కోసం 12 రాజశాసనాలను జారీ చేశాడు. కానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయలేక పోయాడు. ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. జహంగీర్‌ కుమారుడైన ఖుస్రూ 1606లో తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఖుస్రూకి ఆశ్రయం ఇచ్చిన సిక్కు గురువు అర్జున్‌ సింగ్‌ను జహంగీర్‌ చంపించాడు. ఫలితంగా సిక్కులతో మొగలులకు ఘర్షణలు ప్రారంభమయ్యాయి.


రాజ్య విస్తరణ
    జహంగీర్‌ బెంగాల్, మేవాడ్, కాంగ్రా, అహ్మద్‌నగర్‌ లాంటి రాజ్యాలపై దండయాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు. బెంగాల్‌ పాలకుడైన ఉస్మాన్‌ఖాన్‌ (ఆఫ్గన్‌)ను ఓడించి, ఇస్లాంఖాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. అనంతరం ఖాసింఖాన్, ఇబ్రహీం ఖాన్‌లు బెంగాల్‌ గవర్నర్లుగా పనిచేశారు. 
* జహంగీర్‌ సాధించిన విజయాల్లో మేవాడ్‌ను చేజిక్కించుకోవడం అత్యుత్తమమైంది. మేవాడ్‌ (మేవార్‌) పాలకుడైన రాణా అమర్‌సింగ్‌పై 1605, 1608, 1615 సంవత్సరాల్లో దండెత్తి, చివరికి 1615 లో సంధికి ఒప్పించాడు. పంజాబ్‌ పర్వత ప్రాంతాల్లో ఉన్న కాంగ్రా ప్రాంతాన్ని సైతం జయించాడు. 
* చాంద్‌బీబీ మరణానంతరం అహ్మద్‌నగర్‌ను మాలిక్‌అంబర్‌ పాలించేవాడు. జహంగీర్‌ ఈ ప్రాంతంపై అనేకసార్లు దండయాత్ర చేశాడు. సుమారు ఏడుసార్లు మాలిక్‌ అంబర్‌ మొగల్‌ దాడులను తిప్పికొట్టాడు. చివరికి జహంగీర్‌ ఆ ప్రాంతంపై ఆధిపత్యం సాధించి, ‘దక్షిణ సుబా’ను ఏర్పాటు చేశాడు. కానీ జహంగీర్‌ పరిపాలనా కాలమంతా తిరుగుబాట్లతోనే సరిపోయింది. మొదట ఖుస్రూ, అనంతరం జుంటాముఠా, ఖుర్రం, మహబత్‌ఖాన్‌ లాంటివారు తిరుగుబాట్లు చేశారు. ఈ విధమైన అంతఃకలహాల వల్లే మొగలులు 1622 లో కాందహార్‌ను శాశ్వతంగా కోల్పోయారు. నాటి పర్షియా రాజు షా అబ్బాస్‌ కాందహార్‌ను ఆక్రమించాడు. 
* జహంగీర్‌ కాలంలో ఇంకా అనేక ముఖ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1608లో విలియం హాకిన్స్, 1615 లో సర్‌ థామస్‌ రో లాంటి ఆంగ్లేయులు ఈయన ఆస్థానాన్ని సందర్శించారు. జహంగీర్‌ అనుమతితోనే ఆంగ్లేయులు 1616 లో సూరత్‌లో తమ తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు. 
* ఇతడి కాలంలో 1616లో ‘బొబ్బల ప్లేగు’ అనే వ్యాధి వ్యాపించింది. 
* మహబత్‌ఖాన్‌ అనే సేనాని జహంగీర్, నూర్జహాన్‌లను బంధించి, 1625 లో వందరోజుల పాలన చేశాడు. చివరికి 1628 లో ఖుర్రం (షాజహాన్‌) అందరినీ ఓడించి మొగల్‌ చక్రవర్తి అయ్యాడు. దీంతో జహంగీర్‌ పాలన అంతమయ్యింది.
* జహంగీర్‌ గొప్ప విజేత, పరిపాలనాదక్షుడే కాక గొప్ప కళాభిమాని. అనేకమంది కవి పండితులను, కళాకారులను పోషించాడు. ఈయన సూక్ష్మచిత్రలేఖనంలో గొప్ప నిష్ణాతుడు. ఇతడి ఆస్థానంలో బిషన్‌దాస్, మనోహర్‌ గోవర్ధన్‌ లాంటి ప్రసిద్ధ చిత్రకారులు ఉండేవారు. జహంగీర్‌ తుజ్‌కీ-ఇ-జహంగిరీ పేరుతో స్వీయచరిత్రను రాశాడు. తన తండ్రి అక్బర్‌ సమాధిని సికిందర్‌ (ఆగ్రా)లో నిర్మించాడు. కశ్మీర్‌ ఉద్యానవనాలు (షాలిమర్‌ ఉద్యానవనాలు) నిర్మించింది ఇతడే. ఈయన కాలంలో నిర్మించిన ఇతిముద్దౌలా సమాధి, జహంగీర్‌ మహల్‌ (ఆగ్రా) గొప్ప కట్టడాలుగా పేరుగాంచాయి.


నూర్జహాన్‌
    మొగల్‌ సామ్రాజ్యంలో ప్రధానపాత్ర పోషించిన వనిత నూర్జహాన్‌. ఈమె అసలు పేరు మెహరున్నీసా. మొదటి భర్త షేర్‌ అఫ్గాన్‌ ద్వారా లాడ్లీబేగం అనే కుమార్తెకు జన్మనిచ్చింది. నౌరోజ్‌ పండుగలో ఈమెను చూసిన జహంగీర్‌ వివాహం చేసుకోవాలనుకున్నాడు.1611లో అఫ్గాన్‌ మరణించాక వీరి పెళ్లి జరిగింది. మెహరున్నీసాను జహంగీర్‌ నూర్‌మహర్‌ (ఇంటి వెలుగు), నూర్జహాన్‌ (ప్రపంచ వెలుగు) అని ప్రేమగా పిలుచుకునేవాడు. వీరి వివాహం మొగల్‌ సామ్రాజ్యంలో పెను మార్పులకు కారణమైంది. గొప్ప విద్యావంతురాలు, మేధావి అయిన నూర్జహాన్‌కు అధికార దాహం కూడా ఎక్కువే. జహంగీర్‌తో వివాహం అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తన తండ్రి ఘియాస్‌బేగ్‌ను, సోదరుడు అబుల్‌ హసన్‌ (ఆసఫ్‌ఖాన్‌)ను ఉన్నత పదవుల్లో నియమించింది. 
* తన అనుచరులందరితో ‘నూర్జహాన్‌ జుంఠా’ (జుంటాముఠా)ను ఏర్పాటు చేసింది. రాజ్యపాలనలో సర్వాధికారాలు చెలాయించేది. నాణేలపై కూడా నూర్జహాన్‌ తన పేరును ముద్రించుకుంది. తన కుమార్తె లాడ్లీబేగంను జహంగీర్‌ చిన్న కుమారుడు షహ్రియార్‌కిచ్చి వివాహం చేసి, అతడ్ని చక్రవర్తిని చేయాలని ప్రయత్నించింది. ఫలితంగా అప్పటివరకు జుంటాముఠా సభ్యుడిగా ఉన్న జహంగీర్‌ పెద్ద కుమారుడు ఖుర్రం (షాజహాన్‌) తిరుగుబాటు చేశాడు. తన భర్త జహంగీర్‌ సమాధిని లాహోర్‌లో నిర్మించింది. తండ్రి జ్ఞాపకార్థం ఇతిముద్దౌలా పేరుతో సమాధిని కట్టించింది. ఇదే షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌కు నమూనాగా పేరొందింది. 


షాజహాన్‌ (1628-58)
    జహంగీర్‌ పెద్ద కుమారుడు షాజహాన్‌. ఇతడి అసలు పేరు ఖుర్రం. తండ్రి పాలనాకాలంలో ఇతడు అనేక దండయాత్రల్లో పాల్గొన్నాడు. నూర్జహాన్‌ జుంటాముఠాలో సభ్యుడు. నూర్జహాన్‌ తన అల్లుడైన షహ్రియార్‌ను చక్రవర్తిని చేయడానికి ప్రయత్నించడంతో ఖుర్రం తిరుగుబాటు చేశాడు. 1628 నాటికి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. షాజహాన్‌ గొప్ప విజేత, పరిపాలనా దక్షుడు, సారస్వత కళాభిమాని. గొప్ప భవన నిర్మాత. ఇతడి పాలనా కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొంటారు.

 

మొగలుల సాహితీసేవ
    మొగలుల కాలంలో ఆస్థాన చరిత్రలతోపాటు అనువాదానికి కూడా ప్రాధాన్యం లభించింది. అక్బర్‌ మక్తబ్‌ ఖానా పేరుతో అనువాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో హిందీ సాహిత్యం కూడా వికసించింది. తులసీదాస్‌ రచించిన రామ్‌ చరిత్‌ మానస్‌ ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథమైంది. షాజహాన్‌ పెద్ద కుమారుడు దారాషికో హిందూ మహ్మదీయ మతాల సారాన్ని  మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌ పేరుతో గ్రంథస్థం చేయడం విశేషం.

ఫుతూహత్‌-ఎ-ఆలంగీరి: దీన్ని రాసింది ఈసర్‌ దాస్‌ నాగర్‌. ఇతడు ఔరంగజేబ్‌ ప్రతినిధిగా జోధ్‌పూర్‌లో పనిచేశాడు. ఔరంగజేబ్‌ మొదటి 34 ఏళ్ల పాలనా కాలపు విశేషాలు ఉన్న ఈ పుస్తకం ఆ కాలపు మొగల్, రాజపుత్రుల సంబంధాల గురించి ప్రధానంగా సాగింది.

 

నుష్కా-ఎ-దిల్‌కుషా: ఇది కూడా ఔరంగజేబ్‌ చరిత్రను తెలిపే రచనే. భీమ్‌సేన్‌ దీని రచయిత. ఇతడు మొగల్‌ మన్సబ్‌దారు దల్‌పత్‌ రావ్‌ బుందేలా దగ్గర పేష్కారుగా పనిచేశాడు. క్రీ.శ.1700 నుంచి ఔరంగజేబ్‌ సేనలు మహారాష్ట్రలో చేసిన పోరాటాల కథనం ఇందులో ప్రధానం. సమకాలీన అధికారుల అవినీతి, మొగల్‌ సేనల దాడుల వల్ల మరాఠా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘నుష్కాఎదిల్‌ కుషా’లో వెల్లడించాడు. అయితే ఇది కూడా సత్యాన్ని పాక్షికంగానే తెలుపుతుంది. 

 

మాసీర్‌-ఎ-ఆలంగీరి: ఔరంగజేబ్‌ 40 ఏళ్ల పాలనను సంక్షిప్తంగా అందించే ఈ పుస్తకాన్ని రాసింది మహమ్మద్‌ సాకి ముస్తాయిద్‌ ఖాన్‌. ఔరంగజేబ్‌ దండయాత్రలు, అధికారుల నియామకం, బదిలీల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. దీన్ని సర్‌ జదునాథ్‌ సర్కార్‌ ‘‘మొగలుల రాజపత్రం’’గా పేర్కొన్నారు. ఔరంగజేబ్‌ గురించి వివరించే మరో గ్రంథం సుజన్‌ రావ్‌ ఖత్రీ రాసిన ‘ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌’.


అనువాదాలు 

రజ్మ్‌ నామా: అంటే యుద్ధాల పుస్తకం అని అర్థం. ఇది మహాభారతానికి పర్షియా అనువాదం (తర్జుమాఎమహాభారత్‌). అనువాద బృందానికి అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాడు. అనువాదం పూర్తయ్యాక అక్బర్‌ దీనికి చిత్రాలు కూడా గీయించాడు.

* రామాయణాన్ని అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూని, అధర్వణ వేదాన్ని హాజీ ఇబ్రహీం సర్హిందీ, లీలావతిని (గణితశాస్త్ర పుస్తకం) పైజీ, తుజుక్‌ఎబాబరీని అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ పర్షియా భాషలోకి అనువదించారు. ఇవే కాకుండా రాజాస్థానంలో గజళ్లు, ఖసీదాలు తదితర కవితా ప్రక్రియలు వికసించాయి.
అక్బర్‌ కాలంలో హిందీ సాహిత్యం కూడా ఆదరణ పొందింది. అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ దోహాలనే ద్విపదలను రచించాడు. నరహరి అనే పండితుడికి అక్బర్‌ ‘మహాపాత్ర్‌’ అనే బిరుదునిచ్చాడు. ప్రసిద్ధ హిందీ కవులకు ‘కవిరాయ్‌’ అనే బిరుదును ఇచ్చి గౌరవించేవారు. 
* బీర్బల్‌కు (అసలు పేరు మహేశ్‌ దాస్‌) అక్బర్‌ కవి ప్రియ అనే బిరుదు ఇచ్చాడు. రస్‌ఖాన్‌ ‘ప్రేమ్‌ వార్తికా’ అనే హిందీ కావ్యం రచించాడు. ఇది కృష్ణభక్తికి సంబంధించింది. తులసీదాస్‌ విరచిత ‘రామ్‌ చరిత్‌ మానస్‌’ ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘‘వంద మిలియన్ల హిందూస్థాన్‌ ప్రజల పాలిటి బైబిల్‌’’ అని జార్జి గ్రియర్సన్‌ ప్రశంసించాడు.


అమీర్‌ ఖుస్రూ 

కవి, చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడైన అమీర్‌ ఖుస్రూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పటియాలిలో క్రీ.శ.1252లో జన్మించాడు. బాల్బన్‌ మొదలు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ వరకు వివిధ ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు. పర్షియన్, హిందీ, ఉర్దూ భాషల్లో ఖుస్రూ రచనలు సాగాయి. ఈయన ఢిల్లీలోని ప్రసిద్ధ చిష్తీ సాధువు నిజాముద్దీన్‌ ఔలియా శిష్యుడు. అమీర్‌ ఖుస్రూ బిరుదు ‘‘తూతీఎహింద్‌’’  (భారతదేశపు చిలుక). అమీర్‌ ఖుస్రూ రచనా శైలిని ‘సబాక్‌ ఎ హింద్‌’ అంటారు.

* అమీర్‌ఖుస్రూ మొదటి చరిత్ర రచన కిరాన్‌ఉస్‌సాదిన్‌. ఇది మామెలుక్‌ సుల్తాన్‌ కైకుబాద్‌ కాలపు రచన. ఇక ఖజైన్‌ఉల్‌ఫుతూహ్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్, చిత్తోడ్‌గఢ్, మాల్వా, దక్కన్, వరంగల్‌ దండయాత్రలు, భారతదేశం మీదికి జరిగిన మంగోల్‌ దాడుల గురించి వివరించాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రణథంబోర్‌ను ముట్టడించినప్పుడు, అక్కడి రాజపుత్ర స్త్రీల  ‘‘జౌహార్‌’’(మూకుమ్మడిగా చితి పేర్చుకుని మరణించడం) గురించి తెలిపాడు. ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ చరిత్రను వివరిస్తూ ‘‘తుగ్లక్‌ నామా’’ రచించాడు. అమీర్‌ ఖుస్రూ ఇతర రచనలు నూహ్‌ సిపార్, మిఫ్తా ఉల్‌ ఫుతూహ్, దేవలరాణి ఖిజిర్‌ఖానీ. 

సంగీతం విషయానికి వస్తే, అమీర్‌ ఖుస్రూ ఖవ్వాలీ ప్రక్రియను అభివృద్ధి చేశాడు. సితార్, తబలాను ఈయనే మొదటగా తయారు చేశాడని అంటారు. క్రీ.శ.1325లో మరణించిన అమీర్‌ ఖుస్రూను నిజాముద్దీన్‌ ఔలియా దర్గా ప్రాంగణంలోనే ఖననం చేశారు.

 

పద్మావత్‌: మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ ప్రసిద్ధ రచన. జాయసీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని జాయస్‌లో జన్మించాడు. మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ షేర్షా కాలపు కవి. అవధీ మాండలికంలో (హిందీ) ఉన్న ఈ రచన ప్రధానంగా సూఫీ ప్రేమతత్వానికి చెందింది. ఇందులో సుప్రసిద్ధ పద్మావతి (పద్మిని) కథ ఉంది. పద్మావతి చిత్తోడ్‌ రాణా రతన్‌ సింగ్‌ భార్య. ఈమె అందం గురించి తెలుసుకున్న అప్పటి ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ను ముట్టడించాడని చెబుతారు. అయితే చరిత్రకారులు దీన్ని వ్యతిరేకించారు. చిత్తోడ్‌ గుజరాత్‌ వెళ్లే మార్గం మీద ఉండటంతో ఖిల్జీ దండయాత్ర చేశాడనేది చరిత్రకారుల వాదన.


దారాషికో: మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ పెద్ద కొడుకు. సూఫీ మార్మికవాది. ఇతడు హిందూ, ఇస్లాం మతాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. రెండు మతాల సారాన్ని క్రోడీకరిస్తూ ‘‘మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌’’ (రెండు సముద్రాల సంగమం) పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఇంకా కొన్ని ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించి, వాటిని ‘‘సిర్‌ఎఅక్బర్‌’’ పేరుతో సంకలనం చేశాడు. మొగల్‌ సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరులో క్రీ.శ.1659లో ఔరంగజేబ్‌ చేతిలో దారాషికో మరణించాడు.

Posted Date : 09-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌