• facebook
  • whatsapp
  • telegram

షెడ్యూల్డ్‌ కులాలు

తరాల అణచివేతకు సజీవ సాక్ష్యాలు!

  మన దేశంలో అనాదిగా పాతుకుపోయిన కులవ్యవస్థలో కొన్ని వర్గాలు సామాజిక అణచివేతకు గురవుతున్నాయి. అందులో ప్రధాన వర్గం షెడ్యూల్డ్‌ కులాలు. తరాలుగా ఉన్నత వర్గాలు నిర్దేశించిన అహేతుక ఆంక్షలతో వీరికి అనేక ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు దూరమయ్యాయి. సమాజ నిర్మాణం-సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరు అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశంపై అవగాహన పెంచుకోవాలి.

  

షెడ్యూల్‌ కులాలకు చెందిన వారిని ప్రాచీన కాలంలో పంచములు, అస్పృశ్యులు, మ్లేచ్ఛులు, అవర్ణులు అనేవారు. 1931 జనాభా లెక్కల్లో వీరిని అణగారిన వర్గాలుగా పేర్కొన్నారు. 1936లో జాబితాను పునఃసమీక్షించి భారత ప్రభుత్వం కొత్త జాబితాను రూపొందించింది. రాజ్యాంగంలోని 341వ అధికరణను అనుసరించి రాష్ట్రపతి షెడ్యూల్డ్‌ కులాల  (ఎస్సీ) జాబితాను ప్రకటించారు. 20వ శతాబ్దం ప్రారంభకాలంలో గుజరాత్‌లో నర్సింగ్‌ మెహతా అనే సాధువు షెడ్యూల్డ్‌ కులాల వారిని ‘హరిజన్‌’ అనే పదంతో సంబోధించారు. ఆ పదాన్ని మహాత్మా గాంధీ ఉపయోగించండంతో ఎక్కువ జనాదరణ పొందింది. హరిజన్‌ అనే పత్రికను కూడా గాంధీ నడిపారు. 1965 - 75 మధ్య కాలంలో హరిజనులను దళితులు, దళిత పాథర్లని అన్నారు. నాటి నుంచి హరిజన, దళిత పదాలను షెడ్యూల్డ్‌ కులాల వారందరికీ వర్తింపజేస్తున్నారు. 341వ అధికరణను అనుసరించి అస్పృశ్యులుగా పరిగణించిన వారందరినీ ఎస్సీలుగా పేర్కొంటున్నారు. రాష్ట్రపతి ప్రకటించిన జాబితాలో ఏవైనా మార్పులు చేయాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

 

భౌగోళిక విస్తరణ

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్‌ కులాలవారి విస్తరణ ప్రాతిపదికగా మూడు ప్రాంతాలను గుర్తించారు.

 

1) అధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతాలు: ఎ) గంగా - సింధూ నదుల పరీవాహక ప్రాంతాలు బి) తీరప్రాంతం. 

సారవంతమైన భూములు, మంచినీటి సరఫరా, వ్యవసాయానికి తగిన వాతావరణం ఉండటంతో గంగా - సింధూ నదీ పరీవాహక ప్రాంతంలో అధిక జనాభా ఉంటుంది. ఇక్కడ ఎన్నోరకాల పంటలు పండిస్తూ సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రజలు సాగిస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యలో షెడ్యూల్డ్‌ కులాల వారూ ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వారికి ఈ ప్రాంతంలో వ్యవసాయపరంగా సంవత్సరమంతా ఏదో ఒక పని లభిస్తుంటుంది.

2) మధ్యస్థంగా ఎస్సీలు ఉన్న ప్రాంతాలు: దక్షిణ భారత మైదాన ప్రాంతాల్లోనూ ఎస్సీలు నివసిస్తున్నారు. తూర్పున ఒడిశా తీరం నుంచి దక్షిణంగా ఆంధ్ర, తమిళనాడు; పశ్చిమంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో వీరి విస్తరణ ఉంది. ఇక్కడ వ్యవసాయ పనులు సాధారణంగా ఉంటాయి. దాంతో ఎస్సీ జనాభా గంగా - సింధూ నదీ పరీవాహక ప్రాంతంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు అధికంగా నివసిస్తుంటారు. వ్యవసాయ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. దాంతో షెడ్యూల్డ్‌ కులాల జనాభా కూడా ఇక్కడ మధ్యస్థంగా విస్తరించింది. 

3) అతి స్వల్ప ఎస్సీ జనాభా ఉన్న ప్రాంతాలు: షెడ్యూల్డ్‌ కులాలవారు మధ్య వింధ్య, చోటానాగపుర్‌ ప్రాంతాల్లో తక్కువగా ఉంటున్నారు. రాజస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వతారణ్యాలు, కర్ణాటక, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో కొద్దిసంఖ్యలో కనిపిస్తారు.

 

వివిధ కులాలు

  భారతదేశంలోని ఎస్సీలను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. చమార్లు, భంగీ, నామశూద్ర, మాలి, దుసాద్, కోలి, మహార్, పాసి, ఆది ద్రవిడ, ఆది కర్ణాటక, మాదిగ, మాల లాంటి పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎస్సీల జాబితా ఉంటుంది. దేశంలో 1208 షెడ్యూల్డ్‌ కులాలు ఉన్నాయి. కర్ణాటకలో (101 కులాలు) అధికంగా, దాద్రానగర్‌ హవేలీలో (4 కులాలు) తక్కువగా ఉన్నాయి 


 

షెడ్యూల్డ్‌ కులాల జనాభా

  2011లో షెడ్యూల్డ్‌ కులాల జనాభా 20.14 కోట్లు. దేశ జనాభాలో వీరు 16.6 శాతంగా ఉన్నారు. 1961లో ఉన్న జనాభా కంటే ఇది సుమారు మూడు రెట్లు ఎక్కువ. సాధారణ జనాభాలో షెడ్యూల్డ్‌ కులాల నిష్పత్తి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో 31.9%, హిమాచల్‌ప్రదేశ్‌లో 25.2%, పశ్చిమ బెంగాల్‌లో 23.5%గా ఉంది. షెడ్యూల్డ్‌ కులాల మొత్తం జనాభాలో 84% గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, కౌలుదార్లు, ఉపాంత రైతులుగా ఉన్నారు.

 

జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ జనాభా వివరాలు

 

రకరకాల అశక్తతలు

షెడ్యూల్డ్‌ కులాల ప్రజలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక రకాల అశక్తతలకు (వెనుకబాటుతనాలకు) గురవుతున్నారు. స్థూలంగా వాటిని అయిదు రకాలుగా వర్గీకరించారు.

* సామాజిక అశక్తతలు

* విద్యాపరమైన అశక్తతలు

* ఆర్థిక అశక్తతలు

* రాజకీయ అశక్తతలు

* మతపరమైన అశక్తతలు

 

సామాజిక అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారిని అస్పృశ్యులుగా భావించడంతో కులశ్రేణిలో అట్టడుగు వర్గంగా చేర్చారు. దాంతో వారిని తాకితే మైలపడిపోతామనే అపోహలతో సామాజికంగా వేరుచేశారు. ఉన్నత, షెడ్యూల్డ్‌ కులాల వారి మధ్య ఎంతదూరం ఉండాలనే విషయాన్నీ కులవ్యవస్థ నిర్ణయించేది. తిరువనంతపురంలో ఉన్నత కులాల వారి నుంచి  ఎస్సీలు దాదాపు 40 - 80 అడుగుల దూరంలో ఉండాలనే నియమం ఉండేది. ఇంకా అనేక రకాల ఆంక్షలు విధించేవారు. షెడ్యూల్డ్‌ కులాల వారు గుర్రపు స్వారీ చేయకూడదు. విలువైన దుస్తులు ధరించకూడదు. గొడుగు వాడకూడదు. నవదంపతులు పల్లకిలో ఊరేగకూడదు. వారు తాకితే నీరు మైలపడుతుందంటూ ఊరి బావి నుంచి నీటిని తోడకూడదనే ఆంక్షలు అమలు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో వీరు బావి వరకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ అందరికీ ఉపయోగపడే గుంటలు, జలాశయాలను మాత్రం ఉపయోగించుకునే  వీలు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎస్సీలు బ్రిటిష్‌ పాలనలో క్రైస్తవ మతాన్ని, స్వాతంత్య్రానంతరం బౌద్ధమతాన్ని స్వీకరించారు. దాంతో వారికి సమాజంలో కొంతమేరకు గౌరవం లభించడం మొదలైంది.

 

విద్యాపరమైన అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారికి విద్య లేకపోవడం మరొక అశక్తత. కులవ్యవస్థ నియమాలను అనుసరించి వారికి విద్య లేకుండా చేశారు. షెడ్యూల్డ్‌ కులాల వారి పిల్లలు పాఠశాలలో చేరితే ఉన్నత కులాలకు చెందిన పిల్లలు ఆ పాఠశాలలో చేరేవారు కాదు.

ఉదా: తమిళనాడులో పరయ కులానికి చెందిన పిల్లలను, మహారాష్ట్రలో మహర్‌ కులానికి చెందిన పిల్లలను పాఠశాలలోకి రానిచ్చేవారు కాదు. పర్యవసానంగా వారు  నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు

 

ఆర్థిక అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారు సాంఘిక, విద్యాపరమైన అశక్తతలకే కాకుండా ఆర్థిక అశక్తతలకు కూడా లోనయ్యారు. వారు అశూచి వృత్తిని చేపట్టారు. వీరు కొన్ని చోట్ల చెత్తా చెదారం తీసివేసే కార్మికులుగా, మరికొన్ని చోట్ల మానవ మలాన్ని తీసే శ్రామికులుగా, పశువుల మృత కళేబరాలను తీసే వారిగా ఉంటూ వృత్తిపరంగా తక్కువ స్థాయిలో ఉండిపోయారు. దక్షిణ భారతదేశంలో షెడ్యూల్డ్‌ కులాల వారు భూమిని అమ్మాలనుకుంటే దాన్ని ఉన్నత కులాల వారికి మాత్రమే అమ్మాలని, అది కూడా తక్కువ ధరకే ఇవ్వాలని అలా చేయకపోతే వారి పంటలకు నీటి వసతి లేకుండా చేసేవారు. 


రాజకీయ అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారు అనేక రాజకీయ అశక్తతలకూ గురయ్యారు. గ్రామంలో లేదా బస్తీలో లేదా నగరాల్లోని పాలక వర్గాల్లో వారికి సభ్యత్వం ఉండేది కాదు. అందువల్ల సామాజిక, రాజకీయ కార్యకలపాల్లో భాగస్వాములు కాలేకపోయేవారు. పరిపాలనలోనూ ఎస్సీలకు స్థానం లభించేదికాదు. ఆంగ్లేయుల పాలనలో ఓటు హక్కు కల్పించినప్పటికీ దాన్ని వారు ఎప్పుడూ సద్వినియోగం చేసుకోలేకపోయారు.ఆ విధంగా దేశ రాజకీయాల్లో పాలుపంచుకునే అవకాశం లేకుండా పోయింది

 

మతపరమైన అశక్తతలు: ఎస్సీలు మతపరమైన వివక్షలకు గురయ్యారు. వారికి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. శ్మశాన వాటికలు, స్నాన వాటికలను ఉపయోగించకూడదనే నియమం ఉండేది. వేదాలు, పురాణాలు లాంటి ధార్మిక గ్రంథాలను చదవకూడదనే ఆంక్షలు పెట్టేవారు. 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 తెలంగాణ సామాజిక పరిస్థితులు

  భారతీయ సమాజం

 బంధుత్వం - అనుబంధం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌