• facebook
  • whatsapp
  • telegram

గిరిజనులు

అసలైన భారతీయులు!

  అనాది కాలం నుంచి అడవులు, కొండ ప్రాంతాల్లోనే నివాసం. వేట లేదా వ్యవసాయం ప్రధాన జీవన విధానం. నాగరిక సమాజానికి పూర్తిగా దూరం. సొంత సంప్రదాయాలు, మత విశ్వాసాలు, బలమైన బంధుత్వాలతో సాగుతున్న సనాతన సహజీవనం. ప్రకృతి అంటే అపారమైన ప్రేమ.  జంతువులపై అంతులేని ఆరాధన. అదే అమాయకులైన అడవి బిడ్డల చారిత్రక బతుకు చిత్రం. వారి సంస్కృతి సామాజికం, సహజసిద్ధం, స్థానికం, పరిణామ క్రమాల ఫలితం. అందుకే ఆ ఆదివాసీలు అసలైన భారతీయులు.

 

  భారత రాజ్యాంగం గిరిజనుల్లోని అన్ని తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా నిర్వచించలేదు. రాజ్యాంగంలోని 342, 366(25) ఆర్టికల్స్‌ షెడ్యూల్డ్‌ తెగలుగా ఎవరిని గుర్తించాలో పేర్కొన్నాయి. ఆర్టికల్‌ 342 ప్రకారం షెడ్యూల్డ్‌ తెగలు లేదా గిరిజనులు అంటే గిరిజనుల్లోని కొన్ని తెగలు, కొన్ని వర్గాలు లేదా అన్నివర్గాలు/అన్ని తెగలు అని రాష్ట్రపతి ప్రకటించారు.

  నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉన్నవారిని గిరిజనులు/తెగలు అంటారు. ట్రైబ్‌ అనే పదం ట్రైబస్‌ అనే రోమన్‌ పదం నుంచి వచ్చింది. గిరి అంటే కొండ. కాబట్టి కొండ ప్రాంతాల్లో నివసించే వారిని గిరిజనులుగా (ఆదివాసీలు) పిలుస్తారు. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవనవిధానంపై పరిశోధనలు చేసినవారు లూయిస్‌ హెన్రీ మోర్గాన్‌. ఈయన గ్రంథం ‘ది ఏన్షియంట్‌ సొసైటీ’. భారతదేశంలో గిరిజనుల జీవనవిధానంపై పరిశోధనలు చేసినవారు వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథం ‘ట్రైబ్స్‌ ఇన్‌ ఇండియా’.

 

భారత్‌లో ఇవీ లెక్కలు: * 1991 రాయ్‌బర్మన్‌ కమిషన్‌ ప్రకారం దేశంలో మొత్తం గిరిజన తెగల సంఖ్య 427. వారి జనాభా 6.776 కోట్లు (8.08%).

* 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజన తెగలు 573. వారి జనాభా 10.43 కోట్లు (8.6%). ఇందులో పురుషులు 5.24 కోట్లు, స్త్రీలు 5.19 కోట్లు.

 

తెగ లక్షణాలు

* భౌగోళికంగా దూరంగా, ఒంటరిగా జీవనం

* మిగతా సమాజంతో కలవడానికి బిడియం, సంకోచం

* ఆర్థిక వెనుకబాటుతనం

* అనాగరికులుగా ఉండటం

* బలమైన బంధుత్వాలు

* తెగల్లో రాజకీయ పరిషత్‌లు, పంచాయతీలు వంటి అనేక రాజకీయ విభాగాలు ఉండటం. వాటి నిర్ణయాలకు వారు కట్టుబడటం.

* అంతర్‌ వివాహం-ఒక తెగవారు ఆ తెగలోని వారినే వివాహం చేసుకోవడం.

* ప్రతి తెగకు ప్రత్యేకమైన సంస్కృతి

* ఒక ప్రాంతంలోని గిరిజనులంతా ఒకే రకమైన వృత్తిలో ఉండటం.

ఉదా: అడవుల పెంపకం, పోడు వ్యవసాయం, ఆహార సేకరణ, స్థిర, మారక వ్యవసాయం.

 

* ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రత్యేక సంస్కృతి, ఒకే పేరు, ఒకే భాష, అంతర్‌ వివాహం, సమష్టి ఆంక్షలు, ఆర్థిక స్వయంసమృద్ధి, విశిష్ట సామాజిక, రాజకీయ వ్యవస్థలు కలిగి ఉండటం తెగల ముఖ్య లక్షణం.

 

2011 జనాభా లెక్కల ప్రకారం..

* ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌ (14.7%), తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం (0.2%). కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీ జనాభా అధికంగా దాద్రానగర్‌ హవేలీ (1,78,564), తక్కువగా డామన్‌ డయ్యూలో (15,363) ఉంది.

* ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం (94.4%), తక్కువగా ఉన్న రాష్ట్రం గోవా (0.14%). కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీ జనాభా శాతం అధికంగా లక్షదీవులు (94.5%), తక్కువగా అండమాన్‌ దీవుల్లో (8.3%) ఉంది.

* ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు పంజాబ్, హరియాణా. కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ, పుదుచ్చేరి, ఛండీగఢ్‌ల్లో ఎస్టీలు లేరు. దేశంలో అధికంగా ఉన్న గిరిజన తెగ భిల్లులు (52 లక్షల మంది). వీరు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నారు. సంతాల్‌ తెగ (36 లక్షల మంది) పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో ఉంది. గిరిజన తెగలు ఎక్కువ శాతం సిర్‌చిఫ్‌ (మేఘాలయ 98.1%) జిల్లాలో ఉండగా తక్కువగా హాథ్రస్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) జిల్లాలో ఉన్నారు.

 

తెలంగాణలో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల జనాభా 59,18,073 (5.7%). తెలంగాణలో మొత్తం గిరిజన తెగల సంఖ్య 32, గిరిజన జనాభా 32.87 లక్షలు (9.3%). అధికంగా ఉన్న గిరిజన తెగలు లంబాడీలు (20,46,117), కోయ (4,86,391). జనాభా, శాతం పరంగా అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం ఖమ్మం.

 

ఆదిమ గిరిజన తెగలు

గిరిజనుల్లో మరింత వెనుకబడి, నాగరికతకు దూరంగా ఉన్న వర్గాలను ఆదిమ గిరిజనులు అంటారు. వీరిని ప్రస్తుతం పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌  (పీవీటీజీ) అని పిలుస్తారు. ప్రస్తుతం 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (అండమాన్‌-నికోబార్‌ దీవులు)లో ఇలాంటి 75 తెగలు ఉన్నట్లు గుర్తించారు. 1961లో ‘ధేబార్‌ కమిషన్‌’ పీవీటీజీలను అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించింది. వారి అభివృద్ధి, సంరక్షణకు సిఫార్సులు చేసింది. వాటిని అనుసరించి 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి వంద శాతం కేంద్ర నిధులతో, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పథకాలను ప్రారంభించారు.

 

లక్షణాలు: * ఏకరూప సముదాయం * స్వల్ప జనాభా *భౌగోళిక ఏకాంతం * మార్పులను ఇష్టపడకపోవడం * సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం * ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉండటం* ఆర్థిక వెనుకబాటుతనం

 

భౌగోళిక విస్తరణ 

బి.ఎస్‌.గుహ అనే మానవ శాస్త్రవేత్త తెగలను మూడు మండలాలుగా విభజించారు. అవి: ఉత్తర-ఈశాన్య మండలం, కేంద్ర/మధ్యమండలం, దక్షిణ మండలం.

 

ఉత్తర-ఈశాన్య మండలం: తూర్పు కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ (ఉత్తర ప్రాంతం), సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలు, అసోం ఈ మండలంలో ఉన్నాయి. దేశ గిరిజన జనాభాలో 11% ఇక్కడ నివసిస్తున్నారు. 

ఉదా: ఆకా, దఫ్లా, కుకి, మిజోలు, నాగా, గారో, జయంతియా, ఖాసీ, బోటియా, లుసాయి 

 

కేంద్ర/మధ్య మండలం: మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలు ఈ మండలంలో ఉన్నాయి.

ఉదా: సంతాల్‌లు, భిల్లులు, గోండులు, గదవా, కలియా

 

దక్షిణ మండలం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ మండలంలో ఉన్నాయి.

ఉదా: సవర, చెంచు, కోలం, కొండరెడ్లు, తోడా, కదర్, కోయ

 

జాతిపరమైన వర్గీకరణ

భాష, మతం, జీవన విధానాలు, పోలికలు, జాతిపర లక్షణాలను బట్టి 1981లో రిస్లీ మొదటిసారిగా తెగలను శాస్త్రీయంగా వర్గీకరించారు.

 

రిస్లీ ప్రకారం:

 

ద్రావిడ జాతి వర్గం: శారీరకంగా పొట్టితనం, పొడవైన తల, వెడల్పుగా నొక్కినట్లు ఉండే ముక్కు, నల్లటి కళ్లు, నల్లటి శరీర రంగు, తలపై దట్టమైన ఉంగరాల జుట్టు ఈ జాతివారిలో కనిపిస్తాయి. ఉదా: చోటానాగపూర్‌

 

మంగోలి జాతి వర్గం: విశాలమైన శిరస్సు, చదునుగా చక్కగా ఉండే ముక్కు, పొట్టితనం, శరీరం మీద రోమాలు తక్కువగా ఉండటం ఈ జాతి ప్రజల లక్షణాలు. ఉదా: హిమాలయ ప్రాంతం, ఉత్తర ఈశాన్య ప్రాంతం

 

రుగ్గిరీ అభిప్రాయం:

భారత ప్రజలు ఆరు రకాలుగా ఉన్నారని రుగ్గిరీ అభిప్రాయపడ్డారు. అందులో గిరిజన తెగలు మూడు రకాలని పేర్కొన్నారు.  

 

నిగ్రిటోలు: పొట్టిగా ఉండటం, ఎత్తయిన శిరస్సు, పొడవైన నుదురు, దళసరి పెదవులు, శరీరంపై తక్కువ వెంట్రుకలు వీరిలో ఉంటాయి.

ఉదా: అండమాన్‌ నికోబార్‌లోని తెగలు, కేరళ, కర్ణాటకలోని కడర్‌ తెగ

 

తొలి ద్రావిడ జాతి వర్గం: పొట్టిగా ఉండటం, పొడవైన తల, తేనె రంగు పోలిన శరీరం, గోధుమ రంగు కళ్లు ఈ జాతివారిలో ఉంటాయి.  

ఉదా: భిల్లు, చెంచు, సంతాల్, ముండా

 

ఎత్తుగా ఉండి పొడవైన తల ఉన్నవారు: పొడవైన శరీరం, తల; ఒత్తు జుట్టు, పలుచటి నుంచి మధ్యరకంగా ఉండే పెదవులు, చక్కటి అంగ సౌష్ఠవం.

ఉదా: తోడా తెగ (నీలగిరి కొండలు - తమిళనాడు)

 

హైడెన్‌ వివరణ:

భారతదేశ ప్రజలను హైడెన్‌ మూడు రకాలుగా విభజించారు. 

1) హిమాలయ ప్రాంతం 

2) ఉత్తర మైదాన ప్రాంతం (ప్రస్తుతం పాకిస్థాన్‌)

3) దక్కన్‌ ప్రాంతం 

ఈ మూడు ప్రాంతాల్లోని ప్రజలను తిరిగి వివిధ రకాలైన జాతులుగా విభజించారు.

* దక్కన్‌ ప్రాంతంలోని నీగ్రిటో జాతి 

* దక్కన్‌ ప్రాంతంలోని తొలి ద్రావిడ జాతి 

* హిమాలయ ప్రాంతంలోని మంగోలాయిడ్‌ జాతి.

 

భాషా ప్రాతిపదిక 

ద్రావిడ భాషా కుటుంబం: ఇందులో గోండులు, కోయలు, తోడాలు, పలయాలు, చెంచులు, కావర్లు, ఇరులాలు లాంటి తెగలవారు ఉంటారు.

 

ఆస్ట్రిక్‌ భాషా కుటుంబం: వీరిని ముండా భాషా కుటుంబం అని కూడా అంటారు. సంతాల్, ముండారి, హో, ఖాలియా, బూంజీ తెగలు ఉంటాయి.

 

టిబెట్‌-చైనీస్‌ కుటుంబం: మంగోల్‌ తెగలు ఈ భాష మాట్లాడుతున్నారు. ఈశాన్య భారతంలోని తెగలు ఈ కుటుంబానికి చెందుతాయి.

 

గిరిజన మతాలు - సిద్ధాంతాలు

 

సర్వాత్మవాదం (Animism): ఎడ్వర్డ్‌ టేలర్‌ అనే రచయిత ప్రకారం సర్వాత్మ వాదం మానవుల ప్రాథమిక మతం. దీని ప్రకారం కనిపించని అంతర్గత శక్తి ఏదో ఉంది. అదే మనిషిని నడిపిస్తోంది. దాని ప్రకారం ఆత్మలు రెండు రకాలు. 

 

1) స్వేచ్ఛా ఆత్మ: ఇది శాశ్వతమైంది, చావు లేనిది. 

 

2) శరీర ఆత్మ: స్వేచ్ఛా ఆత్మ ఏదైనా శరీరంలో ఉంటే దానిని శరీర ఆత్మ అంటారు.

ఉదా: నీలగిరి కొండల్లోని కోటాలు, అరెడాలు, బిహార్‌లోని హూలులు ఆత్మలున్నాయని నమ్ముతారు.


జీవాత్మవాదం (Anamatism): దీన్ని బొంగాయిజం, మానయిజం అని కూడా అంటారు. రాబర్ట్‌ రునాల్ఫ్‌ మారెట్‌ అనే మానవ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మజుందార్‌ ఈ సిద్ధాంతానికి మద్దతు తెలిపాడు. మానవుడికి అంతుపట్టని అతీêœ శక్తులున్నాయని వీరి నమ్మకం. ఈ శక్తి తీవ్రత మనిషిని బట్టి మారుతుందని చెబుతారు. ఆ శక్తినే ‘మాన’ అని పిలుస్తారు. ఇది ప్రతి జీవిలోనూ ఉంటుందని, అది శక్తికి, బలానికి, విజయానికి కారణం అవుతుందని నమ్ముతారు. మారెట్‌ ఈ నమ్మకాన్ని మానవవాదం అన్నారు. బిహార్‌లోని హూలులు నమ్మే శక్తిని బొంగావాదంగా మజుందార్‌ పేర్కొన్నారు.

 

ప్రాకృతికవాదం: దీనిని మాక్స్‌ముల్లర్‌ (జర్మన్‌) ప్రతిపాదించాడు. ప్రకృతిలోని అన్నింటినీ ఆరాధించడం నుంచి మతం ఉద్భవించిందని భావిస్తారు. ప్రకృతిలో జరిగే ప్రతి విషయం అర్థం కాకపోవడంతో భయపడి పూజించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ మతవాదం ఏర్పడిందని భావిస్తారు.

ఉదా: గోండులు చెట్లను పూజిస్తారు. పెద్దపులిని దైవంగా నమ్ముతారు. భిల్లులు నీరు, అడవులు, కొండలను దైవంగా పూజిస్తారు.

 

టోటెమిజమ్‌: దీనిని ఎమైలీ దుర్క్‌హైమ్‌ ప్రతిపాదించారు. ఆదిమ జాతులు తమ జాతి ఏదో ఒక చెట్టు లేదా జంతువు నుంచి ఆవిర్భవించినట్లు భావిస్తారు. ఆదిమ తెగల్లో ప్రతి గిరిజన తెగకు ఒక్కో పవిత్ర చిహ్నం ఉంటుంది. అది చెట్టు లేదా జంతువు కావచ్చు. ఇలాంటి విశ్వాసాన్ని టోటెమిజమ్‌ అంటారు.

 

ప్రకార్యవాదం (Functionalism): దీన్ని మలినోస్కీ ప్రతిపాదించారు. సమాజంలోని సంస్కృతి ద్వారానే ఈ వాదం ఏర్పడిందని పేర్కొన్నారు.

* రాష్ట్రంలో 47% గిరిజనులు మాత్రమే వారి భాషలో మాట్లాడుతున్నారు. మిగిలినవారు ఇరుగుపొరుగున ఉన్న భాషల్లో మాట్లాడుతున్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో భారత ప్రభుత్వం గుర్తించిన కొన్ని తెగలు: బోడోగబడ, చెంచులు, బోండోపురోజ, కోలమ్, డోంగ్రియా గోండులు, గౌతుబ్‌గబడ, కొండ సవర్లు, కుటియా కోండ్‌లు, తోటి, పారనింగి పురోజ, కోండ్‌ పురోజ. వీరు సాధారణ జనజీవనానికి దూరంగా, నిరక్షరాస్యులుగా నివసిస్తున్నారు. 

 

ముఖ్యాంశాలు

* గిరిజనుల జీవితాల్లో సంబంధాలన్నీ బంధుత్వంపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నవారు డి.జి.మాండెల్‌బామ్‌ (1972).

* గోండుల వితంతు వివాహాన్ని పాట్‌ అంటారు. పాదికత అంటే విడాకులు అని అర్థం.

* తెలుగులో ఎరుక అంటే ‘భవిష్యత్‌ చెప్పడం’ అని అర్థం. ఎరుకల వారు అన్నను బేరెన్న, అక్కను బేరెక్క, చెల్లిని తపిసి అంటారు. వీరిలో అంతర్‌ వివాహ పద్ధతి అమల్లో ఉంది.

* సవర భాషకు లిపిని రూపొందించినవారు గిడుగు రామ్మూర్తి పంతులు.

* కొండరెడ్లు మూడు రకాలు. వారు పాండవ రెడ్లు, రాజారెడ్లు, వంశరెడ్లు.

* భారత్‌లో నిజమైన ఆదిమజాతి తెగ ‘రెడ్లు’ అని పేర్కొన్నవారు జె.పి.విల్స్‌.

* చెంచుల ఇలవేల్పు అయిన శ్రీశైలం మల్లికార్జునస్వామి, అహోబిలం లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలు వందల ఏళ్లుగా చెంచుల సంరక్షణలోనే ఉండేవి. వీరు వాటిని తమ వారసత్వ సంపదగా భావిస్తారు.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

Posted Date : 19-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌