ఫలించని ఫార్ములాలు!
ముల్కీ నిబంధనలను పక్కన పెట్టడంతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు మొదట 8 సూత్రాలు, ఆ తర్వాత తలెత్తిన జై ఆంధ్ర పోరాటాన్ని నిలువరించేందుకు మరో 5 సూత్రాలు, చివరి ప్రయత్నంగా ఇంకో 6 సూత్రాలను ప్రతిపాదించినా తెలుగు ప్రాంతాల్లో సయోధ్య సాధ్యం కాలేదు. చెలరేగిన ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. ఈ దశలో కేంద్రం చేపట్టిన చర్యలు ఉద్యమాలను చల్లార్చకపోగా మరింత ఎగసేలా చేశాయి. ఈ పరిణామ క్రమాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.
జై తెలంగాణ ఉద్యమ కాలం (1969)లో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు నాటి ప్రభుత్వం నేర నివారక నిర్బంధ చట్టాన్ని విచక్షణారహితంగా వినియోగించి అనేక మందిని అకారణంగా నిర్బంధించింది. ఈ ఉద్యమం కారణంగా పలు చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనల్లో పెద్దమొత్తంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం 1969 ఏప్రిల్ 10, 11 తేదీల్లో భారత జాతీయ కాంగ్రెస్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇరు ప్రాంతాల నేతలతో చర్చించారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 11న 8 సూత్రాల పథకాన్ని లోక్సభలో ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల ఉద్యోగ అవకాశాలకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవడమే ఈ అష్టసూత్రాల పథకం ప్రధాన లక్ష్యం.
అష్ట సూత్రాల పథకం
1) తెలంగాణ మిగులు నిధుల తరలింపు అంచనాల కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించడం. దీని ప్రకారం జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేశారు.
2) తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలో కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్ర ప్రణాళికా సంఘం ప్రతినిధులతో చర్చించడం. గత 12 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు నిధులను సమీకరించడం.
3) తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేయడం. ఇందులో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు సభ్యులుగా ఉంటారు.
4) ప్రణాళికా సంఘం పర్యవేక్షణలో తెలంగాణలో ప్రణాళికా పథకాలను అమలుచేయడానికి ఒక ఉపకమిటీని నియమించడం.
5) తెలంగాణ ప్రాంతంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రాంతీయ సంఘానికి అధికారం కల్పించడం.
6) ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన (అపాయింట్మెంట్, సీనియారిటీ, ప్రమోషన్స్) రాజ్యాంగ రక్షణలను న్యాయ నిపుణుల ద్వారా పరిశీలించడం.
7) తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిశీలన కోసం ఒక ఉన్నత కేంద్ర సలహా మండలిని ఏర్పాటుచేయడం.
8) ప్రధానమంత్రి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పై అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.
ఈ ఎనిమిది సూత్రాల పథకంలో ప్రత్యేకించి తెలంగాణ రక్షణలు లేకపోవడంతో తెలంగాణ ఉద్యమ నేతలు, ప్రజలు దీన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ పథకంలో పేర్కొన్న కమిటీలన్నీ కాలయాపన చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చేందుకు కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన కుట్రగా ఉద్యమ నేతలు విమర్శించారు.
జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ
అష్టసూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం 1969, ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ఠ భార్గవ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమించింది. తెలంగాణ మిగులు నిధులను అంచనావేయడానికి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం ఉల్లంఘనలను పరిశీలిండానికి ఈ కమిటీ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
* 1956 పెద్ద మనుషుల ఒప్పందం.
* 1959లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం.
* 1969, జనవరి 19వ తేదీ నాటి అఖిలపక్ష సమావేశంలో జరిగిన ఒప్పందం.
ఈ కమిటీ రూ.28.34 కోట్ల తెలంగాణ మిగులు నిధులను ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి వినియోగించినట్లుగా నిర్ధారించింది. ఈ మొత్తం నిధులను ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే, ఆంధ్రా ప్రాంతంలా తెలంగాణ కూడా అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడింది. అయితే ఈ కమిటీ నివేదికను తెలంగాణ ఉద్యమ నాయకులతో పాటు ప్రాంతీయ కమిటీ వ్యతిరేకించింది.
ప్రధానమంత్రి అష్టసూత్రాల పథకాన్ని వ్యతిరేకించిన తెలంగాణ నాయకులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. విద్యాసంస్థలను నిరవధికంగా మూసివేశారు. బంద్లు, లాఠీఛార్జీలు, పోలీసు కాల్పులు తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి. ఉద్యమ కాలంలో పోలీసు నిర్బంధాలు తీవ్రమవడంతో విద్యాసంస్థలనే జైళ్లుగా మార్చారు. తెలంగాణ ఎన్జీఓలు, ఉపాధ్యాయులు కలిసి ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటుచేసి 37 రోజుల పాటు సార్వత్రిక నిరవధిక సమ్మె చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రత క్రమంగా తగ్గడంతో 1969 సెప్టెంబరులో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి.
తెలంగాణ ఉద్యమం ఉద్ధృతి క్రమంగా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత 1972, అక్టోబరు 3న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని ప్రకటించింది. దీంతో 1972, అక్టోబరు 18న జై ఆంధ్రా ఉద్యమం ప్రారంభమై అనతికాలంలోనే తీవ్రరూపం దాల్చింది. జై ఆంధ్రా ఉద్యమ నేతలు తెలంగాణకు కల్పించిన రక్షణలన్నింటినీ రద్దు చేసి ఆంక్షలు లేని సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటులో కూడా ఇరు ప్రాంతాల నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ ఇరుప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలని పార్టీ నేతలతో, కేబినెట్లో చర్చించి 1972, నవంబరు 27న పంచసూత్రాల పథకాన్ని లోక్సభలో ప్రకటించారు.
పంచసూత్రాల ఫార్ములా
1) తెలంగాణ ప్రాంతంలో నాన్గెజిటెడ్ ఉద్యోగాలు, తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జూనియర్ ఇంజినీర్లకు కూడా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర ఉమ్మడి సంస్థల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకంలో ప్రతి మూడింటిలో రెండో ఉద్యోగానికి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి.
2) ఈ రక్షణలు తెలంగాణ ప్రాంతంలో 1980, డిసెంబరు 31 వరకు, జంట నగరాల్లో 1977, డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత రద్దవుతాయి. రాష్ట్ర రాజధాని జంట నగరాల్లో ఉన్న కారణంగా ఈ తేడా కల్పించారు.
3) ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతులకు తగిన అవకాశాలు కల్పించడానికి వీలుగా సర్వీస్ క్యాడర్స్కు సంబంధించి ప్రథమ లేదా ద్వితీయ గెజిటెడ్ స్థాయి వరకు స్థానికం చేశారు.
4) జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక, వృత్తి విద్యలతో పాటు ఇతర అన్ని విద్యాసంస్థల్లో సౌకర్యాలకు ఎలాంటి విఘాతం ఉండదు. అంతేకాకుండా ఈ సౌకర్యాలు క్రమంగా విస్తృతమవుతాయి.
5) హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ఉమ్మడి పోలీసు వ్యవస్థ ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రూపొందిస్తారు.
పైన తెలిపిన నిర్ణయాల అమలుకు అవసరమైన బిల్లును త్వరలో ప్రవేశపెడతామని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ లోక్సభలో 1972, నవంబరు 27న ప్రకటించారు.
ప్రభావం: ఈ పథకం ఇరు ప్రాంత ప్రజలను సంతృప్తి పరచకపోగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ఉద్ధృతికి దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పథకం జై ఆంధ్రా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ నాయకులు కూడా ఈ పంచసూత్ర పథకాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దీన్ని ‘తెలంగాణ రక్షణలకు గొడ్డలిపెట్టు’ అని విమర్శించారు. ఈ పంచసూత్ర పథకంలోని తెలంగాణ రక్షణలు తెలంగాణ ప్రాంతంలో 1980 వరకు, హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లో 1977 వరకే కొనసాగడం తెలంగాణకు తీవ్ర నష్టదాయకమన్నారు.
ఈ విధంగా జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రకటించిన అష్టసూత్రాల పథకం, జై ఆంధ్రా ఉద్యమ కాలంలో ప్రకటించిన పంచసూత్రాల పథకం రెండూ ఫలించలేదు. కానీ ఆ తర్వాత 1973, సెప్టెంబరు 21న ప్రకటించిన ఆరు సూత్రాల పథకం ఆంధ్రా ప్రాంత ప్రజలకు మోదాన్ని కలిగించగా తెలంగాణ ప్రజలకు ఖేదాన్ని మిగిల్చింది. దీని ద్వారా తెలంగాణ రక్షణలన్నీ రద్దయ్యాయి.
రచయిత: ఎ.ఎం.రెడ్డి
మరిన్ని అంశాలు ... మీ కోసం!
‣ భారతదేశంలో హైదరాబాద్ విలీనం (1948)