• facebook
  • whatsapp
  • telegram

జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (జీఎస్ఎల్వీ)

అంతరిక్షంలో పైచేయి సాధించడానికి ప్రపంచ అగ్ర దేశాలన్నీ పోటీ పడుతుంటాయి. ఈ పోటీలో సత్తా చాటుతున్న భారతదేశం అప్రతిహత విజయాలను సాధిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ చంద్రుడిపైకి, ఇతర గ్రహాల కక్ష్యల్లోకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాలను పంపిస్తూ అక్కడి స్థితిగతులపై అపూర్వ విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతోంది. ఇస్రో రూపొందించిన ఉపగ్రహాలు, వాహకనౌకలు - సాధించిన విజయాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

» అంతరిక్షంలో విజయాలు

» జీఎస్ఎల్వీ ప్రయోగాలు

» పీఎస్ఎల్వీతో చంద్రయాన్

» మంగళయాన్‌తో ప్రపంచఖ్యాతి

 

జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (జీఎస్ఎల్వీ)

జీఎస్ఎల్వీ అనేది ఒక అంతరిక్ష వాహక నౌక. 49 మీటర్ల పొడవు, 416 టన్నుల బరువు ఉంటుంది. 2 టన్నులకు పైగా బరువుండే ఇన్‌శాట్, జీశాట్ ఉపగ్రహాలను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(జీటీవో)లోకి ప్రవేశపెట్టేందుకు ఈ అంతరిక్ష వాహకనౌకను వాడుతున్నారు. జీఎస్ఎల్వీలో 3 దశల్లో ఇంధనం ఉంటుంది. మొదటిదశలో ఘన ఇంధనం, దీనికి అదనంగా 4 లిక్విడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి. రెండోదశలో ద్రవ ఇంధనం, మూడోదశలో క్రయోజినిక్ ఇంజిన్ ఉంటాయి. మూడో దశ చాలా కీలకమైంది. భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌ను ప్రస్తుతం వాడుతుంది.

 

ఇండియన్ మార్స్‌మిషన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహం (మార్స్) పరిశీలనకు ప్రయోగించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్ అంటారు. ఈ ప్రయోగాన్ని ఇండియన్ మార్స్ మిషన్‌గా కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ25 వాహకనౌక ద్వారా 2013, నవంబరు 5న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 300 రోజుల తర్వాత అంగారక కక్ష్యలోకి 2014 సెప్టెంబరు 24న ప్రవేశించింది. ఈ ప్రయోగంతో ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా దేశంగా (ప్రపంచ దేశాల్లో నాలుగోది) భారత్ అవతరించింది. ఇప్పటివరకు అంగారక గ్రహయాత్రను అమెరికా, రష్యా, యురోపియన్‌స్పేస్ ఏజెన్సీ మాత్రమే చేపట్టాయి. ఇతర దేశాలతో పోలిస్తే అతితక్కువ ఖర్చుతో ఇస్రో అంగారక గ్రహయాత్రను చేపట్టింది. దీనికైన ఖర్చు 450 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు అన్నిదేశాలు కలిసి 51 అంగారక గ్రహయాత్రలు చేపట్టగా వాటిలో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. భారతదేశం మొదటి ప్రయోగంతోనే ఈ ఘనత సాధించడం విశేషం. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహంలో మొత్తం 5 పరికరాలున్నాయి. అవి..

1. లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్ (ఎల్ఏపీ): ఇది అంగారక ఉపగ్రహంపైన ఉన్న డ్యుటీరియం, హైడ్రోజన్‌లను కొలవడానికి ఉద్దేశించింది.

2. మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ (ఎమ్ఎస్ఎమ్): ఈ పరికరం అంగారక గ్రహంపైన ఉన్న మీథేన్ ఉనికిని గుర్తిస్తుంది.

3. ఎమ్ఈఎన్‌సీఏ: మార్స్ ఎక్సోస్ఫియరిక్ న్యూట్రల్ కాంపోజిషన్ అనలైజర్. ఈ పరికరం అంగారకుడిపై ఉన్న వాతావరణంలోని వివిధ వాయువులను గుర్తిస్తుంది.

4. మార్స్ కలర్ కెమెరా (ఎమ్‌సీసీ): ఈ కెమెరా అంగారక ఉపరితల ఛాయాచిత్రాలను తీస్తుంది. దీని ద్వారా అక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు.

5. థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (టీఐఎస్): ఈ పరికరం అంగారకుడిపై ఉండే ఉష్ణోగ్రత, నేలలోని ఖనిజాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.

 

ప్రయోగ లక్ష్యాలు

» ఈ ప్రయోగంతో భూమి కాకుండా ఇతర గ్రహాలపైకి వ్యోమనౌకలు లేదా ఉపగ్రహాలను పంపించడానికి కావాల్సిన పరిజ్ఞానం, అనుభవం లభిస్తుంది.

» ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత లేదా ఇతర గ్రహాంతర యాత్రలకు కావాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థ, నమూనాలను రూపొందించుకోవడానికి మార్స్ మిషన్ ఉపయోగపడుతుంది.

» అంగారక గ్రహ ఉపరితల వివరాలు, బాహ్యస్వరూపం, అక్కడి వాయువుల గురించి తెలుసుకోవచ్చు.

 

చంద్రయాన్ - 1

ఇదొక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. చంద్రుడికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబరు 22న దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉప్రగహాన్ని కక్ష్యలో ఉంచడానికి పీఎస్ఎల్వీ-సీ11 వాహకనౌకను ఉపయోగించారు. దీన్నే పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రకంగా పిలుస్తారు. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్‌ను ఇస్రో మొదటి సారిగా వినియోగించింది. ప్రపంచంలో వివిధ దేశాలు నిర్వహించిన చంద్రమండల పరిశోధన యాత్రల్లో ఇది 88వది. దీన్ని ఇస్రో అతి తక్కువ ఖర్చుతో నిర్వహించింది. ఇది భారతదేశ మొదటి చంద్రమండల మానవరహిత యాత్ర. దీన్నే ఇండియన్ మూన్‌మిషన్ - 1 గా పిలుస్తారు.

ఈ ఉపగ్రహం బరువు 1380 కిలోలు. ఈ ఉపగ్రహ ప్రయోగానికైన ఖర్చు 386 కోట్ల రూపాయలు. ఈ ఉపగ్రహంలో 11 పరికరాలున్నాయి. వీటిలో 5 భారతదేశానివి కాగా మిగతా 6 ఇతర దేశాలకు సంబంధించినవి. మనదేశానికి సంబంధించిన పరికరాల్లో మూన్ ఇంపాక్ట్‌ప్రోబ్ అనే పరికరం ఉపగ్రహం నుంచి విడిపోయి చంద్రుడి మీద పడిపోయే విధంగా రూపొందించారు. ఈ పరికరం చంద్రుడి మీదకు చేరే సమయంలో అనేక 3డీ చిత్రాలను తీసి భూమిపైకి చేరవేసింది. ఉపగ్రహాన్ని మొదట చంద్రుడికి 1000 కి.మీ.ల కక్ష్యలోకి చేరవేశారు. తర్వాత 200 కి.మీ.ల కక్ష్యలో ఉంచారు. ఉపగ్రహ సమాచారాన్ని సేకరించేందుకు బెంగళూరులో 2 'అంటేనా'లను అమర్చారు. చంద్రయాన్ - 1 విజయవంతంతో ఈ ఘనత సాధించిన 6వ దేశంగా భారత్ అవతరించింది.

 

ప్రయోగ లక్ష్యాలు

» చంద్రుడి ఉపరితల 3డీ చిత్రాలను తీయడం.

» చంద్రుడిపై ఉన్న మట్టిలోని రసాయనాలు, ఖనిజలవణాల ఉనికిని గుర్తించడం.

» ధ్రువ ప్రాంతాల్లో మంచు ఉండే అవకాశాలను పరిశీలించడం.

» చంద్రుడు, విశ్వ ఆవిర్భానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం.

» చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిపై పరిశోధన.

» ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే చంద్రమండలం యాత్రకు కావాల్సిన ప్రదేశాన్ని గుర్తించడం.

Posted Date : 13-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌