దేశ సుస్థిర సర్వతో ముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలకపాత్ర పోషిస్తోంది. అంటే దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సామాజికాభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది. స్వాతంత్య్రానంతరం భారతదేశం రవాణా రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మనదేశంలో పర్వత, ఎడారి, చిత్తడి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన భూ భాగమంతా రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంది. రవాణా సాధనాలను ముఖ్యంగా 4 రకాలుగా విభజించవచ్చు: అవి: 1) రైలు మార్గాలు 2) రోడ్డు మార్గాలు 3) జలమార్గాలు 4) వాయు మార్గాలు.
భారతదేశ రవాణా రంగంలో రైల్వే వ్యవస్థ ప్రధానమైంది. ప్రయాణికుల, వస్తు రవాణాలోనే కాకుండా దేశ సమగ్రతను, సమైక్యతను పెంపొందించడంలో, విభిన్న సంస్కృతులను పరిరక్షించడంలో, పర్యాటక రంగ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో రైలు మార్గాల చరిత్ర 1853లో లార్డ్ డల్హౌసి గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే బొంబాయి - థానేల మధ్య మొట్టమొదటి రైలును ఆరంభించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 34 కిలోమీటర్లు. ఇప్పుడు మన రైలు మార్గాల మొత్తం పొడవు 63,273 కి.మీ.లు. భారతదేశంలో రైల్వే రంగం అతి పెద్ద ప్రభుత్వరంగ వ్యవస్థగా ఉంది. ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో నాలుగో పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. (మొదటి మూడు దేశాలు వరుసగా అమెరికా, రష్యా, చైనా).
ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం 63,273 కి.మీ. పొడవునా విస్తరించిన రైల్వే దేశవ్యాప్తంగా 7,025 రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. భారత రైల్వేలను 16 ప్రాంతీయ మండలాలుగా విభజించారు. ఈ 16 మండలాలు, వాటి ప్రథాన కేంద్రాలు.
ఉత్తర రైల్వే మండలం అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని కలిగి ఉంది. దాని తర్వాత పశ్చిమ మండలం, ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వేలు పొడవైన రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా BOT ప్రాతిపదికపై (అంటే Build Operate adn Transfer) నిర్మించిన రైలు మార్గం కొంకణ్ రైల్వే. దీని ప్రధాన కేంద్రం నవీ ముంబాయి. కొంకణ్ రైల్వే మార్గం 1998 జనవరి 26 నుంచి పనిచేయడం ప్రారంభించింది. దీని మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని కలిగి ఉంది. ఈ మార్గాన్ని నిర్మించేందుకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టువల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ. పట్టాల మధ్య ఉన్న వెడల్పును బట్టి రైలు మార్గాలను మూడు తరగతులుగా విభజించవచ్చు. అవి
భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైల్వే లైన్ను 1925లోబొంబాయిలోని విక్టోరియా టర్మినస్ నుంచి కుర్లా (V.T.Kurla) వరకు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు డక్కన్ క్వీన్.
* ఇప్పటివరకు దేశంలోని మొత్తం రైలు మార్గాల పొడవులో దాదాపు 28 శాతం రైలు మార్గాలను విద్యుద్దీకరించారు.
* ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ - భారతీయ రైల్వేలు. సుమారు 14 లక్షల మంది పనిచేస్తున్నారు.
* ప్రపంచంలో కెల్లా మిక్కిలి పొడవైన రైల్వే ప్లాట్ఫాం- బెంగాల్లోని ఖరగ్పూర్ ప్లాట్ఫారం.
రైల్వే ఉత్పత్తి యూనిట్లు
ప్రస్తుతం భారతీయ రైల్వేలకు రైలు ఇంజన్లనూ, రైలుపెట్టెలనూ వాటికి సంబంధించిన భాగాలనూ ఉత్పత్తిచేసే యూనిట్లు ఆరు ఉన్నాయి. అవి:
1) చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్ : అవిరి లోకోమోటివ్లను తయారుచేసేది. 1971 నుంచి ఈ రకం లోకోమోటివ్లను ఉత్పత్తిచేయడం నిలిపివేశారు. ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ డీజిల్ హైడ్రాలిక్ షంటింగ్ లోకోమోటివ్లను ఉత్పత్తిచేస్తోంది.
2. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి (DLW): డీజిల్ లోకోమోటివ్లను తయారు చేయడానికి 1964లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాపు, బ్రాడ్గేజ్, మీటర్గేజ్, డీజిల్ లోకోమోటివ్లను, డీజిల్ షంటర్లనూ, విద్యుత్ షంటర్లనూ తయారుచేస్తోంది.
3. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, పెరంబూర్ (ICF) చెన్నై: ఇది 1955లో ఉత్పత్తిని ప్రారంభించింది. బ్రాడ్గేజ్, మీటర్ గేజ్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలున్న రైలు పెట్టెలను తయారుచేస్తున్నారు.
4. విల్ అండ్ యాక్సిల్ ప్లాంటు, ఎలహంక (RWF) (బెంగళూరు): ఇది 1983లో చక్రాలు, ఇరుసు దండాల ఉత్పత్తిని ప్రారంభించింది.
5. డీజిల్ కాంపోనెంట్ వర్క్స్, పాటియాలా (పంజాబ్): పాటియాలాలోని డీజిల్ కాంపొనెంట్ వర్క్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ లోకోమోటివ్ల కాంపోనెంట్లను (విడిభాగాలను) ఉత్పత్తి చేస్తోంది.
6. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా, (పంజాబ్) (RCF): భారతదేశంలో అతిపెద్ద రైల్వే ఉత్పత్తి యూనిట్ ఇది. ఈ కర్మాగారం ప్రయాణికుల పెట్టెలను తయారుచేస్తోంది.
* ప్రైవేటు రంగంలో డీజిల్ రైలు ఇంజన్లను ఉత్పత్తి చేసే సంస్థ టాటా- ఇంజనీరింగ్ లోకోమోటివ్ వర్క్స్- జంషెడ్పూర్ (జార్ఖండ్).
* భారత రైల్వే పరిశోధన అభివృద్ధి (R&D)కి సంబంధించిన Research Design and Standard Organisation(RDSO) ను లక్నోలో స్థాపించారు.
* భారతదేశంలో అత్యధిక రైలు మార్గాల సాంద్రత కలిగిన రాష్ట్రం పంజాబ్. పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలోను, బీహార్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు- హిమసాగర్ ఎక్స్ప్రెస్. ఇది జమ్ముతావి నుంచి కన్యాకుమారి వరకు పయనిస్తుంది.
* ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫాం- ఖరగ్పూర్ (పశ్చిమబెంగాల్). దీని పొడవు 2,733 అడుగులు.
* 2010-11 రైల్వే బడ్జెట్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక, పుణ్యక్షేత్రాలను కలుపుతూ భారత తీర్థ్ రైళ్లను ఆరంభించారు. మహిళల కోసం మాతృభూమి రైళ్ళను, కార్మికుల కోసం కర్మభూమి రైళ్ళను తీసుకొచ్చారు. దేశ భద్రతా దళాలకు గౌరవ సూచకంగా జన్మభూమి ప్రత్యేక రైళ్ళను ప్రవేశపెట్టారు.