• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ అధ్యయనం - సమస్యలు

 * ఏదైనా జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ అనుఘటకాలు; వాటి మధ్య జరిగే అంతఃచర్యలను గురించి తెలియజేసే దాన్ని 'పర్యావరణం' అంటారు. దీన్ని 'భూగోళ పర్యావరణం' అని కూడా అంటారు.

 * పర్యావరణం అనే పదాన్ని ఆంగ్లంలో 'Environment' అని పిలుస్తారు. ఇది 'Environ' అనే ఫ్రెంచి పదం నుంచి వచ్చింది.

 * ఫ్రెంచి భాషలో 'Environ' అంటే 'చుట్టూ ఆవరించి ఉన్న' లేదా   
 'చుట్టుకొని ఉండటం' అని అర్థం.

పర్యావరణంలో రెండు అనుఘటకాలు ఉంటాయి.

1) జీవ అనుఘటకాలు:

     *  వృక్షాలు (ఉత్పత్తిదారులు)

     *  జంతువులు (వినియోగదారులు)

     * సూక్ష్మజీవులు (విచ్ఛిన్నకారులు)

2) నిర్జీవ అనుఘటకాలు:

    ఎ) శీతోష్ణస్థితి పరమైనవి: కాంతి, ఉష్ణం, వర్షపాతం.

    బి) భౌతిక పరమైనవి: గాలి, నేల, నీరు.

    సి) రసాయనికమైనవి: కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు.

మానవుడి ప్రమేయం ఆధారంగా పర్యావరణం రెండు రకాలు

    1) కృత్రిమ, మానవ నిర్మిత పర్యావరణం

    2) సహజసిద్ధ పర్యావరణం

1) కృత్రిమ, మానవ నిర్మిత పర్యావరణం: మానవుడు తన మనుగడ కోసం, తనకు కావాల్సిన అవసరాలను పొందడం కోసం అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసుకున్న పర్యావరణం.

ఇది నాలుగు రకాలు.

  1) సాంఘిక పర్యావరణం: సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థ.

  2) సాంస్కృతిక పర్యావరణం: కట్టుబాట్లు, పండుగలు.

  3) ఆర్థిక పర్యావరణం: వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక సముదాయాలు.

  4) రాజకీయ పర్యావరణం: అసెంబ్లీ, సచివాలయం.

2. సహజ పర్యావరణం:

 *  మానవ ప్రమేయం లేకుండా భూమిపై ఉన్న అనుకూల శీతోష్ణస్థితి ప్రభావం వల్ల ఏర్పడిన పర్యావరణం.

 *  దీన్ని నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు.

1. శిలావరణం (Lithosphere)

2. జలావరణం (Hydrosphere)

3. వాతావరణం(Atmosphere)

4. జీవావరణం (Biosphere)

శిలావరణం

 *  భూ ఉపరితలం నుంచి సగటున 40 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉన్న ఘనస్థితిలోని భూమి పొర. ఇది బాహ్యపొర.

 *  భూ ఉపరితల దృశ్యంలో అంతర్గత, బహిర్గత బలాల వల్ల శిలలు శైథిల్య, క్షయ, విక్షేపణ చర్యలకు లోనుకావడం వల్ల పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, నదీలోయల లాంటి భూ స్వరూపాలు ఏర్పడతాయి.

 *  నేలల ఆవిర్భవానికి, వృక్షజాతుల పెరుగుదలకు కావాల్సిన వివిధ రకాల పోషకాలను అందిస్తూ, సమస్త జీవ జాతులకు అవసరమైన ఆహారపు వనరులను, ఆవాసాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

జలావరణం

*  భూ ఉపరితలంపై 71% జలభాగం ఆవరించింది.

 *  జలచక్రం జలావరణంలో కీలక పాత్ర వహిస్తుంది.

 *  ఇది కార్బన్ శోశకం (Carbon sink)గా వ్యవహరిస్తుంది.

 *  భూగోళ ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరిస్తుంది.

వాతావరణం

 *  భూ ఉపరితలం నుంచి దాదాపు 1600 కి.మీ. వరకు విస్తరించి ఉంది.

 *  భూమిపై జీవజాతి ఆవిర్భావం, మనుగడకు కావల్సిన అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో కీలక పాత్ర
వహిస్తుంది.

 *  దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. పారదర్శకమైన, స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉంటుంది.

 *  ఇది అతినీల లోహిత కిరణాలను భూమిని చేరకుండా చూస్తుంది.

వాతావరణం - సంఘటనాలు:

      వాతావరణం ఘన, ద్రవ, వాయు పదార్థాలచే ఏర్పడి ఉంటుంది.

ఎ) ఘన పదార్థాలు:

      *  భూ ఉపరితలం నుంచి ఘన పదార్థాలైన గాలిలోని దుమ్ము, ధూళి రేణువుల నుంచి ఏర్పడతాయి.

      * ఇవే వాతావరణంలోని ఘనపదార్థాలు.

     * ఇవి వాతావరణంలోకి చేరిన నీటి ఆవిరి ద్రవీభవనం చెందడంలో హైగ్రోస్కోపిక్ కేంద్రాలుగా        వ్యవహరిస్తాయి.

బి) ద్రవ పదార్థాలు:

       * వాతావరణంలోకి చేరే నీటి ఆవిరి ద్రవ పదార్థాలు.

సి) వాయు పదార్థాలు  

  * 'క్లోరిన్‌'ను మినహాయిస్తే మిగిలిన వాయు పదార్థాలన్నీ భూ వాతావరణంలో ఉన్నాయి.

 వీటిలో అధిక శాతం

1) నైట్రోజన్ (78.08%)

2) ఆక్సిజన్ (20.94%)

3) ఆర్గాన్ (0.94%)

4) కార్బన్ డయాక్సైడ్ (0.03%) ఉంటుంది.

 *  CO2 ను బొగ్గుపులుసు వాయువు అని కూడా అంటారు. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన వాయువు.

వాతావరణ నిర్మాణం:

 * సముద్ర మట్టం నుంచి వాతావరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలోని మార్పులకు అనుగుణంగా వాతావరణాన్ని అయిదు ప్రధాన విభాగాలుగా విభజించారు.

  1) ట్రోపో ఆవరణం

  2) స్ట్రాటో ఆవరణం

  3) మీసో ఆవరణం

  4) థర్మో ఆవరణం

  5) ఎక్సో ఆవరణం

ట్రోపో ఆవరణం:

 * దీన్నే 'పరివర్తన ఆవరణం' అంటారు.

 * భూ ఉపరితలం నుంచి 13 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.

 * ఇది వాతావరణంలో మొదటి పొర.

 * భూమధ్య రేఖా ప్రాంతంలో 18 కి.మీ., ధృవాల వద్ద 8 కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది.

 * ఈ ఆవరణంలో భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాకోచించడం, ధృవప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉడటం వల్ల సంకోచించడం జరుగుతుంది.

 * ఈ ఆవరణంలో ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్లేకొద్దీ 6.5ºC చొప్పున, ప్రతి 165 మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ 1ºC చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. దీన్ని సాధారణ క్షీణతా క్రమం (Normal Temperature Laps Rate) అంటారు.

 * ఈ ఆవరణం పైభాగం కంటే కింది భాగంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి సంవహన క్రియకు దోహదపడుతుంది.

 * మేఘాలు ఏర్పడటం, ఉరుములు, మెరుపులు, అల్పపీడనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అలజడులన్నీ ఈ ఆవరణంలో ఏర్పడతాయి.

 * ట్రోపో ఆవరణానికి, దానిపైన ఉన్న స్ట్రాటో ఆవరణానికి మధ్య ఉండే సరిహద్దును 'ట్రోపోపాస్' అంటారు.

 * 'జెట్‌స్ట్రీం' పవనాలు ఈ ఆవరణంలో ఏర్పడతాయి.

 * ఈ ఆవరణంలో ధృవప్రాంతంలో అధిక సాంద్రత, భూమధ్య రేఖా ప్రాంతంలో తక్కువ సాంద్రత ఉంటుంది.

స్ట్రాటో ఆవరణం

 * దీన్ని 'సమతాప ఆవరణం' అంటారు.

 * ట్రోపోపాస్‌ను ఆనుకొని భూఉపరితలం నుంచి 50 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.

 * ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది.

 * దీనికి 25 - 35 కి.మీ. ఎత్తులో 'ఓజోన్ పొర' ఉంటుంది. దీన్నే 'ఓజోన్ ఆవరణం' అని పిలుస్తారు.

 * ఓజోన్ పొర UV కిరణాలను భూఉపరితలంలోకి రాకుండా ఆపుతుంది.

* ఇక్కడ ఎలాంటి అలజడులు లేకుండా నిర్మలంగా ఉండటం వల్ల విమానాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

* ఈ ఆవరణంలో ఉన్నత స్థాయి మేఘాలు 'సిర్రస్ మేఘాలు' విస్తరించి ఉన్నాయి.

 * ఈ ఆవరణం ప్రారంభంలో సుమారు -60oC  ఉష్ణోగ్రత ఉండి, UV కిరణాలు హరించడం వల్ల ఉష్ణోగ్రతలు 0oC  వరకు పెరుగుతాయి.

 * ఈ ఆవరణంలో పై భాగంలో ఉన్న సన్నని పొరను 'స్ట్రాటోపాస్' అంటారు.

మీసో ఆవరణం

 * దీన్నే 'మధ్య ఆవరణం' అంటారు.

 * స్ట్రాటోపాస్ తర్వాత 80 కి.మీ. వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మూడో పొర.

 * ఎత్తుకు వెళ్లేకొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రత చాలా హెచ్చుస్థాయిలో తగ్గుతుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలోని అణువులు చల్లబడి నిశ్చలస్థితిలో ఉంటాయి.

 * దీని కారణంగా ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు, ఉల్కలు లాంటి ఖగోళ వస్తువులు ఈ ఆవరణంలోకి రాగానే పూర్తిగా మండి భూగోళ పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి.

 * దీన్ని 'బాహ్య ట్రోపో ఆవరణం' అని కూడా అంటారు.

 * ఈ ఆవరణం పై సరిహద్దులో ఉష్ణోగ్రతలు -120oC  వరకు ఉంటాయి. అందువల్ల ఇది వాతావరణంలో 'అతిశీతలమైన భాగంగా' ఉంటుంది.

 * ఈ ఆవరణానికి, థర్మో ఆవరణానికి మధ్య ఉండే పొరను 'మీసోపాస్' అంటారు.
థర్మో లేదా ఐనో ఆవరణం:

 * దీన్నే 'ఉష్ణ ఆవరణం' అంటారు.

 * మీసోపాస్‌ను ఆనుకొని దాదాపు 400 కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది.

 * ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరుగుతుంది.

 ఈ ఆవరణంలో వాయువులు అయనీకరణం చెంది ఉండటం వల్ల దీన్ని 'ఐనో ఆవరణం' అంటారు.

 * ఈ ఆవరణంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల వల్ల విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తూ, రేడియో, దూరదర్శన్ తరంగాలను భూమివైపు పరావర్తనం చెందిస్తాయి.

ఎక్సో ఆవరణం:

 * దీన్ని 'బాహ్య ఆవరణం' అంటారు.

 * ఇది థర్మో ఆవరణంపై ఆవరించి ఉంటుంది.

 * ఈ ఆవరణంలో పూర్తిగా తేలిక వాయువులైన హైడ్రోజన్, హీలియం ఉంటాయి.

 * ఇక్కడ పదార్థం 'ప్లాస్మాస్థితిలో' ఉంటుంది.

 * ఈ ఆవరణంపై భూ గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది.
కాంతి పుంజాలు:

 * సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తిమంతమైన వికిరణాలు ఐనో ఆవరణంలోకి ప్రయాణించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్‌లతో విభేదిస్తాయి. ఫలితంగా రసాయన చర్యలు జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుంది. వీటిని కాంతి పుంజాలు లేదా అరోరాలు అంటారు.

 *  ఈ కాంతి కిరణాలు అయస్కాంత ధృవాలవైపు ఆకర్షితమవుతాయి.

 *  ఉత్తర ధృవాన్ని 'అరోరా బొరియాలసిస్', దక్షిణ ధృవాన్ని 'అరోరా ఆస్ట్రాలసిస్' అంటారు.

 *  ఈ కాంతి పుంజాలు అధిక కాంతిని వెలువరుస్తాయి.

 * వాతావరణం, పర్యావరణం నుంచి జీవరాశులు వినియోగించుకునే వివిధ పదార్థాల చలనానికి దోహదపడుతుంది.

జీవావరణం

 * శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునే సంధి ప్రాంతాన్ని 'జీవావరణం' అంటారు.

 * జీవావరణం భూ ఉపరితలం మీద, ఉపరితలం నుంచి 200 మీ. లోతు వరకు, భూ ఉపరితల వాతావరణంలో 7 నుంచి 8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది.

 * పర్యావరణం ఈ నాలుగు ఆవరణాలతో కూడిన ఒక సమ్మిళిత లేదా సమగ్ర ఆవరణం.

 *  పర్యావరణానికి సరిహద్దులు లేవు. విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది.

 *  పర్యావరణంలో మానవుడు ఒక కేంద్ర బిందువు.

 *  పర్యావరణ సమస్యలైన ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, హరిత వాయువుల ప్రభావం విశ్వమంతా ఉన్నాయి.

పర్యావరణంపై మానవ ప్రభావం

 * ప్రాచీన మానవుడు తన కనీస అవసరాల (గాలి, నీరు, నేల, ఆవాసం) మేరకే సహజ వనరులను వినియోగించుకునేవాడు. ఇందులో భాగంగా ఏర్పడే వ్యర్థాలను పర్యావరణం సులభంగా తనలో ఇముడ్చుకుంటుంది.

 * మానవుడు నిప్పును కనుక్కోవడంతో ఇది పర్యావరణంపై ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు.

 * కౄర మృగాలను దెబ్బదీయడం, అడవులను తగుల బెట్టి వ్యవసాయ భూములుగా మార్చడం లాంటివి

జరిగాయి.

 * పారిశ్రామిక విప్లవం తర్వాత మరింత తీవ్ర ప్రభావం చూపింది.

i) జనాభా పెరుగుదల

ii) పారిశ్రామిక, పట్టణీకరణ

iii) అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం

iv) ఘన వ్యర్థ పరిమాణం పెరగడం లాంటివి పర్యావరణ కాలుష్యానికి కారణం.

 * ఉపాధి, విద్య, వైద్య, విలాసవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు ఎక్కువగా వెళ్లడం. దీంతో నగరీకరణ జరిగి ఆవరణ వ్యవస్థ కలుషితం అవుతుంది.

 * పశ్చిమ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాలకు సాగునీటిని అందిస్తూ ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన 'ఇందిరా గాంధీ కాలువ' నిర్మాణం వల్ల జొన్నలు, సజ్జలు లాంటి ఆహార పంటల సాగు తగ్గి చెరకు, పత్తి లాంటి వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచడం, సాంద్ర వ్యవసాయ విధానాల వల్ల భూ వనరులు క్షార నేలలుగా మారిపోతున్నాయి.

 * పర్షియా సింధూశాఖ ప్రాంతంలో చమురు నిక్షేపాలు వెలికితీయడంతో పరిశ్రమల సంఖ్య పెరిగి ఆ ప్రాంత భూ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది.

 * హరిత విప్లవం వల్ల సాంకేతిక పద్ధతులైన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం ఎక్కువ కావ‌డం వల్ల భూమి, జలవనరులు కాడ్మియం, ఫ్లోరిన్, మెర్క్యురీ, లెడ్ లాంటి భారీ లోహాలతో కలుషితమైంది.

 * ప్రస్తుతం మానవుడు ఫ్లోరైడ్ లోపం వల్ల ఫ్లోరోసిస్, కాడ్మియం వల్ల ఇటాయి - ఇటాయి, మెర్క్యురీ (పాదరసం) వల్ల మినిమిటా లాంటి వ్యాధులను ఎదుర్కొంటున్నాడు.

 * నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీరు, పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువుల నుంచి విడుదలయ్యే జల వ్యర్థాలు జలాశయంలో చేరడం వల్ల 'యూట్రిఫికేషన్' అనే కాలుష్యం ఏర్పడుతుంది.

 * కోస్టల్ కారిడార్ నిర్మాణాలు, ట్రాలరి బోట్‌లు, డీప్ షిప్పింగ్ వల్ల కూడా కాలుష్యం అవుతుంది.

పై కారణాల వల్ల అనేక రకాల సమస్యలు ఉద్భవించాయి.

అవి: 1. అటవీ నిర్మూలన

        2. జీవ వైవిధ్యత క్షీణించడం

        3. వాయు కాలుష్యం

ఆవరణ శాస్త్రం [Ecology]

 * పర్యావరణంలోని వివిధ జాతుల మధ్య జీవులు, వాటి పరిసరాలకు మధ్య జరిగే అంతఃచర్యల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని 'ఆవరణ శాస్త్రం' అంటారు.

 * ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ఆంగ్లంలో 'ఎకాలజీ' అంటారు.

 * ECOLOGY అనే పదం రెండు గ్రీకు పదాలైన OIKOS (ఆవాసం), LOGOS(అధ్యయనం) నుంచి వచ్చింది.

 * ఆవరణ శాస్త్రం అనే పదాన్ని 1868లో 'కార్ల్ రైటర్' ఉపయోగించారు.

 * ఈ పదానికి 1869లో ఎర్నెస్ట్ హెకెల్ విస్తృత ప్రాధాన్యాన్ని కల్పించారు.

 * భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు 'మిశ్రా'. మిశ్రా ప్రకారం, వివిధ జాతుల మధ్య అంతర్గత సంబంధాలను; పర్యావరణానికి, జీవులకు ఉండే సంబంధాలను, వాటి విధులను, ఆవాసం, పునరుత్పత్తి ప్రక్రియల పరంగా అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్రం 'ఆవరణశాస్త్రం'.

 * ఆవరణ శాస్త్రాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.

1. వ్యక్తిగత ఆవరణ శాస్త్రం [Auto ecology]

2. సమాజ ఆవరణ శాస్త్రం [Syno ecology]
వ్యక్తిగత ఆవరణ శాస్త్రం:

 * ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేసే ఆవరణ శాస్త్ర విభాగం. ఇందులో ఒక జాతికి చెందిన భౌగోళిక విస్తరణ, చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రత్యుత్పత్తి సంబంధిత అంశాలను తెలియజేస్తుంది.

 * దీన్నే జాతి లేదా జనాభా ఆవరణ శాస్త్రం అంటారు.

సమాజ ఆవరణ శాస్త్రం:

 * ఒకటి కంటే ఎక్కువ జాతుల గురించి అధ్యయనం చేసే ఆవరణ శాస్త్ర విభాగం.

 * భిన్నజాతి జీవుల మధ్య ఆవాసాలు, ఆహారపు అలవాట్లు/ చుట్టూ ఉన్న పరిసరాలు లాంటి వాటి గురించి తెలియజేస్తుంది.

 * ఒక జీవ పర్యావరణంలోని నిర్మాణాత్మక అంశాలను రెండుగా విభజించారు. అవి నిర్జీవ అనుఘటకాలు, జీవ అనుఘటకాలు.

 * ఇవి రెండూ ప్రతిజాతి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

ఆవరణ శాస్త్రాన్ని ప్రభావితం చేసే అంశాలు

   1. ఉష్ణోగ్రత

   2. నీరు

   3. కాంతి

   4. మృత్తిక

   5. జీవ అంతఃసంబంధాలు

ఉష్ణోగ్రత

  * ఇది జీవావరణ వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన పర్యావరణ కారకం.

  * శరీర అంతర్గత ఉష్ణోగ్రత ఆధారంగా జీవజాతులను రెండు రకాలుగా వర్గీకరించారు.

    A) అస్థిరోష్ణక జీవులు లేదా శీతల రక్తపు జంతువులు.

    B) స్థిరోష్ణక జీవులు లేదా ఉష్ణరక్తపు జంతువులు.

 * అస్థిరోష్ణక జీవుల్లో శరీర అంతర్గత ఉష్ణోగ్రతలు, రుతువులను అనుసరించి మారుతున్న పరిసర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్చుకునే అంతర్గత యంత్రాంగం ఉండదు. అందువల్ల ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం లేదా శీతాకాల సుప్తావస్థ (Estivation Period), గ్రీష్మకాల సుప్తావస్థ (Hybernation Period) వల్ల మనుగడ సాధిస్తాయి.

ఉదా: చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు.

 * స్థిరోష్ణక జీవుల్లో రుతువులను అనుసరించి మారుతున్న పరిసర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్చుకునే అంతర్గత యంత్రాంగం ఉంటుంది.

ఉదా: పక్షులు, క్షీరదాలు, మానవులు.* మానవుడిలో సాధారణ శరీర ఉష్ణోగ్రత 36.9 ºC. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉంటే చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ఆవిరిగా మారిన ఫలితంగా ఏర్పడిన చల్లదనం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

* శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత 37 ºC కంటే తక్కువ అయితే శరీరంలో వణుకు ప్రారంభమవుతుంది. ఈ వణుకుతో శరీరంలో ప్రత్యేకంగా ఉష్ణం ఉత్పత్తి జరిగి, శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది.

* ఇది తక్కువ ఉష్ణోగ్రతకు వ్యతిరేకమైన శరీర పరిరక్షణ విధానం.

* మొక్కల్లో ఇలాంటి యంత్రాంగం లేదు.

* వివిధ జాతుల శరీర ఉష్ణోగ్రత సహనస్థాయి [Temparature Tolerance]ని అనుసరించి రెండు రకాలుగా వర్గీకరించారు.

   i) యూరి థర్మల్ జీవులు: ఈ జీవులు అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేందుకు శరీరనిర్మాణంలో

        అనుకూలతలు కలిగి ఉంటాయి.

  ii) స్టీనో థర్మల్ జీవులు: ఈ జీవులు అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే అనుకూలతలను కలిగి
         ఉంటాయి.

* వివిధ జాతుల్లో శరీర ఉష్ణోగ్రత సహనస్థాయిలను అనుసరించి వాటి భౌగోళిక విస్తరణలను నిర్ధారించవచ్చు.

నీరు

* జంతువుల జీవన సరళిని ప్రభావితం చేసే మరొక ముఖ్య కారకం నీరు.

* నీటిలోని రసాయన సంఘటనం, నీటి pH విలువ అనేది నీటి గుణగణాలను నిర్ధారిస్తాయి.

* లవణీయత సహన స్థాయిని అనుసరించి జలచర జీవులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి:

i) వ్యాపిత లవణీయత జంతువులు [Eury haline]: ఉప్పునీటి కయ్యల్లో నివసించే స్థూల లవణీయత మార్పులను ఎదుర్కొనే అనుకూలత కలిగి ఉంటాయి.

ii) మిత లవణీయత జంతువులు [Steno haline]: ఇవి స్థూల లవణీయత మార్పులను ఎదుర్కొనే అనుకూలత లేని జీవులు.

కాంతి:

* భూమి మీద వృక్ష, జంతు జాతుల మనుగడలో కీలకపాత్ర పోషించేది సూర్యకాంతి. సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగి మొక్కలు తమకు కావాల్సిన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి.

* అత్యంత ఎత్తుగా కొమ్మలు బాగా విస్తరించి ఉండే పెద్ద వృక్షాలు నిరంతరం తమ నీడ వల్ల తక్కువ కాంతిని కిందికి ప్రసరింపజేస్తాయి. ఈ విధంగా ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని 'కాంతి వ్యవధి' [Photo Period] అంటారు.

* కాంతి వ్యవధికి అనుగుణంగా జీవులు ప్రదర్శించే ప్రతిస్పందన చర్యలను 'కాంతికాలావధి' [Photo Periodism] అంటారు.

* వివిధ రుతువుల్లో జంతువులు, వృక్షాలు జరిపే సంఘటనలను (పక్షుల వలస, ఆకులు రాలడం) ప్రేరేపించడానికి అవసరమైన కాంతి వ్యవధిని 'సందిగ్ధ కాంతి కాలావధి' (Critical Photo Period) అంటారు.

* భూమధ్య రేఖ ప్రాంతంలో సందిగ్ధ కాలావధి అధికంగా, టండ్రా ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.

ఉదా: శీతాకాలంలో సైబీరియాలో రోజులో ఉండే కాంతి సమయం తగ్గుతుంది. అందువల్ల పక్షులు ఆహారం
కోసం, ప్రత్యుత్పత్తి నిర్వహణ కోసం సందిగ్ధ కాలావధి ఎక్కువగా ఉన్న భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు వలస వస్తాయి. వేసవి కాలంలో తిరిగి తమ స్వదేశానికి వెళతాయి.

* కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయడాన్ని 'జీవ సందీప్తి' (Bioluminescence) అంటారు.

* జంతువుల దేహం వెలువరిచే కాంతిలో పరారుణ కిరణాలు ఉండవు. అందువల్ల దాన్ని 'శీతల కాంతి' అంటారు.

* జెల్లీ చేపలు (నిడేరియన్‌లు), కీటాపిర్టస్ (అనెలిడ్), మిణుగురు పురుగులు (ఆర్థ్రోపోడ్), స్క్విడ్స్ (మొలస్కా), పైరోసోమా (ప్రాథమిక కార్డేటా) లాంటివి జీవసందీప్తి కలగజేస్తాయి.

* చీకట్లో ఆవాసాల్లోని జీవుల సమాచారం, లైంగిక ఆకర్షణ, భోజ్యజీవిని ఆకర్షించడం, రక్షణ సంబంధిత హెచ్చరికలు తెలియజేయడం లాంటి వాటిని 'జీవసందీప్తి' ప్రభావితం చేస్తుంది.

మృత్తిక (Soil)

* వివిధ ప్రాంతాల్లోని మృత్తిక స్వభావం, లక్షణాలు, శీతోష్ణస్థితి శైథిల్య ప్రక్రియ (Weathering Process) మీద ఆధారపడి ఉంటాయి.

* మృత్తికలో వివిధ లక్షణాలైన మృత్తిక సంఘటన, రేణువుల పరిమాణం, రేణువులతో కూడిన మృత్తికలోకి నీరు దిగడం లాంటివి నీటి విలువను నిర్ధారిస్తాయి.

* మృత్తికలోని pH విలువ, ఖనిజ సంఘటన లాంటివి ఒక ప్రాంతంలోని వృక్ష, జంతు జాతులను నిర్ధారిస్తాయి.

జనాభా అంతఃచర్యలు (Population Interactions):

* ప్రతి సమాజంలోని ఆవాసంలో అనేక రకాలైన జీవజాతులు నివసిస్తుంటాయి. ఏ జాతి కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు.

* ప్రతి జాతి ఆహారం, ఆవాసం, ప్రత్యుత్పత్తి, అవసరాల కోసం ఇతర జీవులపై ఆధారపడి వాటితో చర్య, ప్రతిచర్యలను కొనసాగించడం వల్ల మనుగడ సాగిస్తాయి.

ఉదా: మొక్కలు పరపరాగ సంపర్కం కోసం కీటకాలపై ఆధారపడటం.

  జాతుల మధ్య అంతఃచర్యలను నాలుగు రకాలుగా విభజించవచ్చు

1) అన్యోన్య ఆశ్రమ సహజీవనం: (Mutualism)

* ఇందులో రెండు జీవులు లబ్ధి పొందుతాయి.

ఉదా: లైకెన్స్ జీవనం అన్యోన్య ఆశ్రమ సహజీవనాన్ని తెలియజేస్తుంది. దీనిలో ఫంగస్ కిరణజన్య సంయోగక్రియ జరిపే శైవలం లేదా సైనో బ్యాక్టీరియా మధ్య సహజీవనం చేస్తుంది

* మైకోరైజా అనే శిలీంధ్రం ఉన్నత శ్రేణి వేర్లలో నివసిస్తూ ఒక దాంతో ఒకటి సహజీవనం చేస్తాయి. ఇందులో శిలీంద్రాలు మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలను ఇస్తాయి. ప్రతిఫ‌లంగా మొక్క శక్తిని ఇచ్చే పిండి పదార్థాలను శిలీంద్రాలకు అందజేస్తుంది.

2) పోటీతత్వం(Competition):

* ఇందులో రెండు జీవులు నష్టపోతాయి. పోటీతత్వం వివిధ రకాలుగా ఉంటుంది.

A) జాత్యాంతర పోటీ: వనరుల కోసం వివిధ జాతుల మధ్య ఉండే పోటీ.

B) జాత్యంతర్గత పోటీ: ఒక జాతి జీవుల మధ్య ఆహారం, ఆవాసం మధ్య ఉండే పోటీ.

3) సహభోజకత్వం (Commensalism): ఇందులో ఒక జీవి లాభపడుతుంది. మరొక జీవి లాభపడదు, నష్టపడదు.

ఉదా: కాటిల్ ఎగ్రెట్ (ఒక రకమైన పక్షి) మేసే పశువులతో అత్యంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది.

* పచ్చికలో ఉన్న ఎగ్రెట్ పక్షులు గేదెలకు దగ్గరగా ఉండటం వల్ల మేసే సమయంలో గేదెలు తలను అటూ, ఇటూ కదిలించినప్పుడు కీటకాలు పైకి ఎగురుతాయి. ఈ సమయంలో ఎగ్రెట్ పక్షులు కీటకాలను పట్టుకుని తింటాయి.

4) పరాన్న జీవనం (Parasitism): ఇందులో ఒక జీవి లాభపడుతుంది (పరాన్నజీవి). మరొక జీవి (ఆతిథేయి) నష్టపోతుంది.

* పరాన్నజీవనం రెండు రకాలుగా ఉంటుంది

A) బాహ్యపరాన్న జీవులు:

* ఈ విధానంలో బాహ్య పరాన్న జీవులు పరాన్న జీవనంలో ఆతిథేయి శరీరం వెలుపల నివసిస్తూ దాని నుంచి ఆహారాన్ని పొందుతూ, హాని కలగజేస్తాయి.

ఉదా: మానవుడి తలలోని పేను

B) అంతర పరాన్న జీవనం:

* ఈ విధానంలో పరాన్నజీవులు ఆతిథేయి శరీరంలోపల నివసిస్తూ, దాని నుంచి ఆహారాన్ని స్వీకరిస్తూ హాని కలగజేస్తాయి.

ఉదా: మానవుడిలో మలేరియా వ్యాధిని కలగజేసే ప్లాస్మోడియం పరాన్నజీవి.

5) ఎమోన్సాలిజం లేదా జీవ వ్యతిరేకత (Antibiosis):

*  ఒకే ప్రాంతంలో పెరిగే జీవుల సంఘాన్ని, అదే ప్రాంతంలో ఉండే వేరొక జీవుల సంఘం అడ్డంకులు సృష్టించి పెరగకుండా చేయడాన్ని జీవ వ్యతిరేకత లేదా ఎల్లెలోపతి అంటారు. ఉదాహరణకు ఒక జీవ సంఘం ఏదైనా విష పదార్థాన్ని పర్యావరణంలోకి పంపి, వేరొక సంఘం పెరుగుదలను అణిచి వేయడాన్ని ఎల్లోపతిక్ జీవ వ్యతిరేకత అంటారు.

*  ఇది చాలా వృక్షజాతులు, జంతు సంఘాల్లో జరుగుతూనే ఉంటుంది.

6) పరభక్షణ (Predation):

*  ఈ విధానంలో పరాన్న జీవనంలో ఒక జీవి ఉంటే పరాన్న జీవి మాత్రమే లబ్ధి పొందుతుంది. ఆతిథేయికి ఎలాంటి లాభం ఉండదు.

*  దిగువ పోషక స్థాయిలోని జీవులను, పైపోషక స్థాయి జీవులు భక్షించడాన్ని 'పరభక్షణ' అంటారు.

ఉదా: పులులు జింకను తినడం, పిచ్చుకలు గింజలను ఏరివేయడం; ఇందులో పరభక్షి లాభాన్ని పొందుతుండగా, ఆహార జీవి నష్టపోతుంది.

ఆవరణ శాస్త్రం - ముఖ్యమైన పదజాలాలు:

జాతి: తమలోతాము అంతఃప్రజననం జరుపుకునే జీవుల సమాదాయమే 'జాతి'. భిన్న జీవజాతుల మధ్య ఒకే జన్యు సముదాయాన్ని పంచుకుంటూ లైంగిక, శారీరక పరమైన తేడాలు, వైవిధ్యాలు ఉంటాయి.

ఉదా: మానవజాతి, జంతుజాతి, వృక్షజాతి.

*  ఒక జాతిలోని ప్రతి ప్రాణిని వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే దాన్ని జీవిగా పరిగణిస్తారు. ఆవరణ శాస్త్రంలో అతి చిన్న ప్రమాణం జీవి. ఇది ఏ రూపంలోనైనా ఉండవచ్చు.

జనాభా (Population)

*  ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒకే జాతికి చెందిన, ఒకే జీవన విధానాన్ని కలిగిన జన్యుపరమైన వినిమయాలున్న జీవుల సమూహాన్నే 'జనాభా' అంటారు.

ఉదా: భారతీయ జనాభా, ఆఫ్రికన్ జనాభా

జీవ సముదాయం (Bio Community):

*  ఆవరణ వ్యవస్థలోని నిర్దిష్ట ప్రాంతంలో ప్రతిఘటన, పరస్పర సర్దుబాట్ల ద్వారా సహజీవనం చేస్తున్న వివిధ జాతులకు చెందిన జనాభాను 'జీవ సముదాయం' అంటారు.

ఉదా: ఒక అడవిలో ఉన్న కుందేళ్లు, నక్కలు, పులులు; కొలనులోని కప్పలు, చేపలు; ఒక తోటలోని గులాబీలు, మల్లెలు.
           

                            
ఆవాసం:

*  ఒక జాతి జీవులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అని పిలుస్తారు. ప్రతి జాతి ఒక నిర్దిష్ట ఆవాసాన్ని కలిగి ఉంటూ, ఆ పరిసరాల నుంచి తనకు కావాల్సిన ప్రాథమిక అవసరాలను పొందుతుంది. నిర్దిష్ట ఆవాసం లేనిదే ఏ జాతి మనుగడ సాగించలేదు.

ఉదా: మానవజాతి ఎక్కువగా మైదానాలు, పీఠభూముల ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంది. అలాగే నక్కలు, పులులు, సింహాలు అటవీ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి.

ఎకలాజికల్ నిచ్:
 ఆవరణ వ్యవస్థలోని ఏదైనా ఆవాసంలో ఒక జాతి క్రియాత్మక స్థాయిని తెలియజేసే భావన. ఇది నిర్దిష్ట ఆవాసంలో ఒక జీవి తన విధులను నిర్వర్తించే ప్రదేశం. మొదటిసారిగా ఈ పదాన్ని గ్రిన్నెల్ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు.

ఉదా: మానవుడు సర్వభక్షక ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం. జలావరణ వ్యవస్థల్లో శైవలాలు ఉత్పత్తిదారులుగా విధులు నిర్వర్తించడం. భౌమా ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల వృక్ష జాతులు ఉత్పత్తి దారులుగా తమ విధిని కొనసాగించడం.

ఎకలాజికల్ నిచ్‌లో రకాలు:

ఆవాస నిచ్ (Habitate Niche): ఒక జీవి ఆవాసాన్ని తెలియజేసే ప్రదేశం.

ఆహారపు నిచ్ (Food Niche): ఒక జీవి తినే ఆహార రకాన్ని, ఆహార సేకరణ కోసం ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేస్తుంది.

ప్రత్యుత్పత్తి (Reproductive Niche): సంతానోత్పత్తి ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వర్తించాలి అనే ప్రదేశాన్ని తెలియజేస్తుంది.

భౌతిక, రసాయనిక నిచ్ (Physical and Chemical Niche): జీవి నివసించడానికి అనుకూలమైన భూ నిర్మాణం, నీరు, ఇతర పోషకాలు లభ్యమయ్యే ప్రదేశాన్ని తెలియజేస్తుంది.

జీవ మండలం (Biome):

*  రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థలతో కూడిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని జీవమండలం అని పిలుస్తారు. ఇందులో ప్రతి ఆవరణ వ్యవస్థలోని వివిధ జీవసముదాయాలకు చెందిన వృక్ష, జంతుజాతులు ఆయా పరిసరాల్లోని శీతోష్ణస్థితి పరిస్థితులకు అనుగుణంగా తమ విధులను, ఆహారపు అలవాట్లను కొనసాగిస్తూ, ఆ పరిసరాలకు అనుగుణంగా అనుకూలతను పొంది ఉంటాయి.

ఉదా: టండ్రా బయోమ్. ఈ ప్రాంతం అంతా కూడా శృంగాకార వృక్ష జాతులు విస్తరించి ఉంటాయి.

జీవావరణ అనుక్రమం:

*  భౌతిక పరిస్థితుల వల్ల ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవి సమాజ స్థానంలో మరొక రకమైన జీవి సమాజాలు ఆవిర్భవం చెందడాన్ని ఆవరణ అనుక్రమం అంటారు. లేదా ఒక ప్రదేశాన్ని క్రమానుగతంగా వేర్వేరు జీవ జీవుల సంఘాలు ఆక్రమించడాన్ని ఆవరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ చివరకు స్థిరమైన జీవి సమాజం ఏర్పడుతుంది. దీన్నే పరాకాష్ట (Climax Community) జీవ సమాజం అని పిలుస్తారు. ఇందులోని జాతులను పరాకాష్ట జాతులు అంటారు. పరాకాష్ట జీవ సమాజాలు, వాటి చుట్టూ ఉన్న పర్యావరణంతో సమతౌల్యంగా ఉంటాయి.

ఉదా: ఉష్ణమండల వర్షారణ్యాలు (Tropical Rainy Forests)

జీవ సాంద్రీకృతం (Bio Magnification):

* మృత్తికలు, నీటి నుంచి హానికర రసాయనాలు, ఆహారపు గొలుసులు ఆహార మాధ్యమంగా దిగువ పోషక స్థాయిల్లోని జీవుల నుంచి పై పోషక స్థాయి జీవుల్లో పేరుకు పోవడాన్ని జీవ సాంద్రీకృతం అని పిలుస్తారు.

జీవావరణ పిరమిడ్‌లు:

*  ఆవరణ వ్యవస్థకు సంబంధించిన వివిధ జీవ జాతులకు చెందిన జనాభా, జీవ పదార్థం, ఆహారపు గొలుసుల్లోని వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్న శక్తి పరిమాణాలను రేఖీయంగా చూపించడాన్ని జీవావ‌ర‌ణ‌ పిరమిడ్‌లు అని పిలుస్తారు. ఈ భావనను మొదటిసారిగా 1927లో చార్లెస్ ఎల్టన్ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టోనియం పిరమిడ్‌లు అని కూడా పిలుస్తారు.

ఆవరణ వ్యవస్థ: (Ecosystem)

* జీవ, నిర్జీవ అంశాలతో కూడుకున్న ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ నిర్జీవ కారకాల మధ్య పరస్పరం జీవ భూ రసాయన వలయాలు ద్వారా శక్తి, పోషకాల మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థగా ఎ.జి. టాన్‌ప్లే అనే ఆవరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారిగా ఆవరణ శాస్త్ర భావనను పేర్కొన్నారు.
       

                
*  ఆవరణ వ్యవస్థ అనేది 'జీవావరణం నిర్మాణాత్మక ప్రాథమిక ప్రమాణం' అని ఓడమ్ అనే ఆవరణ శాస్త్రవేత్త
తెలియజేశారు.

ఆవరణ వ్యవస్థ రకాలు:

*  ఎలెన్‌బర్గ్ అనే ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థలకు సంబంధించి క్రమానుగత శ్రేణి వర్గీకరణను (Hierarchical classification) రూపొందించారు.


మానవ ప్రయోజనాల దృష్ట్యా ఆవరణ వ్యవస్థలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు.

1) సహజసిద్ధ ఆవరణ వ్యవస్థలు: పర్యావరణంలో రకరకాల ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. అన్నిరకాల ఆవరణ వ్యవస్థలు జీవ, నిర్జీవం అనుఘటకాల పరస్పర చర్యల ఫలితంగా స్వయం సమృద్ధిని కలిగి ఉంటాయి. అన్నీ దాదాపు ఒకేవిధమైన నిర్మాణాన్ని, విధులను, లక్షణాలతో ఉంటాయి. అయినప్పటికీ జాతుల వైవిధ్యంలో, ఉత్పాదన రేటు సాధనలో విభేదాలను కలిగి ఉంటాయి.

2) కృత్రిమ లేదా మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలు: మానవుడు తన సాంఘిక, సాంస్కృతిక, పారిశ్రామిక అవసరాల కోసం సహజసిద్ధ ఆవరణ వ్యవస్థను నిర్మూలించి, ఆ ప్రదేశంలో తన రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు నిర్మించుకునే ఆవరణ వ్యవస్థలనే 'కృత్రిమ ఆవరణ వ్యవస్థలు' అని పిలుస్తారు.


కృత్రిమ ఆవరణ వ్యవస్థలు

  ఎ) పంటపొలాల ఆవరణ వ్యవస్థలు

  బి) నగర ఆవరణ వ్యవస్థలు (పారిశ్రామిక ఆవరణ వ్యవస్థలు ఇందులో భాగంగా ఉంటాయి)

  సి) ప్రయోగశాల ఆవరణ వ్యవస్థలు

 డి) విశ్వాంతరాళ ఆవరణ వ్యవస్థలు

జలావరణ వ్యవస్థలు (Aquatic Ecosystem)

*  జలం ఆవాసంగా ఉన్న ఆవరణ వ్యవస్థను 'జలావరణ వ్యవస్థ' అని పిలుస్తారు. నీటిలోని ఖనిజ పోషకాల పరిమాణాన్ని అనుసరించి జలావరణ వ్యవస్థలను కిందివిధంగా విభజించవచ్చు.

1) మంచినీటి ఆవరణ వ్యవస్థలు (Fresh Water Ecosystem)

*  ఇందులో లవణీయత శాతం అతి తక్కువ. < 5 ppt (parts per thousand) గా ఉంటుంది.

ఉదా: సరస్సులు, కొలనులు, నీటి బుగ్గలు (Water Spings), నదులు.

2) సముద్ర ఆవరణ వ్యవస్థలు: (Marine Ecosystem)
 ఇందులో ఖనిజ పోషకాల పరిమాణం అత్యధికం. > 35 ppt (parts per thousand))గా ఉంటుంది.

ఉదా: సముద్రాలు, మహాసముద్రాలు

3) పరివర్తన ఆవరణ వ్యవస్థలు (Transitional Ecosytem):

*  ఇందులో ఖనిజ పోషకాల పరిమాణం మధ్యస్థంగా (5 to 35 ppt parts per thousands)గా ఉంటుంది.

ఉదా: ఎస్టురీస్ (ఉప్పు నీటి కయ్యలు, మాంగ్రూవ్స్, లాగూన్‌లు, పృష్ట జలాలు (Back waters)).

జలావరణ వ్యవస్థల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు

ఎ) సూర్యకాంతి (Sunlight): జలావరణం ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు మాత్రమే సూర్యకాంతి ప్రసరించి, ఆపై లోతులో ప్రసరించదు. సూర్యకాంతి ప్రసరించే లోతును అనుసరించి జలావరణ వ్యవస్థల్లో వృక్ష జంతుజాతుల ఉనికి ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతి ప్రసరించే లోతు, వృక్ష జాతుల విస్తరణను అనుసరించి జలావరణ వ్యవస్థలను 2 భాగాలుగా విభజించవచ్చు.

    1) యూఫోటిక్ మండలం: ఇది జలావరణ వ్యవస్థ ఉపరితల ప్రాంతం. ఇక్కడ సూర్యకాంతి సమృద్ధిగా
        ప్రసరించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కిరణజన్య
       సంయోగక్రియతోపాటు శ్వాసక్రియ కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది.

   2) ఎపోటిక్ మండలం: ఈ ప్రాంతం లిటోరల్ మండలానికి దిగువన ఉంటుంది. ఇక్కడ సూర్యకాంతి
        ప్రసరించదు. వృక్షజాతులు పెరగవు. కేవలం శ్వాసక్రియ చర్యలు జరుగుతాయి. ఇది ఆక్సిజన్‌ను
        వినియోగించే ప్రాంతం. దీన్నే 'ప్రొఫండల్ మండలం' అని కూడా పిలుస్తారు.

బి) జలాల పారదర్శకత (Transparency of water Bodies): నీటిలోని బంకమన్ను, పూడికలు, వృక్ష ప్లవకాలు లాంటి కణయుత పదార్థాల వల్ల నీరు బురదమయం అవుతుంది. దీని కారణంగా నీటి పారదర్శకత తగ్గుతుంది. నీటి పారదర్శకత లక్షణం తగ్గితే జలాశయంలో లోతుకు వెళ్లేకొద్దీ కాంతి ప్రసరణ తగ్గి, కిరణజన్య సంయోగక్రియ రేటు  జలావరణ వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది.

సి) ఉష్ణోగ్రత (Temperature): నీరు పరిసర ఉష్ణోగ్రత మార్పులకు చాలా నెమ్మదిగా ప్రభావితం అవుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రత చాలా నెమ్మదిగా పెరగడం లేదా నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. కారణం నీటి విశిష్టోష్ణం అధికం కావడం. అయితే దీని కారణంగా జలచర జీవరాశులకు ఉష్ణోగ్రత సహనస్థాయి(Temperature tolerance limit) పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల నీటి ఉష్ణోగ్రతలో ఏమాత్రం మార్పు వచ్చినా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

కొలను ఆవరణ వ్యవస్థ (Pond Ecosystem)

*  జలావరణ వ్యవస్థల గురించి ప్రాథమిక అవగాహన కోసం కొలను ఆవరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. కొలను ఆవరణ వ్యవస్థ అనేది ఒక స్వయం సమృద్ధి కలిగిన జీవనాధార వ్యవస్థ. ఇది ఒక నిలకడతో కూడిన నీటి ఆవరణ వ్యవస్థ. చుట్టూ భూభాగంతో పరివేష్టితమై సముద్ర తీరానికి దూరంగా ఉంటుంది. కొలనులోని నీటిలో సూర్యకాంతి ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు మాత్రమే ప్రసరిస్తుంది. కొలను నీటిలోని కాంతితీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకుని కొలనును నిలువుగా 3 భాగాలుగా స్థరీకరించారు. అవి:

1) వేలాంచల మండలం (Littaral Zone)

2) లిమ్నెటిక్ మండలం (Limnnetic Zone)

3) ప్రొఫండల్ మండలం (Profundal Zone)

వేలాంచల మండలం: తీరానికి దగ్గరగా ఉండి, లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. ఈ ప్రాంతంలో కాంతి అడుగుభాగం వరకు ప్రసరిస్తుంది.

లిమ్నెటిక్ మండలం: ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. కొలనులో అతిపెద్ద మండలం. కాంతి సమర్థంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది.

ప్రొఫండల్ మండలం: ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. ఈ ప్రాంతంలో కాంతి ప్రసరణ జరగదు. ఇందులో కిరణజన్య సంయోగ క్రియను జరిపే జీవులు ఉండవు. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది.

చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థలు (Wet land Ecosystem)

*  భౌమ, జలావరణ వ్యవస్థల మధ్య తేమ, బురదతో కూడిన క్షార స్వభావం ఉన్న సంక్లిష్ట ఆవరణ వ్యవస్థలనే చిత్తడి ఆవరణ లేదా పరివర్తన ఆవరణ వ్యవస్థలు అంటారు. ఇందులోకి మాంగ్రూవ్స్, ప్రవాళభిత్తికలు, చిత్తడి నేలలు, ఎస్టురీస్, లాగూన్స్, పృష్ఠజలాలు (back waters); తీరప్రాంత, ఎడారిప్రాంత ఉప్పు, మంచినీటి సరస్సులు వస్తాయి.

*  దేశంలో మొత్తం 27,403 చిత్తడి ప్రాంతాలను గుర్తించారు. ఇవి దేశ భూభాగంలో 18.4% భూభాగాన్నిఆక్రమించాయి. అంతేకాకుండా 70% చిత్తడి ప్రాంత భూభాగాన్ని వరి సాగు కింద వినియోగిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు విభిన్న శీతోష్ణస్థితి ప్రాంతాల్లోని 25 రాష్ట్రాల్లో 94 చిత్తడి ప్రాంతాలు, 12 రాష్ట్రాల్లో 38 మాంగ్రూవ్ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద మాంగ్రూవ్ పశ్చిమ్ బంగాలోని సుందరబన్ నదీ ముఖద్వారం వెంబడి ఉన్న ఎస్టురీస్, సముద్ర తీరం చీలికల వెంబడి అనేక సంఖ్యలో లాగూన్స్, పృష్ఠజలాలను గుర్తించి, పరీక్షిస్తున్నారు.

*  ప్రపంచంలో అతిపెద్ద ప్రవాళభిత్తిక ఆస్ట్రేలియాలోని గ్రేట్ డివైడింగ్ రీఫ్.

ప్రభుత్వ సంరక్షణ చర్యలు

*  1971లో చిత్తడి ప్రాంతాల సంరక్షణ కోసం రూపొందించిన 'రామ్‌సార్ కన్వన్షెన్‌'లో భాగంగా దేశంలో 94 చిత్తడి ప్రాంతాలను గుర్తించారు. వీటిని వాటిలోని జీవవైవిధ్యతను భాగంగా చేర్చి పరిరక్షిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కొల్లేరు సరస్సు కూడా ఉంది.

 చిత్తడి ప్రాంతాలను నమోదు చేసే రిజిస్టర్ లాంటి నిబంధన (Montrex Record)

*  దీన్ని రామ్‌సార్ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఇందులో అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న, మానవ కార్యకలాపాల వల్ల ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న చిత్తడి ప్రాంతాలను చేర్చారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మాన్ ట్రిక్స్ రికార్డుల్లో 51 చిత్తడి ప్రాంతాలను రిజిస్టర్ చేశారు. ఇందులో భారతదేశంలో రాజస్థాన్‌లోని కియోలాడియో నమోదైంది.

* 1987లో మాంగ్రూవ్స్‌ను సంరక్షించడానికి మడ అడవుల సంరక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సుందర్‌బన్స్, చిలకా సరస్సు, బిత్తరకనిక, పులికాట్, పిచ్చాపురం, పాయింట్ కాలిమర్ (తమిళనాడు), కోరింగ (ఆంధ్రప్రదేశ్), వెంబనాడ్ (కేరళ) లాంటి 38 మడ అటవీ ప్రాంతాలను గుర్తించారు. అంతేకాకుండా మడ అటవీ పరిశోధనకుగాను జాతీయ స్థాయిలో మడ అడవుల జన్యు పరిశోధనా కేంద్రాన్ని ఒడిశాలో ఏర్పాటు చేశారు.

*  అండమాన్ నికోబార్ దీవులు, మన్నార్ సింధుశాఖ, కచ్ సింధుశాఖ, లక్షదీవుల్లో ప్రవాళభిత్తికల సంరక్షణకోసం జాతీయ ప్రవాళభిత్తికా పరిశోధనా సంస్థను పోర్ట్‌బ్లెయిర్‌లో ఏర్పాటు చేశారు.

*  పైన తెలిపిన వాటితోపాటు పర్యావరణ పరంగా బాగా దెబ్బతిన్న మాంగ్రూవ్ ప్రాంతాల్లో మానవకార్యకలాపాలను నియంత్రించడానికి పర్యావరణ పరిరక్షణా చట్టం 1986 కింద 1991లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్(CRZ - 1) నోటిఫికేషన్‌ను, 2011లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (CRZ - 2) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఆవరణ వ్యవస్థ విధులు:

1) ఉత్పాదన
 శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియల ద్వారా ఒక ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యంలోని ఆవరణ వ్యవస్థ నుంచి ఉత్పత్తిదారులు (వృక్షజాతులు) తయారు చేసిన జీవ ద్రవ్యరాశి (Bio Mass)ఉత్పత్తి రేటును ఉత్పాదన అంటారు.

*  ఒక ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యంలోని ఆవరణ వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన జీవ ద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదన అని పిలుస్తారు. వృక్ష, జంతు జాతుల ఉత్పాదనను ఉత్పాదన ఆవరణ శాస్త్రం అంటారు. వనరుల యాజమాన్యం దృష్ట్యా ఉత్పాదన శాస్త్ర విజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మానవుడి సంక్షేమానికి పర్యావరణం, తత్సంబంధమైన సంరక్షణా పద్ధతులను పెంపొందించడానికి ఇంటర్నేషనల్ బయలాజికల్ ప్రోగ్రాం (IBP) ఆధ్వర్యంలో సంస్థాగతంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.

*  ఏదైనా ఒక సమయంలో ఉత్పాదనను సులభంగా అంచనావేసి కొలవవచ్చు. ఏదైనా నిర్దిష్ట సమయంలో ఒక ఆవరణ వ్యవస్థలో కొలచిన జీవ ద్రవ్యరాశి ఉత్పాదనను నికరపంట అంటారు. మొత్తం ఉత్పాదనకు కావాల్సిన కర్బన పదార్థాల పునరాభివృద్ధి రేటును టర్నోవర్ అంటారు. టర్నోవర్ విలువను కింది సూత్రం ద్వారా లెక్కించవచ్చు.

T = Bmax - Bmin

T = టర్నోవర్

Bmax = సంవత్సరంలో గరిష్ఠ జీవద్రవ్యరాశి రేటు

Bmin = సంవత్సరంలో కనిష్ఠ ద్రవ్యరాశి రేటు

Total B = మొత్తం జీవద్రవ్యరాశి రేటు

ఉత్పాదన రకాలు (Types of Productivity)

*  ఉత్పాదన సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది.

   ఎ) ప్రాథమిక ఉత్పాదన (Primary Productivity)

  బి) ద్వితీయ ఉత్పాదన (Secondary Productivity)

ప్రాథమిక ఉత్పాదన

*  ఒక ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యంలోని ఆవరణ వ్యవస్థలో ఉండే ఉత్పత్తిదారులు కిరణజన్య సంయోగక్రియలో తయారు చేసుకున్న పిండి పదార్థాలకు వినియోగమైన సౌర వికిరణ శక్తి విలువల రేటును 'ప్రాథమిక ఉత్పాదన' అంటారు.

ప్రాథమిక ఉత్పాదన మూడు రకాలుగా ఉంటుంది

  1) స్థూల ప్రాథమిక ఉత్పాదన

  2) నికర ప్రాథమిక ఉత్పాదన

  3) నికర సముదాయ ఉత్పాదన

ద్వితీయ ఉత్పాదన (Secondary Productivity)
 ఒక ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యంలోని ఆవరణ వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వినియోగదారుల పోషక స్థాయిల్లోని శక్తి విలువల రేటును ద్వితీయ ఉత్పాదన అంటారు.

విచ్ఛిన్నత (కుళ్లుట - Decomposition)

*  ఆవరణ వ్యవస్థలోని బ్యాక్టీరియా, శిలీంద్రాల లాంటి సూక్ష్మజీవులు లేదా విచ్ఛిన్నకారులు వృక్ష, జంతు జీవజాతుల విసర్జకాలను, మృత కళేబరాలను విచ్ఛిన్నం చేయడాన్ని విచ్ఛిన్నత లేదా కుళ్లిపోవడం అంటారు. ఈ విచ్ఛిన్నత వల్ల సంక్లిష్ట కర్బన పదార్థాలు సరళ అకర్బన పదార్థాలుగా మారి భౌమావరణంలో విలీనమవుతాయి. ఈ విచ్ఛిన్నత ప్రక్రియ కూడా ఆవరణ వ్యవస్థ ఒక ముఖ్యమైన విధి. ఈ విధి నిర్వహణ క్రమంగా జరగని పక్షంలో ఆవరణ వ్యవస్థలు మృత కళేబరాల కాలుష్యాలతో నిండిపోయి మనుగడ సాగించలేవు.

*  అనుక్రమంలోని వేర్వేరు దశలను 'సీరల్ దశలు' అని పిలుస్తారు. ఒక ఆవాసంలో జరిగే మొక్కల అనుక్రమాన్ని సీర్ అంటారు.

*  జీవావరణ అనుక్రమం ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది అవి:

1) హైడ్రార్క్
 ఇది కుంటలు, సరస్సులు, బురద ప్రదేశాల్లో ప్రారంభమయ్యే జీవావరణ అనుక్రమం. ఇందులోని మధ్యంతర దశలను హైడ్రోసీరల్ అని పిలుస్తారు. ఇలాంటి అనుక్రమంలో చివరకు వివిధ రకాల అడవులు ఒక స్థిర జీవ సమాజంగా ఏర్పడతాయి. హైడ్రార్క్ 2 రకాలుగా ఉంటుంది అవి:

ఎ) హైడ్రోసీర్: ఇది మంచినీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం.

బి) హాలోసీర్: ఇది ఉప్పునీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం.

2) గ్జిరార్క్

*  ఇది ఎడారిలో ప్రారంభమయ్యే జీవానుక్రమం. ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఇందులోని అనుక్రమం దశలను గ్జిరోసీర్ అంటారు. దీన్ని 2 రకాలుగా విభజించారు. అవి...

ఎ) లిథోసీయర్: ఇది శిలలపై ప్రారంభమయ్యే జీవానుక్రమం.

బి) సామోసీయర్: ఇది ఇసుకపై ప్రారంభమయ్యే జీవానుక్రమం.

*  క్లైమాక్స్ (చివరి) దశలో ఏర్పడిన జాతులపై ఏ ఇతర జాతులు ఆధిక్యాన్ని సాధించలేవు.

ఆహారపు గొలుసులు (Food Chains)

* ఆహారపు అలవాట్లను అనుసరించి ఒక జీవి మరొక జీవిని తినడం వల్ల, ఆ జీవి మరొక జీవికి ఆహారంగా వినియోగమవడం ద్వారా శక్తి, ఆహార పదార్థాలు ఉత్పత్తిదారుల నుంచి పరాకాష్ట వినియోగదారులకు రేఖీయంగా (Linear (or) Unidirectional) బదిలీ కావడం వల్ల ఏర్పడే క్రియాత్మక నిర్మాణాలనే ఆహారపు గొలుసు అని పిలుస్తారు.

*  వీటి ద్వారా ఆయా పోషక స్థాయిలోని జీవులకు ఆహార పదార్థాల బదిలీ సక్రమంగా జరుగుతూ ఆవరణ వ్యవస్థలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆహారపు గొలుసులో మొదటి పోషక స్థాయిలో ఉత్పత్తిదారులు, అంతిమ పోషక స్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటారు. అంటే ఆహారపు గొలుసులు విచ్ఛిన్నకారులతో అంతమవుతాయి.
ఆహారపు గొలుసుల ప్రాముఖ్యం

   1) ఆవరణ వ్యవస్థల్లో ఖనిజ పోషకాల పునరుత్పత్తిలో కీలక పాత్ర వహిస్తాయి.

   2) ఆయా జాతిజీవుల పోషక స్థాయిలను తెలియజేస్తాయి.

   3) జనాభా పరిమాణాన్ని నియంత్రిస్తూ, ప్రకృతి సమతౌల్యతను కాపాడతాయి.

   4) ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి బదిలీ విధానాన్ని తెలియజేస్తాయి.

   5) భిన్న పోషక స్థాయిల్లోని జీవుల ఆహారపు అలవాట్లను తెలియజేస్తాయి.

భూగోళ ఆవరణ వ్యవస్థలో మూడు ప్రధాన ఆహారపు గొలుసులను గుర్తించారు.

   1) మేత ఆహారపు గొలుసులు (Grazing Food Chains)

   2) పరాన్న జీవ ఆహారపు గొలుసులు (Parasitic Food Chains)

  3) పూతికాహార ఆహారపు గొలుసులు (Detritus Food Chains)

మేత ఆహారపు గొలుసు: ఇది వేట (Prey) వేటగాడి (Preydator) సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.దీన్నే పరభక్షక ఆహారపు గొలుసు (Predatory Food Chain)అని కూడా పిలస్తారు. ఇవి ఖండ, జలావరణ వ్యవస్థ రెండింటిలో ఉంటాయి.

ఎ. ఖండ ఆవరణ వ్యవస్థలోని మేత ఆహారపు గొలుసులు

* ఇవి గడ్డిలో ప్రారంభమవుతాయి.

ఉదా: గడ్డి - కుందేలు - నక్క - తోడేలు - పులులు - సింహాలు

         గడ్డి - మిడత/గొల్లభామ - కప్ప - పాము - గద్దలు

         గడ్డి - కుందేలు - గద్దలు

         గడ్డి - ఎలుకలు - పాములు - గద్దలు

         గడ్డి - గొర్రెలు/మేకలు - మానవులు

బి. జలావరణ వ్యవస్థలోని మేత ఆహారపు గొలుసులు

*  ఇవి వృక్ష ప్లవకాలతో ప్రారంభమవుతాయి.

    1. వృక్ష ప్లవకాలు - జంతు ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు - కొంగలు

    2. వృక్ష ప్లవకాలు - జంతు ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు - తిమింగళాలు

సి. పుతికాహార ఆహారపు గొలుసులు:

*  ఇవి ఖండ, జలావరణ వ్యవస్థల్లో ఉంటాయి. మృతకళేబర జీవ పదార్థాలతో ప్రారంభమవుతాయి.

పరపోషకాలైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు; కుళ్లిన ఆకులు, మృత కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటి నుంచి శక్తి, పోషక పదార్థాలు గ్రహిస్తాయి.

ఆహారపు వలల విధులు (Functions of the Food Webs)

*  ఆవరణ వ్యవస్థలో ఆహార పదార్థాలు, శక్తి ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తాయి.

*  ఆవరణ వ్యవస్థల స్థిరత్వాన్ని పెంపొందిస్తాయి.

*  ప్రతి జాతిజీవుల ఆవాసాలను స్థిరీకరిస్తాయి.

*  ఆవరణ వ్యవస్థల స్థిరత్వం అనేది ఆహారపు వలల సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది.

*  ఒక జీవి మరొక జీవి పెరుగుదలను అదుపులో ఉంచడం ద్వారా ప్రకృతిలోని సమతౌల్యత ఆహారపు వలల ద్వారా రక్షించవచ్చు.

జీవావరణ పిరమిడ్‌లు (Ecological Pyramids)

*  ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లోని వివిధ జీవజాతులకు చెందిన జనాభా, జీవ పదార్థం, ఆహారపు గొలుసుల్లోని వివిధ స్థాయిలో అందుబాటులో ఉన్న శక్తి పరిమాణాలను రేఖీయంగా చూపించడాన్ని జీవావరణ పిరమిడ్‌లు అని పిలుస్తారు. ఈ భావనను మొదటిసారిగా 1927లో చార్లెస్ ఎల్టన్ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టానియం పిరమిడ్‌లు అని కూడా పిలుస్తారు.

జీవావరణ పిరమిడ్‌లను మూడు రకాలుగా విభజించవచ్చు

1. సంఖ్యా పిరమిడ్‌లు (pyramids of Number):ఇవి ఆహార గొలుసుల్లో వివిధ పోషక స్థాయిల్లో ఉండే వివిధ జనాభాల సంఖ్యాపరమైన సంబంధాన్ని సూచిస్తాయి. ఈ పిరమిడ్ ఆధారం వద్ద ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువగా ఉండి, క్రమంగా అగ్రభాగం చేరేకొద్దీ వివిధ పోషక స్థాయిల్లోని జీవుల సంఖ్య తగ్గుతుంది. కానీ కొన్నింటిలో ఇది తలకిందులుగా ఉంటుంది. ఉదాహరణకు పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌లు తలకిందులుగా ఉండగా, మిగిలిన ఆవరణ వ్యవస్థలో నిట్టనిలువుగా సంఖ్యా పిరమిడ్‌లు ఉంటాయి.

2. జీవరాశి పిరమిడ్‌లు (Pyramids of Biomass): జీవావరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో ఉన్న జీవ అనుఘటకాల భారం లేదా ద్రవ్యరాశి సంబంధమైన విషయాల గురించి తెలిపే పిరమిడ్ రేఖాపటాన్ని జీవరాశి పిరమిడ్‌లు అని పిలుస్తారు. ఇందులో ఆధార భాగంలో ఉన్న పోషక స్థాయి ఉండి మైదాన, అటవీ ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉండగా, కొలను ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

3. శక్తి పిరమిడ్‌లు (pyramids of Energy): ఒక జీవావరణ వ్యవస్థలో ఒక చదరపు మీటరు వైశాల్యం ఉన్న స్థలంలో ఒక ఏడాదిపాటు వివిధ పోషక స్థాయిల్లోని జీవరాశులకు వినియోగమైన శక్తి మొత్తాన్ని తెలిపే పిరమిడ్ రేఖాపటాన్ని 'శక్తి పిరమిడ్' అని పిలుస్తారు. ఇందులో ఉత్పత్తిదారుల స్థాయి నుంచి అంతిమ వినియోగదారుల స్థాయి వరకు శక్తి తగ్గుతూ పోతుంది.

*  వివిధ ఆవరణ వ్యవస్థలోని జీవ పిరమిడ్‌లన్నీ నిట్టనిలువుగా ఉంటాయి.

ఆవరణ వ్యవస్థలో జీవుల ఆహారపు అలవాట్లను అనుసరించి వాటిని ఎనిమిది ప్రధాన రకాలుగా విభజించవచ్చు.

1. ఉత్పత్తిదారులు (Producers)
 ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటూ, స్థానబద్ధ జీవనం గడుపుతూ ఇతర జీవులకు ఆహారపదార్థాలను అందించేవి. వీటినే స్వయంపోషకాలు అని కూడా అంటారు. ఆహారపు గొలుసులో ఇవి ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి.

ఉదా: మొక్కలు, నీటి ఆకుపచ్చ శైవలాలు, వృక్ష ప్లవకాలు, కొన్ని ఆక్టినోమైసిటీస్ వర్గానికి చెందిన బ్యాక్టీరియాలు, కీమోసింథటిక్ బ్యాక్టీరియాలు.

2. వినియోగదారులు (Consumers)
 తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం ఉత్పత్తిదారులు, ఇతర వినియోగదారులపై ఆధారపడి జీవించే జాతులు. వీటినే పరపోషకాలు అని కూడా పిలుస్తారు. ఆహార అలవాట్లను ఆధారంగా చేసుకుని వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి:

ఎ) ప్రథమ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారుల నుంచి పొందుతాయి. వీటినే శాకాహారులు అని కూడా పిలుస్తారు. ఇవి ఆహారపు గొలుసులో ద్వితీయ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి.

 ఉదా: మిడత, గొల్లభామ, కుందేలు, జింకలు.

 బి) ద్వితీయ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారుల నుంచి పొందుతాయి. అంటే ఇవి శాకాహార, మాంసాహార జీవనాన్ని గడుపుతాయి. వీటిని ప్రథమ మాంసాహారులు లేదా సర్వభక్షకుడు అని కూడా పిలుస్తారు. ఇవి ఆహారపు గొలుసులో తృతీయ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి.

ఉదా: మానవుడు, కోడి, పిల్లి, కుక్క.

 సి) తృతీయ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం ప్రథమ, ద్వితీయ వినియోగదారులపై ఆధారపడి ఉంటాయి. వీటినే ద్వితీయ మాంసాహారులు అని కూడా అంటారు. ఇవి ఆహారపు గొలుసులో చతుర్థ పోషక స్థాయిని ఆక్రమించాయి.

 ఉదా: నక్క, తోడేలు, హైనాలు, పాములు, పెద్ద చేపలు, కొంగలు, గద్దలు.

 డి) అంతిమ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం ఇతర వినియోగదారులపై ఆధారపడి జీవిస్తాయి. ఇవి ఆహారపు గొలుసులో పంచమ పోషక స్థాయిని ఆక్రమించాయి.

 ఉదా: పులులు, సింహాలు.

3. విచ్ఛిన్నకారులు (Decomposers)
 ఉత్పత్తిదారులు వినియోగదారులు చనిపోయిన తర్వాత, వాటి మృత కళేబరాల్లోని సంక్లిష్ట కర్బన పదార్థాలను, సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి, మృత కళేబర కాలుష్యం నుంచి పర్యావరణాన్ని పరిశుభ్రం చేసే జాతులు. అందువల్ల వీటిని 'ప్రకృతిలో పాకీ పని' నిర్వర్తించే జీవులుగా పేర్కొంటారు.

ఉదా: వివిధ రకాల బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు

4. రూపాంతరీకరణులు (Transformers)
 బ్యాక్టీరియాలు మృత కళేబరాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ (H2S) విషవాయువు విడుదలవుతుంది.

ఉదా:  సల్ఫర్ బ్యాక్టీరియా

5. పరాన్న జీవులు (Parasites)

 ఇతర జీవులపై నివసిస్తూ వాటి నుంచి ఆహారాన్ని పొందుతూ ఆశ్రయం ఇచ్చిన జీవికి హాని కలిగించేవి.

ఉదా:  జలగ, నల్లి, నులిపురుగులు (టేప్ వార్మ్స్).

ఆహారపు గొలుసులో మానవుడి స్థానం

 మానవుడు ఆహారపు గొలుసులో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ పోషక స్థాయిలోని ఏ స్థాయిలోనైనా ఆయా ఆవరణ వ్యవస్థలోని జీవ వైవిధ్యతను బట్టి ఉండవచ్చు. ఇందులో శాకాహారాన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే ప్రాథమిక వినియోగదారులుగా, చిన్న చేపలు, చికెన్, మాంసం లాంటి ఆహార పదార్థాలను వినియోగించినట్లయితే ద్వితీయ పోషక స్థాయిలో, పెద్ద చేపలను వినియోగించినట్లయితే తృతీయ వినియోగదారులుగా మానవుడిని పేర్కొనవచ్చు. మొత్తంగా పరిశీలించినట్లయితే మానవుడిని సర్వభక్షక జీవిగా పేర్కొంటారు.

జీవ-భూ రసాయన వలయాలు (లేదా) పోషక వలయాలు

* నిర్దిష్ట కాల వ్యవధిలో నేలలో, నీటిలో ఉన్నటువంటి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, హైడ్రోజన్, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ పోషకాల మొత్తాన్ని నిలకడ స్థితి అని పిలుస్తారు. నేలలో పోషక విలువల నిలకడ స్థితి రుతువును అనుసరించి వివిధ పరిమాణాల్లో ఉంటుంది. ఆవరణ వ్యవస్థలో పోషకాలు, శక్తి ఆహార పదార్థాల మాదిరి కాకుండా జీవులకు, వాటి పరిసరాలకు మధ్య బదిలీ అవుతూ ఉంటాయి.

* ప్రతి జీవికి ప్రత్యుత్పత్తి శ్వాసక్రియ, శారీరక ప్రక్రియలను నిర్వహించడానికి నిరంతరంగా పోషక పదార్థాలు
అందుబాటులో ఉండాలి.

* ఆవరణ వ్యవస్థలో పోషకాల పరిమాణం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అయితే అవి నిరంతరం జీవులకు, వాటి పరిసరాల మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ, జీవుల పోషకాలకు ఉపయోగపడతాయి. వీటినే జీవ-భూ రసాయనాలు అని పిలుస్తారు.

* జీవ-భూ రసాయన వలయాలు కొనసాగడంలో విచ్ఛిన్నకారులు కీలకపాత్ర వహిస్తాయి.

* సేంద్రియ పదార్థాల్లో చనిపోయిన వృక్ష, జంతు కళేబరాల నుంచి ఏర్పడ్డ ప్రొటీన్‌లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. ఈ సేంద్రియ పదార్థాలే బ్యాక్టీరియా చర్యల వల్ల చివరికి సరళమైన అకర్బన పోషక పదార్థాలుగా మారతాయి. ఆకుపచ్చని మొక్కలు పర్యావరణంలోని ఈ ఖనిజ పదార్థాలను గ్రహించి వాటిని మళ్లీ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్ అనే సంక్లిష్ట ఆహార పదార్థాలుగా మార్పు చెందించి ఆవరణ వ్యవస్థలోని ఇతర జీవ జాతులకు ఆహార గొలుసుల ద్వారా అందించడం వల్ల ఆవరణ వ్యవస్థల సమతౌల్యం పరిరక్షితమవుతుంది.

జీవ-భూ రసాయన వలయాలను కింది విధంగా విభజించవచ్చు.

  1. జల వలయం (Water Cycle)

  2. కర్బన వలయం (Carbon Cycle)

  3. నత్రజని వలయం (Nitrogen Cycle)

  4. ఫాస్ఫరస్ వలయం (Phosphorus Cycle)

  5. ఆక్సిజన్ వలయం (Oxygen Cycle)

శీతాకాల మృత్యువు (Winter kill)

 మంచుతో కప్పి ఉన్న జలాశయాల్లో కాంతిని లోపలికి ప్రసరించకుండా మంచు నియంత్రించడం వల్ల లోపలి జలాలు చీకటిమయం అవుతాయి. దీంతో జలాశయాల అడుగున కిరణజన్యసంయోగక్రియ చర్య ఆగిపోయి, శ్వాసక్రియ కొనసాగుతుంది. అందువల్ల లోతైన సరస్సుల్లో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి చేపలు చనిపోయినట్లు అనిపిస్తుంది. కాని పైన ఉన్న మంచు పొరలు కరగగానే చేపలు జీవించి ఉంటాయి. ఈ స్థితినే 'శీతాకాల మృత్యువు' అని పిలుస్తారు. దీనికి కారణం విఫోటిక్ మండలంలో శ్వాసక్రియ చర్య కొనసాగతూ ఉండటమే.

1. జల వలయం (Water Cycle)

* జీవులకు, వాటి చుట్టూ ఉన్న భౌతిక పరిమాణాలకు మధ్య నీరు, ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని 'జలచక్రం' లేదా జలవలయం అని పిలుస్తారు. దీని వల్ల జీవులకు ప్రాణాధారమైన నీరు అందుబాటులోకి వస్తుంది.

* జలచక్రం కొనసాగడానికి మూలం సూర్యుడు. భూమిని చేరిన సౌరవికిరణం వల్ల భూమి మీద ఉన్న జలాశయాలు, మొక్కలు, మంచు ప్రాంతాల నుంచి నీరు బాష్పీభవనం, భాష్పోత్పేకం, ఉత్పతనం లాంటి ప్రక్రియల ద్వారా వాతావరణంలోకి చేరి ద్రవీభవనం చెంది నీటి బిందువులు, మంచు రూపంలో భూ ఉపరితలాన్ని చేరి, ప్రవాహ వ్యవస్థల ద్వారా తిరిగి జలాశయాల్లోకి చేరుతుంది. ఈ నీరే భూమి మీద ఉన్న జీవజాతుల మనుగడకు కావాల్సిన నీటి వనరులను సమకూరుస్తుంది.

2. కర్బన వలయం (Carbon Cycle): 

* జీవ, నిర్జీవ పదార్థాల మధ్య కర్బన వినిమయాన్ని కర్బన వలయం అని పిలుస్తారు. భూ వాతావరణంలో చాలా తక్కువ పరిణామంలో అంటే 0.03% మాత్రమే ఉంటుంది. వృక్ష, జంతు కణజాలాల నిర్మాణానికి కార్బన్ వెన్నుముకలాంటిది.

* ట్రోపో ఆవరణంలో వాయు స్థితిలో అంటే కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతున్న కార్బన్‌ను సూర్యకాంతి సమక్షంలో మొక్కలు గ్రహించుకొని కార్బోహైడ్రేట్స్ రూపంలో సంశ్లేషణ చెందిస్తాయి. ఈ ఆహార పదార్థం ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులకు బదిలీ అవుతూ, చివరికి విచ్ఛిన్నకారులతో సరళ ఆకర్బన పదార్థాలుగా విడగొట్టబడుతాయి. అంతిమంగా అందులోని కార్బన్ తిరిగి వాతావరణంలోకి కొంత వాయుస్థితిలో, జలావరణం, శిలావరణంలోకి కార్బోనేట్స్, బై కార్బోనేట్స్ రూపంలో బదిలీ అవుతుంది. ఈ విధానం ద్వారా కార్బన్ శిలావరణం, వాతావరణం, జలావరణాల మధ్య ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ అవుతూ మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో కార్బోహైడ్రేట్స్ రూపంలో సంశ్లేషణ చెందుతుంది.

3. నత్రజని వలయం (Nitrogen Cycle):

* జీవులకు, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అని పిలుస్తారు.

* వాతావరణంలో నైట్రోజన్ వాయువు 78.084% ఉంటుంది.
 ప్రొటీన్‌లు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాలు, పెప్త్టెడ్ గొలుసుల నిర్మాణానికి నత్రజని మూలాధారంగా ఉంటుంది. ఇంత ముఖ్యమైన వాయువు అయినప్పటికీ జీవ జాతులు నైట్రోజన్ వాయువును ప్రత్యక్షంగా గ్రహించలేవు.

* వృక్షాలు నేల నుంచి నైట్రోజన్‌లను గ్రహిస్తాయి. రైజోబియం లాంటి బ్యాక్టీరియా వల్ల వాతావరణంలోని నైట్రోజన్ వాయువు, నేలలో నైట్రోజన్‌గా స్థిరీకరణకు గురౌతుంది. దీన్ని నత్రజని స్థాపన అని అంటారు.

* బాసిల్లన్ లాంటి పూతికాహార బ్యాక్టీరియాలు మృతకళేబరాలను విచ్ఛిన్నం చేసి అమ్మోనియాను విడుదల చేస్తాయి. ఈ విధానాన్ని అమ్మోనీకరణ (Ammonification)అంటారు.

* నైట్రో సోమోనస్ లాంటి నత్రీకరణ వల్ల అమ్మోనియా కొంత నైట్రేట్లుగా మారి శిలావరణంలోకి, మరికొంత స్వేచ్ఛా నత్రజని వాయువుగా మారి నేల నుంచి విడివడి వాతావరణంలోకి కలిసిపోతుంది. ఈ విధానాన్ని వినత్రీకరణ అని అంటారు.

* నత్రజని స్థాపన వంటి విధానాల వల్ల వాతావరణంలోని అకర్బన నత్రజని, కర్బన నత్రజనిగా మారి మొక్కల దేహాల్లోకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాల్లో కర్బన నత్రజని ప్రొటీన్లుగా నిర్మితం అవుతుంది.

* మొక్కల కళేబరాల్లోని కర్బన నత్రజని వినత్రీకరణ వల్ల ఆకర్బన నత్రజనిగా మారి వాతావరణంలోకి
వెలువడుతూ నత్రజని సాంద్రత స్థాయిని క్రమబద్ధం చేస్తుంది.

4. ఫాస్ఫరస్ వలయం (Phosphorus Cycle):

* అవక్షేప వలయాల్లో ఫాస్ఫరస్ వలయం చాలా ముఖ్యమైంది. ఫాస్ఫరస్ మూలకం అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ATP) గా కణజాల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇది శక్తి వాహకంగా వ్యవహరిస్తుంది.

* ఫాస్ఫరస్ మూలకం భౌమావరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థలో కొద్ది మాత్రంలో ఉంటుంది. ఫాస్ఫటిక్స్ శిలల శైథిల్యం ద్వారా ఫాస్ఫరస్ విడుదలై మొక్కలకు అందుబాటులో ఉంటుంది. ఆర్థోఫాస్ఫేట్ అయాన్‌ల రూపంలో ఉన్న అకర్బన ఫాస్ఫేట్‌లు వృక్షాల జీవన క్రియల్లో పాల్గొని ఆహారపు గొలుసు ద్వారా క్రమంగా వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు ప్రవహించి చివరకు నేలలో కలుస్తాయి. నేలలోకి విడుదలైన ఫాస్ఫేట్‌లు తిరిగి వృక్షాలకు వినియోగపడతాయి. కొంత భాగం వర్షపు నీటి ద్వారా సముద్రాలకు చేరి పిట్టల వంటి కొన్ని జీవజాతుల ద్వారా తిరిగి నేలను చేరుతుంది. నేటి ఆధునిక వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్ ఎరువుల వాడకం మరీ ఎక్కువైనందు వల్ల నీటిలో ఆక్సిజన్ కొరత వంటి 'యూట్రాఫికేషన్' నీటి కాలుష్య సమస్య ఏర్పడింది.

5. ఆక్సిజన్ వలయం (Oxygen Cycle):

* 'జీవులకు చుట్టూ ఉన్న పరిసరాలకు నిర్జీవ పదార్థాల మధ్య జరిగే ఆక్సిజన్ వినిమయాన్ని ఆక్సిజన్ వలయం' అని అంటారు. వాతావరణంలో ఆక్సిజన్ వాయువు 20.917% పరిమాణంలో ఉంది. జీవావరణంలోని హరిత వృక్షాలు ఒక సంవత్సరంలో విడుదల చేసిన ఆక్సిజన్ చదరపు మీటరుకు 8 మోల్స్ ఉంటుందని బ్రొక్కర్ (1970) మహాశయులు అంచనా వేశారు. ఈ వాయువు సర్వప్రాణుల శ్వాసక్రియకు సరిపోతుంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా ఓజోన్ పొరలో కూడా ఆక్సిజన్ అధిక మోతాదులోనే ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ వాయువు జీవరాశుల అవసరానికి మించి పుష్కలంగానే ఉంటుంది.

పర్యావరణ కాలుష్యం (ENVIRONMENT POLLUTION)

* 1986లో రూపొందించిన 'భారత కాలుష్య చట్టం' ప్రకారం 'ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఏదైనా అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి పర్యావరణ అనుఘటకాల్లో చేరి వాటి సహజ సంఘటనంలో మార్పు తీసుకురావడం వల్ల మానవుడు, ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించే స్థితిని 'పర్యావరణ కాలుష్యం' అని అంటారు.

* 'కాలుష్యం' అనే పదాన్ని ఆంగ్లంలో 'Pollution' అని అంటారు. ఈ Pollution అనే పదం 'పొల్యుటోనియం' (Pollutonium) అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్‌లో పొల్యుటోనియం అంటే 'అపరిశుభ్రత' అని అర్థం.

కాలుష్యకాలు - రకాలు: (Types of Pollutants)

* పర్యావరణ అనుఘటకాల సహజ గుణాన్ని మార్చివేసి వాతావరణంలో మానవ కార్యకలాపాల వల్ల చేరే ఇతర పదార్థాలను 'పర్యావరణ కాలుష్యకాలు' అంటారు.

1. సహజ క్షయం ఆధారంగా రెండు రకాలు

i) జీవ క్షయం చెందే కాలుష్యకాలు: సూక్ష్మజీవుల చర్యల వల్ల క్షయం చెందేవి. సక్రమ నిర్వహణ చేస్తే పర్యావరణానికి హాని చేయకుండా, మేలుచేస్తాయి.

ఉదా: చెత్త, చెదారం, వృక్ష, జంతు సంబంధిత అవశేషాలు, మురుగు, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు మొదలయినవి.

ii) జీవక్షయం చెందని కాలుష్యకాలు: సూక్ష్మజీవుల చర్యలకు లోను కాకుండా కొన్ని వందల సంవత్సరాలు పర్యావరణంలో అదే విధంగా ఉండి పర్యావరణానికి హాని కలిగించేవి.

ఉదా: ప్లాస్టిక్, గాజు, వైద్యపరమైన వ్యర్థాలు, కీటక నాశనులు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ బాటిళ్లు మొదలైనవి.
కాలుష్యాల ఉనికిని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు.

1) గుణాత్మక కాలుష్యకాలు: సహజ సిద్ధంగా పర్యావరణంలో ఉండవు. మానవుని చర్యల వల్ల పర్యావరణంలో కలసి పోతాయి.

ఉదా: రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు.

2) పరిమాణాత్మకమైన కాలుష్యకాలు: సహజ సిద్ధంగా పర్యావరణంలో ఉండే వేరే పదార్థాలు పర్యావరణ అనుఘటాల్లోకి ప్రవేశించడం వల్ల వీటి నిష్పత్తిలో మార్పు వస్తుంది.

ఉదా: CO2, N2, O2, SO2 మొదలైనవి

* కాలుష్యకాలు పర్యావరణ అనుఘటకాల్లో తీసుకువచ్చే మార్పులను బట్టి పర్యావరణ కాలుష్యాన్ని కింది విధంగా విభజించవచ్చు.

  1) వాయు కాలుష్యం

  2) జల కాలుష్యం

  3) నేల కాలుష్యం

  4) ధ్వని కాలుష్యం

  5) ఉష్ణ కాలుష్యం

  6) రేడియోధార్మిక కాలుష్యం

  7) అంతరిక్ష కాలుష్యం

  8) కాంతి కాలుష్యం మొదలైనవి.

1. వాయుకాలుష్యం (Air Pollution)

 ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం వాయుకాలుష్యం అంటే 'ఘన, ద్రవ, వాయు' స్థితిలో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు వాతావరణంలో పరిమితికి మించి చేరినప్పుడు అవి వాతావరణ సంఘటనంలో మార్పు తీసుకురావడం వల్ల జీవులకు, వాటి పరిసరాలకు హాని కలిగించే స్థితినే 'వాయుకాలుష్యం' అంటారు.
 వాయు కాలుష్యానికి అనేక కారకాలు కారణం అవుతున్నాయి.

1) కణరూప కాలుష్యకాలు: (Particulate Matter)

గాలిలో లేదా ద్రవాల్లో తేలియాడుతూ.. అంటే 10 మైక్రాన్ల పరిమాణం కంటే తక్కువ వ్యాసార్ధం ఉన్న ఘన, ద్రవ రూపంలోని రేణువులను 'కణరూప కాలుష్యకాలు' అని అంటారు.  రేణువులు (లేదా) ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని 'ఏరోసాల్' అని పిలుస్తారు.

ఎ) సూక్ష్మ కణరూప కాలుష్యకాలు

* వీటిని P.M.. 2.5 అని కూడా పిలుస్తారు. వీటి పరిమాణం 2.5 మైక్రాన్ల లోపు ఉంటుంది. వీటిని "Fine Particulate Matter" అని కూడా పిలుస్తారు.

కేంద్ర కాలుష్యనియంత్రణ బోర్డు (CPCB) సూచనల ప్రకారం PM 2.5 మానవునికి ఇతర గాలి పీల్చే జంతువులకు ఇవి చాలా హానికరం.

* ఇవి ఊపిరితిత్తుల్లో చొరబడి సులభంగా ఉబ్బసం, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, హృదయ స్పందనలు లయ తప్పడం మొదలైన వ్యాధులకు కారణమై ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి.

బి) స్థూల కణరూప కాలుష్యకాలు

* వీటినే PM10 అని పిలుస్తారు. వీటి పరిమాణం 2.5 మైక్రాన్ల నుంచి 10 మైక్రాన్లు కలిగి ఉంటుంది.

* వీటిని "Coarse Particulate Matter"అని పిలుస్తారు.

* లోహ ఆక్సైడ్‌లు, సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటివి PM 10 కాలుష్యకాలు

కణరూప కాలుష్యకాల వల్ల కలిగే దుష్ఫలితాలు:

1) సిలికాడస్ట్
స్టోన్ క్రషింగ్ పరిశ్రమల నుంచి సిలికా సంబంధిత ఏరోసాల్‌లు విడుదలై ఊపిరితిత్తులకు సంబంధించిన 'సిలికోసిస్' (Grinder's Disease) అనే వ్యాధిని కలుగజేస్తుంది. అంతే కాకుండా దాని వల్ల పరిసర ప్రాంతాల్లోని పంటలపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది.

2) బాక్సైట్ ధూళి
బాక్సైట్ గనుల్లో పనిచేసే వారికి 'బెరీలియోసిస్' అనే ఊపిరితిత్తుల వ్యాధి సంభవిస్తుంది

3) కాటన్ ధూళి
నూలు, వస్త్ర పరిశ్రమల్లో పని చేసే వారికి ధూళి వల్ల 'బయాప్సినోసిస్' (White lungs) అనే ఊపిరితిత్తుల వ్యాధి, దగ్గు, శ్వాసకోస వ్యాధులు సంభవిస్తాయి.

4) ఆస్‌బెస్టాన్ ధూళి
మైనింగ్, సిమెంటు రేకుల పరిశ్రమల నుంచి ఆస్‌బెస్టాస్ విడుదల అవుతుంది. 'ఆస్‌బెస్టోసిస్' అనే వ్యాధి సంభవిస్తుంది.

5) బొగ్గు గనుల్లో పనిచేసే వారికి, 'న్యుమోనియాసిస్' (Black lungs) అనే ఊపిరితిత్తుల వ్యాధి, కళ్లు, ముక్కు, గొంతు భాగాలకు అలర్జీ తాకడం, శ్వాసకోసవ్యాధులు రావడం జరుగుతుంది.

2. కార్బన్ మోనాక్సైడ్ (CO)

* ఇది చాలా ప్రమాదకర విషవాయువు.

* మోటారు వాహనాల నుంచి, పరిశ్రమల్లో బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలను అసంపూర్తిగా మండించడం వల్ల నివాస గృహాల్లో పంట చెరకు, బొగ్గు కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అధిక మోతాదులో విడుదల అవుతుంది.

* పరిసరాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అయితే రక్తంలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌కు బదులు COతో ఆక్సీకరణం చెంది కార్బాక్సీ హిమోగ్లోబిన్‌గా మారుతుంది. ఇది శరీర కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. దీంతో శ్వాసకోస వ్యాధులు సంభవించి చివరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

* బొగ్గు గనిలో పని చేసేవారు, గ్యారేజీలో పనిచేసే వారు ఎక్కువగా ఈ CO విషప్రభావానికి లోనవుతారు.

* గాలిలో దీని పరిమాణం 100 PPM (Parts Per Million atmosphere molecules) దాటితే మానవుల్లో తలనొప్పి, కళ్లు తిరగడం, తలభారంగా మారడం జరుగుతుంది.

3. కార్బన్‌డయాక్సైడ్ (CO2)

* థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో, పరిశ్రమలు, నివాసాల్లో, వెలువడుతుంది.

* హరిత గృహ ప్రభావం (Global Warming)కు ప్రధాన కారణం.

* భూమి మీద మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

* దీన్ని శీతల పానియాలు, నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారు.

* ముక్కు, గొంతులో దద్దుర్లు ఏర్పడటం, ఉబ్బసం మొదలైన వ్యాధులు సంభవిస్తాయి.

* ఆమ్ల వర్షాలకు కారణం అవుతుంది.

* నైట్రస్ ఆక్సైడ్ హరితగృహ ప్రభావానికి కారణం అవుతుంది.

* ఆస్తమా, కాలేయ, మూత్రపిండాల వ్యాధులు సంభవిస్తాయి.

6. ఓజోన్ (O3)

* ఇది ఒక ద్వితీయ కాలుష్యకం, దీని వల్ల శ్వాస పీల్చుకోవడం కష్టతరం అవుతుంది. గుండెనొప్పి, తరచూ శ్వాసకోస వ్యాధులు సంభవిస్తాయి.

7. క్లోరో ఫ్లోరో కార్బన్‌లు: (CFC)

* రిఫ్రిజిరేటర్లు, సెంట్లు, దోమలను నివారించే జట్ కాయిల్స్ మండించడం ద్వారా సీఎఫ్‌సీ విడుదల అవుతాయి.

* దీనివల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతినడం, అధిక రక్తపోటు, కోపం, చిరాకు, కళ్లు, ముక్కు, గొంతు, దెబ్బతినడం జరుగుతుంది.

భారలోహాలు వాతావరణంలోకి విడుదల అవడం

* పాదరసం పరిశ్రమల నుంచి విడుదల అవడం వల్ల 'బుద్ధి మాంద్యం ఏర్పడటం', నాడీ సంబంధ లోపాలు, శరీరంపై బుడిపెలు ఏర్పడటం, మినిమిటా వ్యాధి వంటివి సంభవిస్తాయి.

* లెడ్ పెట్రోల్ మండించడం వల్ల విడుదలయ్యే వాయువుల ద్వారా వాతావరణంలోకి చేరుతుంది. మెదడు, కేంద్రీయ నాడీ వ్యవస్థ, కిడ్నీలు దెబ్బతినడం, ఆలోచనా పరిజ్ఞానం మారడం వంటివి జరుగుతాయి.

* కాడ్మియం వాతావరణంలో కలిసి గుండెపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఇటాయి - ఇటాయి వ్యాధి సంభవిస్తుంది.

* భారతదేశంలో వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం 'ఆటో
ఇంధన పాలసీ'ని ప్రవేశపెట్టింది.

* ఈ పాలసీ ప్రకారం డీజిల్, పెట్రోల్, ఇంధనాల్లో సల్ఫర్ కారకాలను తగ్గించడానికి 4 దశల 'యూరో ప్రమాణాలను' విడుదల చేశారు.

* యూరో 2 నిబంధనల ప్రకారం డీజిల్లో సల్ఫర్‌ను 350 ppm, పెట్రోలులో సల్ఫర్‌ను 150 ppm తగ్గించాలని నిర్దేశించారు.

* యూరో 4 నిబంధనల ప్రకారం సల్ఫర్‌ను 50 ppm వరకు, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లను 35 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

* భారతదేశంలో యూరో IVనిబంధనలను 2010, ఏప్రిల్ 1 నుంచి పాటిస్తున్నారు.

* 2016, మే 12న ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన 'గ్లోబల్ యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ డేటా' నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 103 దేశాల్లోని 3 వేల నగరాల్లో సర్వే నిర్వహించగా అత్యంత కాలుష్య నగరాల్లో న్యూదిల్లీ PM 2.5 ఆధారంగా 11వ స్థానంలో, PM 10 పరంగా 25వ స్థానంలో ఉంది.

* ప్రపంచంలో అత్యంత కాలుష్య కారక నగరం ఇరాన్‌లోని 'జబోల్'. మొదటి '10' కాలుష్య నగరాల్లో 4, మొదటి 20 కాలుష్య నగరాల్లో 10 భారత్‌లోనే ఉన్నాయి.

* Yele Centre for Environmental Law and Policy - 2014 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక నగరం న్యూదిల్లీ.

* తర్వాత స్థానంలో చైనా రాజధాని 'బీజింగ్' ఉంది.

* దేశంలో కణరూప కాలుష్యకాలు అధికంగా ఉన్న నగరం, ప్రాంతం- న్యూ దిల్లీలోని ఎర్రకోట, కుతుబ్‌మినార్.

* తర్వాత స్థానంలో చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సమీపంలో ఉన్న 'సీతాచారి' అనే ప్రదేశం ఉంది.

* థర్మల్ విద్యుత్ కేంద్రాలు నుంచి వెలువడే కణరూప కాలుష్యకాలను నివారించడానికి 'ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్‌'ను వాడతారు.

* పరిశ్రమల నుంచి వెలువడే సూక్ష్మ రేణువుల లాంటి కాలుష్య కారకాలను తీసివేయడానికి ఉపయోగించే పరికరాన్ని స్క్రబ్బర్ (Scrubber) అని అంటారు.

2. జలకాలుష్యం (Water Pollution)

* భూమిపై 97% ఉప్పునీరు, 3% మాత్రమే మంచి నీరు ఉంది.

* ఇందులో 2% ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచురూపంలో, మిగిలిన 1% మంచి నీటిని పరిమితికి మించి వాడడం వల్ల దాని సహజగుణం కోల్పోతుంది.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం 'జలకాలుష్యం అంటే ఏదైనా అవాంఛనీయమైన పదార్థాలు నీటితో కలిసి భౌతిక, రసాయన, జీవసంబంధమైన మార్పులకు గురిచేసి దానిని తాగడానికి వీలులేని స్థితికి చేర్చడమే'.

* సాధారణంగా మురుగునీటి కాలుష్యం వల్ల జలాశయాల్లో 'యూట్రిఫికేషన్' కాలుష్యం (జీవసంబంధిత ఆక్సిజన్ కొరత) ఏర్పడి జలచరాలు నశించిపోతాయి.

* సముద్ర జలాల్లో మురుగునీరు చేరడం వల్ల 'నిడేరియా' వర్గానికి చెందిన ప్రవాళ జీవులు నశిస్తాయి.

* రసాయన, తోళ్లపరిశ్రమ, ఎరువుల పరిశ్రమల్లో వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నాడీమండలం, జీర్ణసంబంధ వ్యాధులు సంభవిస్తున్నాయి.

* పేపర్ తయారీ పరిశ్రమలో విడుదలయ్యే 'మిథైల్ మెర్క్యురీ' వల్ల 'మినిమిటా' వ్యాధి సంభవిస్తుంది.

* ఫాస్ఫేట్ సంబంధిత పరిశ్రమల్లో విడుదలయ్యే ఫ్లోరిన్ వల్ల 'ఫ్లోరోసిస్' వస్తుంది.

* పెయింట్, బ్యాటరీ, పింగాణీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే 'లెడ్' వల్ల హిమోగ్లోబిన్ ఉత్పాదన కుంటుపడటం

*క్రిటినిజం, కాలేయం, మూత్రపిండాలు చెడిపోవడం జరుగుతుంది.

* ఎలక్ట్రోప్లేటింగ్, లోహ, పురుగు మందుల పరిశ్రమల నుంచి విడుదలయ్యే 'కాడ్మియం' వల్ల స్త్రీలలో రొమ్ము నొప్పి, సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గడం, అతిసార వ్యాధి, ఇటాయి ఇటాయి వ్యాధి మొదలైనవి సంభవిస్తాయి.

* వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు ఆర్గానోక్లోరైడ్స్ అండ్ ఆర్గానోఫాస్ఫైడ్స్ వల్ల మానవుడిలో కాలేయం, మూత్రపిండ వ్యాధులు, వానపాముల వంటి ఉపయోగకర జీవులు చనిపోవడం, పక్షుల గుడ్ల కర్పరాలు పలుచబడటం జరుగుతుంది.

* చమురు, నీటిపై ఒక పొరలా ఏర్పడి వాతావరణంలోని ఆక్సిజన్ నీటిలో కరుగకుండా ఆపుతుంది. ఫలితంగా నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. పారాఫిన్లు, మీథేన్, ఈథేన్ మొదలైన వాయువులు పీల్చినప్పుడు శ్వాస సంబంధ వ్యాధులు సంభవిస్తాయి.

జల కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు

1. మినిమిటా వ్యాధి

* ఇది జల కాలుష్యం వల్ల మానవునిలో సంభవిస్తుంది.

* జపాన్‌లోని 'మినిమిటా' గ్రామంలో 1953లో ఈ వ్యాధిని గుర్తించారు.

* కాగితం, రంగుల పరిశ్రమల నుంచి మెర్క్యురి వ్యర్థ రూపంలో జలాశయాల్లోకి చేరినప్పుడు 'డైమిథైల్ మెర్క్యురి' నీటిలో కరిగి చేపల శరీరంలో సాంద్రీకృతం అవుతుంది. దీంతో ఆ చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.

లక్షణాలు:

  * పాదాలు, చేతులు స్పర్శజ్ఞానాన్ని కోల్పోతాయి.

  *  వినికిడి సామర్థ్యం, కంటి చూపు తగ్గిపోతుంది.

  * జన్యుపరమైన మార్పులు సంభవిస్తాయి.

2. ఇటాయి - ఇటాయి వ్యాధి

* ఈ వ్యాధిని మొదటగా జపాన్‌లోని 'ఇటాయి' గ్రామంలో గుర్తించారు.

* వరిపొలాల్లో వేసే పురుగు మందులు, జింక్ సంబంధిత పరిశ్రమల నుంచి విడుదలయ్యే మురుగు నీరు ద్వారా

'కాడ్మియం' ఎక్కువగా పంటపొలాల్లో సాంద్రీకృతం అవుతుంది. దీంతో అది వరి, గోధుమ ద్వారా మానవ ఆహారంలో చేరి

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

లక్షణాలు:

 * ఎముకలు విరూపణ చెందడం.

 * మూత్రపిండాల, కేంద్ర పరిధీయ నాడీ వ్యవస్థ దెబ్బతినడం.

 *  రక్తహీనత

 * అతిసారవ్యాధి

 * స్త్రీలలో రొమ్మునొప్పి, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం.

 * భారతదేశంలోని పశ్చిమ్ బంగలో ఈ తరహా వ్యాధి ప్రభావం, లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

3. మిథైల్ హిమోగ్లోబేనియా [OR] BLUE BABY SYNDROME:

* తాగునీటిలో 'నైట్రేట్స్' కాలుష్యకాలు ఎక్కువగా చేరినప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో సంభవించడం వల్ల పుట్టబోయే శిశువులు నీలి రంగులో లేదా క్యాన్సర్ వ్యాధితో జన్మిస్తారు. చర్మం నీలిరంగులోకి మారుతుంది.

* పంటల్లో అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల భూగర్భ జలాల్లో నైట్రేట్స్ గాఢత పెరుగుతుంది.

* ఈ నైట్రేట్స్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి 'మెటాహి హిమోగ్లోబియా' సంక్లిష్టంగా మారడం వల్ల శరీర కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి ఈ దుష్ప్రభావం ఏర్పడుతుంది.

వ్యాధి లక్షణాలు:

* శ్వాసకోశ, రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

* చర్మం నీలి రంగులోకి మారుతుంది.

* కాన్సర్ సంభవిస్తుంది.

* పిరమిడల్ సిండ్రోమ్ లాంటి నేత్ర సంబంధ వ్యాధులు వస్తాయి.

* భారతదేశంలోని రాజస్థాన్, నాగపూర్, తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో జల కాలుష్యం (నైట్రేట్లు) ఏర్పడుతుంది.

* నీటి నాణ్యతను కొలిచే ప్రమాణం 'విలీన ఆక్సిజన్' [Dissolved Oxygen].విలీన ఆక్సిజన్ అంటే నీటిలో
కరిగిన ఆక్సిజన్ పరిమాణం.

* జలాశయాల్లో ఆక్సిజన్ పరిమాణం 5 ppm కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే ఆ నీరు సాగు, తాగునీటి అవసరాలకు జలచర జీవుల నివాసానికి ఉపయోగపడతాయి.

* విలీన ఆక్సిజన్ 5 ppm కంటే తగ్గితే జలకాలుష్యం, యూట్రిఫికేషన్ కాలుష్యం ఏర్పడుతుంది.

* ఓలిగోట్రాఫికేషన్ అంటే కొత్తగా తవ్విన బావులు, సరస్సులు, చెరువులు మొదలైన వాటిలో నీరు నిలకడగా
ఉంటుంది. జలాశయాల్లో నీటి మొక్కలు, నీటి జంతువులకు కావలసిన పోషక పదార్థాలు ఉండక నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దీనినే ఓలిగోట్రాఫికేషన్ అంటారు.

యుట్రిఫికేషన్ (or) శైవల మంజరులు (Algal Blooms)

* జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు జలాశయమంతా శైవల మొక్కలు విస్తారంగా పెరగడాన్ని 'యుట్రిఫికేషన్' (లేదా) 'శైవల మంజరులు' అంటారు.

* ఇవి నీటికి ప్రత్యేక రంగును కలగజేస్తాయి. నీటి నాణ్యతను క్షీణింపచేస్తాయి.

* నివాస ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగు, రొయ్యలు, చేపల చెరువుల నుంచి వచ్చే ఫాస్పేట్ నైట్రేట్ లాంటి పోషకాలు జలాశయాల్లో కలవడం దీనికి ముఖ్యకారణం.

* నీటిలో పెరిగే మొక్కల్లో సాధారణ నీటి 'హైయాంతిస్' (హయాంసిత్) ఒకటి. దీన్ని 'టెర్రర్ ఆఫ్ బెంగాల్' అంటారు. ఇది ప్రపంచంలో చాలా సమస్యాత్మకమైన కలుపు మొక్క. ఇవి పెరగడం వల్ల అన్ని నీటి మార్గాలు మూసుకుపోతాయి. మనం వాటిని తొలగించే సామర్థ్యం కంటే వేగంగా పెరుగుతాయి.

నీటి కాలుష్య పరిమితి (Degree of water Impurity)

* కలుషితమైన నీటి pH ఆ నీటిలోని ఆక్సిజన్, కాల్షియం పరిణామాలు, ఫాస్పేట్‌ల స్థాయి, సేంద్రియ పదార్థాలు,
విష పదార్థాలు మొదలైన పదార్థాలను బట్టి మారుతూ ఉంటుంది.

* నీటిలో కరిగిన ఆక్సిజన్ గాఢత 5 ppm కంటే తగ్గితే చేపలు జీవించలేవు.

* నీటి కాలుష్య పరిమితి BOD, COD విలువను బట్టి లెక్కించవచ్చు.

BOD అంటే Biological Oxygen Demand

* COD అంటే Chemical Oxygen Demand

BOD: ప్రమాణ ఘనపరిమాణం ఉన్న నీటిలోకి కర్బన వ్యర్థాలను సూక్ష్మజీవులు వాయుయుత స్థితిలో, జీవ రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకున్న ఆక్సిజన్ పరిమాణాన్ని BOD(Biological Oxygen Demand)అంటారు.

* BODని సూక్ష్మజీవులు 5 రోజులకు లేదా 7 రోజులకు వినియోగించుకునే అవధి ఆధారంగా కొలుస్తారు.

COD: నీటిలోని కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి బలమైన రసాయన కారకాలకు అవసరమైన ఆక్సిజన్‌ను సరి సమానంగా రెండు గంటల్లో పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో పొందగలిగే ఆక్సిజన్ పరిమాణాన్ని 'COD' అని అంటారు.

జల కాలుష్యం - నివారణ పద్ధతులు

* మురుగును జలాశయాల్లోకి విడుదల చేసే ముందే 'సీవేజ్ ట్రీట్‌మెంట్' (మురుగునీటి శుద్ధి కేంద్రాల) ద్వారా శుద్ధి చేసి విడుదల చేయాలి.

* పారిశ్రామిక, పురపాలక వ్యర్థాలను రీసైకిల్ చేయాలి.

* మురుగును చిల్లగింజల ద్వారా ఖర్చు తక్కువతో శుద్ధి చేయవచ్చు.

* రసాయన ఎరువుల స్థానంలో కంపోస్టు, వర్మీకంపోస్టు లాంటి జీవ ఎరువులను వినియోగించాలి.

* అయాన్‌ల వినిమయం, అధిశోషణ విద్యుత్ విశ్లేషణ లాంటి ప్రక్రియ ద్వారా బయో కెమికల్ కాలుష్యాలను నీటి నుంచి తొలగించాలి.

* సముద్ర జలాల్లో పేరుకుపోయే సుడోమోనాస్ బ్యాక్టీరియా ద్వారా విక్షాళనం చెందించాలి.

* ఇటీవల భారత సంతతికి చెందిన 'ఆనంద్ చక్రవర్తి' అనే అమెరికన్ శాస్త్రవేత్త సముద్ర జాలాల్లో చమురు కాలుష్యాన్ని నియంత్రించే Oil Eating Bacteria 'సూపర్ బగ్‌'ను రూపొందించారు.

* జల కాలుష్యం నియంత్రణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ని అనుసరించి 1974లో జల కాలుష్య నివారణ చట్టాన్ని చేశారు.

3. ధ్వని కాలుష్యం (Sound Pollution)

* అవాంఛనీయమైనటువంటి దుర్భరమైన, వినసొంపుగాలేని ధ్వనులు వాతావరణంలో కలవడాన్ని, 'ధ్వని కాలుష్యం' అంటారు. దీని కారణంగా మానవుడిలో చికాకు, కోపం రావడం, మానసిక ప్రశాంతత దెబ్బతినడం వంటివి చోటు చేసుకుంటాయి.

* ధ్వని తీవ్రతను 'డెసిబెల్స్‌'లో కొలుస్తారు. మానవుడు వినగలిగిన కనీస ధ్వని స్థాయి 1 డెసిబెల్. గరిష్ఠ ధ్వని స్థాయి 80 డెసిబెల్స్

* ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవుడు వినగలిగిన ధ్వని స్థాయిని అనుసరించి ధ్వని తీవ్రత అవధులను కింది విధంగా విభజించింది.

  1. 0 డెసిబెల్ ఎటువంటి శబ్దం ఉండదు

  2. 10 - 50 డెసిబెల్స్ శ్రావ్యత ఉన్న ధ్వని

  3. 50 - 80 డెసిబెల్స్ మాధ్యమిక ధ్వని స్థాయి

* 80 - 110 డెసిబెల్స్ - బిగ్గర ధ్వని స్థాయి లేదా అపాయకరమైన ధ్వని స్థాయి, తాత్కాలిక చెవుడు ఏర్పడుతుంది.

* 110 - 180 డెసిబెల్స్ ఉన్నప్పుడు - (జెట్ విమానాలు చేసే ధ్వని స్థాయి) ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది.

* ఈ స్థితిలో చెవిలోని టెంపోనిక్ పొర అనగా కర్ణభేరి పనిచేయక మానవుడు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతాడు.

* భారతదేశంలోని నగరాల్లో, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు చేత సిఫారసు చేసిన గరిష్ఠ అనుమతిచ్చిన శబ్ధ స్థాయిలను దిగువ పట్టికలో పొందుపరిచారు.

 

వర్గం                                                                                            పగలు    రాత్రి
నివాసాలుండే ప్రాంతం      50 డె.బి.  49 డె.బి.
వాణిజ్యపరమైన ప్రాంతం     60 డె.బి.  50 డె.బి.
పరిశ్రమల ప్రాంతం 70 డె.బి.  65 డె.బి.

 

వైద్యశాలలు, విద్యాసంస్థలు,

పూజలు జరిగే ప్రదేశాలు నిశ్శబ్ద మండలాలు

ధ్వని కాలుష్యానికి కారణాలు:

* గృహాల్లో ఉపయోగించే గ్రైండర్‌లు, వాషింగ్ మిషన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయడం వల్ల వచ్చే శబ్దాలు.

* పరిశ్రమల్లో యంత్ర పరికరాల నుంచి వెలువడే శబ్దాలు

* తవ్వకాల ప్రదేశాల్లో యంత్రాల నుంచి వెలువడే శబ్దాలు

* నగర కూడళ్లలో వాహనాల నుంచి వెలువడే శబ్దాలు

* రాజకీయ భవనాలు, ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్ల నుంచి వెలువడే శబ్దాలు

ధ్వని కాలుష్యం వల్ల మానవుడిలో కలిగే దుష్ఫలితాలు

* చికాకు, కోపం రావడం, మానసిక ప్రశాంతత దెబ్బతినడం

* తీవ్ర ఒత్తిడికి లోను కావడం వల్ల రక్తపోటు, డయాబెటిస్, ఎసిడిటీ లాంటి వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్తనాళాలు సంకోచించి గుండెపోటుకు దారి తీస్తుంది.

* చిన్న పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందక బుద్ధి మాంద్యం సంభవిస్తుంది.

* కాలేయం, మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రభావం కలుగుతుంది.

* ధ్వని వేగాన్ని మించిన సూపర్ సోనిక్ విమానాల నుంచి వెలువడే శబ్దాల వల్ల ఏర్పడే శబ్ద తరంగాల ప్రభావాన్ని 'సోనిక్ ధూమ్' లేదా తరంగ ఘాతం అని పిలుస్తారు. ఈ ఉనికిపాటు ధ్వని పర్యావరణాన్ని కలుషితం చేయకుండా, కిటికీ అద్దాలు పగలటం, స్త్రీలలో గర్భస్రావం జరగటం, నెలలు నిండకుండా ప్రసవాలు జరగటం లాంటి ప్రమాదాలు ఏర్పడతాయి.

నివారణ చర్యలు

 పరిశ్రమల్లో యంత్రాల నుంచి వెలువడే శబ్దాలను ప్రెసిఫిటేటర్స్, ఇన్సురేటర్స్ అనే పరికరాల ద్వారా నిర్వీర్యపరచాలి.

* పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు చెవిప్లగ్‌లను ఉపయోగించాలి.

* రోడ్డు మార్గాలకు ఇరువైపులా పారిశ్రామిక ప్రాంతాల్లో ధ్వని తీవ్రతలను నియంత్రించే వృక్ష జాతులను పెంచాలి.

* పరిశ్రమలను మానవ ఆవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి.

* వాహనాలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ, సైలెన్సర్‌ను ఉపయోగించాలి. దీని అమలుపై నిరంతరం చట్టపరమైన పర్యవేక్షణ ఉండాలి.

* యంత్రాల డిజైనింగ్‌లో మార్పు చేయడం, యంత్రాలకు సౌండ్ ప్రూఫ్ క్యాబ్స్ ఏర్పాటు చేయాలి.

* ప్రజోపకరమైన వాహనాలను మినహాయించి మిగతా వాహనాలను నగరాలకు దూరంగా మళ్లించాలి.

* ప్రార్థనా మందిరాల్లో, రాజకీయ సమావేశాల్లో లౌడ్‌స్పీకర్‌ల వినియోగం నిషేధించాలి.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రూపొందించిన పరిశ్రమల్లో షిఫ్టుకు పనిచేసే కార్మికులకు 90 డెసిబెల్స్ కన్నా ధ్వని తీవ్రత మించకుండా కాలుష్య నివారణ బోర్డులు నిరంతరం పర్యవేక్షించాలి.

* 1987లో ధ్వని కాలుష్య నియంత్రణకు చట్టబద్ధత కల్పించేందుకు ఈ అంశాన్ని వాయు కాలుష్య నివారణ చట్టంలో చేరుస్తూ 1987లో వాయు కాలుష్య నివారణ చట్టానికి సవరణ చేశారు.

* 2000లో కేంద్ర ప్రభుత్వం 'ద నాయిస్ పొల్యూషన్ అండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్' అనే మరో చట్టాన్ని చేశారు.

4. భూ లేదా మృత్తికా కాలుష్యం

* భూ పటలంలోని శిలలు భౌతిక, రసాయనిక వైఫల్యానికి గురికావడం వల్ల ఏర్పడే ఖనిజాలతో కూడిన భూ ఉపరితలంపై వదులుగా ఉన్న శిలాపొరనే నేలలు అని పిలుస్తారు. ఇందులో 4 ప్రధాన అను ఘటకాలు ఉంటాయి.

* ఖనిజాలు

* సేంద్రీయ పదార్థం

* మృత్తికా ద్రావణం

* వాయువులు

* భూ కాలుష్యం అంటే సహజసిద్ధ కారణాల వల్ల లేదా మానవుడు అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టే చర్యల వల్ల మృత్తికా అనుఘటకాల్లో వచ్చే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన మార్పులనే మృత్తికా కాలుష్యం అని అంటారు. దీని వల్ల

మృత్తికల ఉత్పాదకత తగ్గిపోవడం. అందులో పెరిగే మొక్కల లక్షణాల్లో మార్పులు సంభవించి పంటల ఉత్పత్తులు తగ్గిపోతాయి.

* మృత్తికా కాలుష్యానికి కారణాలను, వాటి నుంచి విడుదలయ్యే కాలుష్యాలను తద్వారా మానవుల్లో, మొక్కల్లో సంభవించే దుష్ఫలితాలను కింది పట్టిక ద్వారా తెలియజేశారు.


* పైన తెలియజేసిన వాటిలో నేల క్రమక్షయం కూడా భూ కాలుష్యానికి కారణం అవుతుంది. అడవుల నరికివేత, సరైన పంటల విధానం పాటించకపోవడం, నేల క్రమక్షయానికి కారణం అవుతుంది. అంతే కాకుండా అణుశక్తి ఉత్పత్తి కార్యక్రమాలు పెరిగిపోవడంలో అనేక రేడియోధార్మిక పదార్థాలు భూమిలోకి విడుదల కావడం వల్ల నేలలు మృత్తికలు కాలుష్యానికి గురి అవుతున్నాయి. దీని కారణంగా వ్యర్థ భూములు విస్తృతి పెరగడం, నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు క్షీణించి పంట ఉత్పత్తులు తగ్గడం మొదలైన దుష్ఫలితాలు కలుగుతాయి.

5. అటవీ నిర్మూలన

 మానవుడు సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక వాణిజ్య నివాస అవసరాల కోసం అటవీ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల అటవీ వనరుల విస్తృతి దేశంలో క్రమంగా తగ్గిపోతుంది. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33.3% ఉండాల్సిన అడవులు ప్రస్తుతం 21.3 శాతానికి తగ్గిపోవడం జరిగింది. దీని వల్ల కింద తెలిపిన సమస్యలను ఎదుర్కోవడం జరుగుతోంది. అవి
నేల క్రమక్షయం

రుతుపవనాలు గతితప్పడం

    భూగర్భజలాల మట్టం తగ్గడం

   * జీవవైవిధ్యత దెబ్బతినడం

   *వాతావరణంలో కాలుష్య స్థాయి పెరిగిపోవడం

   * గిరిజనుల జీవన చర్యలు దెబ్బతినడం

   జన్యు వైవిధ్యత దెబ్బతినడం

అటవీ నిర్మూలనకు కారణాలు:

* అటవీ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చడం.

* కొండవాలు ప్రాంతాల్లో గిరిజనులు పాటించే పోడు వ్యవసాయం

* గనుల తవ్వకం

* నీటిపారుదల, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం

* రోడ్డు, రైల్వే మార్గాలు నిర్మించడం

* పెద్ద మొత్తంలో పశువులను మేపడం

* నక్సలిజం, బోడోలాండ్ లాంటి మానవ అసాంఘిక కార్యకలాపాలు

* గ్లోబల్ వార్మింగ్ సదస్సు

* సంరక్షణ చర్యలు ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించే శాసనపరమైన చర్యలు. ఇవి అటవీ విస్తృతిని పెంచేందుకు ఉపయోగపడతాయి.

* శాస్త్రీయ పద్ధతుల అటవీ వనరులను వాణిజ్య స్థాయిలో వినియోగించుకునే చర్యలు

వనీకరణ చర్యలు

* అటవీ విస్తృతిని పెంపొందించే క్రమంలో భాగంగా కింద తెలిపిన కార్యక్రమాలను అమలు చేయడం
జరుగుతుంది.

* సామాజిక అడవుల పెంపక కార్యక్రమం

* వన మహోత్సవ కార్యక్రమాలు (మార్చి 21)

* జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (JFM) స్థానిక ప్రజలను అటవీ సంరక్షణలో భాగస్వామ్యం చేసే పథకం

* పట్టణ అటవీ విధానం (Urban Forestry)

* వనసంరక్షణ సమితి (VSRS)

* అటవీ వాణిజ్యం (Commercial Forestry)

* అటవీ, వ్యవసాయ పథకాలు (Agro Forestry Schemes)

* కణజాల వర్థనం, ఇతర ఆధునిక పద్ధతుల ద్వారా మొక్కలను పెంచి అడవులను అభివృద్ధిపరిచే విధానం
(Silvi Culture).

6. థర్మల్ లేదా ఉష్ణకాలుష్యం

* థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణువిద్యుత్ కేంద్రాలు, బొగ్గు ఇంధనంగా ఉపయోగించే భారీ పరిశ్రమల్లో దాదాపు 70% ఉష్ణశక్తి బహిర్గతమవుతుంది. ఈ ఉష్ణోగ్రతను తగ్గించడానికి సమీపంలో ఉన్న నదుల నుంచి లేదా జలాశయాల నుంచి కండెన్సర్‌ల ద్వారా నిరంతరం నీటి ప్రవాహన్ని పంపించి చల్లబరుస్తారు. ఈ విధంగా నీటి ప్రవాహం కండెన్సర్ల ద్వారా ప్రవహించి, ఆ యంత్రాలను చల్లబరిచి, విడుదలై ఆ నీరు సమీప నదిలో కలుస్తుంది. ఈ నీరు సుమారు 6º సెంటీగ్రేడ్‌ల నుంచి 10o సెంటీగ్రేడ్‌ల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.

థర్మల్ కాలుష్య ప్రభావం

* విలీన ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.

* నీటిలో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ DO విలువలు తగ్గిపోయి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడుతుంది. ఉదాహరణకు 32o F వద్ద నీటిలో D.O విలువలు 14.6 ppm ఉండగా, 64oF వద్ద 5 ppm కంటే తక్కువగా పడిపోతుంది. దీని కారణంగా నీటిలో ఉండే సున్నిత జలచరాలు ఈ వేడికి తట్టుకోలేవు. అంతే కాకుండా వాటికి చాలా విస్తృతమైన ఆక్సిజన్ కరిగిన స్థితిలో లేకపోవడం వల్ల సున్నిత బ్యాక్టీరియా, ప్రోటోజోవా వంటి జీవులుచనిపోతాయి.

* సహజమైన నీటిలో ఇవి వృద్ధి చెందుతూ ఆహారపు గొలుసులో పెద్ద జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. కాబట్టి పై జీవులు నశించడం వల్ల మిగతా జలచరాలకు ముప్పు పెరుగుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద హానికరమైన బ్యాక్టీరియా మాత్రమే మనగలుగుతుంది. వీటి మూలంగా వైవిధ్యానికి భంగం కలుగుతుంది. పైగా ఈ స్థితిలో శైవలాలు వృద్ధి చెంది యూట్రిఫికేషన్ ప్రక్రియ వల్ల నీరు ఎందుకూ పనికి రాకుండా పోతుంది.

థర్మల్ కాలుష్య నియంత్రణ

* థర్మల్ కాలుష్యం వల్ల జలచరాల జీవ వైవిధ్యం దెబ్బ తినడంతో పాటు, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది. కాబట్టి థర్మల్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. వీటిలో కొన్ని చర్యలు ఈ విధంగా ఉన్నాయి.

*  కూలింగ్ టవర్స్‌ను ఏర్పాటు చేయడం.

*  కూలింగ్ పాండ్స్‌ను ఏర్పరచడం.

*  కృత్రిమ జలాశయాలను ఏర్పాటు చేయడం మొదలైనవి.

7. ఘన వ్యర్థాల కాలుష్యం - నిర్వహణ

*  పట్టణ, నగర మానవ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఆధునిక జీవనశైలి, వినిమయ స్వభావం పెరగడంతో ఉపయోగించి అనంతరం పారవేసే పద్ధతిలో వస్తూత్పత్తిని చేపట్టడంతో ఘన వ్యర్థాల ఉత్పత్తి అధికమవుతోంది.

*  ఘన వ్యర్థాల సమస్య ప్రధానంగా పట్టణ, నగరజనావాసాల్లో ప్రధానంగా ఉంది. ఈ ఘన వ్యర్థాలను వాటి మూలాన్ని బట్టి 4 రకాలుగా విభజించవచ్చు. అవి.

*  గృహ సంబంధిత వ్యర్థాలు పెద్ద పెద్ద మెట్రోపాలిటిన్ నగరాల్లో ఇదో ప్రధాన సమస్య.

ఎ) జీవక్షయం చెందేవి: వంటశాల చెత్త, పాడైపోయిన వస్త్రాలు, పేపరు, లెదర్ వస్తువులు.

బి) జీవక్షయం చెందనివి: ప్లాస్టిక్ గ్లాసు, సిరామిక్, లోహసంబంధ వ్యర్థాలు.

పారిశ్రామిక సంబంధ వ్యర్థాలు: ప్త్లెయాష్, బ్యాటరీలు, మైకా లోహ సంబంధ వ్యర్థాలు.

హాస్పిటల్ (బయో మెడికల్): సిరంజిలు, వాడేసిన కాటన్, సెలైన్ బాటిల్, మాంసపు ముద్దలు, అన్ని ఘన వ్యర్థాల్లో బయోమెడికల్ ఘన వ్యర్థాలు చాలా హానికరమైనవి.

ఈ-వ్యర్థాలు: పాడైపోయిన కంప్యూటర్లు, ప్రింటర్లు, టెలివిజన్‌ల లోని విషపూరిత రసాయనాలు, లోహ సంబంధ పదార్థాలు, భార లోహాలు.

* ఈవ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు, రేడియోధార్మిక వ్యర్థాలను అత్యంత ప్రమాదకర వ్యర్థాలుగా పిలుస్తారు.

ఘన వ్యర్థాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు:

*  అధిక జనాభా

*   పట్టణీకరణ

*   జీవన ప్రమాణాలు పెరగడం

*   సాంకేతిక పరిజ్ఞానం

దుష్ప్రభావాలు: ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేనట్లయితే కింద తెలిపిన పర్యావరణ ఆరోగ్య, ఆర్థికపరమైన దుష్ప్రభావాలు కలుగుతాయి. అవి:

* భూ జల వనరులు కలుషితమవుతాయి. దీని వల్ల ఫ్లోరిన్, లెడ్ లాంటి భార లోహ కాలుష్యకాలు మానవ ఆహార శృంఖలాల్లో జీవ ఆవర్తనం చెంది ఫ్లోరోసిస్ లాంటి వ్యాధులు, డయేరియా, విరోచనాలు లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.

* విషవాయువులతో గాలి దుర్గంధభరితమై మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి.

*  సూక్ష్మజీవుల వ్యాప్తి పెరుగుతుంది. ఎలుకలు, పందికొక్కుల బెడద ఎక్కువై ప్లేగు లాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

* వ్యర్థం కారణంగా సౌందర్యంతో నిండిన పరిసరాలు అంద విహీనంగా మారుతాయి.

*  గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాన్ని తొలగించడం, స్థానిక సంస్థల పరిపాలనకు ఆర్థిక భారంగా
పరిణమిస్తుంది.

ఘన వ్యర్థ నిర్వాహణలో ఇమిడి ఉన్న పద్ధతులు:

*  భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 60 మిలియన్ టన్నుల ఘన వ్యర్థ పదార్థం ఉత్పత్తి అవుతోంది. CPCB (Central Pollution Control Board) అందించిన వివరాల ప్రకారం దేశంలో ఘనవ్యర్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరాల్లో దిల్లీ (3.3 మి.ట.) ప్రథమ స్థానంలో ఉండగా, తరువాత స్థానంలో ముంబయి (2.7 మి.ట.), చెన్నై (1.6 మి.ట.) హైదరాబాద్ (1.4 మి.ట)లు ఉన్నాయి. రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్ర (7 మి.ట.) ప్రథమ స్థానంలో ఉండగా తరువాత స్థానంలో పశ్చిమ బంగ (4.5 మి.ట.) ఉంది.

*  ఘన వ్యర్థాల నిర్వహణలో ఇమిడి ఉన్న పద్ధతులను కింద పేర్కొనడం జరిగింది.

1. వ్యర్థ పరిమాణాన్ని తగ్గించి పోగుచేయడం: (Reduction & Dumping)

ఎ) వ్యర్థం జనించే ప్రాంతంలోనే వాటి పరిమాణాన్ని తగ్గించాలి. అందులో జీవక్షయం చెందే చెత్తను గుంతలు తీసి పూడ్చి కంపోస్ట్‌గా ఎరువుగా మార్చాలి.

బి) పల్వరైజేషన్: గ్రైండింగ్ మిషన్ల ద్వారా వ్యర్థాన్ని ముక్కలుగా చేసి దాని భౌతిక స్వరూపాన్ని, పరిమాణాన్ని మార్చే విధానం. దీని వల్ల వ్యర్థం రుచి మారి కీటకాలకు ఆకర్షణీయంగా లేకుండా పోతుంది. తరువాత గుంతలు తీసి పూడ్చవచ్చు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల భారతదేశంలో ఈ విధానం అమలులో లేదు.

సి) ల్యాండ్ హిల్లింగ్: జీవక్షయం చెందని, పునర్వినియోగానికి, పునఃచక్రీకరణకు వీలు కాని వ్యర్థాన్ని లోతట్టు ప్రాంతాల్లో పూడ్చాలి.

2) పునఃచక్రీకరణ, పునర్వినియోగం (Recycling and Re-use)

*  ఘన వ్యర్థాన్ని ముడి పదార్థంగా మార్చి తిరిగి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చుకొనే విధానం. దీని ద్వారా వ్యర్థాల కాలుష్యాన్ని నియంత్రించడమే కాకుండా, సహజ వనరుల మీద ఒత్తిడిని తగ్గించవచ్చు. ఆల్పాదాయ వర్గాలకు ఉపాధిని కల్పించవచ్చు. ఇందులోని భాగాలు

ఎ) కంపోస్టింగ్: ఉత్పత్తి ప్రాంతంలోనే జీవక్షయం చెందే వ్యర్థాలన్నింటినీ ఆక్సిజన్ సమక్షంలో సూక్ష్మజీవుల చర్య ద్వారా ఎరువు, మీథేన్ వాయువును ఉత్పత్తి చేయడం.

బి) వర్మికంపోస్ట్: బహిరంగ ప్రదేశాల్లో ఏర్పడే జీవక్షయం చెందే వ్యర్థాన్ని వానపాము చర్య ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియ.

సి) ఇన్సినరేషన్: 800o సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద హాస్పిటల్ సంబంధ వ్యర్థాలను మండించి దాని నుంచి వెలువడే వేడి నుంచి విద్యుత్తును తయారు చేయడం.

డి) పునర్వినియోగం: ఒక వస్తువును అది చెడిపోయినంతవరకు వివిధ రూపాల్లో వివిధ అవసరాలకు ఉపయోగించడం.

3) సముద్రాలలో పారవేయడం: తీరప్రాంత పట్టణాల్లో జనించే వ్యర్థాన్ని తీరం నుంచి 20 కి.మీ. దూరంలో 30

మీటర్ల లోతులోకి తరలించే ప్రక్రియ. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
ఘన వ్యర్థాల నిర్వాహణలో సమస్యలు:

*  భారతదేశ నగరాలు చాలావరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందక పోవడం వల్ల మురికి వాడల సంఖ్య ఎక్కువగా ఉంది. దీని వల్ల చెత్త సేకరణ కష్టంగా మారింది.

*  వ్యర్థాన్ని ఉత్పత్తి స్థానాల నుంచి సరిగా వేరుపరచకపోవడం వల్ల డంపింగ్ చేయడం కష్టంగా ఉంది.

*  డంపింగ్‌కు భూమికొరత తీవ్రంగా ఉంది.

*  స్థానిక సంస్థలకు వ్యర్థ నిర్వాహణ ఆర్థిక భారంగా పరిణమించింది.

*  భారతీయుల ఆహారపు అలవాట్లను అనుసరించి పండ్లు, కూరగాయలకు సంబంధించిన వ్యర్థాలు ఎక్కువగా ఉన్నందున వీటిని తొలగించడం కష్టంగా ఉంది.

8. ఈ - వ్యర్థాలు (E - Waste)

* కాలం చెల్లి, ఏ విధంగా వినియోగం లేనటువంటి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల సంబంధిత వ్యర్థాలనే e-waste అని పిలుస్తారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ శీఘ్రగతిలో పురోగమిస్తుంది. దీనికి తోడు పాత వాటిని రిపేరు చేయించుకుని వాడుకునే సంస్కృతి పోయి, నయా వినిమయ సంస్కృతి రోజు రోజుకు పెరగడం వల్ల ఈవ్యర్థాల పరిమాణం పెరిగిపోతుంది. అసోచామ్ కేపీఎస్‌జీ గ్రూప్స్ 2016 మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం 18.5 లక్షల టన్నుల మేర ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా.

* భారత్ ప్రపంచంలో ఈ వ్యర్థాలు ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది.

* దేశంలో ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా, మొదటి స్థానంలో ఉన్న
నగరం 'ముంబయి'.

E-Wasteను 3 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. అవి:

1) వైట్ గూడ్స్: గృహాల నుంచి జనించి పాడైపోయిన వాషింగ్ మెషీన్లు, గ్రైండర్స్, రిఫ్రిజిరేటర్స్ మొదలైనవి.

2) బ్రౌన్ గూడ్స్: వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి ఉత్పత్తి అయ్యే పాడైపోయిన టెలిఫోన్, కెమెరాలకు సంబంధించిన విడి విభాగాలు మొదలైనవి

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌