భారతదేశ చరిత్రలో క్రీ.శ. 1919-47 మధ్యకాలాన్ని గాంధీ యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో గాంధీజీ భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి తనదైన ముద్రవేశారు.
గాంధీజీ 1934లో కాంగ్రెస్ను వీడినా, మరణించే వరకు కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిగా నిలిచారు. 1940లో కొంతకాలం కాంగ్రెస్కు నాయకత్వం వహించినా మరుసటి సంవత్సరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్రీ.శ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పటికీ, ఉద్యమాన్ని ప్రారంభించేలోపు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని జైల్లో పెట్టింది.
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించి జాతిపితగా ప్రసిద్ధికెక్కిన గాంధీజీ గుజరాత్లోని కథియవార్ సంస్థానంలో పోర్బందర్ అనే గ్రామంలో అక్టోబరు 2, 1869లో జన్మించారు. గాంధీజీ తండ్రి కరమ్ చంద్ పోర్బందర్, రాజ్కోట్లలో దివాన్ (మంత్రి)గా పనిచేసేవారు. గాంధీజీ తల్లి పుత్లీబాయి. గాంధీజీకి 12 ఏళ్ల వయసులో కస్తూర్బాతో వివాహం జరిగింది. గాంధీజీ ఇంగ్లండులో బారిస్టరు చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు.
1893లో దాదా అబ్దుల్లా అనే వ్యక్తి తరపున న్యాయవాదిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ శ్వేత జాతీయుల దురహంకారం వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి చలించిపోయారు. గాంధీజీ శ్వేతజాతి ప్రభుత్వంపై పోరాడటానికి సత్యాగ్రహమనే కొత్త ఆయుధాన్ని ఉపయోగించారు. గాంధీజీపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ప్రముఖులు... థోరూ, లియో టాల్స్టాయ్, జాన్ రస్కిన్. గాంధీజీ డర్బన్లో ఫీనిక్స్ ఫామ్ను ఏర్పాటు చేశారు. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించారు. 1910లో సత్యాగ్రహంలో పాల్గొనే కుటుంబాలకు అండగా ఉండటానికి టాల్స్టాయ్ ఫామ్ను ప్రారంభించారు. 1914 వరకు దక్షిణాఫ్రికాలో ఉండి, 1915 జనవరిలో భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడానికి ఇంగ్లండులో అంబులెన్స్ యూనిట్ను ఏర్పాటు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని కైజర్ ఇ హింద్ అనే బంగారు పతకంతో సత్కరించింది.
ఉద్యమాల పరంపర
దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రయత్నాల గురించి విద్యావంతులకేగాక, సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. దేశంలో సామాన్య ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి సభ్యుడిగా భారతదేశమంతటా పర్యటించారు. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో హోమ్రూల్ ఉద్యమం చేయడం మంచిది కాదని భావించారు. జాతీయవాదుల లక్ష్యాలను సాధించడానికి అహింసాయుత సత్యాగ్రహమే సరైన విధానమని పేర్కొన్నారు. 1917-18 మధ్యకాలంలో మూడు పోరాటాల్లో పాల్గొన్నారు.
* చంపారన్ సత్యాగ్రహం: బిహార్లోని చంపారన్లో నీలిమందు రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి 1917లో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. గాంధీజీ సభ్యుడిగా ప్రభుత్వం ఒక విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీ సిఫార్సుల మేరకు రైతులకు వ్యతిరేకంగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు. ఇది భారతదేశంలో గాంధీజీకి మొదటి రాజకీయ విజయం.
* అహ్మదాబాద్ మిల్లు సమ్మె: ప్లేగు బోనస్ నిలుపుదలకు సంబంధించి మిల్లు యజమానులకు, కార్మికులకు మధ్య గొడవ జరిగింది. దీంతో గాంధీజీ అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల సంఘాన్ని స్థాపించి, 1918లో నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు మిల్లు యాజమాన్యం కార్మికుల వేతనం 35 శాతం పెంచడానికి అంగీకరించింది.
* ఖేదా సత్యాగ్రహం: గుజరాత్లోని ఖేదాలో 1918లో కరవు సంభవించింది. రెవెన్యూ కోడ్ ప్రకారం సాధారణ ఉత్పత్తిలో 1/4వ వంతు కంటే తక్కువైతే రైతులు భూమి శిస్తు నుంచి మినహాయింపునకు అర్హులు. అయితే అధికారులు పన్ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. గాంధీజీ సత్యాగ్రహం చేపట్టడంతో రైతులను భూమి శిస్తు చెల్లింపు నుంచి మినహాయించారు. ఈ సత్యాగ్రహం సందర్భంగా సర్దార్ పటేల్, ఇందూలాల్ యాజ్ఞక్ లాంటి యువనాయకులు గాంధీజీకి అనుచరులుగా మారారు.
* పై మూడు పోరాటాలలో విజయం సాధించడం ద్వారా గాంధీజీ సామాన్య ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందగలిగారు. అలాగే వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోగలిగారు.
రౌలత్ చట్టం - 1919
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతీయవాదులు రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని రూపొందించింది. దీన్ని వారు అవమానకరంగా భావించారు. విప్లవాత్మక నేరాల చట్టాన్ని ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సర్ సిడ్నీ రౌలత్ నాయకత్వం వహించడం వల్ల ఈ చట్టం రౌలత్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని భారతీయులు నల్ల చట్టంగా పరిగణించి 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.
* జలియన్వాలాబాగ్ దురంతం: నిషేధ ఆజ్ఞల గురించి తెలియని సమీప గ్రామాల్లోని ప్రజలు 1919 ఏప్రిల్ 13 బైశాఖి పండగ రోజున సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ల అరెస్ట్కు నిరసనగా అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ (పార్కు) లో సమావేశమయ్యారు. జనరల్ డయ్యర్ పైశాచిక ప్రవర్తనవల్ల జరిగిన పోలీసు కాల్పుల్లో సుమారు 400 మంది మృతి చెందారు. దీనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ బిరుదును త్యజించారు. హింసాత్మక పరిస్థితుల పట్ల అప్రమత్తమైన గాంధీజీ ఏప్రిల్ 18, 1919న ఉద్యమాన్ని ఉపసంహరించారు.
* సహాయ నిరాకరణ ఉద్యమం: గాంధీజీ 1919-22 మధ్య ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రెండు ఉద్యమాలు ప్రారంభించడానికి కారణాలు వేరైనా, అహింసాయుత సహాయ నిరాకరణ అనే ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమానికి, భారత రాజకీయాలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇదే తక్షణ కారణం కావడం విశేషం.
* 1919 నవంబరులో ఢిల్లీలో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ సమావేశంలో బ్రిటిష్ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. గాంధీజీ ఖిలాఫత్ సమస్యపై సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ప్రారంభించాలని భావించినా, మతపరమైన సమస్యపై ముస్లిం నాయకులతో పొత్తుకలిగి ఉండటాన్ని తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు గాంధీజీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులయ్యారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరుస్తూ గాంధీజీ 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
* కాంగ్రెస్ సెప్టెంబరు 1920లో కోల్కతాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి అంగీకరించింది. 1920 డిసెంబరులో జరిగిన నాగ్పుర్ సమావేశంలో కాంగ్రెస్ ఈ ఉద్యమానికి ఆమోదముద్ర వేసింది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. స్వరాజ్య సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించింది.
ఉద్యమ లక్ష్యాలు, కార్యక్రమాలు
లక్ష్యాలు: రౌలత్ చట్టాన్ని రద్దు చేసి, జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయాలి.
* బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ పట్ల ఉదార వైఖరిని అవలంబించాలి. టర్కీ సుల్తానుకు ఖలీఫా పదవిని తిరిగి కట్టబెట్టాలి.
* స్వరాజ్య డిమాండును అంగీకరించాలి.
నకారాత్మక కార్యక్రమాలు: బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను భారతీయులు వెనక్కి ఇచ్చివేయాలి.
¤ ప్రభుత్వ దర్బారుకు, అధికార ఉత్సవాలకు ఆహ్వానాలను తిరస్కరించాలి.
¤ ప్రభుత్వ నియంత్రణలోని పాఠశాలలు, కళాశాలలను విద్యార్ధులు బహిష్కరించాలి.
¤ బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించాలి.
¤ మెసపటోమియాలో పనిచేయడానికి అన్నివర్గాల వారు తిరస్కరించాలి. ¤ రాష్ట్ర, కేంద్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలి. ¤ విదేశీ వస్తువులను బహిష్కరించాలి. ¤ స్థానిక సంస్థలలోని నామినేటెడ్ స్థానాలకు భారతీయులు రాజీనామా చేయాలి.
సకారాత్మక కార్యక్రమాలు:
* ఆచార్య నరేంద్రదేవ్, చిత్తరంజన్ దాస్, లాలా లజపతిరాయ్, జాకీర్ హుస్సేన్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల ఆధ్వర్యంలో జాతీయ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.
* తిలక్ స్వరాజ్య నిధికి ఆరునెలలలోగా కోటి రూపాయలు విరాళంగా సేకరించారు.
* స్వదేశీ పరిశ్రమల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. 1921 జులైలో అలీ సోదరులు బ్రిటిష్ సైన్యం నుంచి ముస్లింలు వైదొలగాలని పిలుపునిచ్చారు.
* హిందూ - ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం, అంటరానితనాన్ని నిర్మూలించడం.
* దేశంలోని విశిష్ట వ్యక్తులు లాభదాయకమైన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ స్వాతంత్య్రానికి చిహ్నంగా మారింది.
* వేల్స్ యువరాజు పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించారు. బొంబాయిలో నవంబరు 17, 1921న అతని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించడం ఆపేశారు.
* 1921 మే లో గాంధీజీ, వైస్రాయి లార్డ్ రీడింగ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 1922 ఫిబ్రవరి 1న గాంధీజీ బార్డోలి నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
చౌరీచౌరా సంఘటన
* ఉద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో 1922 ఫిబ్రవరి 5న ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీచౌరా గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామం గోరఖ్పూర్ నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషనులో బంధించి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవదహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపేశారు.