• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - వ్యవసాయం

జనుము: ఖరీఫ్ కాలంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో జనుము ముఖ్యమైంది. ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. జనుము ఉత్పత్తుల ఎగుమతుల్లో మాత్రం బంగ్లాదేశ్ తొలిస్థానంలో, భారత్ రెండోస్థానంలో ఉన్నాయి. జనుము పంటకి కావాల్సిన అనుకూల పరిస్థితులు: 24ºC నుంచి 35ºC ఉష్రోగత, 125 సెం.మీ. నుంచి 150 సెం.మీ వర్షపాతం, ఒండ్రు నేలలు, మురుగు నీటి వసతులు.

* దేశంలో జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ్ బంగ. దీంతో పాటు బిహార్, ఒడిశా, అసోం, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా జనుమును పండిస్తున్నారు. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు జనుము పంటకి అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ్ బంగ రాజధాని 'కోల్‌కతా' నగరాన్ని "ప్రపంచ జనపనార రాజధాని"గా పేర్కొంటారు. జనపనారను 'బంగారు పీచు' అని కూడా అంటారు. జనపనారతో గోనె సంచులు, పురికొస, గోనె పట్టలు లాంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సాధారణంగా జనప నారను బేళ్లలో కొలుస్తారు. 1 బేలు జనుము 170 కేజీలకి సమానం.

పొగాకు: ఇది రబీ కాలంలో సాగుచేసే వాణిజ్య పంట. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. చైనా, బ్రెజిల్ ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. పొగాకు పంటకు అనుకూల పరిస్థితులు: 20ºC - 40ºC ఉష్ణోగ్రత, 75 సెం.మీ - 100 సెం.మీ. వర్షపాతం, తేలికపాటి ఎర్రనేలలు, ఒండ్రు నేలలు. ఈ పంటకి మంచు హానికరమైంది. మంచు కురిస్తే పొగాకు నాణ్యత తగ్గుతుంది.

* దేశంలో పొగాకు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ మొదలైనవి. పొగాకులో ప్రసిద్ధి చెందిన రకాలు నికోటినా టుబాకం, నొకోనారస్టికా, వర్జీనియా రకం పొగాకు ఉత్పత్తిలో భారతదేశం ప్రసిద్ధి చెందింది.

 

తోట పంటలు

* తేయాకు: సమశీతోష్ణ మండలంలో సాగు చేసే ప్రధాన తోటపంట తేయాకు. తేయాకు ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. వినియోగంలో మాత్రం మనదేశమే మొదటి స్థానంలో ఉంది. తేయాకు పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు: 150 సెం.మీ - 300 సెం.మీ వర్షపాతం, 20ºC - 25ºC ఉష్ణోగ్రత, నీరునిల్వ ఉండని పర్వత లోయ ప్రాంతాలు, లాటరైట్ నేలలు.

* దేశంలో తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అసోం. తర్వాతి స్థానం పశ్చిమ్ బంగ. ఈ రాష్ట్రంలోని డార్జిలింగ్ పర్వతప్రాంతాలు తేయాకు తోటలకి ప్రసిద్ధి. తేయాకులో ప్రసిద్ధి చెందిన రకాలు బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, ఊలాంగ్‌టీ. భారతదేశం బ్లాక్‌టీకి, చైనా గ్రీన్‌టీకి ప్రసిద్ధి.

 

కాఫీ: ఉష్ణమండలంలో సాగు చేసే ప్రధాన తోట పంట కాఫీ. కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రథమస్థానంలో ఉంది. కాఫీ పంటకి కావాల్సిన అనుకూల పరిస్థితులు: 15ºC - 25ºC ఉష్ణాగ్రతలు, 150 సెం.మీ - 225 సెం.మీ వర్షపాతం, నీరు నిల్వ ఉండని పర్వత లోయ ప్రాంతాలు, సంవత్సరం పొడవునా వర్షపాతం, లాటరైట్ నేలలు.

* దేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం - కర్ణాటక. ఈ రాష్ట్రంలోని కూర్గ్, చిక్‌మగళూర్, హసన్, కొడగు జిల్లాల్లో విస్తరించి ఉన్న బాబు బుడాన్ కొండల ప్రాంతం కాఫీ తోటలకి ప్రసిద్ధి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా కాఫీ తోటలను సాగుచేస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని ఉత్తర మలబార్, ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ ప్రాంతాలు కాఫీ తోటలకి ప్రసిద్ధి. కాఫీలో ప్రధాన రకాలు అరాబికా, రొబస్టా, అకాబికాలో కూర్గ్స్, చిక్స్, కెన్ట్సే, మార్గోగైప్, బోర్బన్, బ్లూమౌంటైన్ రకాలు.

 

రబ్బరు: ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రబ్బరు బెరడుపై పదునైన ఆయుధంతో గంటు ఏర్పడేలా చేసి ఒక రకమైన స్రావాన్ని సేకరిస్తారు. దాన్ని నిల్వ చేస్తే అది ఘనీభవిస్తుంది. ఈ పదార్థాన్ని 'లేటెక్స్' అంటారు. దానికి అనేక మిశ్రమాలను కలిపి సహజ రబ్బరును తయారు చేస్తారు.

* రబ్బరు పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు: 25ºC - 35ºC ఉష్ణోగ్రతలు, 200 సెం.మీ. - 300 సెం.మీ. వర్షపాతం, సంవత్సరం పొడవునా వర్షపాతం, లేటరైట్ నేలలు. దేశంలో మొట్టమొదట రబ్బరు పంటసాగు 1902 లో కేరళ రాష్ట్రంలోని పెరియార్ నది పరీవాహాక ప్రాంతంలో ప్రారంభమైంది. దేశంలో రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం - కేరళ. దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బరులో 90 శాతం కంటే అధికంగా ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. దీంతోపాటు తమిళనాడులోని కన్యాకుమారి, కోయంబత్తూరు, సేలం, నీలగిరి, మదురై ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో రబ్బరు సాగు చేస్తున్నారు.

సుగంధ ద్రవ్యాలు: దేశంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు సాగుచేస్తున్నారు. అధిక భాగం సాగయ్యేది కేరళలోనే. దేశంలో పండిస్తున్న ప్రధాన సుగంధ ద్రవ్యాలు:

     పసుపు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
     మిరియాలు - కేరళ, కర్ణాటక
     లవంగాలు - కేరళ, కర్ణాటక
     అల్లం - కేరళ, మేఘాలయ
     యాలకులు - కేరళ, తమిళనాడు
     కుంకుమ పువ్వు - జమ్మూ కశ్మీర్
     ఉల్లిపాయలు - మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
     మిరప - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక

* కేరళలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు సాగు చేస్తుండటంతో ఈ రాష్ట్రాన్ని 'సుగంధ ద్రవ్యాల ఉద్యానవనంగా' పిలుస్తారు.

 

పండ్ల తోటలు

     ప్రపంచంలో పండ్ల ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్న పండ్లలో ప్రధానమైనవి:

* జీడిమామిడి - కేరళ, కర్ణాటక, గోవా

* యాపిల్ - హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్

* ద్రాక్ష - పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ

* అరటి - తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్

* జామ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు

* సీతాఫలాలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్

* బొప్పాయి - ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు

* నారింజ - మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 

కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారతదేశం

మొద‌టి స్థానం: పాలు, పప్పుధాన్యాలు, జనుము, పసుపు, అల్లం, మిరియాలు, అరటికాయలు, సపోటా, మామిడి, దానిమ్మ, ద్రాక్ష, నిమ్మ, క్లాలీఫ్లవర్.

రెండో స్థానం: వరి, గోధుమ, చెరకు, వేరుశనగ, పండ్లు, కూరగాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, తేయాకు, బంగాళాదుంపలు, టమాటా.

మూడో స్థానం: పొగాకు, కోడిగుడ్లు, క్యాబేజి, కొబ్బరికాయలు, పత్తి, నారింజ.

* దేశం మొత్తంలో పండ్ల ఉత్పత్తిలో తమిళనాడు, మహారాష్ట్ర ప్రముఖ స్థానంలో ఉన్నాయి. అయితే మొదటి స్థానంలో మాత్రం పై రాష్ట్రాల వరుస క్రమం తరచూ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రం, ఆ రాష్ట్రంలోని వాతావరణం, మార్కెట్ అంశాలపై ఆధారపడి ఉత్పత్తి ఉండటం వల్ల ఉత్పత్తిలో నిలకడ లోపిస్తుంటుంది.

వ్యవసాయ రంగం అంటే ఒక్క పంటల సాగే కాకుండా పంటలతోపాటు పశుపోషణ, చేపల పెంపకం, పట్టు పురుగుల పెంపకం కూడా వస్తాయి.

 

పట్టు ఉత్పత్తి

    ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. కృత్రిమ పట్టు ఉత్పత్తిలో జపాన్ దేశం ప్రథమ స్థానంలో ఉంది. పట్టు పురుగుల పెంపకాన్ని 'సెరికల్చర్' అంటారు. భారతదేశంలో ప్రధానంగా నాలుగు రకాల పట్టు ఉత్పత్తి అవుతుంది.

  పట్టు పేరు - ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు...

    i) మల్బరీ - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్

    ii) టస్సర్ - ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్

    iii) ఇరి - అసోం, మేఘాలయ

    iv) ముగ - అసోం, మేఘాలయ

* దేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, అసోం, మేఘాలయ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కూడా పట్టు ఉత్పత్తి చేస్తున్నారు.

 

మత్స్య పరిశ్రమ

     చేపల పెంపకాన్ని 'పిసికల్చర్' అంటారు. దేశంలో లభించే చేపలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి మంచినీటిలో లభించే చేపలు, ఉప్పునీటిలో లభించే చేపలు. దేశంలో చేపల ఉత్పత్తిని పెంపొందించడానికి ప్రారంభించింది 'నీలి విప్లవం'. దేశంలో విస్తరించి ఉన్న సుమారు 7516 కి.మీ. పొడవైన సముద్రతీర ప్రాంతంలో సముద్ర చేపలు లభిస్తుండగా, భూభాగంలో విస్తరించి ఉన్న నదులు, కాలువలు, వాగులు, చెరువులు మొదలైన వాటిలో మంచినీటి చేపలు లభిస్తున్నాయి.

* దేశంలో లభించే మొత్తం చేపల్లో ఉప్పునీటి చేపలే అధికం. ఉప్పునీటి చేపల ఉత్పత్తిలో కేరళ, మంచినీటి చేపల ఉత్పత్తిలో పశ్చిమ్ బంగ, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. దేశంలో చేపల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ్ బంగ.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులను పెంపొందించడానికి దేశంలో ప్రారంభించిన వివిధ విప్లవాలు...

* ఆహారధాన్యాల ఉత్పత్తులు - హరిత విప్లవం (దేశంలో ఆద్యుడు - ఎం.ఎస్. స్వామినాథన్)

* పాల ఉత్పత్తులు - శ్వేత విప్లవం (దేశంలో ఆద్యుడు - వర్గీస్ కురియన్)

* చేపల ఉత్పత్తి - నీలి విప్లవం

* రొయ్యల ఉత్పత్తులు - పింక్ రివల్యూషన్

* కోడిగుడ్ల ఉత్పత్తులు - సిల్వర్ రివల్యూషన్

* పండ్ల ఉత్పత్తులు - గోల్డెన్ రివల్యూషన్

* టమాటా ఉత్పత్తులు/ మాంసపు ఉత్పత్తులు - ఎరుపు విప్లవం

* ఉన్ని ఉత్పత్తులు - గ్రే రివల్యూషన్

* సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు - బ్రౌన్ రివల్యూషన్

* బంగాళాదుంపల ఉత్పత్తులు - రౌండ్ రివల్యూషన్

* ఉద్యానవన పంటల ఉత్పత్తులు - ఆరెంజ్ రివల్యూషన్

* నూనెగింజల ఉత్పత్తులు - ఎల్లో రివల్యూషన్

 

వ్యవసాయ పంటలు - జాతీయ పరిశోధనా కేంద్రాలు ఉన్న ప్రాంతాలు

* వరి - కటక్ (ఒడిశా)

* జనుము - భారక్‌పూర్ (పశ్చిమ్ బంగ)

* పత్తి - నాగ్‌పుర్ (మహారాష్ట్ర)

* చెరకు - కోయంబత్తూరు (తమిళనాడు), లఖ్‌నవూ (ఉత్తర్ ప్రదేశ్)

* పొగాకు - రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)

* తేయాకు - జోర్హాట్ (అసోం)

* కాఫీ - చిక్‌మగళూర్ (కర్ణాటక)

* పట్టు - మైసూర్ (కర్ణాటక)

* వేరుశెనగ - జునాఘడ్ (గుజరాత్)

* ఉద్యానవనాలు - బెంగళూరు (కర్ణాటక)

* ఉప్పునీటి చేపలు - కొచ్చి (కేరళ)

తోట పంటలు - కాసర్‌గడ్ (కేరళ)

* సుగంధ ద్రవ్యాలు - కాలికట్ (కేరళ)

* బంగాళదుంపలు - సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)

* ఉల్లిపాయలు - నాసిక్ (మహారాష్ట్ర)

Posted Date : 17-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌