ఏ దేశానికైనా.. ఏ రాష్ట్రానికైనా.. మానవ వనరులే బలం. ఒక ప్రాంతం చక్కటి ప్రగతిని సాధించిందంటే అక్కడ మానవ వనరుల అభివృద్ధి కూడా బాగున్నట్లే. ఇలాంటి పురోగమనంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది. ఇంతటి కీలకమైన మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే ప్రాధాన్య అంశాల్లో అక్షరాస్యత ఒకటి. ఇది అన్ని రకాల వృత్తి నైపుణ్యాలతోపాటు ఆదాయ, సంపాదన అవకాశాలను పెంచుతుంది. మరి మానవ వనరుల ప్రాధాన్యం ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత ఎలా ఉంది? వంటి అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం..
మానవ ఉత్పాదక శక్తిని పెంచే ఏ చర్య అయినా మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది. వాటిలో శిక్షణ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ విస్తరణ పథకాలు, కుటుంబాల వలసలు అత్యంత ప్రామాణికమైనవి.. - థియోడర్ డబ్ల్యూ షుల్జ్
ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేసే ప్రధాన కారకాల్లో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మానవ వనరులు అత్యంత ముఖ్యమైనవి. దేశంలో ఉత్పత్తి స్థాయి, ఉత్పత్తి సగటు, ఉత్పాదకత తదితర అంశాల్లో అధిక పరిమాణాత్మక మార్పులు మానవ వనరుల అభివృద్ధి వల్ల సాధ్యమవుతుంది. ఆర్థిక వ్యవస్థలోని అనేక పరిశోధనలు శ్రమ, మూలధనంలో పెరుగుదల, అత్యధిక స్థాయిలో ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేసినట్లు రుజువయ్యాయి.
* విద్య, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని మానవ వనరులుగా చెప్పవచ్చు.
* మానవ వనరుల నాణ్యతలో పెరుగుదల.. విద్య, వైద్యం, నైపుణ్యం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
మానవ వనరుల అభివృద్ధి - ప్రాధాన్యం
* ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యపాత్రను పోషిస్తుంది.
* భౌతిక మూలధనం సమర్థంగా, అభిలషణీయంగా ఉపయోగించడం మానవ వనరుల సమర్థ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.
* ఆదాయాలు, సంపద సృష్టి, సమర్థవంతమైన సాంకేతిక సృష్టి, వినియోగం, వాటి అభివృద్ధి.. ఇవన్నీ మానవ వనరుల వల్లే సాధ్యమవుతాయి.
* వనరుల సమర్థ వినియోగాన్ని సాంకేతిక, వృత్తి, పాలనా సంబంధ నైపుణ్యాలు ఉండే మానవ వనరులే నిర్వహిస్తాయి. తద్వారా అభివృద్ధి సాధ్యపడుతుంది.
మానవ వనరుల అభివృద్ధి చర్యలు (థియోడర్ డబ్ల్యూ షుల్జ్)
* ప్రజల ఆయుర్దాయం, శక్తి, సమర్థత, ఆరోగ్యం, సేవలు వంటి అంశాలపై చేసే వ్యయాలు
* పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ సదుపాయాలు
* ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత, పరిశోధన, అభివృద్ధి విద్య స్థితులు
* వ్యవసాయ రంగ అభివృద్ధి, విస్తరణ కార్యకలాపాలు, సంస్థలు అమలు చేయని వయోజన విద్యా పథకాలు
* ఉద్యోగావకాశాలకు అనుగుణంగా సర్దుబాటుకు వ్యక్తులు, కుటుంబాల వలసలు
* మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఈ రెండు ప్రక్రియలూ పరస్పరం ఆధారపడి, ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తుంటాయి.
విద్యతో ప్రయోజనాలు
* మానవ వనరుల అభివృద్ధికి విద్య అత్యధికంగా దోహదం చేస్తుంది.
* విద్యపై పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకువెళుతుంది.
* ఉద్యోగ, ఆదాయ/సంపాదన అవకాశాలను విద్య పెంచుతుంది. దాంతో ఆదాయ సమానతలు కూడా పెరుగుతాయి.
* సంపూర్ణ విద్యాపరిస్థితులు ప్రజా సామర్థ్యాన్ని పెంచుతాయి.
* గ్రామీణ ప్రాంతాల అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను విద్య తొలగిస్తుంది.
* నైపుణ్యాలతోపాటు ఆధునిక దృక్పథాన్ని పెంచుతుంది.
* వ్యవసాయదారులు అక్షరాస్యులయితే నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచగలుగుతారు.
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే నైపుణ్యాలను విద్య ద్వారా పొంది నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలు తగ్గించవచ్చు.
ముఖ్యాంశాలు
* తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత ఉన్న జిల్లా హైదరాబాద్.
* అక్షరాస్యతలో రెండో స్థానం రంగారెడ్డి జిల్లా.
* అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా మహబూబ్నగర్.
* తెలంగాణలో పురుషుల్లో అక్షరాస్యత శాతం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో ఉన్న జిల్లా మహబూబ్నగర్.
* స్త్రీలలో అక్షరాస్యత శాతం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో మహబూబ్నగర్ జిల్లా ఉంది.
* తెలంగాణలో పట్టణ అక్షరాస్యత అత్యధికంగా ఉన్న మొదటి మూడు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ.
* అతి తక్కువ పట్టణ అక్షరాస్యత ఉన్న జిల్లాలు వరుసగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్.
* తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత అత్యధికంగా ఉన్న మొదటి మూడు జిల్లాలు వరుసగా రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం. అతి తక్కువగా ఉన్న జిల్లాలు వరుసగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్.