• facebook
  • whatsapp
  • telegram

కాక‌తీయులు

11 - 15 శతాబ్దాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు
కాకతీయుల తొలి ప్రస్తావన తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడి మాగల్లు శాసనం (క్రీ.శ. 950)లో ఉంది. ఇది గుండియ - ఎరియ - కాకర్త్య గుండనల గురించి వివరిస్తుంది. గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువు శాసనం వెన్న భూపతి వంశీయులే కాకతీయులని పేర్కొంటుంది. కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద, తర్వాత కల్యాణి చాళుక్యుల వద్ద సేనానులుగా పనిచేశారు. రాష్ట్రకూటులది గరుడకేతనం. రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం. కాకతీయులు కల్యాణి చాళుక్యుల వరాహ లాంఛనాన్ని స్వీకరించారు. కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులు అయ్యారు. కాకతి అంటే కూష్మాండం/ గుమ్మడి అనే అర్థం కూడా ఉంది. 22వ తీర్థంకరుడైన నేమినాథుడి శాసనాధికారిణి పేరు కూష్మాండిణి. కాకతీయులు మొదట జైనులు కాబట్టి కూష్మాండి దేవతను కూడా పూజించారు. ఆంధ్రరాజులగా కీర్తి నొందారు.


         కాకతి వంశ ప్రతిష్ఠకు పునాది వేసింది మొదటి బేతరాజు. ఇతడికి కాకతి పురాధినాథ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజుకు కాకతి వల్లభ అనే బిరుదుంది. సిద్ధేశ్వర చరిత్ర గ్రంథంలో కాకతీయ మూలపురుషుడు మాధవవర్మ అని ఉంది. కాకతీయుల కాలంలో చేబ్రోలును మహాసేనం అని, అనుమకొండను రుద్రేశ్వరం అని పిలిచేవారు. అనుమకొండ రాజు పద్మసేనుడు సిద్ధేశ్వరుడిని గుమ్మడిపూలతో పూజించడం వల్ల సంతానం కలిగింది. కాబట్టి వారి సంతానాన్ని గుమ్మడితీగ సంతానం అని పిలిచేవారు. కాకతీయులను ఆంధ్రదేశాధీశ్వరులు, మహామండలేశ్వరులు, స్వయంభూ దేవతారాధకులు అని పిలుస్తారు. రట్టడి (గ్రామపెద్ద) పదవితో వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది.

 

మొదటి బేతరాజు (క్రీ.శ. 992 - 1052):
 కాకతీపురాధినాథ బిరుదాకింతుడు. ఇతడు వేయించిన శనిగరం శాసనం ద్వారా సెబ్బిమండలం (కరీంనగర్)లో కొంత భాగం ఇతడి పాలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. మొదటి బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జైనాలయాన్ని పునర్ నిర్మించాడు.

 

మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 - 1076):
ఇతడు అరికేసరి/ అరిగజకేసరి బిరుదు పొందాడు. ఓరుగల్లు సమీపంలో కేసరి తటాకాన్ని తవ్వించాడు. చాళుక్య మొదటి సోమేశ్వరుడికి కొప్పం యుద్ధంలో సహకరించి అతడి నుంచి అనుమకొండ ప్రాంతాన్ని పొందాడు.

 

రెండో బేతరాజు (1076 - 1108):
త్రిభువనమల్ల, విక్రమచక్ర రెండో బేతరాజు బిరుదులు. మంత్రి వైజదండాధిపుడు. రెండో బేతరాజు మరణానంతరం పెద్ద కుమారుడు దుర్గరాజు పాలనకు వచ్చాడు. మొదటి బేతరాజు నిర్మించిన బేతెశ్వరాలయానికి దుర్గరాజు రామేశ్వర పండితుడి పేరుమీద దానధర్మాలు చేసినట్లు ఖాజీపేట దర్గాశాసనం తెలుపుతోంది. దుర్గరాజు పాలనా కాలం 1108 - 1116 (గురువు - ధ్రువేశ్వరుడు)

 

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 1157):
మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు రెండో ప్రోలరాజు. రుద్రదేవుడి అనుమకొండ శాసనం ఇతడి విజయాలను తెలుపుతోంది. ఇతడు ఓరుగల్లు పట్టణ నిర్మాణం ప్రారంభించాడు. అందులో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించాడు.

      మహామండలేశ్వర బిరుదుతో పాలించాడు. శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటాడు. అనుమకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వర, కేశవ ఆలయాలను నిర్మించాడు. ఓరుగల్లును క్రీడాభిరామం గ్రంథం ఆంధ్రనగరి అని పేర్కొంది. దీన్ని ఏకశిలానగరం అని కూడా అంటారు. మైలమ అనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది. రెండో ప్రోలరాజు కాలం నుంచే వరాహం అధికార చిహ్నమైంది.
 

రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు (1157 - 1195):

స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసాడు. వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. కాలచూరి బిజ్జలుడు ఇతడి చేతిలో ఓడినట్లు బిజ్జలుని లక్ష్మీశ్వర శాసనం తెలుపుతోంది. 1176 - 82 సంవత్సరాల మధ్య జరిగిన పలనాటి యుద్ధంలో కాకతిరుద్రుడు నలగాముడి పక్షాన పోరాడాడు. త్రిపురాంతకం శాసనాన్ని 1185లో వేయించాడు. 1186లో ద్రాక్షారామ శాసనం వేయించాడు. యాదవరాజు జైత్రపాలుడి చేతిలో మరణించాడు. ఇతడి కాలంలోనే శైవ - జైన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. జైనాచార్యుడైన ఉపమన్యముని సహాయంతో మహాదేవుడు రుద్రుడిపై తిరుగుబాటు చేశాడు. మల్లిఖార్జున పండితారాధ్యుడు రుద్రుడి సమకాలికుడు. రుద్రుడు అనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. రుద్రుడి మంత్రి గంగాధరుడు బుద్ధదేవుడి ఆలయం నిర్మించాడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడికి విద్యాభూషణం అనే బిరుదు ఉంది. అనుమకొండ శాసనాన్ని రచించిన కవి అచితేంద్రుడు. తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి పేర్కొన్న గ్రంథం - ప్రతాపరుద్రీయం.

 

మహదేవుడు (1195 - 1199):
         శైవ మతాభిమాని. ఇతడి గురువు ధృవేశ్వర పండితుడు. ప్రతాపరుద్రుడి ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవుడికి రాజ్యం అప్పగించాడు. మహదేవుడి భార్య భయ్యాంబిక, కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు - మైలాంబ, కుందమాంబ. ఇతడు కూడా యాదవరాజు జైతుగి చేతిలో మరణించాడు. అతి తక్కువ కాలం పాలించిన పాలకుడు ఇతడే.

 

గణపతిదేవుడు (1199 - 1262):
         అతి ఎక్కువ కాలం పాలించిన వ్యక్తి. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన కాకతీయ రాజు. జైతుగి కుమారుడు సింఘనకు తెలుగు రాయస్థాపనాచార్య అనే బిరుదు ఉంది. గణపతి దేవుడి గురువు విశ్వేశ్వర శంభు. రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, కాకతీయరాజ్య భారధేరేయ అనే బిరుదులు ఉన్నాయి. 1199 నాటి గణపతి దేవుడి మంథెన శాసనంలో అతడి బిరుదు సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య. గణపతి సేనాని ముత్యాల చెండరాయడు వెలనాడు, దివిసీమ ప్రాంతాలపై దాడిచేసి విజయం సాధించాడు. చందోలు పాలకుడు పృథీశ్వరుడిని, దివిసీమ అయ్యవంశానికి చెందిన ఫిన్నచోడుడిని ఓడించాడు. ఫిన్న చోడుడి కుమార్తెలు నారమ, పేరమలను గణపతి వివాహం చేసుకున్నాడు. వారి సోదరుడు జాయపను తన గజసాహిణిగా నియమించుకున్నాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ప్రకారం ఛోడతిక్కన పృథీశ్వరుడి శిరస్సుతో ఆటలాడినట్లు తెలుస్తోంది. గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరఃకందుక క్రీడా వినోద అనే బిరుదు కూడా ఉంది. అతడు 1254లో రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చాడు. కుమార్తెలు రుద్రమదేవిని నిడదవోలు - వీరభద్రుడికి, గణపాంబను కోట పాలకుడు బేతరాజుకు ఇచ్చి వివాహాలు చేశాడు.

       సోదరి మేళాంబికను నతవాడి పాలకుడు పృథ్వీరాజుకిచ్చి వివాహం చేశాడు. మనుమసిద్ధి ఆస్థానంలోని తిక్కన రాయభారం వల్ల మోటుపల్లి రేవును పొందాడు. మోటుపల్లికి - దేశీయ కొండాపురం అనే పేరుంది. బమ్మెర పోతన (ఒంటిమిట్ట - కడప) ఇతడి కాలం వాడే. కానీ గణపతి 1262లో జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడు. జాయప దక్షిణ దండయాత్రలను చేబ్రోలు శాసనం తెలియజేస్తుంది. గణపేశ్వర శాసనం కూడా జాయప విజయాలను తెలుపుతోంది. గణపతి దేవుడికి చోడకటక చూరకార బిరుదు కూడా ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ఛోడ తిక్కన కురువులూరు యుద్ధం గురించి వివరిస్తుంది. గణపతి నెల్లూరు ఛోడతిక్కన కుమారుడైన మనుమసిద్ధి (వీరగండ గోపాలుడు)కి సాయంచేశాడు. ఈ విషయాన్ని న్యాయనిపల్లి శాసనం తెలుపుతోంది. గణపతి గురువు విశ్వేశ్వర శంభు (శివదేవుడు) గోళకీమఠాలు ఏర్పాటు చేశాడు. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. శిల్పి రామప్ప గణపతి దేవుడు అభయశాసనం, మోటుపల్లి శాసనాలు వేయించాడు. నాటి మోటుపల్లి పాలకుడు సిద్ధయ దేవుడు. గణపతి దేవుడు వరంగల్లులో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు. మోటుపల్లి, అభయ శాసనాలు వేయించాడు. తిక్కన గణపతి దేవుడి సమకాలీనుడు.


 

రుద్రమదేవి (1262 - 1289):
         ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి మహిళ. శాసనాల్లో రుద్రదేవ మహారాజు, రాయగజకేసరి లాంటి బిరుదులతో ఈమెను ప్రస్తావించారు. కాయస్థ అంబదేవుని దుర్గి శాసనం రుద్రమను కఠోధృతి/ పట్లోధృతిగా వర్ణిస్తుంది. రుద్రమ సేనాని రేచర్ల ప్రసాదిత్యుడికి రాయపితామహాక, కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదులు ఉన్నాయి.

        ఓరుగల్లు కోట లోపల మెట్లు కట్టించింది. కులశేఖర పాండ్యుడిని ఓడించింది. కానీ, కాయస్థ అంబదేవుడు ఈమెను యుద్ధభూమిలోనే వధించినట్లు చందుపట్ల శాసనం (నల్గొండ జిల్లా) ద్వారా తెలుస్తోంది. త్రిపురాంతకం శాసనం కూడా అంబదేవుని విజయాలను వర్ణిస్తోంది. అంబదేవుడు కొప్పెరుంజింగని వధించి కాడవరాయి విధ్వంసక బిరుదు పొందాడు. యాదవరాజులపై రుద్రమ విజయాన్ని బీదర్ శాసనం తెలుపుతుంది. హేమాద్రి తన వ్రతఖండం గ్రంథంలో రుద్రమదేవిని ఆంధ్రమహారాణి అని పేర్కొన్నాడు. బీదర్‌కోట శిలాశాసనంలో రాయగజకేసరి బిరుదును ప్రస్తావించడమైంది. రుద్రమ మల్కాపురం శాసనం (నల్గొండ) ప్రసూతి వైద్యకేంద్రాల గురించి వివరిస్తుంది. విశ్వేశ్వర శివాచార్యులకు మందడం అనే గ్రామాన్ని దానం చేసింది.
 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323):
         చివరి కాకతీయ రాజు. ఇతడు రుద్రమ కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడు. రాజ్యాన్ని 77 నాయంకరాలుగా విభజించాడు. తురుష్కులు కాకతీయ రాజ్యంపై 8 సార్లు దండెత్తినట్లు విలస తామ్రశాసనం, కలువ చెరువు శాసనాలు పేర్కొంటున్నాయి. కానీ ముస్లిం రచనలు మాత్రం 5 దండయాత్రలనే తెలుపుతున్నాయి. 1303లో కాకతీయ, ఖిల్జీ సైన్యాలు కరీంనగర్‌లోని ఉప్పరపల్లి వద్ద తలపడ్డాయి. రేచర్ల వెన్నసేనాని, పోలుగంటి మల్లి మాలిక్ ఫక్రుద్దీన్ జునాను ఓడించారు. 1309లో మాలిక్ కపూర్ దండయాత్రను అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు. తర్వాత ముబారక్ ఖిల్జీ ఖుస్రూఖాన్‌ను పంపాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ ఉలూగ్/ జునాఖాన్/ మహ్మద్ బిన్ తుగ్లక్‌ను పంపాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం 'బొబ్బారెడ్డి' అనే సేనాని కాకతీయ సైన్యం నుంచి వైదొలగి ద్రోహం చేసినట్లు తెలుస్తోంది. 1323లో ప్రతాపరుద్రుడిని ఖాదర్‌ఖాన్ దిల్లీకి తీసుకుపోతుండగా నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

          ఆంధ్రనగరి లేదా ఓరుగల్లును సుల్తాన్‌పూర్‌గా పేరు మార్చారు. గంగాదేవి మధురా విజయం, ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం ప్రతాపరుద్రుడి ఆత్మహత్య గురించి పేర్కొన్నాయి. వరంగల్‌లో బుర్హనుద్దీన్‌ను పాలకుడిగా నియమించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమనాయుడు తుగ్లక్‌ల ఆస్థానంలో ఉప ప్రధాని (మాలిక్ మక్బూల్)గా పనిచేశాడు. ఇతడు తెలంగాణ బ్రాహ్మణుడు. అనితల్లి కలువచేరు శాసనం కూడా ముస్లిం దండయాత్రలను వివరిస్తోంది. ప్రతాపరుద్రుడి ప్రధాని ముప్పిడినాయకుడు.
 

కాకతీయుల పాలన:
         బద్దెన - నీతిశాస్త్ర ముక్తావళి, శివదేవయ్య - పురుషార్థసారం, మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం, మడికిసింగన - సకలనీతి సమ్మతం లాంటి గ్రంథాలు కాకతీయుల పాలనా విశేషాలను వివరిస్తాయి. రాచరికం సప్తాంగ సమన్వితం. మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. 18 మంది తీర్థుల గురించి సకలనీతి సమ్మతం పేర్కొంటోంది. రాజు - మంత్రులు, తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని పురుషార్థసారం పేర్కొంది. రాజోద్యోగులను 72 నియోగాలుగా విభజించారు. బహత్తర నియోగాధిపతి 72 నియోగాలపై పర్యవేక్షకుడిగా ఉండేవాడు. కాకతీయులు మహామండలేశ్వర  బిరుదు ధరించారు.
           రాజ్యాన్ని నాడులు - స్థలాలు - గ్రామాలుగా విభజించారు. నాడులకు సీమ, పాడి, భూమి అనే పర్యాయ పదాలున్నాయి. గ్రామంలో 12 మంది ఆయగాండ్రు ఉండేవారు. కరణం, రెడ్డి (పెదకాపు), తలారి మాత్రమే ప్రభుత్వ ప్రతినిధులు. మిగిలిన 9 మంది తమ వృత్తుల ద్వారా విధులు నిర్వహించేవారు. న్యాయ విషయాల్లో ప్రాడ్వివాక్కులు రాజుకు సలహాలిచ్చేవారు.

          గ్రామాల్లో తగాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ఉద్యోగులను నియమించేవారని దుగ్గిరాల శాసనం పేర్కొంది. సమయసభలు అనే న్యాయ సభలు ఉండేవి. ప్రత్యేక నేరాల విచారణకు నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేసినట్లు క్రీడాభిరామం పేర్కొంది. ఆయగాండ్రు రైతుల నుంచి పంటలో కొంత భాగం 'మేర' వసూలు చేసేవారు. రాచపొలాన్ని కౌలు (కోరు)కు తీసుకున్న రైతులను అర్థశీరి అనేవారు. పెనుంబాకం మానదండం, కేసరిపాటిగడలు ఉపయోగించి పొలాన్ని సర్వే చేయించేవారు. రాచపొలం, నీరుపొలం, వెలిపొలం, తోటపొలం అని భూములను వర్గీకరించేవారు. సన్నిగండ్ల శాసనం కొలగాండ్రు, కరణాలను ప్రస్తావించింది. గొర్రెల మందలపై అడ్డవట్ల పన్ను విధించేవారు. కోటగణపాంబ వేయించిన మొగలుట్ల శాసనం వృత్తి పన్నుల గురించి వివరిస్తోంది. వడ్రంగులను తక్షక అనేవారు. రేవు పట్టణాలను కర పట్టణాలు అనేవారు. పన్నులు వసూలు చేసే స్థలాలను ఘట్టాలు అని పిలిచేవారు.
           సైనిక వ్యవస్థలో దుర్గాలకు అధిక ప్రాముఖ్యం ఉందని పురుషార్థసారం, నీతిసారం తెలుపుతున్నాయి. రథాలు వాడుకలో లేవు. చతురంగ బలాలన్నీ మహారాజ పట్టసాహిణి పర్యవేక్షణలో ఉండేవి. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యంలో వెలమల ప్రాబల్యం అధికంగా ఉండేది. రాజు అంగరక్షకదళం (వెంకి) గురించి సకలనీతి సమ్మతం తెలుపుతోంది. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు. 75 మంది నాయంకరులు ఉన్నట్లు బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి తెలుపుతోంది. రాజుతోపాటు స్వచ్ఛందంగా మరణించే సైనిక బృందాలు లెంకలు.

 

ఆర్థిక పరిస్థితులు:
        వ్యవసాయం ప్రధాన వృత్తి. మొదటి ప్రోలరాజు కేసరి సరస్సును, రేచర్ల రుద్రుడు పాకాల చెరువును తవ్వించారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించేవారు. కందిపప్పు వాడకంలో లేదు. పాల్కురికి సోమనాథుడు 'పండితారాధ్య చరిత్ర'లో 20కి పైగా వస్త్ర రకాలను పేర్కొన్నాడు. మచిలీపట్నం వస్త్రాల గొప్పతనం గురించి మార్కోపోలో తెలియజేశాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖమల్ వస్త్రాలు నేసేవారు. నిర్మల్ కత్తులు డమాస్కస్‌కు ఎగుమతి అయ్యేవి. త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని బ్రహ్మనాయుడు ఎత్తించినట్లు పల్నాటి వీరచరిత్ర పేర్కొంటోంది.
          ఆదిలాబాద్ జిల్లా కూనసముద్రం కత్తులకు ప్రసిద్ధి. మోటుపల్లి (ప్రకాశం), కృష్ణపట్నం (నెల్లూరు), హంసలదీవి (గుంటూరు), మైసోలియా లాంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది. విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించాలని నీతిసారం గ్రంథం పేర్కొంది. గోల్కొండ ప్రాంత వజ్రపు గనుల గురించి మార్కోపోలో పేర్కొన్నాడు. వర్తకులు నకరం - స్వదేశీ - పరదేశీ - నానాదేశీ పెక్కుండ్రు అనే శ్రేణులుగా ఏర్పడేవారు. త్రిపురాంతకంలో అయ్యావళి అయినూరరు (500) అనే కన్నడదేశ వర్తక శ్రేణి ఉంది. యనమదల శాసనం వర్తక శ్రేణుల గురించి పేర్కొంది. నాటి నాణేలన్నింటిలో పెద్దది గద్యాణం. ఇది బంగారు నాణెం. దీన్ని నిష్క లేదా మాడ అని కూడా పిలిచేవారు. రూక అనేది వెండి నాణెం. ఒక మాడకు పది రూకలు అని బాపట్ల శాసనం పేర్కొంది. రూకలో విభాగాలైన అడ్డుగ, పాదిక, వీస, చిన్నం అనే నాణేలు ఉండేవి.

 

మత, సాంఘిక పరిస్థితులు:
       కాకతీయులు మొదట జైన మతాన్ని అనుసరించారు. హనుమకొండలో అనేకమంది జైనులు ఆశ్రయం పొందారు. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండపై జైనాలయ బసది (కడలాలయ బసది) నిర్మించింది. రెండో ప్రోలరాజు హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది. కానీ రెండో బేతరాజు, దుర్గరాజులు రామేశ్వర పండితుడి (శ్రీశైల మఠాధిపతి)ని గురువుగా భావించారు. నాడు ఆలంపురం గొప్ప కాళాముఖ శైవ క్షేత్రం. పండితారాధ్యుడు పానగల్లురాజును శపించినట్లు తెలుస్తోంది. బ్రహ్మయ అనే శైవుడు గోవూరు(కోవూరు-నెల్లూరు)లోని జైనబసదులను నేలమట్టం చేశాడు. పొట్ల చెరువు, తిరువూరుల్లో బసదులను కూల్చి జైనులను హింసించారు. సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం గణపతిదేవుడు హనుమకొండలోని జైనులను క్రూరంగా హింసించాడు. గణపతి గురువు విశ్వేశ్వరశివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. దాహళ దేశంలో సద్భావశంభు గోళకీమఠాన్ని స్థాపించగా ఆంధ్రలో విశ్వేశ్వర శివదేవుడు ప్రధానాచార్యుడయ్యాడు. ఆంధ్రలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రం మందడం. వైష్ణవం కూడా ఆదరణకు నోచుకుంది. శ్రీకూర్మం, శ్రీకాకుళం, తిరుపతి, మంగళగిరి, సింహాచలం నాటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు. రామానుజాచార్యులు శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చినట్లు శ్రీపతి భాష్యం తెలుపుతోంది. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు విష్ణు భక్తుడు. తిక్కన ప్రభావం వల్ల గణపతిదేవుడు వైదిక మతాభిమాని అయ్యాడు. విశ్వేశ్వర శివుడు మందడంలో వేద పాఠశాల నెలకొల్పాడు. ప్రతాపరుద్రుడి కాలానికి బ్రాహ్మణాధిక్యం పెరిగినట్లు పిడుపర్తి సోముడి బసవపురాణం తెలుపుతోంది. మైలారదేవుని ఆరాధనలో తలలు కత్తిరించుకునేవారు. ఆలయ ఉద్యోగ బృందంలో స్థానాపతులు ప్రధానాధికారులు. నాడు ఆలయ ఉద్యోగి బృంద పర్యవేక్షణకు బహత్తర నియోగాధిపతి ఉండేవాడు.

       నాటి కుల సంఘాలను సమయములు అనేవారు. బ్రాహ్మణ సమయానికి మహాజనులు అనీ, వైశ్య సంఘానికి నకరము అనే ప్రత్యేక పేర్లు ఉన్నాయి. సానుల వృత్తి సంఘాలను సానిమున్నూరు అనేవారు. రుద్రదేవుడి కాలం నుంచే కాకతీయులు వైదిక మతాభిమానులు అయ్యారు. వీరి కాలంలోనే వెలమ, రెడ్డి కులాల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. సమయాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి సమయ దండన విధించేవారు. బాపట్ల శాసనం సమయ సేనాపతి అనే ఉద్యోగిని పేర్కొంటోంది.
  అరిగాపులు అంటే పన్ను కట్టాల్సిన రైతులు. కొలగాండ్రు అంటే పన్ను వసూలు చేసేవారు. పట్టప హుండీ - ధన రూపంలో విధించే పన్ను, పట్టు కొలచు - ధాన్య రూపంలో విధించే పన్ను.

 

పన్నులు:
          దర్శనం - రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను. అప్పణం - రాజు అకారణంగా వేసేది. ఉపకృతి - యువరాజు ఖర్చుల కోసం చెల్లించే పన్ను. అడ్డు సుంకం - యాదవ వర్గాలపై పన్ను. కాకతీయుల కాలంలో పన్ను 1/6 వ వంతు. రాజన్నశాలి అనేది ఒక వరి వంగడం. ఇటీవల తవ్వకాల్లో బయల్పడిన ద్రెక్మ నాణెం గ్రీకు నాణేలను పోలి ఉంది. కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు మొగిలిచర్లలో ఉన్న ఏకవీరాదేవిని ఆరాధించేవారు. ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. మాడ అనే బంగారు నాణేన్ని కాకతీయులు ప్రవేశపెట్టారు.

 

భాష - సాహిత్యాలు:
        కాకతీయుల అధికార భాష సంస్కృతం. విద్యామంటపాలను ఏర్పాటు చేశారు. మందడం వేద పాఠశాలను విశ్వేశ్వర శివుడు నిర్మించాడు. పాకాల శాసన రచయిత కవి చక్రవర్తి గణపతిదేవుడి ఆస్థాన కవి. రుద్రదేవుడు నీతిసారంను రచించాడు. ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని అగస్త్యుడు నలకీర్తి కౌముది, బాలభారత మహాకావ్యం, కృష్ణచరిత మొదలైన గ్రంథాలు రాశాడు. గంగాదేవి మధురా విజయంలో అగస్త్యుడిని తన గురువుగా కీర్తించింది. మరో కవి శాకల్య మల్లుభట్టు ఉత్తర రాఘవకావ్య, నిరోష్ట్య రామాయణం లాంటి కావ్యాలు రాశాడు. విద్దనాచార్యులు ప్రమేయచర్చామృతం గ్రంథాన్ని రాశాడు. గంగయభట్టు శ్రీహర్షుడి ఖండన ఖండ ఖాద్య గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు.
గమనిక: విద్యానాథుడు, అగస్త్యుడు ఒక్కరే అని కొందరి భావన. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యాత అయిన మల్లినాథుడే విద్యానాథుడని కొందరి భావన.
         జైన కవి అధర్వణుడు విరాట పర్వతాన్ని అనువదించినట్లు తెలుస్తోంది. అప్పయార్యుడు జైనేంద్ర కళ్యాణాభ్యుదయం కావ్యాన్ని రాశాడు. మల్లికార్జున పండితుడు శివతత్వసారం రచించాడు. యధాహక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. శివదేవయ్య శివదేవధీమణి మకుటంతో శతకాన్ని రచించాడు. పాల్కురికి సోమనాథుడు (పాలకుర్తి) పండితారాధ్య చరిత్ర, బసవపురాణం గ్రంథాలను రాశాడు. అనుభవసారం అనే పద్య కావ్యాన్ని, వృషాధిప శతకాన్ని కూడా రచించాడు. సంస్కృతంలో రుద్రభాష్యం రచించాడు. హుళక్కి భాస్కరుడు భాస్కర రామాయణం రచించాడు. తిక్కన శిష్యువైన మారన మార్కండేయ పురాణాన్ని తెనిగించి నాగయగన్న మంత్రికి అంకితం చేశాడు.

         మూలఘటిక కేతన దశకుమార చరిత్రను తెనిగించాడు. అభినవ దండిగా పేరొందిన కేతన రచనయే తెలుగులో మొదటి కథాకావ్యంగా ప్రసిద్ధి. మంచన కేయూర బాహుచరిత్రను రాసి గుండనమంత్రికి అంకితమిచ్చాడు. కాకతీయ యుగంలోనే శివకవులు శతక ప్రక్రియను ప్రారంభించారు. తిక్కన సోమయాజి కృష్ణ శతకాన్ని, బద్దెన నీతి శతకాన్ని (సుమతీ శతకం) రచించారు. యాజ్ఞవల్క్యుడి ధర్మశాస్త్రాన్ని కేతన విజ్ఞానేశ్వరీయం పేరుతో అనువదించాడు. ఆంధ్ర భాషా భూషణం గ్రంథం ద్వారా తెలుగు భాషా శాస్త్రానికి పునాదులు వేశాడు. తిక్కన కవి వాగ్బంధం అనే ఛంధో గ్రంథాన్ని రాశాడని ప్రతీతి. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి ప్రముఖ రాజనీతి గ్రంథం. క్షేమేంద్రుడు ముద్రామాత్యం, శివదేవయ్య పురుషార్థసారం, ఆంధ్రభోజుడు (అప్పనమంత్రి) నీతి భూషణం గ్రంథాలను రచించారు. భోజకవి (భోజుడు) చారుచర్య అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. కేతన కాదంబరి, రావిపాటి త్రిపురాంతకుడు మదన విజయం నాటి ప్రధాన శృంగార కావ్యాలు. త్రిపురాంతకుడు (తిప్పన్న) ప్రేమాభిరామం పేరుతో సంస్కృతంలో వీధి నాటకం రచించాడు.
          తిప్పన్న అంబికా శతకం కూడా రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడి క్రీడాభిరామం ఓరుగల్లు మత, సాంఘిక జీవితాన్ని; ద్వారసముద్రంలోని నటుల గురించి వివరిస్తుంది. మల్కాపురం శాసనం మందడంలోని విశ్వేశ్వర దేవస్థానంలోని ఆటగత్తెలు (10), పాటగత్తెల (12) గురించి పేర్కొంటుంది. జాయపసేనాని నృత్యరత్నావళి చిందు, కోలాటం లాంటి అనేక జానపద నృత్యాలను పేర్కొంది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు.

 

వాస్తు నిర్మాణాలు:
దేశ రక్షణలో దుర్గాలకు ప్రాముఖ్యం ఉంది. మూడు రక్షణ శ్రేణులతో (పుట్టకోట, మట్టికోట, అగడ్త రాతికోట) ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించారు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం రాతికోటలో 77 బురుజులు ఉండేవి. రుద్రమదేవి కాలంలో రాతికోట లోపలి భాగంలో మెట్లను నిర్మించారు. ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వర, పద్మాక్షి ఆలయాలు; ఓరుగల్లులో స్వయంభూ, కేశవ ఆలయాలను నిర్మించారు. 1162లో కాకతి రుద్రుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడి (త్రికూటాలయం)ని నిర్మించాడు. రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులే త్రికూటాధిపతులు. గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించారు. పాలంపేట రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల గృహాలు ఉన్నాయి.  రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మాచల్దేవి చిత్రశాలను నిర్మించినట్లు క్రీడాభిరామం గ్రంథం తెలుపుతోంది. మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూ దేవుడి విగ్రహం దిల్లీ మ్యూజియంలో ఉంది. హనుమకొండలో నంది విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఓరుగల్లు గురించి అమీర్ ఖుస్రూ తన రచనల్లో పేర్కొన్నాడు.

 

కాక‌తీయులు - సాంఘీక, ఆర్థిక, సామాజిక ప‌రిస్థితులు

* గ్రామానికో చెరువు
* మూడు శతాబ్దాల చరిత్ర
* వ్యవసాయానికి పెద్దపీట
* వాణిజ్యంలోనూ ప్రత్యేకత

కాకతీయులు తెలంగాణను దాదాపు 300 సంవత్సరాలకు పైగా పాలించారు. వీరి కాలంలో తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించింది. వీరు నిర్మించిన ఎన్నో చెరువులు, దేవాలయాలు నేటికీ తెలంగాణలో కాకతీయుల సుపరిపాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.
 

గ్రామ పరిపాలన
గ్రామ పరిపాలనను 'మహాజనులు' అనే సభ నిర్వహించేది. ఈ సభ నిర్ణయాలను అమలుపరచడానికి 12 మంది ఆయగార్లు ఉండేవారు. వీరిలో కరణం, రెడ్డి, తలారి అనేవారు ప్రభుత్వోద్యోగులు. కరణం భూమిశిస్తును నిర్ణయించేవాడు. రెడ్డి భూమిశిస్తును వసూలు చేసేవాడు. తలారి గ్రామ రక్షకభటుడు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేవాడు. మిగిలిన 9 మంది వివిధ వృత్తులను చేసే గ్రామ సేవకులు. ఆయగార్లకు పన్నులు లేని భూములు ఇచ్చేవారు. కొన్నిసార్లు పంటలో కూడా భాగముండేది.

 

రాజ్య ఆదాయం: భూమిశిస్తు రాజ్యాదాయంలో ప్రధానమైంది. పండిన పంటలో 1/6వ వంతు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. భూమిశిస్తును 'అరి' అనీ, చెల్లించే వారిని 'అరిగాపులు' అనీ వ్యవహరించేవారు.

 

సంప్రదాయ పన్నులు
రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలను 'దరిశనం' అని, రాజు లేదా ఇతర అధికారులు మేలు చేసినప్పుడు చెల్లించే కానుకను 'ఉపకృతి' అని అనేవారు.

ప్రతి పొలాన్ని గడ లేదా దండ లేదా కొలతో కొలిచేవారు. ఈ గడ 32 జానల పొడవుండేది. నీరు పొలంపై పన్నును 'కోరు' అనీ, వెలిపొలంపై పన్నును 'పుట్టిహండి' అనీ వ్యవహరించేవారు. 'కొలకాండ్రు' అనే అధికారులు పన్నులు వసూలు చేసేవారు. ప్రతి గ్రామంలో రాజు సొంత పొలానికి 'రాచదొడ్డి' అని పేరుండేది. ఈ భూమిని రైతులకు 'కోరు' లేదా అర్ధాదాయానికి కౌలుకు ఇచ్చేవారు. ఇలా తీసుకునే రైతులను 'అర్ధశిరీ' అనేవారు. సంత పట్టణాల వర్తక సామగ్రిపై విధించే సుంకానికి 'పెంట సుంకం' లేదా 'మగమ' అని పేరు. వేశ్యలపై విధించే పన్నును 'గుణాచార పన్ను' అనేవారు.
 

చెరువుల నిర్మాణం
కాకతీయులు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ఈ క్రమంలో చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే కాకతీయుల కాలంలో తెలంగాణలోని అన్ని గ్రామాల్లో చెరువుల నిర్మాణం జరిగింది. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండేది. చెరువుల నిర్మాణాన్ని సప్త సంతానాల్లో ఒకటిగా భావించేవారు. సప్త సంతానాల గురించి గంగాధరుడి కరీంనగర్ శాసనం, గణపతిదేవుడి గణపేశ్వర శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు నిర్మించిన చెరువుల్లో కేసరి సముద్రం, రుద్ర సముద్రం, ఉదయచోడుని చెరువు, పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం చెరువు, బయ్యారం చెరువు, కుంద సముద్రం ముఖ్యమైనవి. కాకతీయులు 'దశబంధ ఈనాం' అని ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. చెరువు కింద సాగయ్యే పంటలో పదో వంతు రాజుకు ధన లేదా ధాన్యరూపంలో చెల్లించే షరతుపై ఇచ్చిన ఈనాంనే దశబంధ ఈనాం అనేవారు.

మూసేటి కాల్వ, ఇమ్మడి కాల్వ, కృష్ణవేణి కాల్వ, అంతర్‌గంగ కాల్వలకు నదుల నుంచి నీరు సరఫరా అయ్యేది. ప్రతాపరుద్రుడి కాలంలో అడవులను నరికించి, కొత్త భూములను వ్యవసాయ యోగ్యంగా చేశారు. ఈ కాలంలో గోధుమలు, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు పంటలను పండించేవారు.
 

పరిశ్రమలు
ప్రాచీన కాలం నుంచీ కలంకారీ చీరలకు, సన్నని వస్త్రాలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో 20కి మించిన వివిధ వస్త్రాలను పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. ఓరుగల్లు రత్న కంబళ్లు, ముఖమల్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండలో వజ్రాలు దొరికేవి.

 

వాణిజ్యం
వాణిజ్యాన్ని వైశ్యులు, బలిజశెట్టులు నిర్వహించేవారు. వర్తకులు 'శ్రేణి' వ్యవస్థ ద్వారా వ్యాపారం చేసేవారు. ఈ కాలంనాటి పెద్దశ్రేణి 'సర్వదేశీయ సహస్రతెలికి'. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం ఉండేది. వడ్డీ 12 శాతం మించరాదని 'విజ్ఞానేశ్వరం' చెబుతుంది. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. అక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేవి. 'గద్యాణం' అనే బంగారు నాణెం, 'రూక' అనే వెండి నాణెం అమల్లో ఉండేవి.

అలంపురం, పానగల్లు, మంథెన, తంగెడ, మాచర్ల, వెల్పూరు, త్రిపురాంతకం, నెల్లూరు దేశీయ వాణిజ్య కేంద్రాలు. వీటిని రేవు పట్టణాలైన మోటుపల్లి, మచిలీపట్టణాలతో కలుపుతూ రహదారులుండేవి. మోటుపల్లి నుంచి త్రిపురాంతకం మీదుగా బళ్లారి మార్గం ఉండేది. చైనా, సింహళం, పర్షియా, అరేబియా దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. మోటుపల్లి ప్రధాన ఓడరేవుగా ఉండేది. గణపతిదేవుడు ఇక్కడ విదేశీ వర్తకులకు అభయహస్తమిస్తూ మోటుపల్లి అభయశాసనాన్ని వేయించాడు. మోటుపల్లిని దేశీయకొండ పట్టణం అనేవారు.

 

సాంఘిక జీవనం
కాకతీయుల కాలంలో కులవ్యవస్థ బాగా ప్రబలి పోయింది. కాకతీయుల కులం గురించి స్పష్టత లేదు. కానీ శూద్రులనే భావన ఉంది. వర్ణాంతర వివాహాలు కేవలం ఉన్నత వర్గాల వారిలో ఉండేవి. వివిధ వర్ణాల మధ్య సామరస్యం ఉండి గ్రామీణ జీవితం ప్రశాంతంగా సాగింది. అయితే రెడ్డి, వెలమ కులాల మధ్య అధికార ప్రాబల్యం కోసం పోరాటాలు జరిగాయి. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం తగ్గింది. అధికారం శూద్రుల హస్తగతం కావడంతో వారు రాజులయ్యారు. శూద్రులతో క్షత్రియులు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను రక్షించడానికి పుళింద వర్గాన్ని బ్రహ్మ సృష్టించినట్లు కాకతీయ ప్రోలరాజు సేనాని మల్లెనాయకుడు 'మాటేడు శాసనం'లో పేర్కొన్నాడు. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. మనువు తర్వాత మొదటిసారిగా స్త్రీకి ఆస్తిహక్కును గుర్తించింది ఈ కాలంలోనే. విజ్ఞానేశ్వరం స్త్రీధనాన్ని అయిదు రకాలుగా వర్ణిస్తుంది.

 

దురాచారాలు
కాకతీయుల కాలంనాటి సమాజంలో నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, సతీసహగమనం లాంటి దురాచారాలుండేవి. సామాన్య ప్రజల్లో మద్యపానం, జూదం, కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు లాంటి వ్యసనాలుండేవి. దేవదాసీలకు, బసివిరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. ప్రభువులు, ఉన్నతవర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించేవారు.

క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధం తర్వాత ఓరుగల్లులో కూడా పల్నాటి వీరులకు జాతర చేయడం ఆచారమైంది. పల్నాటి బ్రహ్మనాయుడు కులవ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను, చాపకూళ్లను ప్రోత్సహించాడు. అతడు వీరవైష్ణవాన్ని అనుసరించి.. అనేక మంది నిమ్న కులస్థులను అందులో చేర్చాడు. దళితులకు దేవాలయ ప్రవేశం చేయించాడు. శివుడి ఉగ్రరూపాలైన భైరవ, మైలారు దేవతలను పూజించినట్లు క్రీడాభిరామం తెలుపుతోంది. మైలారు దేవుడిని యుద్ధదేవుడిగా వీరులు ఆరాధించేవారు.
 

మత జీవనం
నాటి సమాజంలో వీరశైవ, వీరవైష్ణవ శాఖల మధ్య తరచుగా ఘర్షణ జరిగేది. హరిహరులు (శివుడు, విష్ణువు) ఇద్దరూ ఒకటేనని మహాకవి తిక్కన ప్రచారం చేసి ప్రజల్లో సఖ్యత కల్పించాడు. ఏకవీర, రేణుక, భైరవుడు, చాముండేశ్వరి, వీరభద్రుడు, కుమారస్వామి, మైలారుదేవుడు, ముద్దరాలు ముసానమ్మ లాంటి దేవతలను పూజించేవారు.

 

జైనమతం
తొలి కాకతీయులు దిగంబర జైనమతాన్ని అనుసరించారు. వేంగి రాజ్యంలో హింసకు గురైన జైనులు హనుమకొండకు వలస వచ్చినట్లు ఓరుగల్లు కైఫీయత్తు (గ్రామ చరిత్ర) వివరిస్తుంది. క్రీ.శ.800 నాటికే హనుమకొండ ప్రముఖ జైనకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. రాజరాజ నరేంద్రుడు అనే వేంగి చాళుక్యరాజు హింసించగా వృషభనాథుడనే జైనాచార్యుడు హనుమకొండకు వచ్చినట్లుగా ఓరుగల్లు కైఫీయత్తు ద్వారా తెలుస్తోంది. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం జైన దేవాలయంగా ఉండేది. హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో మొదలవుతుంది. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండలో కడలాలయ జైనబసదిని నిర్మించింది. తర్వాతి కాలంలో జైనులను శైవులు హింసించినట్లు, వారి దేవాలయాలను నేలమట్టం చేసినట్లు పండితారాధ్యం తెలుపుతోంది. హనుమకొండలోని జైన మతస్థులను గణపతి దేవుడు తన గురువైన విశ్వేశ్వర శివుడి ప్రోత్సాహంతో హింసించినట్లుగా సిద్ధేశ్వర చరిత్ర ద్వారా తెలుస్తోంది. విశ్వేశ్వర శివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. అయినప్పటికీ జైనమతం పూర్తిగా పతనం కాలేదు. బోధన్, పొట్లచెరువు (పటాన్ చెరువు), వేములవాడ, కొల్లిపాక (కొలనుపాక), హనుమకొండ ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి.

 

శైవం
కాకతీయుల కాలంలో శైవం విశేష ఆదరణ పొందింది. ఈ కాలంలో కాలాముఖ శైవం ఎక్కువగా జనాదరణ పొందింది. గణపతిదేవుడి కాలం నుంచి గోళకీ మఠం ఆదరణ పొందింది. గోళకీ మఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శంభు గణపతిదేవుడి శివదీక్షా గురువు. క్రీ.శ.1261లో విశ్వేశ్వర శంభునికి రుద్రమదేవి మందారం (మందడం) గ్రామాన్ని కృష్ణలంకతో కలిపి దానం చేసినట్లు మలకపురం శాసనం తెలుపుతోంది. ఈ గ్రామానికి ఆయన విశ్వేశ్వర గోళకీ లేదా విశ్వనాధ గోళగిరి అనే కొత్తపేరు పెట్టాడు. మందడంలో వేద పాఠశాలను, సత్రాన్ని, శుద్ధ శైవమఠాన్ని విశ్వేశ్వర శంభు ఏర్పాటు చేశాడు. విశ్వేశ్వర శివుడు ఏలేశ్వరంలో షోడశ ఆవర కాలమఠాన్ని ఏర్పాటు చేశాడు. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, కూర్మపురాణం తెలుపుతున్నాయి. మందడం, ద్రాక్షారామం, పుష్పగిరి, శ్రీశైలం, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో గోళకీ మఠ శాఖలు ఏర్పడ్డాయి. శైవుల్లో ఎక్కువగా మూఢాచారాలుండేవి. జంతుబలులు, ఆత్మబలిదానాలు ఎక్కువగా ఉండేవి. భక్తులు వీరావేశంతో గండకత్తెరతో తలలు కత్తిరించుకునేవారు. దేవాలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో జాతరలు నిర్వహించేవారు. గ్రామదేవతలను పూజించేవారు. గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో పాశుపత, శివశాసన, కాపాలిక, కాలానన, యామిళ తదితర శైవ శాఖలున్నట్లు త్రిపురాంతకం, మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తోంది. అలంపురం గొప్ప కాలాముఖ క్షేత్రంగా ఉండేది.

 

వైష్ణవం
కాకతీయుల కాలంలో వైష్ణవం కూడా గొప్ప ఆదరణ పొందింది. కాకతీయుల రాజలాంఛనం 'వరాహం'. రుద్రమదేవి కాలం నుంచి వైష్ణవం విశేషంగా వ్యాప్తి చెందింది. కాకతీయల సామంతులు వైష్ణవాన్ని ఆదరించారు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని, నగునూరులో వైష్ణవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు, గణపతిదేవుడు చాతుర్వర్ణ సముద్ధరణ బిరుదు ధరించారు. ఈ కాలంలో దక్షిణాదేశం నుంచి రామానుజ వైష్ణవం తెలంగాణలోకి ప్రవేశించి వ్యాపించింది. నందలూరు, తిరుపతి, మంగళగిరి, మాచర్ల, సింహాచలం, శ్రీకూర్మం, నెల్లూరు, బాపట్ల, శ్రీకాకుళం తదితర ప్రాంతాలు వైష్ణవ కేంద్రాలుగా ఉండేవి. ప్రతాపరుద్రుడు కీ.శ.1321లో చెన్నకేశవస్వామికి కొన్నిదానాలు చేసినట్లు కొలనపల్లి శాసనం తెలుపుతోంది.

 

విద్యా విధానం
కాకతీయుల కాలం నాటి రాజభాష సంస్కృతం. అప్పట్లో విద్యా మండపాలు ఉండేవి. ఇవి ముఖ్య దేవాలయాలకు అనుబంధంగా ఉండి సాహిత్య గోష్ఠులకు, మత చర్చలకు కేంద్రంగా పనిచేసేవి. మందడం, పుష్పగిరి తదితర ప్రాంతాల్లో విద్యా మండపాలతో పాటు వేదపాఠశాలలు కూడా ఉండేవి. ఈ విద్యాకేంద్రాల్లో గణితం, జ్యోతిషం, ఆయుర్వేద విద్యలను నేర్పేవారు. క్రీ.శ.1261 నాటి మల్కాపురం శాసనం నాటి విద్యామండపాల స్థితిగతులను తెలుపుతోంది.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌