* దరఖాస్తుదారులు, విజేతల్లో 77 శాతం వారే
* తొలి 10 ర్యాంకర్లలో ఆరుగురు అబ్బాయిలు
ఈనాడు, హైదరాబాద్: రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్లో అమ్మాయిలకే అగ్రస్థానం దక్కింది. దరఖాస్తుదారులు, ఉత్తీర్ణుల్లో 77 శాతం మంది వారే ఉన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎడ్సెట్ ఫలితాలను ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఓయూ ఉపకులపతి రవీందర్, కన్వీనర్ రామకృష్ణ, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ తదితరులు సెప్టెంబరు 24న సాయంత్రం విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 34,185 మందిలో 33,683 మంది కనీస మార్కులు పొందారు. వారిలో అమ్మాయిలు 25,983 (77 శాతం) మంది, అబ్బాయిలు 7,700 (23 శాతం) మంది ఉన్నారు. మొదటి 10 ర్యాంకర్లలో ఆరుగురు అబ్బాయిలుండగా, రెండు, ఏడు, ఎనిమిది, పది ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ ఎడ్సెట్లో అమ్మాయిల శాతం ఏటేటా పెరుగుతోందని చెప్పారు. ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేష్బాబు, ఎడ్సెట్ కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదింటి విద్యాకుసుమం
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: ఎడ్సెట్లో మొదటిర్యాంకు సాధించిన మహేందర్ది పేదకుటుంబం. స్వస్థలం నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం దుగ్యాల గ్రామం. చిన్న కిరాణా దుకాణంతో జీవనం సాగించిన ఆయన తండ్రి తిమ్మిశెట్టి నర్సింహ 15 ఏళ్ల కిందట మృతి చెందారు. సోదరుడు సురేందర్ చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తమ్ముడిని ప్రోత్సహించారు. ఇంటర్ తర్వాత డీఎడ్ చేసిన మహేందర్... అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, ఓయూ నుంచి లైబ్రరీ సైన్స్తో పీజీ ఉత్తీర్ణులయ్యారు. ఎడ్సెట్ (సోషల్)లో 150కి 122.50 మార్కులతో సత్తా చాటారు. ‘డీఎడ్ అభ్యసన, గ్రూప్స్ సాధన అనుభవంతో ఈ ర్యాంకు సాధ్యమైంది. భవిష్యత్తులో గ్రూప్స్లో ఉన్నతోద్యోగం సాధించాలన్నది లక్ష్యం’ అని మహేందర్ తెలిపారు.
మరింత సమాచారం ... మీ కోసం!