• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకుల జాతీయీకరణ (లక్ష్యాలు - అభివృద్ధి)

సామాన్యుల సేవలో.. సమగ్ర ప్రగతిలో!

  దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులకు కారణమైన ప్రభుత్వ చర్యల్లో బ్యాంకుల జాతీయీకరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కేవలం వ్యాపార కోణంలో సాగుతున్న బ్యాంకుల దృక్పథాన్ని, బ్యాంకింగ్‌ వ్యవస్థ దశ, దిశలను మార్చేసిన నిర్ణయమది. బ్యాంకింగ్‌ రంగంలోని స్తబ్దతను వదిలించి, ప్రజలందరి సేవలో తరించే విధంగా పురోగామి విధానాల వైపు మళ్లించింది. ఈ జాతీయీకరణ లక్ష్యాలు, బ్యాంకింగ్‌ పరిమాణంలో మార్పులు, సామాన్య ప్రజలకు అందిన సేవలు, పెరిగిన పరపతి గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలతో వచ్చిన విప్లవాత్మక మార్పులు నేటి ఆధునిక, డిజిటల్‌ ఆర్థిక సేవలకు బాటలు వేసిన వైనాన్ని అర్థం చేసుకోవాలి.

  వ్యాపార సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. ఇదే తరహాలో మన దేశంలో తొలినాళ్లలో వాణిజ్య బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతను మరిచి కొందరికే సేవలందిస్తూ, కేవలం లాభాల కోసమే పనిచేశాయి. ఈ పరిస్థితితో దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగంతో పాటు అభివృద్ధికి కీలకమైన పారిశ్రామిక రంగానికి సరిపడా నిధులు కరవయ్యాయి. 1967లో కేంద్రం నియమించిన హజారీ కమిటీ పరిశ్రమలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానం లేకపోతే పరపతి ప్రణాళికను తీసుకురాలేమని పేర్కొంది. దీంతో ప్రభుత్వం తొలుత సోషల్‌ కంట్రోల్‌ని ప్రవేశపెట్టింది. అనుకున్న ఫలితాలు రాకపోవడంతో 1969, జులై 19న నాటి ప్రధాని ఇందిరా గాంధీ మొదటిసారిగా బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియ ప్రారంభించారు. 1980, ఏప్రిల్‌ 15న రెండోసారి బ్యాంకుల జాతీయీకరణ చేపట్టారు.

  1969లో బ్యాంకుల జాతీయీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించిన లక్ష్యాలు.- 1) బ్యాంకులపై కొద్దిమంది ఆధిపత్యాన్ని తొలగించడం. 2) వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులకు సరిపడా రుణాన్ని సమకూర్చడం. 3) బ్యాంకుల నిర్వహణను ఆధునికీకరించటం. 4) నూతన వ్యవస్థాపకులను ప్రోత్సహించడం. 5) బ్యాంకు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం, వారి ఉద్యోగ నిబంధనలు మెరుగుపరచడం.


లీడ్‌ బ్యాంకు పథకం: సాంఘిక లక్ష్యాల అమలు కోసం బ్యాంకింగ్‌ వ్యవస్థలో మార్పులు సూచించేందుకు 1962లో జాతీయ పరపతి మండలి డి.ఆర్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన అధ్యయన బృందాన్ని నియమించింది. విస్తృతంగా డిపాజిట్లు సేకరించేందుకు, సామాజిక లక్ష్యాలకు అనుగుణంగా పరపతి పంపిణీకి ప్రాంతీయ మార్గదృక్పథం ఉండాలని గాడ్గిల్‌ కమిటీ సూచించింది. ఈ సూచనే లీడ్‌ బ్యాంకు పథకానికి దారితీసింది. 1969లో నారీమన్‌ అధ్యక్షతన రిజర్వ్‌ బ్యాంకు ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సంఘం ఈ సిఫార్సును ఆమోదించడంతో లీడ్‌ బ్యాంక్‌ పథకం ప్రారంభమైంది. 2004, మార్చి నాటికి 587 జిల్లాలకు వర్తించింది.


వాణిజ్య బ్యాంకుల పురోగతి: 1) శాఖలు: బ్యాంకుల జాతీయీకరణ, లీడ్‌ బ్యాంకు పథకాలతో ఎస్‌బీఐ గ్రూపు, జాతీయీకరణ జరిగిన ఇతర బ్యాంకుల శాఖలు 92% పెరిగాయి. సేవలు గ్రామాలకు విస్తరించాయి. 1969 నాటికి గ్రామాల్లో 22% ఉన్న బ్యాంకు శాఖలు, 2020 మార్చి నాటికి 35 శాతానికి పెరిగాయి. 2) డిపాజిట్లు: వాణిజ్య బ్యాంకుల డిపాజిట్‌ మొత్తం 1969లో రూ.4,646 కోట్ల నుంచి 2020 మార్చి నాటికి రూ.1,37,50,146 కోట్లకు పెరిగింది. 50 ఏళ్లలో ఈ పెరుగుదల 2,960 రెట్లు. 3) పరపతి: డిపాజిట్లకు తగ్గట్టుగా బ్యాంకు పరపతి పరిమాణం మారింది. 1969, జూన్‌లో రూ.3020 కోట్ల నుంచి 2020, మార్చిలో రూ.1,04,49,562 కోట్లకు అంటే 3,460 రెట్లు పెరిగింది. 4) ప్రాధాన్య రంగాలకు పరపతి: భారత ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యరంగాలు 1) వ్యవసాయం 2) చిన్న పరిశ్రమలు 3) ఇతర రుణాలు (పారిశ్రామికవాడలు, రహదారులు- నీటి సరఫరా, చిల్లర వర్తకం, చిన్న వ్యాపారం, స్వయం ఉపాధి, విద్య, వెనుÚ[బడిన తరగతుల వారు, ఎస్సీ, ఎస్టీలకు గృహనిర్మాణం, వినిమయ రుణాలు)


ప్రాధాన్య రంగాలకు పరపతి గురించి 1980లో రిజర్వు బ్యాంకు కొన్ని ఆదేశాలిచ్చింది. 1) మొత్తం బ్యాంకు పరపతిలో ప్రాధాన్య రంగాల వాటా 40% ఉండాలి. 2) ప్రాధాన్య రంగాలకు చెల్లించిన పరపతిలో వ్యవసాయం వాటా 40% ఉండాలి. 3) గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలలో పనిచేస్తున్న బలహీనవర్గాల వారికి మంజూరు చేసే ప్రత్యక్ష రుణాలు వ్యవసాయానికి చెల్లించిన మొత్తం ప్రత్యక్ష పరపతిలో 50% ఉండాలి. 4) గ్రామీణ చేతివృత్తుల వారు, కుటీర పరిశ్రమల్లో పనిచేసే వారికి చెల్లించిన రుణం చిన్న పరిశ్రమకు చెల్లించిన మొత్తం పరపతిలో కనీసం 12.5% ఉండాలి. 1969లో బ్యాంకుల పరపతిలో ప్రాధాన్య రంగాలకు దక్కింది 12% కాగా, 2021-22 నాటికి 39.72%కు పెరిగింది. ఇందులో వ్యవసాయం (16.42.%), చిన్న, సూక్ష్మ పరిశ్రమలు (12.59%), విద్య (0.97%), గృహనిర్మాణం (6.26%), ఇతరాలు (3.48%) ఉన్నాయి.5) సామాజిక బ్యాంకింగ్‌ - పేదరిక నిర్మూలన పథకాలు: దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం వాణిజ్య బ్యాంకుల సేవలను వినియోగించింది.


వ్యత్యాస వడ్డీ రేట్లు: 1972, ఏప్రిల్‌లో వ్యత్యాస వడ్డీ రేట్ల పథÅకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలుత 162 జిల్లాలకు, ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించింది. ఈ పథకం కింద బలహీనవర్గాల వారికి చెల్లించే రుణాలపై వడ్డీ రేటును 4 శాతంగా నిర్ణయించారు.


సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఐఆర్‌డీపీ): ఈ పథకం కింద ఎస్సీలు, ఎస్టీలు, స్త్రీలు, బలహీనవర్గాల వారితో పాటు విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కోసం రుణాలిచ్చారు.


6) బ్యాంకింగ్‌ వైవిధ్యీకరణ/నూతన విధానాలు, సాధనాలు: జాతీయీకరణ తర్వాత బ్యాంకులు పురోగామి పద్ధతులు అనుసరించాయి. 1949, బ్యాంకింగ్‌ క్రమబద్ధీకరణ చట్టాన్ని కేంద్రం సవరించింది. అనేక వాణిజ్య బ్యాంకులు స్వతంత్రంగా మర్చంట్‌ బ్యాంకింగ్‌ సేవలు చేపట్టాయి. కొన్ని బ్యాంకులు ప్రత్యేక అనుబంధ శాఖలు ఏర్పాటు చేసి మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రారంభించాయి. రిటైల్‌ బ్యాంకింగ్‌ ఒక లాభదాయకమైన విధానంగా చేపట్టి గృహ రుణాలు, వినియోగ రుణాలు విస్తృతంగా మంజూరు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డుల్ని విస్తృతంగా జారీ చేస్తున్నాయి. ఖాతాదారులకు ఆన్‌లైన్, నెట్‌బ్యాంకింగ్, మొబైల్‌ యాప్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాయి. వినూత్న ఆలోచనలున్న ఔత్సాహికులకు వెంచర్‌ క్యాపిటల్‌ నిధులు సైతం సమకూరుస్తున్నాయి.


ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన: ఆర్థిక సమ్మిళిత లక్ష్యంతో 2014, ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ‘మేరా ఖాతా - భాగ్యవిధాతా’ అనేది దీని నినాదం. దేశంలోని అన్ని కుటుంబాలకు మౌలిక బ్యాంకు ఖాతాలు ఇచ్చి, విత్త సేవలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ పథకం ప్రారంభించిన రోజే 1.5 కోట్ల పొదుపు ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాకు కనీస బ్యాలెన్స్‌ అవసరం లేదు. రూపే డెబిట్‌ కార్డులు జారీ చేస్తారు. రూ.లక్ష వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది.


బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు


భారత ద్రవ్యవ్యవస్థ పనితీరును సమీక్షించేందుకు 1982లో సుఖ్‌మాయ్‌ చక్రవర్తి కమిటీని నియమించగా, 1985లో నివేదిక సమర్పించింది. ఇందులోని ముఖ్యాంశాలు.. 1) ధరల స్థిరీకరణాన్ని సాధించే ద్రవ్యవిధానం ఉండాలి. 2) ద్రవ్య సరఫరా పెరిగేందుకు కారణాలు ఆర్‌బీఐ ప్రభుత్వానికి పెద్దఎత్తున పరపతి ఇవ్వడమే. 3) వడ్డీ రేట్ల నిర్ణయంలో బ్యాంకులకు స్వేచ్ఛ ఉండాలి. 4) కేంద్ర బడ్జెట్‌ లోటును తిరిగి నిర్వచించాలి. 


నరసింహ కమిటీ: విత్త వ్యవస్థ పనితీరు, నిర్మాణాన్ని పరిశీలించి సూచనలు చేసేందుకు భారత ప్రభుత్వం 1991లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఎం.నరసింహం అధ్యక్షతన కమిటీని నియమించింది. ఇది 1991, డిసెంబరులో నివేదిక సమర్పించింది. అందులోని సిఫార్సులు. 


1) ఆదేశిత పెట్టుబడి: ఎ) చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌) తగ్గించడం: ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకు చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని ప్రధాన సాధనంగా ఉపయోగించుకోవడం మానుకోవాలి. ఎస్‌ఎల్‌ఆర్‌ను 38.5% నుంచి వచ్చే పదేళ్ల కాలానికి 25%కు తగ్గించాలి. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. బి) నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) తగ్గించడం: పరపతి నియంత్రణ కోసం నగదు నిల్వల నిష్పత్తిపై ఆధారపడకుండా బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలపై ఆధారపడాలి. సీఆర్‌ఆర్‌ని 15% నుంచి 3 శాతానికి తగ్గించాలి. ప్రస్తుతం ఇది 4.5% ఉంది. 2) ఆదేశిత పరపతి కార్యక్రమాలు నిలుపుదల: ప్రాధాన్యత రంగ రుణాలను 40 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలి. అయితే ప్రభుత్వం ఈ సిఫార్సును ఆమోదించలేదు.3) వడ్డీ రేట్ల వ్యవస్థ: దేశంలో వడ్డీ రేట్ల వ్యవస్థను మార్కెట్‌ శక్తులు నిర్ణయించాలి. 4) నాలుగు అంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 5) బ్యాంకుల విస్తరణ, సరళీకరణ పాటించాలి. 6) ద్వంద్వ నియంత్రణను రద్దు చేయాలి.


బ్యాంకింగ్‌ సంస్కరణలపై 1998లో మరోసారి నరసింహం కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక బ్యాంకింగ్‌ రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. అందులోని ముఖ్యాంశాలు- * శక్తిమంతమైన బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. * సంకుచిత బ్యాంకింగ్‌ వ్యవస్థను అమలు చేయాలి. * చిన్న, స్థానిక బ్యాంకుల ఏర్పాటు. * మూలధన పర్యాప్త నిష్పత్తిని పెంచాలి.* బ్యాంకింగ్‌ చట్టాలను సమీక్షించాలి. * వడ్డీ రేట్లపై క్రమబద్ధీకరణ తొలగించాలి.* స్వచ్ఛంద పదవీవిరమణ పథకం అమలు చేయాలి.* ఎస్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో ఆర్‌బీఐ వాటాను 33 1/2 శాతానికి తగ్గించాలి.


 ఈ సిఫార్సుల్లో చాలావరకు ప్రభుత్వం ఆమోదించి అమలు జరుపుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్న బ్యాంకింగ్‌ శాఖను మూసేయాలని చేసిన సిఫార్సును ఆమోదించలేదు.



 

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌