ఆర్థిక పురోగతికి పునాదులు!
దేశ ప్రగతి, ఆర్థిక పురోగతి మూలధన వనరుల లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి చెందినా, చెందుతున్నా ఆ దేశానికి మూలధన వనరుల లభ్యత బాగా ఉందని అర్థం. వస్తు, సేవల ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడులే ఈ మూలధన వనరులు. ప్రజల పొదుపుతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు మూలధన నిల్వలుగా మారుతుంటాయి. పూర్వం అసంఘటితంగా జరిగిన ఈ పెట్టుబడుల సేకరణ ప్రస్తుతం అధికశాతం సంఘటితంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో విస్తృత పరిధి ఉన్న విత్త మార్కెట్ స్వరూప స్వభావాలను, పరిణామక్రమాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రధాన పెట్టుబడి సమీకరణ వ్యవస్థ అయిన స్టాక్మార్కెట్ గురించి, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీల గమనంపై అవగాహన పెంచుకోవాలి.
ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమైంది మూలధనం. ఆచార్య రాగ్నర్ నర్క్స్ ప్రకారం వెనుకబడిన దేశాల్లో పేదరికపు విషవలయాలను ఛేదించాలంటే మూలధన సంచయనం అవసరం. పెట్టుబడి అంటే మార్కెట్ల నుంచి వాటాలు, బాండ్లు, డిబెంచర్లు, రుణాలు, సెక్యూరిటీల అమ్మకం మొదలైనవి. దీనినే విత్త పెట్టుబడి అని కూడా అంటారు. వాస్తవిక పెట్టుబడి అంటే ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, డ్యామ్లు, రోడ్లు, భవనాలు మొదలైన ప్రజాఆస్తులు అని జె.ఎమ్.కీన్స్ నిర్వచించాడు. పెట్టుబడి ఒక ప్రవాహం, మూలధనం ఒక నిల్వ.
మూలధనం - ప్రయోజనాలు:
1) అవస్థాపన సదుపాయాలు పెరుగుతాయి.
2) సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది.
3) జనాభా పెరుగుదలను ఎదుర్కొంటుంది.
4) ఉద్యోగితను పెంచుతుంది.
5) విదేశీ వ్యాపార లోటు తొలగిస్తుంది.
6) ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది.
7) ఆర్థిక సంక్షేమాన్ని పెంచుతుంది.
రకాలు:
1) మానవ మూలధనం.
2) భౌతిక మూలధనం. మానవ మూలధనం అంటే విద్య, వైద్యం నైపుణ్యాలపై చేసే ఖర్చు. భౌతిక మూలధనం అంటే యంత్రాలు, ఫ్యాక్టరీలు, దీర్ఘకాలిక పెట్టుబడులు. భౌతిక మూలధనం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1) పొదుపు
2) ఆర్థిక సంస్థలు (బ్యాంకులు)
3) ఉత్పత్తిదారులు.
• పొదుపు ఆర్థిక సంస్థల్లో జమ అయి, ఉత్పత్తిదారులకు రుణం రూపంలో పెట్టుబడిగా లభిస్తుంది.పెట్టుబడి పెరిగేకొద్దీ మూలధన సంచయనం జరుగుతుంది.
మూలధనాన్ని సేకరించే మార్గాలు:
1) దేశీయ మార్గాలు (పొదుపు, లోటు బడ్జెట్, దేశీయ రుణాలు, విదేశీ వర్తకంలో మిగులు)
2) విదేశీ మార్గాలు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సంస్థాగత పెట్టుబడులు, విదేశీ సంస్థల ఆర్థిక సహకారం).
దేశీయ మార్గాల ద్వారానే అధిక పెట్టుబడి లభిస్తుంది. ఇందులో ముఖ్యమైంది పొదుపు. దేశీయ పొదుపును ‘గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ (జీడీఎస్)’ అంటారు. ఈ పొదుపు మూడు రకాలుగా జరుగుతుంది.
1) గృహ రంగాలు
2) కార్పొరేట్ రంగాలు
3) ప్రభుత్వ రంగం
గృహరంగాల్లో రెండురకాలుగా పొదుపు జరుగుతుంది.
1) భౌతిక పొదుపు (బంగారం, వెండి లాంటి లోహాలు, గృహ నిర్మాణాలు మొదలైనవి)
2) విత్త పొదుపు (బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో పొదుపు) భారత్లో విత్త పొదుపు 6.6%గా ఉంటే భౌతిక పొదుపు 10.6%గా ఉంది.
మూలధన సంచయనం: ఒక ఆర్థిక సంవత్సరంలో లభించిన స్థూల, స్థిర మూలధనాన్ని మూలధన సంచయనం అంటారు. అధికంగా మూలధన సంచయనం 74% ప్రైవేటు రంగం కల్పిస్తే, 26% ప్రభుత్వ రంగం కల్పిస్తుంది.
విత్త మార్కెట్లు: ఆర్థిక వ్యవస్థలో విత్త మార్కెట్లు కీలకం. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి దోహదం చేస్తాయి. విత్త మార్కెట్లు ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్ అని రెండు రకాలుగా ఉంటాయి.
1) ద్రవ్య మార్కెట్: ఇది స్వల్పకాలిక మార్కెట్. ఇందులో మంజూరయ్యే రుణాల కాలవ్యవధి ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. దీన్ని స్వల్పకాలిక పరపతి మార్కెట్ అని కూడా అంటారు. ద్రవ్య మార్కెట్ ప్రత్యక్షంగా ద్రవ్యంతో వ్యవహరించదు. సమీప ద్రవ్యంగా పిలిచే వర్తకపు బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల అంగీకార పత్రాలు మొదలైన రూపాల్లో ఉంటుంది. ఈ పత్రాలన్నింటికీ అధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్య మార్కెట్ను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
ఎ) అసంఘటిత ద్రవ్య మార్కెట్: దీనిలో మూడు రకాలు ఉంటాయి.
1) క్రమబద్ధీకరించని నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలు ఉదా: విత్త కంపెనీలు, చిట్ఫండ్ కంపెనీలు, నిధి కంపెనీలు మొదలైనవి.
2) దేశీయ బ్యాంకర్లు. ప్రాచీన కాలం నుంచి దేశీయ బ్యాంకర్ల వ్యవస్థ ఉంది. ఇవి నాణేలను భద్రపరిచి రుణాలుగా ఇచ్చేవి. ఉదా: బెంగాల్లో జగత్ సేఠ్లు, పట్నాలో షాలు, సూరత్లో నాధ్జీ, అంబాజీలు; మద్రాస్లో చెట్టియార్లు.
3) వడ్డీ వ్యాపారులు
బి) సంఘటిత ద్రవ్య మార్కెట్: భారతీయ సంఘటిత ద్రవ్య మార్కెట్లో రిజర్వ్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఉంటాయి. సంఘటిత మార్కెట్లో వివిధ రకాల ఉపమార్కెట్లు ఉంటాయి.
i) కాల్మనీ మార్కెట్: ఇవి ప్రధాన నగరాలైన ముంబయి, కోల్కతా, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్లో ఎక్కువగా ఉంటాయి. 1970 నుంచి ఎల్ఐసీ, ‘యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ ద్రవ్య మార్కెట్లో రుణదాతలుగా వ్యవహరించేవి. 1987లో వాఘల్ వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం నాన్బ్యాంకింగ్ విత్త సంస్థలను కూడా రుణదాతలుగా అనుమతించారు. 1988లో ‘డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా (డీఎఫ్హెచ్ఐ)’ నెలకొల్పారు.
ii) ట్రెజరీ బిల్లుల మార్కెట్: ద్రవ్యమార్కెట్లో అత్యంత ప్రధానమైంది బిల్లుల మార్కెట్. ఇందులో స్వల్పకాల వ్యవధి ఉన్న బిల్లుల క్రయవిక్రయాలు జరుగుతాయి. సాధారణ ట్రెజరీ బిల్లులకు 91 రోజుల కాలపరిమితి ఉంటుంది. వీటిని ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, వాణిజ్య ప్రభుత్వ సంస్థలకు, విత్త సంస్థలకు అమ్ముతుంది. 1986లో 182 రోజుల గడువుతో, 1992లో 364 రోజుల గడువుతో, 1997లో 14 రోజుల కాలపరిమితితో ట్రెజరీ బిల్లులు ప్రవేశపెట్టారు. 2001లో వీటిని నిలిపివేశారు.
iii) వాణిజ్య బిల్లుల మార్కెట్: ఒక వ్యాపార సంస్థ మరో వ్యాపార సంస్థ పేరు మీద విడుదల చేసే బిల్లులను వాణిజ్య బిల్లు అంటారు. సాధారణంగా దీని కాలవ్యవధి మూడు నెలలు ఉంటుంది. వాణిజ్య బిల్లులు అనేక రకాలుగా ఉంటాయి.
1) డిమాండ్ బిల్లులు
2) కాలపరిమితి బిల్లులు
3) వ్యాపార బిల్లులు
4) విత్త బిల్లులు
5) దేశీయ బిల్లులు
6) విదేశీ బిల్లులు. భారతదేశంలో అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను హుండీలు అంటారు.
iv) వాణిజ్య పత్రాలు: వాఘల్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టింది. కంపెనీలు జారీ చేసే వాణిజ్య పత్రాల విలువ కనీసం రూ.కోటి ఉండాలి.
v) డిపాజిట్ల సర్టిఫికెట్లు: వీటిని వాఘల్ కమిటీ సిఫార్సు చేసింది. వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారీ చేసే సర్టిఫికెట్లను డిపాజిట్ సర్టిఫికెట్లు అంటారు. 1991-92లో అఖిల భారత విత్త సంస్థలైన ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఐఎఫ్సీఐ లు కూడా ఈ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
vi) మ్యూచువల్ ఫండ్స్: ద్రవ్య మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ని ఆర్బీఐ 1992, ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. వ్యక్తిగత పెట్టుబడిదారులకు అదనపు స్వల్పకాలిక పెట్టుబడి అవకాశాన్నివ్వడం ఈ పథకం ఉద్దేశం. 2007, మార్చి 7 నుంచి ద్రవ్య మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ‘సెబి’ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చింది.
2) మూలధన మార్కెట్: పరిశ్రమలకు అవసరమైన దీర్ఘ కాలిక విత్తాన్ని సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు. గవర్నమెంటు మార్కెట్ను గిల్ట్ ఎడ్జ్ అని కూడా అంటారు. ‘గిల్ట్ ఎడ్జ్’ అంటే అంటే ‘అత్యంత శ్రేష్టమైన బంగారంతో సమానం’ అని అర్థం. మూలధన మార్కెట్ను నియంత్రించే సంస్థ సెబీ. భారతదేశంలో ‘సెబీ’ గుర్తించిన స్టాక్ ఎక్స్ఛేంజ్లు 23. వీటిలో శాశ్వతమైనవి 5.అవి
1) అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్
2) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
3) కోల్కతా స్టాక్ ఎక్స్ఛేంజ్
4) మగధ స్టాక్ ఎక్స్ఛేంజ్
5) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ): 1875లో బాంబేలోని దలాల్ స్ట్రీట్లో ప్రారంభించారు. ఆసియాలో మొదటి, పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్. 1986లో సెన్సెక్స్ (సెన్సిటివిటీ ఇండెక్స్) పేరుతో ఒక సూచీని ప్రవేశపెట్టింది. (ఆధార సంవత్సరం 1978-79). 30 కంపెనీల వాటా ధరలను పరిగణిస్తూ భార సగటు పద్ధతిలో ప్రతి 15 సెకన్లకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సూచీ జవాబును పాయింట్స్ అంటారు. ప్రస్తుతం బీఎస్ఈ ఛైర్మన్ ఎస్.ఎస్.ముంద్రా.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ): 1992, నవంబరు 1న బాంబేలో స్థాపించారు. దీన్ని నాదకర్ణి కమిటీ సిఫార్సు చేసింది. యూటీఐ, ఐడీబీఐ, ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ తదితర ఆర్థిక సంస్థలు కలిసి స్థాపించాయి. 1996లో ‘నిఫ్టీ’ పేరుతో సూచీని ప్రవేశపెట్టింది. (ఆధార సంవత్సరం 1995-96.) 50 కంపెనీల వాటాల ధరలను ప్రతి 15 సెకన్లకు ఒకసారి భార సగటు పద్ధతిలో లెక్కించి పాయింట్లు ప్రకటిస్తారు. ప్రస్తుత ఎన్ఎస్ఈ ఛైర్మన్ ఆశీష్ కుమార్ చౌహాన్
సెబీ (ఎస్ఈబీఐ - సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా): షేర్వాణి కమిటీ సిఫార్సుల మేరకు 1988లో బొంబాయిలో స్థాపించారు. 1992లో ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించారు. స్టాక్మార్కెట్లను సెబీ క్రమబద్ధం చేస్తుంది. ప్రస్తుతం సెబీ ఛైర్మన్ మాధాబి పూరి బచ్.
షేర్ మార్కెట్ కుంభకోణాలు: 1991లో హర్షద్ మెహతా కుంభకోణంపై బీఎస్ఈ జానకీరామన్ కమిటీని నియమించింది. 2001లో కేతన్ పారఖ్ కుంభకోణంపై ‘ప్రకాష్మణి త్రిపాఠి’ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.
బుల్: స్టాక్ మార్కెట్లో వాటాల ధరలు పెరుగుతుంటే ‘బుల్’ అంటారు.
బేర్: స్టాక్ మార్కెట్లో వాటాల ధరలు తగ్గితే ‘బేర్’ అంటారు.
బ్రోకర్: స్టాక్ మార్కెట్లో వాటాల కొనుగోలు, అమ్మకాలపరంగా మధ్యవర్తిగా వ్యవహరించే వారిని ‘బ్రోకర్’ అంటారు. వీరు ప్రతి లావాదేవీలపై కమిషన్ వసూలు చేస్తారు.
రచయిత: ధరణి శ్రీనివాస్