• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనులు

తొలి తెలుగు చక్రవర్తులు

  ప్రాచీన భారతదేశ చరిత్రలో శాతవాహనులకు విశిష్ట స్థానం ఉంది. దక్షిణాదిన తొలి సామ్రాజ్యాన్ని స్థాపించి నాలుగు శతాబ్దాలకు పైగా జనరంజక పాలన సాగించారు. అశోకుడి అనంతరం స్వతంత్ర పాలకులైన వీరు శాంతికాముకులుగా మెలుగుతూనే శక్తిమంతమైన విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. స్వదేశీ, విదేశీ దండయాత్రలను ఎదుర్కొని శాంతిని నెలకొల్పారు. వైదిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించి తర్వాతి తరాలకు అందించారు. బౌద్ధ మతోద్ధరణకు తోడ్పడ్డారు. నాటి ప్రజాజీవనం, సంస్కృతి, భాషా, సాంస్కృతిక వికాసం వంటి అంశాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  ప్రప్రథమ ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలు శాతవాహనులు. ఈ సామ్రాజ్య స్థాపనతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు. దక్షిణ పథాన్ని శక, యవన, పహ్లవ విదేశీ దాడుల నుంచి కాపాడారు. వీరిని సాతవాహనులు, శాలివాహనులు, శాతకర్ణులు, ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులని కూడా అంటారు. ఆంధ్ర అనేది జాతినామం. శాతవాహన అనేది వంశనామం.

శాతవాహన రాజుల గురించి తెలుసుకోవడానికి వివిధ ఆధారాలు ఉన్నాయి. 

1) పురావస్తు ఆధారాలు

శాసనాలు: శాసనాల గురించి చేసే అధ్యయనాన్ని శాస్త్రం ఎపిగ్రఫీ అంటారు.

* ఎర్రగుడి శాసనం - అశోకుడు  

* 13వ శిలశాసనం - అశోకుడు 

* నానాఘాట్‌ శాసనం - నాగానిక 

* నాసిక్‌ శాసనం - గౌతమీ బాలశ్రీ 

* అమరావతి శాసనం - రెండో పులోమావి 

* మ్యాకదోని శాసనం - మూడో పులోమావి 

* హాతిగుంఫా శాసనం - ఖారవేలుడు 

* జునాగఢ్‌ శాసనం - రుద్రదమన

నాణేలు: నాణేల గురించి అధ్యయనాన్ని న్యూమెస్‌ మ్యాటిక్స్, నాణేలపై ఉన్న బొమ్మల అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అని అంటారు. శాతవాహనుల కాలం నాటి నాణేలను సీసం, వెండి పోటిన్‌ అనే మిశ్రమ లోహంతో తయారు చేసేవారు. మొదటి శాతకర్ణి అశ్వమేథ యాగం గుర్తుతో, గౌతమీపుత్ర శాతకర్ణి తన చిహ్నంతో, యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాప గుర్తుతో నాణేలను ముద్రించారు.

2) లిఖిత ఆధారాలు 

ఎ) పురాణాలు: మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణం, ఐతరేయ బ్రాహ్మణం 

బి) బౌద్ద మత గ్రంథాలు 

సి) జైన మత గ్రంథాలు 

డి) స్వదేశీ సాహిత్యం: బృహత్కథ - గుణాడ్యుడు, కథాసరిత్సాగరం - సోమదేవసూరి, గాథాసప్తశతి - హాలుడు, లీలావతి పరిణయం - కుతూహలుడు, సుహృల్లేఖ - ఆచార్య నాగార్జునుడు, కాతంత్ర వ్యాకరణం - శర్వవర్మ 

ఇ) విదేశీయుల రచనలు: ఇండికా - మెగస్తనీస్, ది గైడ్‌ టు జాగ్రఫీ - టాలమీ, నేచురల్‌ హిస్టరీ - ప్లీనీ, పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ - అజ్ఞాత నావికుడు, సి-యు-కి - హుయాన్‌త్సాంగ్‌

శాతవాహనుల జన్మస్థలం మీద విభిన్న వాదనలున్నాయి. వీరిది కర్ణాటక ప్రాంతమని వి.ఎన్‌.సుక్తాంకర్, మహారాష్ట్ర వారని పి.టి.శ్రీనివాస అయ్యంగార్, విదర్భ వాసులని .వి.వి.మిరాసి, ఆంధ్రులేనని గుత్త వెంకటరావు, ఎం.రామారావు, డాక్టర్‌ స్మిత్‌ తదితరులు పేర్కొన్నారు.

శాతావాహనుల రాజధానులు 

1) శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) 

2) ధరణికోట/ధాన్యకటకం (గుంటూరు జిల్లా) 

3) ప్రతిష్టానపురం (మహారాష్ట్ర) 

రాజుల్లో ప్రముఖులు


శ్రీముఖుడు (క్రీ.పూ.271-248): ఇతడికి చిముకుడు, శిముకుడు, శిశుక, సింధుక, సిప్రక, సుద్ర వంటి పేర్లు ఉన్నాయి. ఇతడే ఆంధ్ర శాతవాహన వంశ స్థాపకుడు. తండ్రి పేరు శాతవాహనుడు/శాలివాహనుడు. వీరి రాజధాని ప్రతిష్టానపురం. శ్రీముఖుడు అశోకుడికి సమకాలీనుడు. మౌర్యులకు సామంతుడిగా మెలిగాడు. 23 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. మొదట జైనమతం స్వీకరించాడు. ఆ తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఈయన వేయించిన నాణేలు (పోటిన్‌) కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభించాయి. ‘సాధ్వహణ’ అనే పేరుతో నాణేలను ముద్రించాడు.

కృష్ణుడు/కన్హ (క్రీ.పూ.248-230): శ్రీముఖుడి సోదరుడు. 18 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. మహారాష్ట్రలో నాసిక్‌ వరకు రాజ్య విస్తరణ చేశాడు. నాసిక్, కన్హేరి వద్ద బౌద్ధవిహారాలను నిర్మించారు. అశోకుడి మరణం తర్వాత తన రాజ్యానికి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ‘విదర్భ’ కోసం పుష్యమిత్ర శుంగుడితో యుద్ధం చేశాడు. ఇతడి కాలంలో నే భాగవత మతం ఆంధ్రలోకి ప్రవేశించింది. ఆ మత స్థాపకుడు వాసుదేవుడు. 

మొదటి శాతకర్ణి (క్రీ.పూ.230-220): శ్రీముఖుడి కుమారుడు. పదేళ్ల పాటు పరిపాలించాడు. మత్స్య పురాణంలో ఇతడిని మల్లకర్ణి అని పేర్కొన్నారు. ‘శాతవాహన’ అనే వంశం నామాన్ని తన పేరుకు జోడించిన మొదటి రాజు. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. ఏకవీర, అప్రతిహతచక్ర సామ్రాట్, శూరుడు, దక్షిణ పథపతి అనే బిరుదులు ఉన్నాయి. మహారాష్ట్రను పాలిస్తున్న సామంతుడైన ‘మహారథి త్రయినోకరో’ కుమార్తె నాగానికను వివాహం చేసుకున్నాడు. ఈమె ‘నానాఘాట్‌ శాసనం’ను ప్రాకృత భాషలో వేయించింది. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయినిని ఆక్రమించాడు. ఉజ్జయిని పట్టణ తోరణాన్ని నాణేలపై ముద్రించాడు. కళింగ రాజు ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లుగా హాథిగుంపా శాసనంలో ఉంది. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం నిర్వహించాడు. ఇతడి మరణానంతరం కుమారులు చిన్నవాళ్లు కావడంతో భార్య నాగానిక కొంతకాలం పరిపాలన చేసింది. తర్వాత రాజ్యానికి వచ్చినవారు పూర్ణోత్సాంగుడు (వేదసిరి), స్కందస్తంభి.

రెండో శాతకర్ణి (క్రీ.పూ.184-128): ఈయన ఆరో శాతవాహన రాజు. తొలి శాతవాహన రాజుల్లో సుప్రసిద్ధుడు. స్కందస్తంభి తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు. 56 ఏళ్ల పాటు పాలించాడు. నానాఘాట్‌ శాసనంలో నాగానిక పేర్కొన్నది ఇతడి గురించేనని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శకులు, కళింగులు, శుంగులతో యుద్ధాలు చేశారు. ఇతడి కాలం నాటి నాణేలు మాళ్వా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో లభించాయి.

* రెండో శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చినవారు లంబోదరుడు (క్రీ.పూ.128-110), అపీలకుడు (క్రీ.పూ.110-98), మేఘ స్వాతి (క్రీ.పూ.98-80), స్వాతి (క్రీ.పూ.80-62), స్కందస్వాతి (క్రీ.పూ. 62-55).* మృగేంద్ర (క్రీ.పూ.55-52). మృగేంద్ర కాలంలోనే బెత్లహామ్‌ వద్ద ఏసుక్రీస్తు జన్మించారు.

కుంతలస్వాతి (క్రీ.పూ.52-44): ఇతడు 13వ రాజు. ఎనిమిదేళ్లు పరిపాలించాడు. ఇతడి కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజ భాష అయ్యింది. కుంతలస్వాతికి సంస్కృతం నేర్పిన పండితుడు శర్వవర్మ. ఆయన రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. దక్షిణాన మొదట సంస్కృత గ్రంథం ఇదే. కానీ భారతదేశంలో మొదటి సంస్కృత గ్రంథం పాణిని రచించిన ‘అష్టాధ్యాయి’. కుంతలస్వాతి కాలం నాటి మరో కవి గుణాఢ్యుడు. ఇతడి రచన ‘బృహత్కథ’. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని హరిసేనుడు బృహత్కథా కోశం, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి, సోమదేవుడు కథాసరిత్సాగరం గ్రంథాలను రచించారు.

* కుంతలస్వాతి తర్వాత స్వాతికర్ణి రాజు అయ్యాడు.

మొదటి పులోమావి (క్రీ.పూ.43-19): ఇతడు స్వాతికర్ణి తర్వాత రాజు. శాతవాహునుల్లో 15వ పాలకుడు. తన రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. అవంతి, అకర రాజ్యాలను ఆక్రమించాడు. మగధ రాజధాని పాటలీపుత్రంపై ఆంధ్ర విజయకేతనం ఎగురవేశాడు. నాటి మగధ రాజు కణ్వ వంశీయుడైన సుశర్మ.

* మొదటి పులోమావి తర్వాత గౌర కృష్ణుడు (క్రీ.పూ.19 - క్రీ.శ.6) రాజు అయ్యాడు.

హాలుడు (క్రీ.శ.7-12): ఈయన 17వ రాజు. అయిదేళ్ల పాటు పరిపాలించాడు. స్వయంగా కవి. ఎక్కువ మంది కవులను పోషించి కవివత్సలుడిగా పేరు పొందాడు. గాథా సప్తశతి అనే గ్రంథం రాశాడు. ప్రాకృత భాషకి ఇతడి కాలం స్వర్ణయుగం. హాలుడు-లీలావతి (శ్రీలంక రాకుమారి)ల ప్రేమగాథను కుతూహలుడు అనే కవి ‘లీలావతి పరిణయం’ గ్రంథంగా రాశాడు. వారి వివాహం ద్రాక్షారామంలో జరిగింది.

* హాలుడి తర్వాత రాజులు మందలకుడు (క్రీ.శ.7-12), పురీంద్రసేనుడు (క్రీ.శ.12-33), సుందర స్వాతికర్ణి (క్రీ.శ.33-34), చకోర స్వాతికర్ణి (క్రీ.శ.34), శివస్వాతి (క్రీ.శ.34-62).

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.62-86): శాతవాహనుల్లో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. 23వ పాలకుడు. 24 ఏళ్లు పరిపాలించాడు. శాలివాహన శకాన్ని (క్రీ.శ.78) ప్రారంభించాడు. ఈయన బిరుదులు దక్షిణ సముద్రాదీశ్వర, ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ క్షత్రియ దర్పమాన వర్థన, త్రిసముద్ర తోయ పీతవాహన. షహరాట వంశానికి చెందిన నహపాణుడిని నాసిక్‌లోని జోగల్‌ తంబి యుద్ధంలో ఓడించాడు. దీంతో ‘షహరాట వంశ నిరీవ శేషకర’ అనే బిరుదు పొందాడు. నహపాణుడి నాణేలపై తన చిహ్నాలతో నాణేలను మళ్లీ ముద్రించాడు. శక, యవన, పహ్లవులను ఓడించాడు. ఇతడి విజయాల గురించి నాసిక్‌ శాసనం తెలుపుతుంది. ఆ శాసనం వేయించినవారు గౌతమీ బాలాశ్రీ. శాసనం రాసినవారు శివస్వామి - మహాస్వామి.

వాసిష్టపుత్ర పులోమావి/రెండో పులోమావి (క్రీ.శ.86-114): గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతడి గురించి తెలిపే శాసనాలు నాసిక్‌లో 4, కార్లేలో 2, అమరావతి, ధరణికోటల్లో ఒక్కొక్కటి చొప్పున లభించాయి. నాసిక్‌ శాసనంలో ఇతడిని ‘దక్షిణ పథేశ్వరుడు’గా పేర్కొన్నారు. ప్రాచీనాంధ్రలో 9 నగరాలను నిర్మించి నవనగర స్వామిగా  ప్రసిద్ధికెక్కాడు. శక రాజు రుద్రదాముడు ఇతడి కాలంలో రెండుసార్లు శాతవాహన రాజ్యంపై దండెత్తాడు. అమరావతి వద్ద స్తూపం నిర్మించారు. ఇతడి నాణేలు, శాసనాలు ఆంధ్ర జిల్లాల్లో విస్తారంగా లభించాయి. అమరావతి వద్ద లభ్యమైన శాసనంలోనే ‘నాగబు’ అనే తెలుగు పదం కనిపిస్తుంది.

శివశ్రీ (క్రీ.శ.114-121): వాసిష్టపుత్ర పులోమావి తర్వాత శివశ్రీ రాజయ్యాడు. ఇతడికి క్షత్రప అనే బిరుదు ఉంది. రుద్రదాముడి కుమార్తె రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గురించి తెలిపే శాసనం గిర్నార్‌ లేదా జునాగఢ్‌ శాసనం. ఇతడి అనంతరం శివస్కందుడు (క్రీ.శ.121-128) రాజయ్యాడు.

యజ్ఞశ్రీ శాతకర్ణి (క్రీ.శ.128-157): ఇతడు 27వ రాజు. చివరి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. రుద్రదాముడి వెండి నాణేలను పోలిన నాణేలను ముద్రించాడు. ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు ఇతడి కాలం నాటివాడే. నాగార్జునాచార్యుడి కోసం నాగార్జునకొండలో బౌద్ధవిహారం నిర్మించాడు. రోమన్‌లతో వ్యాపారం చేశాడు. తెరచాపతో కూడిన నాణేలను ముద్రించాడు. ఇతడి తర్వాత విజయశ్రీ (క్రీ.శ.157-163), చందశ్రీ (క్రీ.శ.163-166) రాజులయ్యారు.

* ఆచార్య నాగార్జునుడిని రెండో బుద్ధుడు అంటారు. ఈయన మహాయాన బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. బౌద్ధంలో మార్టిన్‌ లూథర్‌ అని కూడా అంటారు. నాగార్జునుడు శూన్యవాద సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతానికి కారకుడు. అందువల్లే ఈయనను ‘ఐన్‌స్టీన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు.

మూడో పులోమావి (క్రీ.శ.166-174): శాతవాహనుల్లో చివరి రాజు. ఇతడి పరిపాలన విషయాలను మ్యాకదోని శాసనం తెలుపుతుంది. మూడో పులోమావిని ఓడించి, రాజ్యం నుంచి తరిమేసిన ఇక్ష్వాక రాజు శ్రీచాంత మూలుడు.

మాదిరి ప్రశ్నలు


1. పురాణాలు అనుసరించి శాతవాహనుల్లో చివరి రాజు.

1) శివశ్రీ 2) విజయశ్రీ 3) చంద్రశ్రీ 4) మూడో పులోమావి

2. శాతవాహనుల ప్రధాన భాష?

1) తెలుగు 2) సంస్కృతం 3) ప్రాకృతం 4) తమిళం

3. నాసిక్‌ శాసనం వేయించినవారు?

1) సుందర శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) గౌతమీ బాలశ్రీ 4) ఒకటో శాతకర్ణి 

4. కవివత్సలుడు అనే బిరుదు పొందినవారు?

1) హాల శాతవాహనుడు 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) రాజరాజనరేంద్రుడు 4) మూడో మాధవవర్మ

5. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలిపే శాసనం?

1) పితలోభోరా 2) నాసిక్‌ 3) నానాషూట్‌ 4) జున్నార్‌

1) మంత్రి  2) సైనికాధికారి 3) జిల్లా అధికారి 4) గ్రామ పెద్ద

6. అమరావతి వద్ద బౌద్ధ మత స్తూపం నిర్మించినవారు?

1) వాసిష్టపుత్ర శాతకర్ణి  2) యజ్ఞశ్రీ శాతకర్ణి  3) శ్రీముఖుడు  4) గౌతమీపుత్ర శాతకర్ణి

7. రెండో శాతకర్ణి వివాహం చేసుకున్న నాగానిక ఎవరు?

1) నహపాణుని కుమార్తె 2) మహారథి త్రయిణోకరి కుమార్తె 3) చష్టుముని కుమార్తె 4) రుద్రదమన సోదరి

8. ఆంధ్రా శాతవాహనుల రాజధాని?

1) వేంగి 2) వరంగల్లు  3) ధరణికోట  4) కొండపాడు

9. శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యం

1) బాలశ్రీ శాసనం  2) కార్లే శాసనం  3) యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ నాణేలు 4) ది షెరిప్లెస్‌ ఆఫ్‌ ది ఎరిత్రయన్‌ సీ

10. శాతవాహనుల శాసనాల్లో వాడిన భాష

1) ప్రాకృతం  2) సంస్కృతం  3) తెలుగు   4) మరాఠి

11. కళింగ రాజు ఖారవేలుడి శాసనం

1) నాసిక్‌ శాసనం 2) నానాఘాట్‌ శాసనం  3) హాతిగుంఫా శాసనం  4) అమరావతి శాసనం

12. మ్యాకదోని శాసనాన్ని ఎవరు వేయించారు?

1) మూడో పులోమావి  2) నాగానిక  3) శివశ్రీ  4) స్కంధుడు

13. శాతవాహనుల్లో 2వ రాజు ఎవరు

1) రెండో శాతకర్ణి  2) రెండో పులోమావి  3) కన్హ  4) హాలుడు

సమాధానాలు

1-4, 2-3, 3-3, 4-1, 5-3, 6-1, 7-2, 8-3, 9-3, 10-1, 11-3, 12-1, 13-3. 

శాతవాహనుల పరిపాలన


మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. పరిపాలనలో మనుధర్మ శాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం వీరికి మార్గదర్శకాలు.

* రాజ్యాధికారం వంశపారంపర్యం. రాజు సర్వాధికారి. కానీ నిరంకుశుడు, నిరపేక్షుడు కాదు.

* రాజనీతి శాస్త్రం, ధర్మ శాస్త్రం ఆధారంగా రాజ్య పరిపాలన జరిగేది.

* రాజుకి పరిపాలనలో అనేకమంది సహాయపడేవారు

1) విశ్వ అమాత్యులు - రాజుకి ఆంతరంగిక సలహాదారు

2) రాజా అమాత్యులు - రాజాజ్ఞలను అమలుపరిచేవారు

3) మహా అమాత్యులు - ఆర్థిక మంత్రి

4) అమాత్యులు - ఆహారాలకు (రాష్ట్రాలు) అధిపతులు

* భాండాగారికుడు - వస్తు సంచయనాన్ని భద్రపరిచే అధికారి.

* హిరణికుడు - ద్రవ్య ఆదాయం భద్రపరిచే అధికారి.

* మహాసేనాపతి - సైనిక వ్యవహారాలు చూసేవాడు.

* లేఖకుడు - రాజ పత్రాలను, రాజ శాసనాలు రచించేవారు, అంతరంగిక కార్యదర్శి.

* నిబంధకారులు - రాజ వ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచేవారు. వీరిని అక్షిపటలకులు అని కూడా అంటారు.

* శాతవాహనులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. వీటిని ‘ఆహారాలు’ లేదా ‘విషయాలు’ అని అంటారు.

* ఒక్కో ఆహారంలో ఒక ప్రధాన నగరం ఉండేది.

ఉదా: గోవర్ధనాహారం, సోపారాహారం, మామలాహారం

* ఆహారం అధికారి: అమాత్యులు (వీరి అధికారం వంశపారంపర్యం కాదు)

* పరిపాలనలో అతి చిన్న విభాగం - గ్రామం

* గ్రామ పాలనాధికారి - గ్రామణి. ఇతని అధికారంలో 5- 10 గ్రామాలుండేవి.

* గ్రామంలో అధికారులు: గుమిక - గ్రామ పాలకుడు, మహాతరక - గ్రామ రక్షకుడు, మహా ఆర్యక - మత వ్యవహారాలు, భాండాగారిక - గ్రామస్థాయిలో గిడ్డంగుల పరిరక్షణ, రజ్జగాహక - భూమి సర్వే అధికారి.

* రాజ్యంలోని పట్టణాలను నిగమాలు అంటారు. పట్టణ వ్యవహారాలు చూసే సభలను నిగమ సభలు అంటారు. నిగమ సభ సభ్యులను గహపతులు అంటారు. నిగమ సభల గురించి భట్టిప్రోలు శాసనంలో, మెగస్తనీస్‌ ఇండికాలో పేర్కొన్నారు.

సైనిక వ్యవస్థ: రథ, గజ, తురగ, పదాతి దళం ఉండేది. శాతవాహనుల సైనిక వ్యవస్థ గురించి వివరించే శాసనం హతిగుంఫా శాసనం. వీరి యుద్ధ తంత్రం గురించి తెలుసుకోవడానికి అమరావతి శిల్పం ఉపయోగపడుతుంది. ముందు భాగంలో పదాతి దళం, పక్క భాగంలో అశ్వ దళం, గజ దళం, వెనుకభాగంలో ధానుష్క దళం ఉండేది. సర్వసైన్యాధ్యక్షుడిగా మహాసేనాపతి ఉండేవాడు. వీరికాలంలో కటకం అంటే సైన్యాగారం. స్కంధావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం.

ఆర్థిక పరిస్థితులు: ప్రజల జీవనాధారం వ్యవసాయం. రాజుకి సొంత భూములుండేవి. దాన్ని రాజఖంకోట అంటారు. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించేవారు. ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. పంటలో రాజు భాగాన్ని (1/6) రాజభాగం/దీయమేయం అని పిలిచేవారు. భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించే అధికారిని రజ్జగాహకుడు అంటారు. పంటలు పండే క్షేత్రాలను సీత క్షేత్రాలు అంటారు. వ్యవసాయ పర్యవేక్షణాధికారి సీతాధ్యక్ష. ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండేది.

* శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తి పనివారు నివసించేవారు. వృత్తి సంఘాలను శ్రేణులు అంటారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్టి. శ్రేణి కట్టుబాట్లను ‘శ్రేణిధర్మ’గా పిలిచేవారు. వృత్తి పనివారు ‘కరుకర’ వృత్తి పన్ను చెల్లించేవారు. ఈ వృత్తి సంఘాలు తర్వాతి కాలంలో కులాలుగా మారాయి.

* స్వదేశీ, విదేశీ వ్యాపారం జరిగేది. పశ్చిమ తీరంలో సైరాన్, తగర, నాసిక్, గోవర్ధన మొదలైనవి ప్రధాన వ్యాపార కేంద్రాలు కాగా, తూర్పు తీరంలో విజయపురి, గూడూరు, ధాన్యకటకం. వినుకొండ ప్రధాన వ్యాపార కేంద్రాలు.

* గూడూరు సన్న వస్త్రాలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్రాల పరిశ్రమకు, గుంటుపల్లి రాగి ఇనుము పరిశ్రమకు, ప్రతిష్టానపురం తగరం, జౌళి పరిశ్రమకు ప్రసిద్ధి

* విదేశాలతో వ్యాపారం చేసేవారిని సార్దవాహులు అనేవారు. వీరు శ్రేణులుగా ఏర్పడి శ్రేష్టి (నెట్టె) నాయకత్వంలో వ్యాపారం చేసేవారు. వీరి విదేశీ వ్యాపారం గురించి తెలిపే గ్రంథాలు: పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ, ది గైడ్‌ టు జాగ్రఫీ. శాతవాహనులు తూర్పు ద్వీపాలతో, రోమ్‌తో వ్యాపారం చేశారు. రోమన్‌ చక్రవర్తుల బంగారు, వెండి నాణేలు లభించిన ప్రాంతాలు. శ్రీకాకుళం జిల్లాలోని సాలిహుండం, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నాగార్జునకొండ; విజయవాడ, నెల్లూరు, కడప జిల్లాలోని అత్తిరాల.

* ప్రధాన ఎగుమతులు: సుగంధద్రవ్యాలు, రత్నాలు, ముత్యాలు, పట్టువస్త్రాలు, 

* ప్రధాన రేవు పట్టణాలు: తూర్పు తీరంలో కోడూరు, మైసోలియా, ఘంటశాల, కోరంగి, పుదుచ్చేరి; పశ్చిమ తీరంలో బారుకచ్చా, సోపారా, కల్యాణి.

* నాణేలు: వర్తకంలో అధికభాగం వస్తుమార్పిడిగానే జరిగేది. సీసం, పొటిన్, రాగి, వెండి, బంగారు నాణేలు ముద్రించారు. వెండి నాణేన్ని కర్ష పణం, బంగారు నాణేన్ని సువర్ణ అనేవారు. ఒక బంగారు నాణెం 35 కర్షపణాలకు సమానం.

సాంఘిక పరిస్థితులు


వర్ణాశ్రమ ధర్మాలు పాటించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులతో పాటు వృత్తులను బట్టి అనేక ఉపకులాలు ఉండేవి. పితృస్వామిక కుటుంబవ్యవస్థ అవలంబించారు. సంఘంలో మహిళలకు గౌరవం ఉండేది. స్త్రీలు ఆరు విధాలైన స్త్రీ ధనం కలిగి ఉండేవారు. భర్తల ఉద్యోగాలను అనుసరించి భార్యలు సేనాపతిని, బోజకి, మహాబోజకి వంటి బిరుదులు పొందేవారు.

మత పరిస్థితులు

అధికారికంగా వీరిది వైదిక మతం. వైదిక మతోద్ధరణకు కృషి చేశారు. వైదిక మత క్రతువులు నిర్వహించారు. నాసిక్‌ శాసనం, నానాఘాట్‌ శాసనం వైదిక మతం గురించి వివరిస్తాయి. హాలుడి గాథా సప్తశతి - శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. ఈ గ్రంథంలో గౌరి, పశుపతి, రుద్ర, పార్వతి, లక్ష్మీనారాయణ ప్రస్తావన ఉంది.

శైవం: ప్రధాన ఆరాధకుడు పశుపతి. నాటి ప్రాచీన శివాలయం గుడిమల్లం.

వైష్ణవం: వాసుదేవుడు ప్రధాన దైవంగా ఉన్న మతం. వీరి శాసనాలలో వాసుదేవ, కేశవ, వర్ధన, కృష్ణ, గోపాల అనే పేర్లున్నాయి. హాలుని గ్రంథంలో కృష్ణలీలలు, రాధాకృష్ణుల ప్రణయగాథలు, లక్ష్మీనారాయణ ప్రస్తావన ఉంది. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు విరివిగా చేశారు.

జైన మతం


శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించాడు. కరీంనగర్‌ జిల్లాలోని మునుల గుట్ట, ఏలూరు సమీపంలోని గుంటుపల్లి గుహలు జైన స్థావరాలుగా వెలుగొందాయి. ప్రముఖ జైనాచార్యుడు పద్మనంది భట్టారకుడు గుంతకల్లు సమీపంలో నివసించేవాడు. ఇతన్ని కొండ కుందాచార్యులు అని కూడా అంటారు.

బౌద్ధ మతం


శాతవాహనులు వైదిక మతస్థులైనప్పటికీ బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీరి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మతం బౌద్ధమే. వర్తకులు, స్త్రీలు, వృత్తి పనివారు, వర్తకులు బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఆంధ్రాలో తొలి గొప్ప బౌద్ధ భిక్షువు మహాదేవ భిక్షువు. వీరి కాలంలో చైత్యకవాదం అభివృద్ధి చెందింది. చైత్యాన్ని పూజించడం ప్రధాన ఆచారం. ఆంధ్రాలో ప్రచారంలో ఉన్న బౌద్ధ మత శాఖ- మహాయానం/ మహాసాంఘికం. దీని ప్రధాన కేంద్రం ధాన్యకటకం. మహాయాన బౌద్ధమతాన్ని విస్తరించినవారు ఆచార్య నాగార్జునుడు.

* రెండో శాతవాహన రాజైన కృష్ణుడు బౌద్ధభిక్షువుల అవసరాలను చూసేందుకు నాసిక్‌లో ఒక మహామంత్రిని నియమించారు. హాలుడి గాథాసప్తశతిలో బుద్ధుని పాదారాధన ఉంది.

* గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి బాలశ్రీ భయదనిభ తెగకు చెందిన భిక్షువులకు ఒక విహారం నిర్మించింది. భూదానాలు చేసింది. 2వ పులోమావి మహాసాంఘిక బౌద్ధ బిక్షువుల పోషణార్థం ఒక గ్రామం దానం చేశాడు. బౌద్ధమత నిర్మాణాలైన చైత్యాలు, స్తూపాలు, ఆరామాలు, విహారాలు నిర్మించారు.

చైత్యములు: ఇవి బౌద్ధమత దేవాలయాలు. చందవరం, గుంటపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, కార్లే, కవ్హేరి, భజ, నాసిక్‌లో ఉన్నాయి.

స్తూపాలు: 3 రకాలు

1) దాతు గర్భితములు: బుద్ధుడి అవశేషాలపై నిర్మించినవి. ఉదా: అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు

2) పారిభోజకములు: బౌద్ధభిక్షవుల అస్థికలపై నిర్మించేవి.

3) ఉద్దేశిక స్తూపాలు - బుద్ధిడి ధాతువు లేకుండా నిర్మించేవి.

విహారం: విశ్రాంతి మందిరాలు

ఆరామం: విద్యాలయం

ఆచార్య నాగార్జునుడు


బిరుదులు: ఇండియన్‌ ఐన్‌స్టీన్, ఇండియన్‌ మార్టిన్‌ లూధర్, 2వ బుద్ధుడు, మాధ్యమిక వాద ప్రవక్త, గతితార్కికవాద ప్రవక్త

గ్రంథాలు: సుహృల్లేఖ, మాధ్యమిక శాస్త్రం, ఉపదేశం, ద్వాదశముఖ శాస్త్రం, రత్నావళి, మహాయాన భవబేధశాస్త్రం.

* ఈయన శ్రీపర్వతం (నాగార్జునకొండ) వద్ద నివసించేవారు. 4వ బౌద్ధ సమావేశానికి హాజరయ్యారు. ఇతని శూన్యవాదం జగత్‌గురువు ఆదిశంకరాచార్య మాయావాదానికి మూలం.

సాహిత్యం: ప్రాకృత సాహిత్యం ఉండేది. హాలుని కాలంలో స్వర్ణయుగం. శాసనాలు ఎక్కువగా ప్రాకృత భాషలోనే ఉన్నాయి.

ప్రాకృత కవులు, కవయిత్రిలు: చుల్లవా, అమరరాజ, మకరందసేన, శ్రీరాజ, రేవ, మాధవి, ఆంధ్రలక్ష్మి.

ప్రాకృత గ్రంథాలు: గుణాఢ్యుడు- బృహత్కథ, సోమదేవసూరి- కథాసరిత్సాగరం, క్షేమేంద్రుడు- బృహత్కథామంజరి, బుద్ధస్వామి- బృహత్కధాశ్లోక సంగ్రహం, ఉద్యోధనుడు - కువలయమాల.

సంస్కృత సాహిత్యం: సంస్కృతం 2వ అధికార భాష. మహాయాన బౌద్ధమత కాలంలో సంస్కృతం ఆదరణ పొందింది. శకరాజు రుద్రరాముడు మొదటి సంస్కృత శాసనం వేయించారు.

ప్రముఖ సంస్కృత గ్రంథాలు: శర్వవర్మ- కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు- కామసూత్రాలు.

ప్రధాన భాషలు: తెలుగు, కన్నడం, సంస్కృతం.

* అజంతాలోని 9, 10 గుహాలయాల్లోని వర్ణచిత్రాలు శాతవాహనుల కాలం నాటివి.

Posted Date : 07-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌