• facebook
  • twitter
  • whatsapp
  • telegram

65 శాతం ఖాళీలే 

ఎనిమిదేళ్లుగా నియామకాలు లేవు

విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల కొరత

ఆరేళ్ల వ్యవధిలో 35 శాతం మంది పదవీ విరమణ 

విద్యా నాణ్యత, పరిశోధనపై తీవ్ర ప్రభావం

ప్రైవేటు వర్సిటీలు వచ్చినా సర్కారు వాటిపై శీతకన్ను 

ప్రమాణాల్లేక న్యాక్‌కు దూరంగా మూడు 

ఓయూలో 2020 సంవత్సరంలో 28 మంది పదవీ విరమణ పొందారు. 2021లో మరో 20 మంది, 2022లో 20 మంది పదవీ విరమణ పొందనున్నారు. మరో మూడేళ్లలో ఓయూ, కేయూలోనే కనీసం 150 మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతారని సమాచారం. ఓయూలో 2014 జూన్‌ తర్వాత ఖాళీ అయినవే 250 వరకు ఉన్నాయి. ఇక కాకతీయ వర్సిటీలో 281 ఖాళీలు ఉండగా, అయిదు సంవత్సరాల్లో 100 మందికిపైగా పదవీ విరమణ చెందారు. జేఎన్‌టీయూహెచ్‌లో ఈ నాలుగు సంవత్సరాల్లోనే 30 మంది పదవీ విరమణ పొందారు. వెంటనే నియామకాలు చేపట్టకుంటే వర్సిటీలు ఖాళీ అవుతాయని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

ఓయూలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సైకాలజీ  విభాగంలో ఇప్పుడు కేవలం ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, మరొకరు విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్‌ స్థాయి వారే ఆ పోస్టుల్లో ఉండాలి. ఆచార్యుడి స్థాయి వారు ఒక్కరూ లేకపోవడంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లే ఆ హోదాలో కొనసాగాల్సిన దయనీయ పరిస్థితి. వాస్తవానికి ఈ విభాగంలో మంజూరు పోస్టులు 11 కావడం గమనార్హం.

బాసర ఆర్‌జీయూకేటీలో ఒక్క రెగ్యులర్‌ అధ్యాపకుడు కూడా లేడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 71 శాతం బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. దేశంలోనే వందేళ్లు పూర్తయిన అరుదైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఓయూలోనూ 67 శాతం పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
అర్హులైన ఆచార్యులు లేకపోవడం వల్ల పరిశోధన పత్రాల సంఖ్య భారీగా పడిపోతుంది. ఇప్పటికే ఇంపాక్ట్‌ ఫ్యాక్టర్‌ అధికంగా ఉండే ప్రముఖ జర్నళ్లలో పరిశోధన పత్రాల ప్రచురణ భారీగా తగ్గిందన్న విమర్శలున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే యూజీసీ, ఏఐసీటీఈ, డీఎస్‌టీ, డీఆర్‌డీఓ తదితర సంస్థల నుంచి పరిశోధనా ప్రాజెక్టులు రావడం తగ్గిపోతుందన్న ఆందోళన వర్సిటీ వర్గాల్లో ఉంది.

ఆచార్యులు, సహాయ, సహ ఆచార్యులతో కళకళలాడాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సగటున 65 శాతం ఖాళీలతో వెలవెలబోతున్నాయి. సమాజానికి దిక్సూచిగా నిలవాల్సిన అవి బోధనా సిబ్బంది కొరతతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తెలంగాణలో ఏ విశ్వవిద్యాలయాన్ని చూసినా...ఏ విభాగాన్ని పరిశీలించినా ఇదే దుస్థితి. అన్ని వర్సిటీల్లోనూ పనిచేస్తున్న బోధకుల కంటే ఖాళీలే ఎక్కువ కన్పిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి ఆచార్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడం, పదవీ విరమణ పొందుతున్న వారి స్థానాలను అలాగే వదిలేస్తుండటంతో బోధన ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయి. ఫలితంగా విశ్వవిద్యాలయాలు కాస్తా విశ్వ‘మిథ్యా’లయాలుగా మారాయి. ఉదాహరణకు ఓయూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో 32 మందికి 13 మందే ఉన్నారు. వన్‌మ్యాన్‌ ఆర్మీగా జియో కెమిస్ట్రీ, సంస్కృతం, ఆర్కియాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విభాగాలు పనిచేస్తున్నాయి. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, తమిళం లాంటి పలు భాషా విభాగాల్లో బోధన సిబ్బంది ఒక్కరూ లేరు. ఈ వర్సిటీలో అతిపెద్ద విభాగంగా పేరొందిన రసాయనశాస్త్రంలో 101 మందికి 43 మందే ఉండటాన్నిబట్టి ఇక్కడ బోధనా సిబ్బంది కొరత తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. సిద్దిపేట, జోగిపేట, నర్సాపూర్‌ పీజీ కళాశాలలు శాశ్వత ఆచార్యులు ఒక్కరూ లేకుండానే నడుస్తున్నాయి. కేయూలో ఒకప్పుడు 23-24 మందితో నడిచిన విభాగాలు ఇప్పుడు ముగ్గురికే పరిమితమయ్యాయి. పొలిటికల్‌ సైన్స్, ఆర్థికశాస్త్రంలో ఒక్కరే పనిచేస్తున్నారు.

పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్‌ స్థాయి వారు ఒక్కరూ లేకుండానే నడుస్తుండగా, శాతవాహనలో ఒకే ఒక్క ఫ్రొఫెసర్‌ ఉన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని స్టాటిస్టిక్స్‌ విభాగంలో ఏడుగురు శాశ్వత అధ్యాపకులు అవసరంకాగా, ఒక్క సహాయ ఆచార్యుడే ఉన్నారు. ఆంగ్ల విభాగంలో ఏడు పోస్టులకుగాను కేవలం ఇద్దరు సహాయ ఆచార్యులే పనిచేస్తున్నారు. ఇవే కాదు ఏ విశ్వవిద్యాలయం, ఏ విభాగం తీసుకున్నా పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు.

భర్తీలో అడుగడుగునా జాప్యం 

2017 నవంబరు 25: మొదటి విడత కింద 1,061 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీఓ 34 జారీ

2018 జనవరి: భర్తీకి మార్గదర్శకాల ఖరారు

2018 జూన్‌ 19: సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో నియామకాలు జరపరాదని యూజీసీ ఆదేశం

2019 ఎన్నికలకు ముందు: కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌

2019 జులై: రెగ్యులర్‌ ఉపకులపతుల పదవీకాలం ముగింపు. అప్పటి నుంచి ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు.

వీసీలే లేరు..ఇక నియామకాలా?

ఉన్నత విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిల్లో ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, మరో నాలుగు ప్రత్యేక వర్సిటీలు. ఇంకొకటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పనిభారం, డిమాండ్‌ ఆధారంగా ఈ వర్సిటీల్లో మొత్తం 2,766 బోధనా సిబ్బంది పోస్టులు అవసరమని గుర్తించారు. వాటిల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది వెయ్యి లోపే ఉంటే...ఖాళీలు మాత్రం సుమారు 1750కుపైగా ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాటిని భర్తీ చేయడానికి కనీసం ఉపకులపతులు కూడా లేకపోవడంతో అన్నింటికీ ఐఏఎస్‌ అధికారులనే ఇన్‌ఛార్జులుగా నియమించారు. పూర్తిస్థాయి ఉపకులపతుల పదవీకాలం 2019 జులైలో ముగిసింది. అంటే ఏడాదిన్నరకుపైగా గడిచింది. వారి నియామకానికే ఇంకా అడుగులు పడలేదు.

అన్ని విధాలా నష్టమే

అర్హులైన ఆచార్యులు లేక విద్యాబోధనలో నాణ్యత దెబ్బతింటోంది. పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. వాస్తవానికి ఆచార్యులు కేవలం మార్గదర్శకం చేస్తారు. పరిశోధనకు సంబంధించి పనిచేసేది పరిశోధన విద్యార్థులే. వారి సంఖ్య తగ్గిందంటే పరిశోధనల నాణ్యతా పడిపోతుంది. న్యాక్‌తోపాటు ఆయా విభాగాల వారీగా ఇచ్చే నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడేషన్‌ గుర్తింపు కష్టమవుతుంది. రాష్ట్ర వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులు 1,153 మంది ఉన్నా పీహెచ్‌డీ గైడ్లుగా వ్యవహరించడం కుదరదు.

‘న్యాక్‌’ గుర్తింపునకు దూరం

ఆచార్యులు, ఇతర మౌలిక వసతులు తగినంతగా లేనందున ఇప్పటికీ కరీంనగర్‌లోని శాతవాహన, బాసర ఆర్‌జీయూకేటీ, హైదరాబాద్‌ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌) గుర్తింపునకు దూరమయ్యాయి. ఆ గుర్తింపు లేదంటేనే వర్సిటీల్లో తగినన్ని వసతులు లేవని అర్థం. బాసర ఆర్జీకేటీయూలో శాశ్వత బోధన సిబ్బందే లేరు. శాశ్వత నియామకాలు జరిపితే తప్ప న్యాక్‌ గుర్తింపు రాదు. యూజీసీ నిబంధనల ప్రకారం 10 శాతానికి మించి ఒప్పంద అధ్యాపకులు ఉండకూడదు. రెండున్నర సంవత్సరాల క్రితం ఓయూకు అతి కష్టమ్మీద న్యాక్‌ ఏ గ్రేడ్‌ దక్కింది. త్వరలో ఆచార్యుల భర్తీని చేపడతామని అప్పట్లో హామీ ఇవ్వడంతో కమిటీ సభ్యులు ఏ గ్రేడ్‌ ఇచ్చారు. బోధనా సిబ్బంది ఖాళీలు లేకుంటే ‘ఏ డబుల్‌ ఫ్లస్‌ గ్రేడ్‌’ వచ్చేదని ఓయూ ఆచార్యుల్లో ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

ఎనిమిదేళ్లుగా నాన్చుడు ధోరణి

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడేళ్లకు ప్రభుత్వం 2017 నవంబరులో నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం పోస్టుల భర్తీని ప్రాధాన్యంగా తీసుకోలేదని ఆచార్యులు ఆరోపిస్తున్నారు. దాంతో ఉపకులపతులు కూడా ఆ దిశగా చొరవ ప్రదర్శించలేదు. దానికితోడు 2018లో సుప్రీంకోర్టులో రోస్టర్‌ పాయింట్ల వ్యవహారంపై కేసు దాఖలవడంతో భర్తీ ప్రక్రియ మరింత జాప్యమైంది. దానిపై 2019లోనే స్పష్టత రాగా, అదే సంవత్సరం జులైలో ఉపకులపతుల పదవీకాలం ముగిసింది. దీంతో ఈ ప్రక్రియ అటకెక్కింది. ఓయూలో 2012లో చివరి సారిగా బోధన సిబ్బంది భర్తీ జరిగింది. జేఎన్‌టీయూలో చివరిసారిగా నియామకాలు 2010లో జరిగాయి. ఆ తర్వాత రెండు సార్లు నోటిఫికేషన్‌ ఇచ్చినా అర్ధంతరంగా ఆగిపోయింది.

నష్టం మాటల్లో చెప్పలేనిది

తాత్కాలిక సిబ్బంది ఉన్నా, శాశ్వత సిబ్బంది ఉన్నా నష్టం లేదనే మాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి. దానికి నేను పూర్తి విరుద్ధం. శాశ్వత సిబ్బంది ఉంటే బాధ్యత పెరుగుతుంది. బోధన, పరిశోధన పరంగా నాణ్యత ఉంటుంది. అలా లేకపోతే ఆ నష్టం వెలకట్టలేనిది. ఆ దిశగా సిబ్బందిని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉపకులపతులు, రాష్ట్ర ప్రభుత్వానిదే.

- ఆచార్య సిద్ధిఖీ, మాజీ ఉపకులపతి, ఓయూ

కొత్త వీసీలు రాగానే ఖాళీల భర్తీ 

తెలంగాణ ఏర్పాటు తర్వాత అవసరమైన ఆచార్యుల పోస్టులపై నిపుణుల కమిటీని నియమించాం. ఆ మేరకు తొలి విడతలో 1,061 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ కారణాలతో ఖాళీలను భర్తీ చేయలేకపోయాం. త్వరలోనే ఉపకులపతులను ప్రభుత్వం నియమించనుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త వీసీలు రాగానే ఆచార్యుల పోస్టులను నియమిస్తాం. 

- ఆచార్య తుమ్మల పాపిరెడ్డి, ఛైర్మన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి 

Posted Date : 11-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌