• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నామ‌మాత్ర ఫీజుతో నాణ్య‌మైన విద్య!‌

కేంద్రీయ విద్యాల‌యాల్లో అడ్మిష‌న్ల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల

దేశంలో ఉత్తమ విద్య అందించడంలో మేటి సంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు పేరు. తక్కువ ఫీజుతో.. నాణ్యమైన, ఒత్తిడిలేని విద్యను ఆశించేవారు ఈ సంస్థల్లో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌ అమలవుతుంది. సువిశాల ప్రాంగణాలు, సుశిక్షితులైన బోధనా సిబ్బంది, ఆటస్థలం, అన్ని రకాల సౌకర్యాలు... కేవీల ప్రత్యేకత. సీటు పొందినవారు ఒకటి నుంచి ప్లస్‌ 2 వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. తాజాగా వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది! 

చిన్నారుల చదువుల నిమిత్తం ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ మందికి అనువైనవిగా కేంద్రీయ విద్యాలయాలు గుర్తింపు పొందాయి. చదువుతోపాటుగా విద్యేతర అంశాలకూ ప్రాధాన్యమివ్వడం కేవీల ప్రత్యేకత. పిల్లల సమగ్ర వికాసం ఆశించే తల్లిదండ్రులు ఈ సంస్థల్లో చదివించడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికి ఉన్న గిరాకీ దృష్ట్యా ప్రవేశం అంత సులువుగా లభించనప్పటికీ, ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. ఇందుకోసం లాటరీ విధానాన్ని అనుసరిస్తారు. అందువల్ల ఒకటో తరగతిలో తమ పిల్లలను చేర్చాలనుకున్నవారు ప్రయత్నం చేయవచ్చు. మిగిలిన తరగతుల్లో ఖాళీలు ఉంటేనే సీట్లు లభిస్తాయి. 

సీట్ల భర్తీ

ప్రతి పాఠశాలలోనూ ఒకటో తరగతిలో ఒక సెక్షన్‌ ఉంటుంది. ఒక్కో సెక్షన్‌లోనూ ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం 20 నుంచి 60 వరకు సీట్లు లభిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో ఫస్ట్‌ క్లాస్‌లో రెండు నుంచి అయిదు వరకు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. సెక్షన్లు, షిఫ్ట్‌ల కారణంగా ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం దక్కుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను ముందుగా భర్తీ చేస్తారు. ఇందుకోసం వచ్చిన అన్ని దరఖాస్తులను కలిపి డ్రా తీస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారికి ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయించారు. రెండు సీట్లు సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ (తల్లిదండ్రులకు సంతానంగా ఒక కుమార్తె మాత్రమే ఉన్నవారు)కు ఉన్నాయి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు లభిస్తున్నాయి. వీటిని ఆయా విభాగాలకు చెందిన దరఖాస్తుల నుంచి లాటరీ విధానంలో భర్తీ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ భర్తీ చేయగా ఒకవేళ సీట్లు మిగిలితే వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి లాటరీ విధానంలోనే కేటాయిస్తారు. 

ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ ప్రక్రియ అంతా ఆన్‌లై న్‌లోనే జరుగుతుంది. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఖాళీలకు ఆ పాఠశాల ప్రిన్సిపల్, కమిటీ సభ్యుల సమక్షంలో ఆఫ్‌లైన్‌ విధానంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్లస్‌ 1లో ప్రవేశాలు పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులతో చేపడతారు. తొలి ప్రాధాన్యంగా పదో తరగతి వరకు కేంద్రీయ విద్యాలయాల్లో చదివినవారికి ఉంటుంది. సీట్లు మిగిలితే ఇతర బోర్డులవారికి అవకాశం కల్పిస్తారు. 

వీరికి ప్రాధాన్యం...

సీట్ల కేటాయింపులో రక్షణ, పారా మిలటరీలో పనిచేస్తున్నవారి పిల్లలకు మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంతానానికి ద్వితీయ ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు...మొదలైనచోట్ల పనిచేసే ఉద్యోగుల చిన్నారులకు ఆ తర్వాతి ప్రాధాన్యం లభిస్తుంది. ప్రతి ఎంపీ (లోక్‌సభ) తన పరిధిలోని కేంద్రీయ విద్యాలయంకు ఏడాదికి పది మందిని సిఫార్సు చేయవచ్చు. రాజ్యసభ సభ్యులైతే వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాష్ట్రం పరిధిలో ఉన్న కేవీలకు పది మందిని సిఫార్సు చేయవచ్చు. ఇలా ఎంపీలు ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను కేవీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా కేవీలకు అనుమతి పత్రాలు వస్తే సీట్లను కేటాయిస్తారు. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ, ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ ఉన్నతోద్యోగులు, రిసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌...తదితర విభాగాలవారీ కొన్నేసి సీట్ల చొప్పున కోటా ఉంటుంది. 

ఫీజు సంగతి...

విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు పొందినవారు ప్లస్‌ 2 వరకు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. వీరికి పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫారం, పాఠశాలకు చేరడానికి అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు సైతం చెల్లిస్తారు (ఇందుకోసం తగిన వివరాలు అందించాలి). అలాగే కేవీల్లో చేరిన బాలికలు ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. బాలురైతే ఏడో తరగతి వరకు ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ బాలబాలికలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 9, 10 తరగతులకు బాలురు నెలకు రూ.200 ఫీజు చెల్లించాలి. 11, 12 తరగతులకు కామర్స్, హ్యుమానిటీస్‌ కోర్సులైతే రూ.300, సైన్స్‌ కోర్సులకు రూ.400 చెల్లించాలి. కంప్యూటర్‌ తరగతులు ఉంటే అన్ని విభాగాల విద్యార్థులూ నెలకు రూ.వంద చొప్పున చెల్లించాలి. సైనికోద్యోగులు, మాజీ సైనికోద్యుగుల పిల్లలకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. 

దరఖాస్తు ఇలా...

ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు మార్చి 31, 2021 నాటికి అయిదేళ్లు పూర్తికావాలి (ఏప్రిల్‌ 1 నాటికి పూర్తయినా పరిగణనలోకి తీసుకుంటారు) అలాగే ఏడేళ్లకు మించరాదు. తర్వాతి తరగతులకు ఒక్కో ఏడాదీ కలుపుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ప్రాథమిక సమాచారంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్‌తో మిగిలిన వివరాలు చేర్చాలి. వీటికి అవసరమైన పత్రాలు (వయసు ధ్రువీకరణ..మొదలైనవి) జత చేయాలి. అన్ని వివరాలు, పత్రాలు నమోదుచేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకుని సబ్మిట్‌ చేయాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడే చేరాలనుకుంటున్న మూడు కేవీలను ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యంగా వీటిని నమోదు చేయాలి. 

ముఖ్య తేదీలు

ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 19 సాయంత్రం 7 వరకు స్వీకరిస్తారు. 

రెండు, ఆపైన తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశానికి: ఏప్రిల్‌ 8 నుంచి 15 వరకు సంబంధిత విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్లస్‌ 1లో ప్రవేశాలు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి మొదలవుతాయి. 

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/

Posted Date : 07-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌