ప్రవేశాలకు పెరిగిన డిమాండ్
ఈనాడు, హైదరాబాద్: రెగ్యులర్ కళాశాలలో ఫీజుల భారం.. ఉద్యోగం చేస్తూ చదువుకోవాల్సిన అవసరం.. ఇలా వివిధ రకాల కారణాలతో విద్యార్థులు దూరవిద్య వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత రెండేళ్లుగా ప్రత్యక్ష బోధన సరిగా జరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దూరవిద్యకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా బీఆర్ అంబేడ్కర్, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు తీసుకొనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
సడలింపులతో ఇటువైపు మొగ్గు..
కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిగ్రీ స్థాయిలో విశ్వవిద్యాలయాలు సైతం కొన్ని సడలింపులతో జవాబుపత్రాల మూల్యాంకనం చేస్తుండటంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాక చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువును మెరుగుపరుచుకొనేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అటు ఉద్యోగం చేస్తూ.. ఇటు చదువునూ కొనసాగిస్తున్నారు. ఇందుకు దూరవిద్య విధానం కలిసివస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సైతం విజ్ఞానం పెంచుకొనేందుకు బీఏ, ఎంఏ కోర్సులను ఎంచుకొని పూర్తి చేస్తున్నారు.
‣ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు విడతలలో ప్రవేశాలు కల్పిస్తుంటారు. గత విద్యాసంవత్సరంలో రెండు విడతల్లో 8,810 మంది చేరగా.. ఈ విద్యా సంవత్సరంలో 2021 అక్టోబరులో జరిగిన మొదటి విడత ప్రవేశాల్లో 5,321 మంది చేరారు. ప్రస్తుతం రెండో విడత ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి 31 వరకు దరఖాస్తుకు గడువు ఉంది. గతేడాది కంటే ఎక్కువ మంది చేరతారని వర్సిటీ అధికారులు అంచనావేస్తున్నారు.
పీజీ స్థాయిలో బాగా పెరిగారు: ప్రొ.కె.సీతారామారావు, ఉపకులపతి, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
గతంలో దూరవిద్య అంటే గ్రామీణ వాతావరణం, పేద విద్యార్థులే చేరతారనే భావించేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిగ్రీ చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో పీజీ స్థాయిలో దూరవిద్య వైపు మొగ్గు చూపుతున్నారు. డిగ్రీలోనూ ప్రైవేటు కళాశాలలు మూత పడుతుండటంతో సీట్లు సరిపోక ఇటువైపు వస్తున్నారు.
కొత్త కోర్సులకు ప్రణాళిక: జాస్తి రవికుమార్, సంయుక్త సంచాలకుడు, ఓయూ దూరవిద్య విభాగం
దూరవిద్య కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనికి తగ్గట్లు ఓయూ తరఫున యోగా, డిజిటల్ బ్యాంకింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, డాటా సైన్స్ తదితర విభాగాల్లో పీజీ డిప్లొమా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News