* ఐసీఏఐ కీలక నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ).. సీఏ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత మే నెలలో జరగాల్సిన సీఏ పరీక్షలను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన ఐసీఏఐ వాటిని తిరిగి జులై 29వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జులైలో పరీక్షలకు హాజరుకాలేమని భావించే విద్యార్థులు వచ్చే నవంబరులో పరీక్షలు రాసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఆ పరీక్షలకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయరు. దరఖాస్తు ఫీజు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. జులైలో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే అవకాశాన్నీ ఐసీఏఐ కల్పించింది. అలాంటి విద్యార్థులు వెబ్సైట్ ద్వారా జూన్ 17వ తేదీ నుంచి 20వ తేదీలోపు తమ పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవచ్చు. పరీక్షను నవంబరులో రాయాలనుకున్న విద్యార్థులు వెబ్సైట్లో ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. నవంబరులో రాయాలని ఒకసారి ఆప్షన్ను ఎంపిక చేసుకుంటే..మళ్లీ మార్చుకోవడం కుదరదు. ఈ ఏడాది పరీక్షలను రద్దు చేయాలని కొంత మంది నుంచి వస్తున్న డిమాండ్ను సంస్థ తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.