తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోర్సులందించే విద్యాసంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ) ఒకటి. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్య అందించే లక్ష్యంతో లాభాపేక్ష లేని సంస్థగా దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో వివిధ స్పెషలైజేషన్లతో మేనేజ్మెంట్ ప్రోగ్రాములు అందిస్తున్నారు. వాటిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్), కేంద్ర మానవ వనరుల విభాగం, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ) నడుస్తోంది. ఈ సంస్థ 1995లో తొలిసారిగా పూర్తి కాల వ్యవధితో పోస్ట్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సు ప్రారంభించింది. కొన్నాళ్లపాటు ఉస్మానియా క్యాంపస్లో తరగతులు నిర్వహించేవారు. ప్రస్తుతం హైదరాబాద్కు సమీపంలోని షామీర్పేట్లో నూతనంగా నిర్మించిన ప్రాంగణంలో తరగతులు జరుగుతున్నాయి. వసతి సౌకర్యమూ ఉంది. పబ్లిక్ ఎంటర్ప్రైజ్కు సంబంధించి సమస్యలు, విధానాల రూపకల్పన నిమిత్తం ఐపీఈను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ మేనేజ్మెంట్లో వైవిధ్యమైన కోర్సులు అందిస్తోంది.
ఏయే కోర్సులు?
‣ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)
‣ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)- బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఐఎఫ్)
‣ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)- ఇంటర్నేషనల్ బిజినెస్ (ఐబీ)
‣ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)- మార్కెటింగ్ (ఎం)
‣ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (హెచ్ఆర్ఎం)
‣ ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) (మధ్యస్థాయి ఉద్యోగులకు)
అర్హత: కనీసం 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం) మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశం: క్యాట్ / జాట్ / మ్యాట్/ ఆత్మా / సీమ్యాట్ / జీమ్యాట్ వీటిలో ఎందులోనైనా స్కోర్ సాధించాలి. ఈ స్కోర్ సెప్టెంబరు 2019 - జూన్ 2020 లోపు పొందినదై ఉండాలి. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, అకడమిక్ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలు టెలిఫోన్, వాట్సాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇవి సెప్టెంబరు 4 ఉదయం 11:30 నుంచి మొదలవుతాయి.
కరిక్యులమ్, ఫీజు, ప్లేస్మెంట్లు
పీజీడీఎం కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఏడాదికి మూడు చొప్పున ట్రైమిస్టర్లు ఉంటాయి. మొదటి ఏడాది మేనేజ్మెంట్లో సాధారణ అంశాలపై బోధన ఉంటుంది. రెండో ఏడాది స్పెషలైజేషన్లపై దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులు రెండు ఎలక్టివ్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సు వ్యవధి 15 నెలలు. రెండేళ్ల పీజీడీఎం కోర్సు ఫీజు రూ.8 లక్షలు. వసతి, భోజనం నిమిత్తం విడిగా గది కావాలంటే రూ.లక్ష యాభై వేలు, ఇద్దరికో గది చొప్పన అయితే రూ.లక్ష అయిదు వేలు చొప్పున ఏడాదికి చెల్లించాలి.
క్యాట్, జాట్, జీమ్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఏటీఎంఏ వీటిలో ఏ పరీక్షలోనైనా 90 పర్సంటైల్ పైన సాధించినవారికి రూ.2 లక్షలు, 80 పర్సంటైల్ దాటితే రూ. లక్ష, 75కు దాటితే రూ.80 వేలు, 70కంటే ఎక్కువ సాధించినవారికి రూ.60 వేలు స్కాలర్షిప్పు చెల్లిస్తారు.
కోర్సు చివరలో క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తున్నారు. దేశీయ కార్పొరేట్ సంస్థలతోపాటు బహుళజాతి సంస్థలు ఇక్కడి విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. వీరికి రూ.5 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు వార్షిక వేతనం చెల్లిస్తున్నాయి. టీసీఎస్, డెలాయిట్, ఒరాకిల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మైక్రోసాఫ్ట్, వీడియోకాన్, అమూల్, జైడస్ క్యాడిలా, సీఎస్సీ, ఐసీఐసీఐ, బజాజ్, హ్యుందాయ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, గోద్రెజ్, నోవార్టిస్, కొటక్, యాక్సిస్, ఇండస్ఇండ్, ఎయిర్టెల్, ఐడియా.... తదితర సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
వెబ్సైట్: https://www.ipeindia.org/