‣ రెండు సంస్థల ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు
సాంకేతిక విభాగాల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ దూసుకుపోతున్నారు. ప్రతిభావంతులైన ఈ అమ్మాయిలను ఎన్నో సంస్థలు ఉపకార వేతనాల రూపంలో ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా రెండు ప్రముఖ సంస్థలు- డీఆర్డీఓ, అడోబ్ వీరికి స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఆసక్తి ఉన్న సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థినులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
డీఆర్డీఓ.. స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్’, అడోబ్ ఇండియా ‘విమెన్ ఇన్ టెక్నాలజీ స్కాలర్షిప్’ పేరిట అమ్మాయిలకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. టెక్నికల్ విభాగాల్లో విద్యను అభ్యసించేవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అమ్మాయిలకు సమ ప్రాధాన్యం కల్పించడం, వారిని ప్రోత్సహించడం అనే లక్ష్యాల సాధనకు వీటిని ఉద్దేశించారు.
విమానయాన కోర్సులవారికి..
డీఆర్డీఓ ఆధ్వర్యంలోని రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) ద్వారా వీటిని అందిస్తోంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్/ స్పేస్ ఇంజినీరింగ్ అండ్ రాకెట్రీ/ ఏర్క్రాఫ్ట్ ఇంజినీరింగ్/ ఏవియానిక్స్ల్లో యూజీ (బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్)/ పీజీ (ఎంఈ/ ఎంటెక్) చేస్తున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్షిప్ మొత్తం: అండర్ గ్రాడ్యుయేట్లకు నాలుగేళ్లకు ఏడాదికి రూ.1,20,000/ వార్షిక ఫీజు మొత్తం. పీజీ వారికి రెండేళ్లపాటు నెలకు రూ.15,500 చెల్లిస్తారు.
అర్హత: భారతీయులై ఉండాలి. పై స్పెషలైజేషన్లలో యూజీ, పీజీల్లో మొదటి సంవత్సరంలో చేరబోయేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యూజీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. పీజీ విద్యార్థులు డిగ్రీలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. పై స్పెషలైజేషన్లలో డ్యూయల్/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ మొదటి నాలుగేళ్లు మాత్రమే స్కాలర్షిప్ చెల్లిస్తారు.
స్కాలర్షిప్ సమయంలో విద్యార్థులు ఏటా 70% మార్కులతో ఉత్తీర్ణులవడం తప్పనిసరి. ఫెయిల్ అయినా, తగినన్ని మార్కులు సాధించకపోయినా స్కాలర్షిప్ రద్దు అవుతుంది. అలాగే ఏ ఇతర స్కాలర్షిప్లనూ పొందకూడదు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో https://rac.gov.in దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బయోడేటా, ఫొటో, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజేమీ లేదు.
దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 15, 2020.
సాంకేతిక కోర్సులవారికి..
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక విభాగాల్లో చదువుతున్నవారికి అడోబ్ వీటిని అందిస్తోంది.
స్కాలర్షిప్లో భాగంగా ట్యూషన్ ఫీజుతో పాటు అడోబ్ ఇండియాలో సమ్మర్ ఇంటర్న్షిప్, సీనియర్ టెక్నాలజీ లీడర్ మెంటర్షిప్, గ్రేస్ హాపర్ కాన్ఫరెన్స్ ఇండియాలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఖర్చులను సంస్థే భరిస్తుంది.
అర్హత: భారతీయ విద్యార్థి అయివుండాలి. నాలుగేళ్ల బీఈ/ బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ ఎంఎస్/ఎంటెక్ ప్రోగ్రాముల వారు అర్హులు. అయితే 2022 నాటికి విద్య పూర్తయ్యేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మ్యాథ్స్, కంప్యూటింగ్ల్లో మేజర్/ మైనర్ చదువుతుండాలి.
ఎంపిక:
‣ టెక్నికల్ స్కిల్స్
‣ సృజనాత్మకంగా ఆలోచించగల నైపుణ్యం
‣ చొరవ
‣ బృందంతో పనిచేయగలిగే అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులో భాగంగా
‣ ఎస్సే
‣ రెజ్యూమె
‣ కళాశాల ప్రొఫెసర్ నుంచి లెటర్ ఆఫ్ రెకమండేషన్
‣ తాజా, గత అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ను సమర్పించాలి. ఆన్లైన్లో https://research.adobe.com/forms/adobe-indiawomen-in-technology-scholarship/ దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 20, 2020