• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి కాలపట్టిక విడుదల

* అక్టోబరు 6 నుంచి ఆరు విడతల కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్‌ సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సెప్టెంబరు 11న కాలపట్టిక ప్రకటించింది. ఈసారి అక్టోబరు 6 నుంచి ఈ ప్రక్రియ మొదలై నవంబరు 7వ తేదీతో ఆరు విడతల సీట్ల కేటాయింపు ముగుస్తుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో గత ఏడాది కంటే ఈసారి ఒక విడత కౌన్సెలింగ్‌ తగ్గింది. మొదటి విడత సీట్ల కేటాయింపు కంటే ముందుగా రెండుసార్లు నమూనా (మాక్‌) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అప్పటికే వెబ్‌ ఆప్షన్లు (ఛాయిస్‌ ఫిల్లింగ్‌) ఇచ్చుకున్న వారికి ఎక్కడ సీట్లు రావచ్చో దీనివల్ల తెలుస్తుంది. అవసరమైతే విద్యార్థులు తమ ఆప్షన్లను మార్చుకొని మళ్లీ నమోదు చేసుకోడానికి ఇలా చేస్తారు. ఈసారి సీటు వచ్చాక స్వయంగా వెళ్లి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేలా నియమావళిని మార్చారు. ఆరు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే వాటి భర్తీకి మరో రెండు విడతల కౌన్సెలింగ్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
 

111 సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌
*  ఐఐటీలు: 23
*  ఎన్‌ఐటీలు, ఐఐఈఎస్‌టీ షిబ్పూర్‌: 32
*  ట్రిపుల్‌ ఐటీలు: 26
*  ఇతర సంస్థలు: 30
*  మొత్తం: 111
(తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ (ఎంటెక్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లకే), విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, కర్నూలు, శ్రీసిటీలోని ట్రిపుల్‌ఐటీల్లో సీట్లను జోసా భర్తీ చేస్తుంది)

ఆరు విడతల కౌన్సెలింగ్‌ కాలపట్టిక
*  అక్టోబరు 6: రిజిస్ట్రేషన్‌/ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రారంభం
*  12వ తేదీ: మొదటి నమూనా సీట్ల కేటాయింపు
*  14వ తేదీ: రెండోసారి నమూనా సీట్ల కేటాయింపు
*  16వ తేదీ: మొదటి విడత సీట్ల కేటాయింపు
*  అక్టోబరు 21: 2వ విడత, 26వ తేదీ: 3వ విడత, 30వ తేదీ: 4వ విడత, నవంబరు 3వ తేదీ: 5వ విడత, నవంబరు 7వ తేదీ: 6వ విడత సీట్ల కేటాయింపు

Posted Date : 12-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌