• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రవేశాలు

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ప్రకటన విడుదల


సృజనశీలురు, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు  ఫైన్‌ ఆర్ట్స్‌. వివిధ సంస్థలు ఈ విభాగంలో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ  (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) పేరున్న సంస్థ. తాజాగా ఈ  విశ్వవిద్యాలయ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు  చేసుకోవచ్చు. పరీక్షలో చూపే ప్రతిభతో సీట్లను కేటాయిస్తారు.  

అద్భుతమైన సృజన, కళాకృతితో కనువిందుచేసే నైపుణ్యం ఉన్నవారు ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. యూజీ కోర్సులతోనే ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే పీజీలో చేరవచ్చు. ఉన్నత విద్య ద్వారా సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌ కోర్సులు ఎంచుకోవడానికి వీలవుతుంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. బీఎఫ్‌ఏ అనంతరం రెండేళ్ల వ్యవధితో ఎంఎఫ్‌ఏ కోర్సుల్లో చేరవచ్చు.  స్వయం ఉపాధికీ¨, ఏదైనా సంస్థలో పని చేసుకోవడానికీ ఈ కోర్సులు ఉపయోగపడతాయి. చదువుకున్న విభాగాన్ని బట్టి సాఫ్ట్‌వేర్, బహుళ జాతి సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి.  ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీ మీడియా, యానిమేషన్‌...తదితర సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరు తమ ప్రతిభను చాటవచ్చు. ఫొటోగ్రఫీ చేసినవారికి అన్నిచోట్లా అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి (వర్క్‌ షాపు నడపడం) ద్వారా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్, ఆర్కిలాజికల్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌.. బీఎఫ్‌ఏలో పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులు అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు. మాదిరి ప్రశ్నపత్రం వెబ్‌సైట్‌లో ఉంచారు. దానిద్వారా పరీక్ష, సన్నద్ధం కావాల్సిన అంశాలపై అవగాహనకు రావచ్చు. 

అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ అండ్‌ యానిమేషన్‌: 
మెమరీ, డ్రాయింగ్, కలరింగ్‌ విభాగాల్లో వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఈ విభాగంలో ఏదైనా అంశాన్ని ఇస్తారు. దానికి దృశ్య రూపాన్ని ఇవ్వాలి. ఎంత అందంగా గీశారు, నైపుణ్యం ఎలా ఉంది, ఉపయోగించిన రంగులు... మొదలైనవాటికి ప్రాధాన్యం ఉంటుంది. మరో పేపర్‌ ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 మార్కులకు 50 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో జీకే, కరంట్‌ అఫైర్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ ఆర్ట్‌ ఓరియంటెడ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ఇంకో పేపర్‌ ఆబ్జెక్టివ్‌ డ్రాయింగ్‌లో వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో భాగంగా ఏదైనా వస్తువు లేదా బొమ్మ చూపుతారు. ఆ దృశ్యాన్ని పెన్సిల్‌తో గీచి, దాని చుట్టూ పరిసరాలను ఊహించి వర్ణనాత్మక చిత్రాన్ని రూపొందించాలి. ఈ పరీక్షలను అక్టోబరు 18న నిర్వహిస్తారు. ఈ విభాగం పరీక్షలో చిత్ర నైపుణ్యాలు, ఊహ, పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. 

ఫొటోగ్రఫీ:
కంపోజిషన్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌ వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో డ్రాయింగ్, కంపోజిషన్‌ నైపుణ్యాలు పరిశీలిస్తారు. పెన్సిల్‌తో ఇచ్చిన చిత్రాలకు షేడ్‌లు ఇవ్వాలి. అలాగే అక్కడున్న చిత్రాలను క్రమ పద్ధతిలో అమర్చాలి. ఏదైనా అసంపూర్ణ దృశ్యం ఇచ్చి దాని చుట్టూ ఉండే అవసరమైన ఇతర అంశాలను అందులో చేర్చి తీర్చిదిద్దమంటారు. వీటన్నింటికీ పరీక్షలో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే మరో ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌ 50 మార్కులకు 50 నిమిషాల వ్యవధితో ఇస్తారు. ఇందులో జీకే, కరంట్‌ అఫైర్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ ఆర్ట్‌ ఓరియంటెడ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష అక్టోబరు 19న ఉదయం ఉంటుంది.  

ఇంటీరియర్‌ డిజైన్‌:
ఈ సంస్థ బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో భాగంగా ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సు నడుపుతోంది. అందులోనూ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం 200 మార్కులకు 3 గంటల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష అక్టోబరు 19 మధ్యాహ్నం ఉంటుంది. ఇందులో జీకే, కరంట్‌ అఫైర్స్‌ 20, జనరల్‌ ఆర్ట్‌ 20, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 50, ఇలస్ట్రేటివ్, అనలిటికల్‌ అండ్‌ డిజైన్‌ ఎబిలిటీ 50, మెమరీ డ్రాయింగ్‌ 30, కలర్‌ కోఆర్డినేషన్‌ 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 30.
పరీక్ష తేదీలు: అక్టోబరు 18, 19
www.jnafauadmissions.com

Posted Date : 22-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌