• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మేటి సంస్థల్లోకి మరో దారి

ఉత్తమ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి. ఐఐఎంల్లోకి క్యాట్‌ మాదిరిగానే జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), జంషెడ్‌పూర్‌తో పాటు వివిధ అనుబంధ సంస్థల్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎక్స్‌ఏటీ) ఏటా నిర్వహిస్తున్నారు. తాజాగా ఎక్స్‌ఏటీ- 2021 ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రవేశం కల్పించే సంస్థల వివరాలు చూద్దాం...

దేశంలో క్యాట్‌ తర్వాత పేరొందిన పరీక్ష జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎక్స్‌ఏటీ). జేవియర్‌ విద్యాసంస్థలతోపాటు వందకుపైగా ఇతర బీ స్కూళ్లు ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దేశంలో టాప్‌-10 బీ స్కూళ్లలో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌ ఒకటి. వివిధ ఐచ్ఛికాలతో ఇక్కడ మేనేజ్‌మెంట్‌ కోర్సులు లభిస్తున్నాయి. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో ఈ సంస్థ తర్వాతే మరేదైనా! దీనికి చెన్నై, ముంబయి, బెంగళూరు, రాంచీ, భువనేశ్వర్, దిల్లీ .. తదితర చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశం ఎక్స్‌ఏటీ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో లభిస్తుంది. ఈ సంస్థల్లో చదివిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్‌ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకుంటున్నారు.   

ప్రవేశం కల్పించే కొన్ని ప్రసిద్ధ సంస్థలు..
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌; ఫ్లేమ్‌ యూనివర్సిటీ, పుణె; ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, న్యూదిల్లీ; గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు; గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, చెన్నై; ఐఎఫ్‌ఎంఆర్, చిత్తూరు; ఐఐఆర్‌ఎం, హైదరాబాద్‌; ఐఎంటీ, హైదరాబాద్, నాగ్‌పూర్, ఘజియాబాద్, దుబాయ్‌; ఐఆర్‌ఎం, ఆనంద్‌; మైకా, అహ్మదాబాద్‌; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్, పుణె; పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ, గాంధీనగర్‌; టీఏపాయ్, మణిపాల్‌; విట్, వెల్లూరు; విజ్ఞాన జ్యోతి, హైదరాబాద్‌. 

పరీక్ష ఇలా..
పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌ 1లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, డెసిషన్‌ మేకింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ 2లో జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు వస్తాయి. సెక్షన్లవారీ వ్యవధి నిబంధన లేదు. అభ్యర్థులు తమకు నచ్చిన సెక్షన్‌ నుంచి పరీక్ష ప్రారంభించుకోవచ్చు. ఒక సెక్షన్‌ నుంచి మరో సెక్షన్‌లోకి వెళ్లిపోవచ్చు. 
మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో 165 నిమిషాలు సెక్షన్‌ 1కు, 15 నిమిషాలు సెక్షన్‌ 2కు కేటాయించారు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో రుణాత్మక మార్కులు లేవు. ఇందులో సాధించిన స్కోరు.. గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ నిమిత్తం పరిగణనలోకి తీసుకోరు. ఎక్స్‌ఏటీ- 2020లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీలో 26, డెసిషన్‌ మేకింగ్‌ ఎబిలిటీలో 21, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగంలో 28, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు అడిగారు. 

ముఖ్యమైన తేదీలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.
దరఖాస్తు ఫీజు: రూ.1750
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబరు 12
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30
అడ్మిట్‌ కార్డులు: డిసెంబరు 20 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: జనవరి 3 (ఆదివారం), 2021 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.
వెబ్‌సైట్‌: https://xatonline.in/

Posted Date : 30-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌