‣ దేశవ్యాప్తంగా 8000 ఖాళీలు
దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో సుమారు 8000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఆర్మీ పాఠశాలల నియామక ప్రకటన వెలువడినప్పుడు ఇందులో సాధించిన స్కోరుతో ఆయా స్కూళ్లకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యుఈఎస్) ఆధ్వర్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు నడుస్తున్నాయి. ఇక్కడ సీబీఎస్ఈ బోధన ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో సాధించిన స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ లోగా సంబంధిత ఆర్మీ పాఠశాలల ప్రకటనలు వెలువడినప్పుడు ఆ స్కోరుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ, ఇతర పరీక్షలు నిర్వహించి, విధుల్లోకి తీసుకుంటారు.
ఎంపిక ఎలా?
మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో ముఖాముఖి ఉంటుంది. మూడో దశలో టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీపై పరీక్ష ఉంటుంది. వీటిని సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. భాషోపాధ్యాయులకైతే ఎస్సే, కాంప్రహెన్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 15 మార్కులు కేటాయించారు. స్క్రీనింగ్లో అర్హత సాధించినవారికే రెండు, మూడో దశలు ఉంటాయి. టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపిక కావడానికి సీటెట్ లేదా టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. అయితే ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష రాసుకోవడానికి సీటెట్ లేదా టెట్ అవసరం లేదు.
రెండు భాగాలుగా పరీక్ష
టీజీటీ, పీజీటీ పోస్టులకు 180 మార్కులకు 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. పార్ట్ ఎలో జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్టులు, మెథడాలజీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు. పార్ట్ బి ఆ సబ్జెక్టుకు సంబంధించింది. ఈ విభాగానికీ 90 మార్కులు కేటాయించారు. రెండు విభాగాల్లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. పీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి పార్ట్ ఎలో మాత్రమే పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. మార్కులు 90. అన్ని పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆయా విభాగాల్లో 50 శాతం మార్కులు సాధిస్తేనే అర్హులవుతారు.
పరీక్షపై అవగాహన నిమిత్తం మాక్ టెస్టును నిర్వహిస్తారు. నవంబరు 4 నుంచి ఆసక్తి ఉన్నవారు రాసుకోవచ్చు. నవంబరు 13 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే మాదిరి ప్రశ్నపత్రాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అయితే వీటిని కావాల్సినవారు పార్ట్ ఎకు రూ.50, పార్ట్ బికు రూ.50 చెల్లించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అర్హత..
పీజీటీ పోస్టులకు: పీజీ, బీఎడ్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
టీజీటీ పోస్టులకు: గ్రాడ్యుయేషన్, బీఎడ్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
పీఆర్టీ పోస్టులకు: గ్రాడ్యుయేషన్, బీఎడ్ లేదా రెండేళ్ల ఎడ్యుకేషన్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అయిదేళ్ల అనుభవం ఉంటే 57 ఏళ్లలోపువాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ల్లైన్ దరఖాస్తులు: అక్టోబరు 20 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.500
స్క్రీనింగ్ పరీక్ష: నవంబరు 21, 22
అడ్మిట్ కార్డులు: నవంబరు 4 నుంచి.
ఫలితాలు: డిసెంబరు 2.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ.
వెబ్సైట్: http://aps-csb.in