యూపీఎస్సీ ఏటా కంబైన్డ్ జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తోంది. వీటికి ఎంపికైనవారికి గ్రూప్-ఎ హోదాతో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్.. తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. ఆకర్షణీయమైన వేతనాలు దక్కుతాయి. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుబంధ విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం.
జియో సైంటిస్ట్ పోస్టుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1 ప్రిలిమినరీ, స్టేజ్-2 మెయిన్స్, స్టేజ్ -3 ఇంటర్వ్యూ.
ప్రిలిమినరీ
ప్రిలిమినరీ (స్టేజ్-1) పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇందులో రెండు పేపర్లుంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్కు వంద మార్కులు. ఈ పేపర్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. పేపర్- 2 దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మారుతుంది. జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్ట్ పోస్టులకు జియాలజీ/ హైడ్రో జియాలజీ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. జియో ఫిజిస్ట్ పోస్టులకు జియో ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్, కెమికల్ పోస్టులకు కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2 ఆయా సబ్జెక్టుల్లో 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1, పేపర్-2 ఒక్కో ప్రశ్నపత్రం వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు తగ్గిస్తారు. ప్రిలిమినరీ రెండు పేపర్లలోనూ అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఆయా విభాగాల వారీ ఖాళీలకు 6 లేదా 7 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్స్
ఈ ప్రశ్నపత్రం డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో వస్తాయి. సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. మెయిన్స్లో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కూ 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కూ 3 గంటల వ్యవధి కేటాయించారు. స్టేజ్-2లో అర్హత సాధించినవారిని స్టేజ్-3 (ఇంటర్వ్యూ)కి ఎంపిక చేస్తారు. విభాగాలవారీ మొత్తం ఖాళీలకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను స్టేజ్-3కి ఆహ్వానిస్తారు.
ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగినవారా లేదా గమనిస్తారు. నాయకత్వ లక్షణాలతోపాటు ఇతర సామర్థ్యాలను అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు.
మొత్తం ఖాళీలు: 40. వీటిలో కేటగిరీ 1 జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 15 కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. కేటగిరీ 2 సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో హైడ్రో జియాలజిస్టు 16, కెమికల్ 3, జియో ఫిజిక్స్ 6 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: కెమిస్ట్, కెమికల్ పోస్టులకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ అప్లయిడ్ కెమిస్ట్రీ/ ఎనలిటికల్ కెమిస్ట్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హైడ్రో జియాలజీ ఖాళీలకు పీజీలో జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ హైడ్రో జియాలజీ చదివినవారు అర్హులు. జియో ఫిజిక్స్ పోస్టులకు ఎమ్మెస్సీ అప్లయిడ్ ఫిజిక్స్/ జియో ఫిజిక్స్/ అప్లయిడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్ కోర్సులవారు అర్హులు.
వయసు: జనవరి 1, 2021 నాటికి 21 ఏళ్లు నిండాలి. గరిష్ఠంగా 32 ఏళ్లు మించరాదు. అంటే జనవరి 2, 1989 కంటే ముందు; జనవరి 1, 2000 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తుల గడువు: అక్టోబరు 27
ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21, 2021
మెయిన్ పరీక్ష: జులై 17, 18 తేదీల్లో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్సైట్: https://upsc.gov.in/