• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నవోదయకు పోటీ పడతారా?

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జవహర్‌ నవోదయలు వరంగా చెప్పుకోవచ్చు. ఎంపికైతే చాలు- ప్లస్‌ 2 (ఇంటర్‌) వరకు చదువు, వసతి, భోజనం అంతా ఉచితమే. బోధనలో ఉన్నత ప్రమాణాలు అనుసరించడం ఈ విద్యాలయాల ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22) ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పరీక్షలో ప్రతిభ చూపినవారిని చేర్చుకుంటారు.  

దేశవ్యాప్తంగా తమిళనాడు మినహా, ఇంచుమించు జిల్లాకొకటి చొప్పున 661 నవోదయ విద్యాలయాలున్నాయి. వీటిలో ఏపీలో 15 (2 కొత్తవి), తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. 2020-2021 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టు (జేఎన్‌వీఎస్‌టీ) రాసుకోవచ్చు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో నింపుతారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదవివుండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి దక్కుతాయి. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు ఉన్నాయి. 

పరీక్ష విధానం
పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా తాను కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మూడు సెక్షన్లలో 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాయించారు. రుణాత్మక మార్కులు లేవు. సెక్షన్‌-1 మెంటల్‌ ఎబిలిటీ. 40 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక గంట సమయం కేటాయించారు. సెక్షన్‌ -2 అరిథ్‌మెటిక్‌లో 20 ప్రశ్నలు వస్తాయి. 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్‌-3 లాంగ్వేజ్‌ టెస్ట్‌లో 20 ప్రశ్నలు. వ్యవధి అర గంట. సమాధానాలు గుర్తించడానికి ఓఎంఆర్‌ పత్రాన్ని ఇస్తారు. బ్లాక్‌ లేదా బ్లూ పెన్ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ సూచించే బాక్సును మార్కు చేయాలి. పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. 

ప్రశ్నలు ఇలా..
మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలో చిత్రాలు, రేఖలు, బొమ్మలపై ప్రశ్నలు వస్తాయి. ఈ సెక్షన్‌లో 10 భాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిలో భిన్నమైనది గుర్తించమనడం, ఒక అసంపూర్ణ చిత్రం లేదా గ్రాఫ్‌ ఇచ్చి అది సంపూర్ణం కావడానికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరిపోతుందో పోల్చమనడం, చిత్రాలు/ బొమ్మల క్రమాన్ని ఇచ్చి తర్వాత వచ్చే దాన్ని గుర్తించమనడం.. ఇలా ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ పరీక్షలో అంకెలు, కసాగు, గసాభా, వడ్డీలు, దత్తాంశాలు, భిన్నాలు, లాభనష్టాలు, నాలుగంకెల్లో ఉండే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు...మొదలైన ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున 4 పాసేజ్‌లు ఉంటాయి. 

ఎంపికైతే...
బాలికలు, ఎస్సీ, ఎస్టీలు, అల్పాదాయ వర్గాలవారు ఆరో తరగతి నుంచి +2 వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజనం పొందవచ్చు. మిగిలినవారు తొమ్మిదో తరగతి నుంచి నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఉన్నత బోధన ప్రమాణాలు నవోదయ విద్యాలయాల సొంతం. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. తొమ్మిది నుంచి ఆంగ్ల మాధ్యమం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ.. తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పై తరగతులను ఇతర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లో చదువుకోవచ్చు.

గమనించండి! 
అర్హత: 2020-2021 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: మే 1, 2008 - ఏప్రిల్‌ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 15, 2020 
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 10, 2021 
వెబ్‌సైట్‌: https://navodaya.gov.in
 

Posted Date : 29-10-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌