కంప్యూటర్ వినియోగం, ఉద్యోగ అన్వేషణ, నైపుణ్యాలపై అవగాహన పెంచే ఆన్లైన్ సంస్థ జునూన్. లాక్డౌన్లో ఉపాధిని కోల్పోయిన కార్మికులు నైపుణ్యాలు పెంచుకునేలా ఈ సంస్థ సహాయం చేస్తోంది!
మన దేశంలో సుమారు 45 కోట్ల మంది నైపుణ్యాలున్న, లేని వృత్తి పనివారు ఉన్నారు. నైపుణ్యాలు లేని వారికి సరైన శిక్షణ ఇస్తే తగిన ఉపాధి పొంది వీరంతా తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటారు. ఈ దిశగా వారికి సహకరించేందుకు అహాన్ అగర్వాల్ అనే 17 ఏళ్ల దిల్లీ కుర్రాడు ఏడాది కిందట ‘జునూన్’ అనే సంస్థను ప్రారంభించాడు. లాక్డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయి ఇంటికే పరిమితమైనవారు ఈ సంస్థ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు తగిన ఉద్యోగావకాశాలనూ పొందొచ్చు. కొన్ని సంస్థలూ అవసరమైన ఉద్యోగులను జునూన్ ద్వారా ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
ఎవరెవరు అర్హులు: ఆటోమెకానిక్లు, కార్పెంటర్లు, క్లీనర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, కుకింగ్ అసిస్టెంట్లు, డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, గార్డెనర్లు, లాండ్రీ వర్కర్లు, సుతారీ పనిచేసేవారు, పిల్లలను సంరక్షించే ఆయాలు, పెయింటర్లు, ప్యాకింగ్ చేసేవారు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, సర్వర్లు, వేర్హౌసింగ్ సిబ్బంది, సరకులు, ఆహార పదార్థాలను డెలివరీ చేసేవారు... వీరంతా ఈ సంస్థ ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
ఏమేం నేర్పిస్తారు?: విభాగాల వారీగా వృత్తిపరమైన నైపుణ్యాలను నేర్పిస్తారు. సుమారు ఇరవై రకాల వృత్తులకు సంబంధించిన పాఠాలను వీడియో, టెక్స్ట్ రూపంలో వెబ్సైట్లో పొందుపరిచారు. ఇవి ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో శిక్షణ పొందే అవకాశం ఉంది. అలాగే కంప్యూటర్ను ఉపయోగించడం, వాట్సాప్ చేయడం, ఉద్యోగావకాశాలను ఎలా అన్వేషించాలో కూడా నేర్పిస్తారు. అంతేకాదు జీవన నైపుణ్యాలనూ మెరుగుపరుస్తారు. పని నేర్చుకోవడంతోపాటు ఎదుటివారితో మర్యాదగా ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి.. లాంటి సున్నితమైన విషయాలనూ నేర్పిస్తారు. ఈ సేవలన్నింటినీ సంస్థ ఉచితంగానే అందిస్తోంది.
ఇందులో చేరాలంటే: https://junoon.me/ వెబ్సైట్లోకి వెళ్లి పేరు, ఫోన్ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని కేటాయించిన కాలమ్లో ఎంటర్ చేయడం ద్వారా రిజిష్టర్ కావచ్చు. ప్రస్తుతం సుమారు పన్నెండు సంస్థలు జునూన్ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి.