‣ సరైన సన్నద్ధతో లక్ష్యఛేదన
‣ దేశవ్యాప్తంగా 3479 భర్తీకి ప్రకటన విడుదల
‣ తెలంగాణలో 262, ఏపీలో 117 ఖాళీలు
దేశంలోని గిరిజన(ఎస్టీ) పిల్లల్లో విద్యాభివృద్ధి కోసం వెలిసిన విద్యాలయాలే ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు. మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన, ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడంతోపాటు విద్యార్థులు ఇతర అంశాల్లోనూ రాణించేలా తయారు చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 587 ఏకలవ్య పాఠశాలలు ఉండగా.. 2022లో మరో 462 బడులను ప్రారంభించనున్నారు. ఒక్కో విద్యాలయంలో 480 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 3479 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎక్జామ్(ఈటీఎస్ఎస్ఈ) 2021’ పేరుతో ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సంయుక్తంగా ఈ నియామకాలు చేపట్టనుంది. వీటిలో 175 ప్రిన్సిపల్, 116 వైస్ ప్రిన్సిపల్, 1244 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ), 1944 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ) పోస్టులున్నాయి. ఈ పరీక్షకు ఎక్కువ పోటీ ఉంటుంది. సమయమూ తక్కువగా ఉన్నందున సరైన ప్రణాళికతో సన్నద్ధమైతే మంచి జీతం అందుకునే ఉద్యోగాన్ని పొందవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 117 పోస్టులు ఉన్నాయి. వీటిలో 14 ప్రిన్సిపల్, 6 వైస్ ప్రిన్సిపల్, 97 టీజీటీ పోస్టులుండగా, పీజీటీ ఖాళీలు లేవు. తెలంగాణలో ప్రిన్సిపల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ 77, టీజీటీ 168తో కలిసి మొత్తం 262 ఖాళీలను భర్తీ చేయనన్నారు.
అర్హతల వివరాలు
ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు. వైస్ ప్రిన్సిపల్ అభ్యర్థులకు 45 ఏళ్లు ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అలాగే బీఈడీ/తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ప్రిన్సిపల్ అభ్యర్థులకు కేంద్ర/రాష్ట్ర/ అటానమస్ విద్యాసంస్థల్లో పదేళ్లు ప్రిన్సిపల్/పీజీటీ/టీజీటీగా పని చేసిన అనుభవం ఉండాలి. వైస్ ప్రిన్సిపల్కు కేంద్ర/రాష్ట్ర/ అటానమస్ విద్యాసంస్థల్లో కనీసం రెండేళ్లు పీజీటీ లేదా లెక్చరర్(లెవల్ 8)/ మూడేళ్లు మొత్తం రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసిన అనుభం ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ సాధించాలి. బీటెక్/ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్/ ఐటీ చేసినా అర్హులే. బీఈడీ/తత్సమాన ఉత్తీర్ణత అవసరం. అలాగే హిందీ, ఆంగ్ల భాషాల్లో బోధించే నైపుణ్యం ఉండాలి. వయసు 40 ఏళ్లు ఉండాలి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం ఉత్తీర్ణతతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. స్టేట్/ సీబీఎస్ఈ నిర్వహించే టెట్ పేపర్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హిందీ, ఆంగ్ల భాషల్లో బోధించే నైపుణ్యం ఉండాలి. వయసు 35 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్లను బట్టి అన్ని పోస్టులకు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30, 2021న ముగుస్తుంది. దరఖాస్తు రుసుముగా ప్రిన్సిపల్ & వైస్ ప్రిన్సిపల్ రూ.2000, పీజీటీ & టీజీటీలు రూ.1500 చెల్లించాలి. దీనికి మే 1, 2021 వరకు అవకాశం ఉంది. పరీక్ష మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈటీఎస్ఎస్ఈ-2021 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా నిర్వహిస్తుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ఇందులో సాధించిన స్కోరు ఆధారంగా మెరిట్ లిస్టును రోస్టర్ల ప్రకారం సంబంధిత రాష్ట్రాలకు ఎన్టీఏ పంపుతుంది. దాని ఆధారంగా రాష్ట్రాలు పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు జరుపుతాయి. టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు.
పరీక్షా విధానం
ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టుల దరఖాస్తుదారులకు మొత్తం (సీబీటీ-160, ఇంటర్వ్యూ-40) 200 మార్కులకు, టీజీటీలకు 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానానికి 0.25 కోత విధిస్తారు. ఈ రాతపరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్ ఇంగ్లిష్-10, జనరల్ హిందీ-10; జనరల్ నాలెడ్జ్-10, లాజికల్ రీజనింగ్-10, కంప్యూట్ లిటరసీ-10, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-10; అకడమిక్(ప్రిన్సిపల్ 30, వైస్ ప్రిన్సిల్ 60); అడ్మినిస్ట్రేటివ్ & ఫినాన్స్(ప్రిన్సిపల్ 70, వైస్ ప్రిన్సిపల్ 40) నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. పీజీటీలకు జనరల్ ఇంగ్లిష్-10, జనరల్ హిందీ-10; జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్-10, అనలైటికల్ ఎబిలిటీ-15, న్యూమరికల్ ఎబిలిటీ-10, కంప్యూటర్ లిటరసీ-05; టీచింగ్ ఆప్టిట్యూడ్/పెడగోజీ-20; సబ్జెక్టు నాలెడ్జ్ నుంచి 80 ప్రశ్నలు అడుగుతారు. టీజీటీలకు పీజీటీల కంటే సబ్జెక్టు నాలెడ్జ్లో అదనంగా 20 ప్రశ్నల ఎక్కువగా ఇస్తారు. మిగతా విభాగాల్లో రెండింటిలో ప్రశ్నల వెయిటేజీ ఒకే రకంగా ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
జీతభత్యాలు
ప్రిన్సిపల్కు లెవల్ -12 పేకమిషన్ కింద రూ.78800 నుంచి రూ.209200 జీతభత్యంగా ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్(లెవల్ -10)కు రూ.56000-177500, పీజీటీ (లెవల్ -8)లకు రూ.47600-151100, టీజీటీ(లెవల్ -7)లకు రూ.44900-142400 అందుకుంటారు.
సిలబస్-ప్రిపరేషన్
ప్రిన్సిపల్ & వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు సెక్షన్-3 అయిన అకడమిక్లో చైల్డ్ డెవలప్మెంట్ & పెడగోజీ (థియరీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, లెర్నర్ యాజ్ ఏ డెవలెపింగ్ ఇండివిడ్యువల్, లెర్నింగ్ ఇన్ కల్చరల్ ప్రాస్పెక్టివ్), ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ (యాక్ట్స్/ రైట్స్, ఎన్ఈపీ 2020, స్కూల్ ఆర్గనైజేషన్, రైట్స్ & డ్యూటీస్ ఆఫ్ ప్రిన్సిపల్/ వైస్ ప్రిన్సిపల్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్), టీచింగ్లెర్నింగ్ (అండర్స్టాండింగ్ లెర్నింగ్/ టీచింగ్, లెర్నింగ్ ఎక్జామ్పుల్స్, పేజ్&మోడల్స్ ఆఫ్ టీచింగ్) నుంచి ప్రశ్నలడుగుతారు. సెక్షన్-4 అడ్మినిస్ట్రేటివ్ & ఫినాన్స్లో సీసీఎస్(సీసీఏ, కండక్ట్) రూల్స్, ఫండమెంటల్ & సప్లిమెంటరీ రూల్స్, ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్, లీవ్ ట్రావెల్ కన్సీజన్ రూల్స్, మెడికల్ అటెండెన్స్ రూల్స్, పెన్షన్ రూల్స్ & న్యూ పెన్షన్ స్కీం,జనరల్ ఫినాన్షియల్ రూల్స్పర్చేస్ ప్రొసిజర్, ఇన్కం & సర్వీస్ ట్యాక్స్కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
పీజీటీ & టీజీటీ పోస్టులకు పార్ట్ 3 (టీచింగ్ ఆప్టిట్యూడ్/ పెడగోజీ)లో నాలెడ్జ్ ఆఫ్ ఎన్ఈపీ 2020, పెడగోజీ కాన్సర్న్స్, ఇన్క్ల్యూజివ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ & ఇంట్రాక్షన్ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్ 4 అయిన సబ్జెక్టు నాలెడ్జ్ విభాగంలో పీజీటీ అభ్యర్థులకు సీబీఎస్ 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉండే కఠినతర ప్రశ్నలు ఇస్తారు. టీజీటీ రాసే వారికి 2020-21 సీబీఎస్ఈ పదో తరగతి సిలబస్లో పునరావృతంకాని 12 తరగతి స్థాయి కఠినతర ప్రశ్నలడుగుతారు.
దక్షిణాది అభ్యర్థులను జనరల్ హిందీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రశ్నలు సామాన్య స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 30, 2021.
వెబ్సైట్: http://https://tribal.nic.in/EMRS.aspx