‣ ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు చక్కని అవకాశం
‣ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం
దేశంలో ప్రతిభ గలలక్షలాది మంది షెడ్యూల్డు (ఎస్సీ), ఇతరఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ) కులాలకు చెందిన విద్యార్థులున్నారు. చాలామంది ఉన్నత విద్యను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మధ్యలోనే చదువు మానేసి ఇతరపనులకు వెళ్తున్నారు. ఇక కష్టపడి చదివి ఉద్యోగాల ముంగిట్లో ఉన్నవారికి శిక్షణ తీసుకోవడం భారంగా మారుతోంది. ఆర్థిక స్థోమత లేక సన్నద్ధతలో వెనుకబడుతున్నారు.
ఇలాంటి విద్యార్థులకు భారత ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏటా సాయమందిస్తోంది. ఈఏడాదికి తాజాగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు వారు సిద్ధమవుతున్న ఉద్యోగాలకు సంబంధించినఉచిత శిక్షణ అందిస్తారు. ఉన్నత చదువులు కోసం పరీక్షలు రాసే వారికి కూడా ఉచిత కోర్సులు అందిస్తారు. అదే సమయంలో స్థానికంగా ఉంటున్నవారికి రూ.3000, దూరప్రాంతాల వారికి రూ.6000 స్టైపెండ్ ఇస్తారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా మరో రూ.2000 చెల్లిస్తారు. మొత్తం 1500 సీట్లు ఉన్నాయి.
ఏయే కోర్సులకు శిక్షణ ఇస్తారు?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగాలకు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) చేపట్టే నియామకాలకు సన్నద్ధమయ్యే వారికి శిక్షణ ఇస్తారు. అలాగే రాష్ట్రాలు చేపట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) ఉద్యోగాలకు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, పబ్లిక్ సెక్టార్ సంస్థలు నిర్వహించే ఆఫీసర్ స్థాయి కొలువులకు ఉచితశిక్షణ పొందవచ్చు. ఉన్నత చదువుల కోసం రాసే ఐఐటీ, జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్ తదితర పరీక్షలకు, అర్హత పరీక్షలైన శాట్, జీఆర్ఈ, జీమ్యాట్, టీఓఈఎఫ్ఎల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) వంటి ఉద్యోగ ఎంపిక పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
అర్హులు ఎవరంటే?
కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు. అభ్యర్థి పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్షలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారిని తప్పిస్తారు.
రెండు పద్ధతుల్లో అమలు
ఈ పథకాన్ని రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు. విద్యార్థులు ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు.
1. మొత్తం సీట్లను గుర్తింపు పొందిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు అప్పగిస్తారు. విద్యార్థుల ఎంపిక ఆయా ఇన్స్టిట్యూట్లే చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందుతుంది. అందుకు సంబంధించిన ఫీజును సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చెల్లిస్తుంది.
2. మొత్తం సీట్లకుగానూ మంత్రిత్వ శాఖే విద్యార్థులను ఎంపిక చేస్తుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన ఇన్స్టిట్యూట్లో ఉచిత శిక్షణ పొందవచ్చు. అందుకు అయ్యే ఫీజును రెండు విడతల్లో అభ్యర్థుల బ్యాంకులో వేస్తుంది.
దరఖాస్తు ఎలా?
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సెప్టెంబర్ 10, 2021 తుది గడువు.
వెబ్సైట్: http://coaching.dosje.gov.in/